Skip to main content

2000 PO Jobs in SBI: ఎస్‌బీఐలో పీఓ కొలువులు.. సిలబస్‌పై విశ్లేషణ

బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులకు బ్యాంకింగ్‌ రంగంలో అద్భుత అవకాశం స్వాగతం పలుకుతోంది! దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ).. రెండు వేల ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది! మూడంచెల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో.. ఎస్‌బీఐ పీఓ పోస్టులకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణతోపాటు పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..
Success in SBI PO Exam Guide,SBI PO Notification 2023, exam pattern & syllabus & preparation tips,2000 PO positions,
  • రెండు వేల పీఓ పోస్ట్‌ల భర్తీకి ప్రకటన
  • డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు
  • మూడంచెల ఎంపిక విధానం
  • వేతన శ్రేణి రూ.36,000-రూ.63,840 

ఎస్‌బీఐ.. క్లరికర్‌ కేడర్, పీఓ, స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌ తదితర పోస్టుల భర్తీకి క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇదే క్రమంలో తాజాగా 2023కు సంబంధించి ప్రొబేషనరీ ఆఫీసర్స్‌ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఇప్పటికే ఆయా బ్యాంకు ఉద్యోగాలకు, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు అదే ప్రిపరేషన్‌తో ఎస్‌బీఐ పీఓ పోస్ట్‌లకు కూడా పోటీ పడొచ్చు.

రెండు వేల పోస్ట్‌లు
ఎస్‌బీఐ తాజా నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం రెండు వేల పీవో పోస్ట్‌లను భర్తీ చేయనుంది. ఇందులో జనరల్‌ కేటగిరీకి 810 పోస్టులు,ఓబీసీ అభ్యర్థులకు 540, ఎస్‌సీలకు 300, ఎస్‌టీలకు 150, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 200పోస్ట్‌లను రిజర్వ్‌ చేశారు.

చదవండి: SBI Notification 2023: ఏదైనా డిగ్రీ అర్హతతో 2000 ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

అర్హత
2023, డిసెంబర్‌ 31 నాటికి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్‌ 31లోపు తమ కోర్సు ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

వయసు

  • ఏప్రిల్‌ 1, 2023 నాటికి 21-30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అయిదేళ్లు, ఓబీసీ వర్గాలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది. 
  • వేతనం: బేసిక్‌ పే: రూ.41,960(వేతన శ్రేణి రూ.36,000-రూ.63,840)

మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ
ఎస్‌బీఐ పీవో పోస్టుల భర్తీకి మూడు దశల్లో ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తోంది.
అవి.. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామినేషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ.

వంద మార్కులకు ప్రిలిమినరీ
నియామక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ రాత పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు-30 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 35 ప్రశ్నలు-35 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులు.. ఇలా మొత్తం 100 మార్కులు-100 ప్రశ్నలకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోనే ఉంటుంది. పరీక్షకు అందుబాటులో ఉండే సమయం ఒక గంట.

తదుపరి దశ మెయిన్‌
ఎంపిక ప్రక్రియలో రెండో దశ మెయిన్‌ ఎగ్జామినేషన్‌. తొలి దశ ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతి­భ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు 10 మందిని చొప్పున మెయిన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌ పరీక్షను ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ పరీక్ష 200 మార్కులకు; ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌పై డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ 50 మార్కులకు ఉంటుంది. రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలు-50 మార్కులకు, డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ 30ప్రశ్నలు-50 మార్కులకు,జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు-60 మార్కులకు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 35ప్రశ్నలు-40 మార్కులకు పరీ­క్ష జరుగుతుంది. పరీక్ష సమయం 180 నిమిషాలు.

చదవండి: SBI Notification 2023: 6,160 అప్రెంటీస్‌ ట్రైనీ పోస్టులు.. బ్యాంకింగ్‌ కెరీర్‌ అభ్యర్థులకు చక్కటి అవకాశం

డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌
మెయిన్‌లో భాగంగానే ప్రత్యేకంగా ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌పై డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఇది 50 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షలో లెటర్‌ రైటింగ్, ఎస్సే రైటింగ్‌ ఉంటాయి. 30 నిమిషాల వ్యవధి­లో కంప్యూటర్‌ ఆధారంగా సమాధానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.

నెగెటివ్‌ మార్కింగ్‌
ఆబ్జెక్టివ్‌ విధానంలో జరిగే ప్రిలిమ్స్, మెయిన్స్‌ ఎగ్జామ్స్‌లో నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు మార్కును తగ్గిస్తారు.

చివరగా సైకోమెట్రిక్‌ టెస్ట్‌
మొత్తం ఎంపిక ప్రక్రియలో చివరి దశ సైకోమెట్రిక్‌ టెస్ట్‌. ఇందులో భాగంగా గ్రూప్‌ ఎక్సర్‌సైజ్, పర్సనల్‌ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు ముగ్గురిని చొప్పున(1:3 నిష్పత్తిలో) తుది దశకు ఎంపిక చేస్తారు. మొత్తం 50 మార్కులకు నిర్వహించే చివరి దశ ఎంపిక ప్రక్రియలో గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూకు 30 మార్కులు ఉంటాయి.

గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌
గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా అభ్యర్థులను వేర్వేరు బృందాలుగా విభజిస్తారు. ఒక్కో బృందంలో గరిష్టంగా అయిదుగురు అభ్యర్థులు ఉండేలా చూస్తారు. ఇలా బృందాలుగా విభజించాక.. నిర్దిష్టంగా ఒక అంశాన్ని పేర్కొని.. దానికి అభ్యర్థుల అభిప్రాయం లేదా సమాధానాన్ని అడుగుతారు. సామాజిక అంశాలపై అవగాహన, టీమ్‌ స్కిల్స్‌ వంటి వాటిని పరిశీలిస్తారు.

పర్సనల్‌ ఇంటర్వ్యూ
గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా.. పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.  ఇంటర్వ్యూలో బ్యాంకింగ్‌ నాలెడ్జ్, బ్యాంకింగ్‌ రంగంలో కెరీర్‌పై ఆసక్తిని పరిశీలిస్తారు.

వెయిటేజీ విధానం
తుది విజేతల ఎంపికలో ఎస్‌బీఐ వెయిటేజీ విధానాన్ని అనుసరిస్తోంది. మెయిన్‌ పరీక్షలో పొందిన మార్కులకు 75 శాతం; చివరి దశలోని గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభకు 25 శాతం వెయిటేజీ ఇస్తోంది. ఇలా మొత్తం వంద శాతానికి అభ్యర్థులు పొందిన మార్కులను క్రోడీకరించి.. తుది విజేతలను నిర్ణయిస్తుంది. 

చదవండి: Banks - Study Material

సిలబస్‌పై పట్టుతో సక్సెస్‌
రీజనింగ్‌
ఈ విభాగంలో మంచి మార్కుల కోసం ప్రాక్టీస్‌­కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. విశ్లేషణ సామర్థ్యం, తార్కికత్వం పెంచుకునే విధంగా కృషి చేయాలి. సిరీస్, అనాలజీ, కోడింగ్‌-డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్‌ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్‌ అంశాల్లో పరిపూర్ణమైన అవగాహన పొందాలి.

డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌
అభ్యర్థులు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన మరో విభాగం.. డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌. ఇందులో రాణించడానికి కాలిక్యులేషన్‌ స్కిల్స్‌ను పెంచుకోవాలి. టేబుల్స్, డయాగ్రమ్స్, నంబర్‌ డేటా, లైన్‌ గ్రాఫ్, బార్‌ గ్రాఫ్‌ తదితర గ్రాఫ్‌ ఆధారిత డేటాలలోని సమాధానాన్ని క్రోడీకరించే విధంగా ప్రాక్టీస్‌ చేయాలి.

జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌
ఈ విభాగానికి సంబంధించిన అంశాలను మరింత ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. ఇటీవల కాలంలో జాతీయ ఆర్థిక రంగంలో మార్పులు, బ్యాంకుల విధి విధానాల్లో మార్పులు, అవి కొత్తగా ప్రకటిస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌
ఇందులో రాణించేందుకు.. బేసిక్‌ గ్రామర్‌తో మొదలుపెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, జంబుల్డ్‌ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్‌ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌
అర్థమెటిక్‌ అంశాలపై పట్టు సాధించాలి. స్క్వేర్‌ రూట్స్, క్యూబ్‌ రూట్స్, పర్సంటేజెస్, టైం అండ్‌ డిస్టెన్స్, టైం అండ్‌ వర్క్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, రేషియోస్‌ సంబంధిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి.

గ్రూప్‌ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ
ఈ ప్రక్రియలో విజయం సాధించడానికి ఇంగ్లిష్‌ వ్యాకరణం, వాక్య నిర్మాణంపై అవగాహన పెంచుకోవాలి. దీంతోపాటు సామాజిక పరిణామాలపై పట్టుండాలి.  ఇందుకోసం దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, ఇతర జనరల్‌ ఎస్సే పుస్తకాలు అనుసరించడం ఉపయుక్తంగా ఉంటుంది.

అనుసంధానం చేసుకుంటూ
పీఓ పోస్ట్‌ల అభ్యర్థులు ప్రిలిమ్స్, మెయిన్స్‌లోని ఉమ్మడి అంశాలను గుర్తించాలి. ముఖ్యంగా రెండు దశల్లోనూ ఉన్న ఇంగ్లిష్, రీజనింగ్‌కు కామన్‌ ప్రిపరేషన్‌ దృక్పథం ఎంతో మేలు చేస్తుంది. ఈ విభాగాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. మెయిన్‌లో క్లిష్టత స్థాయి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మెయిన్‌ పరీక్ష కోణంలోనే ప్రిపరేషన్‌ సాగిస్తే.. ప్రిలిమ్స్‌లో సులువుగా నెగ్గడమే కాకుండా.. ఒకే సమయంలో రెండింటికీ సన్నద్ధత లభిస్తుంది. 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్‌ 27, 2023
  • ప్రిలిమినరీ పరీక్ష(ఆన్‌లైన్‌) తేదీలు: నవంబర్‌లో 
  • మెయిన్‌ ఎగ్జామినేషన్‌: డిసెంబర్‌ లేదా 2024 జనవరిలో  
  • సైకోమెట్రిక్‌ టెస్ట్‌: 2024 జనవరి/ఫిబ్రవరి నెలలో
  • తుది ఫలితాల వెల్లడి: 2024 ఫిబ్రవరి/మార్చి నెలలో
  • వివరాలకు వెబ్‌సైట్‌: https://www.sbi.co.in/careers
Qualification GRADUATE
Last Date September 27,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories