టీటీడీలో ఉద్యోగాలంటూ సోషల్ మీడియాల్లో కొందరు పనిగట్టుకుని చేస్తున్న అవాస్తవ ప్రకటనలను నమ్మి మోసపోవద్దని టీటీడీ తెలిపింది.
సోషల్ మీడియా ఉద్యోగ ప్రకటనలు నమ్మొద్దు
గతంలో టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసపు మాటలతో కొంతమంది దళారులు అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసిన సందర్భాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తు చేసింది. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. టీటీడీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టేటప్పుడు ముందుగా పత్రికల్లో, టీటీడీ వెబ్సైట్లో అధికారిక ప్రకటన (నోటిఫికేషన్) ఇవ్వడం జరుగుతుందని తెలిపింది. ఇలాంటి విషయాలపై టీటీడీ గతంలో ప్రజలకు వివరణ ఇవ్వడం జరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి అవాస్తవ ప్రకటనలు నమ్మొద్దని కోరింది. అవాస్తవ ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.