Skip to main content

Groups Preparation Tips: గ్రూప్స్‌..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్‌ కొట్టేలా!

తెలంగాణ గ్రూప్స్‌ ఉద్యోగార్థులకు శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
groups preparation tips in telugu

అదేవిధంగా గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 రెండు సర్వీసుల్లోనూ కొత్తగా మరికొన్ని ఉద్యోగాలను చేర్చింది. దీంతో పోస్ట్‌ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది! మరోవైపు గ్రూప్‌ 2, 3 నోటిఫికేషన్‌ల విడుదలకు కసరత్తు ప్రారంభించింది. దీంతో ఈ మూడు నోటిఫికేషన్లకు ప్రిపేర్‌ అవ్వాలా.. లేదా ఏదో ఒకదానిపైనే పూర్తిగా దృష్టిపెట్టడం మంచిదా అనే సందిగ్ధంలో ఎంతో మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ నేపథ్యంలో.. టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌ ప్రిపరేషన్‌పై ప్రత్యేక కథనం...

  • తెలంగాణలో వెలువడిన గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌ 
  • త్వరలో గ్రూప్‌-2, 3 ప్రకటన వెలువడే అవకాశం
  • రెండు సర్వీసుల్లోనూ పెరగనున్న పోస్ట్‌ల సంఖ్య
  • ఒకే ప్రిపరేషన్‌తో గ్రూప్స్‌ సన్నద్ధత పొందే వీలు

ఇప్పటికే 9,168 పోస్టులతో గ్రూప్‌ 4 ప్రకటన వచ్చేసింది. పోస్టుల సంఖ్య భారీగానే ఉంది. కాబట్టి ముందు గ్రూప్‌ 4పై దృష్టిపెట్టి దీన్ని సొంతం చేసుకుందామనే ఆలోచన చేస్తారు. వాస్తవానికి గ్రూప్‌1, గ్రూప్‌2, 3కి సన్నద్ధమయ్యే అభ్యర్థులు కూడా గ్రూప్‌ 4 రాసే అవకాశం ఉంది. వీరితోపాటు పోలీస్‌ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు, టీచర్‌ పోస్టుల కోసం ప్రిపేర్‌ అవుతున్న వారు కూడా పోటీ పడతారు. పోటీ తీవ్రంగానే ఉంటుంది. కాబట్టి గ్రూప్‌ 4నే లక్ష్యంగా చేసుకుందాం.. అనే ఆలోచన సరికాదు. త్వరలో గ్రూప్‌ 2, 3 నోటిఫికేషన్‌ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గ్రూప్‌ 4లో ఉన్న ప్రత్యేక సిలబస్‌ కోసం రోజుకు కొంత సమయం కేటాయిస్తూ.. మిగతా సమయంలో గ్రూప్‌2, 3లకు ఏకకాలంలో ప్రిపరేషన్‌ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. గ్రూప్‌ 4లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌ 1 జనరల్‌ స్టడీస్‌ 150 ప్రశ్నలు-150 మార్కులకు ఉంటుంది. పేపర్‌ 2 సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ 150 ప్రశ్నలు-150 మార్కులకు ఉంటుంది. పేపర్‌ 1లోని సిలబస్‌ అంశాలు దాదాపు అన్ని గ్రూప్‌ పరీక్షల్లో ఉంటాయి. పేపర్‌ 2కు మాత్రం అభ్యర్థులు కొంత ప్రత్యేకంగా ప్రిపరేషన్‌ సాగించాల్సి ఉంటుంది. 

చదవండి: Groups Preparation Tips: 'కరెంట్‌ అఫైర్స్‌'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!

గ్రూప్‌-2 మరో 100 పోస్ట్‌లు

ఇటీవల తెలంగాణ ప్రభుత్వ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం- గ్రూప్‌-2లో అదనంగా మరో 100 పోస్ట్‌ల వరకు పెరిగే వీలుంది. వాస్తవానికి ఈ ఏడాది ఆగస్ట్‌ 31న జారీ చేసిన జీఓ ప్రకారం-గ్రూప్‌-2లో 16 హోదాల్లో మొత్తం 663 పోస్ట్‌ల భర్తీకి ఆమోదం తెలిపారు. తాజాగా జీఓ ప్రకారం-కొత్తగా అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (తెలంగాణ స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌), అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌(ఇతర శాఖలు), డిస్ట్రిక్ట్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌(జువెనైల్‌ కరెక్షనల్‌ సర్వీసెస్‌), అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌(బీసీ వెల్ఫేర్‌ సబ్‌ సర్వీస్‌), అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌(ట్రైబల్‌ వెల్ఫేర్‌ సబ్‌ సర్వీస్‌), అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌(ఎస్‌.సి.డి.డి. సబ్‌ సర్వీస్‌) హోదాలను చేర్చారు. దీంతో.. గ్రూప్‌-2 పోస్ట్‌లు మరో 100 వరకు పెరిగే అవకాశం ఉంది.

గ్రూప్‌-3 కూడా ఇదే బాట

గ్రూప్‌-3 సర్వీసుల్లోనూ పోస్ట్‌ల సంఖ్య పెరగనుంది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం-ఎనిమిది హోదాల్లో 1,373 పోస్ట్‌లకు అనుమతులిచ్చారు. ఈ సర్వీసుకు సంబంధించి కూడా కొత్తగా అకౌంటెంట్, ఆయా హెచ్‌ఓడీల్లో సీనియర్‌ అసిస్టెంట్‌ /అకౌంటెంట్‌ లేదా జూనియర్‌ అసిస్టెంట్‌/అకౌంటెంట్‌ లేదా తత్సమాన హోదాలను కొత్తగా కలిపారు. దీంతో.. గ్రూప్‌-3లోనూ మరో 200కు పైగా పోస్ట్‌ల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

చదవండి: TSPSC Group 4 Notification: 9,168 గ్రూప్‌-4 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

నోటిఫికేషన్‌లు ఎప్పుడు? 

గ్రూప్‌ 2, 3 ఈ రెండు సర్వీసులకు సంబంధించి ఈ నెలలో(డిసెంబర్‌లో)నే నోటిఫికేషన్‌ వెలువడే అవకాశముందని సమాచారం. కాబట్టి అభ్యర్థులు నోటిఫికేషన్‌ వచ్చే వరకు వేచి చూడకుండా.. వెంటనే ప్రిపరేషన్‌ ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సర్వీసులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు నిర్దిష్ట వ్యూహంతో అడుగులు వేస్తే ఒకే సమయంలో రెండింటికీ సన్నద్ధత లభిస్తుందని పేర్కొంటున్నారు.

చదవండి: 1,373 గ్రూప్‌–3 , 9,168 గ్రూప్‌–4 పోస్ట్‌లు: విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు ఇవే!!

గ్రూప్‌ 2, 3 సిలబస్‌ ఒకే రీతి

టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌-2, 3 సిలబస్‌ దాదాపు ఒకే రీతిలో ఉంటుంది. దీన్ని ఉద్యోగార్థులు తమకు అనుకూలంగా మలచుకోవాలి. రెండు పరీక్షల సిలబస్‌ను బేరీజు వేసుకుంటూ..అభ్యసనం సాగిస్తే ఒకే సమయంలో రెండు సర్వీసులకు సన్నద్ధత పొందొచ్చు. గ్రూప్‌-2ను నాలుగు పేపర్లుగా, గ్రూప్‌-3ను మూడు పేపర్లుగా నిర్వహించనున్నారు. గ్రూప్‌-2లో మాత్రం నాలుగో పేపర్‌గా తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం అనే అంశాలతో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ అంశాలను గ్రూప్‌-3లోని పేపర్‌-2, పేపర్‌-3 అంశాలతో సమ్మిళితం చేసుకునే అవకాశం ఉంది.

బేరీజు వేసుకుంటూ

గ్రూప్‌-2, 3 అభ్యర్థులు రెండు సర్వీసులకు సంబంధించిన సిలబస్‌ను ముందుగా బేరీజు వేసుకోవాలి. రెండు పరీక్షల్లో పేర్కొన్న పేపర్లు, సబ్జెక్ట్‌లు, సిలబస్‌ అంశాలపై పూర్తి స్పష్టత తెచ్చుకోవాలి. ఒకే తరహాలో ఉన్న అంశాలను ఒకే సమయంలో చదివేలా.. వేర్వేరుగా ఉన్న అంశాలకు నిర్దిష్టంగా ప్రత్యేక సమయం కేటాయించేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. రెండింటిలోనూ ఒకే సిలబస్‌ అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది నిపుణుల అభిప్రాయం.

చదవండి: Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..! 

పుస్తకాల ఎంపిక

గ్రూప్‌-2, 3 అభ్యర్థులు రెండు పరీక్షల సిలబస్‌పై స్పష్టత తెచ్చుకున్న తర్వాత పుస్తకాల ఎంపికపై దృష్టిపెట్టాలి. పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ అంశాలన్నీ ఉన్న పుస్తకాలను సేకరించుకోవాలి. ప్రధానంగా తెలంగాణ ఉద్యమ దశలకు సంబంధించి మార్కెట్లో పదుల సంఖ్యలో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి గందరగోళ పడకుండా ఏవైనా ఒకట్రెండు ప్రామాణిక పుస్తకాలను ఎంచుకోవాలి. అకాడమీ పుస్తకాలను చదవడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

డిస్క్రిప్టివ్‌ విధానంలోనే

ప్రామాణిక పుస్తకాలు ఎంపిక చేసుకున్న అభ్యర్థులు వాటిని క్షుణ్నంగా చదివేలా వ్యవహరించాలి. ఒక టాపిక్‌కు సంబంధించి నిర్వచనం మొదలు తాజా పరిణామాలకు వరకూ సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలి. గ్రూప్‌-2,3 రెండు పరీక్షలు పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో,బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటాయి. కాని అభ్యర్థులు ప్రిపరేషన్‌లో మాత్రం డిస్క్రిప్టివ్‌ విధానం అనుసరించాలి. చదువుతూ ఆయా అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పరచుకునేలా నోట్స్‌ రాసుకోవాలి. ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్‌ చదివేలా సమయ పాలన పాటించాలి. 

అనుసంధాన విధానం

గ్రూప్‌-2, 3 ప్రిపరేషన్‌లో అభ్యర్థులు అనుసంధాన దృక్పథం అనుసరించాలి. అంటే..రెండు పరీక్షల్లోని సిలబస్‌లో కామన్‌గా ఉన్న అంశాలను సమ్మిళితం చేసుకుంటూ చదవాలి. జనరల్‌ స్టడీస్, కరెంట్‌ అఫైర్స్, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌; భారత రాజ్యాంగం విధానం, పరిపాలన, ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ ..ఇలా కామన్‌ అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదివే వీలుంది. 

జాతీయం నుంచి స్థానికం వరకు

గ్రూప్‌-2, 3 అభ్యర్థులు ప్రిపరేషన్‌ సమయంలో జాతీయ అంశాలు మొదలు స్థానిక అంశాల వరకూ అన్నింటిపైనా అవగాహన పెంచుకోవాలి. తెలంగాణ ప్రాంత ప్రాధాన్యమున్న అంశాలను ఔపోసన పట్టాలి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ దశలు, తెలంగాణ ఆవిర్భావ దశ, మలి దశ ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా తెలంగాణ సామాజిక ముఖ చిత్రాన్ని తెలియజేసే అన్ని అంశాలను చదవాలి. సాహిత్యం, కళలు, కవులు, సంస్థానాలు, భౌగోళిక స్వరూపం, వనరులు, ప్రభుత్వ పథకాలు, తెలంగాణ ఏర్పాటు తర్వాత అమలు చేస్తున్న కొత్త పథకాలు.. ఇలా అన్ని అంశాలపై దృష్టి పెట్టాలి.

చదవండి: APPSC&TSPSC: గ్రూప్స్‌కు సొంతంగా నోట్స్‌ రాసుకుని.. గుర్తు పెట్టుకోవ‌డం ఎలా..?

సొంత నోట్స్‌

చదువుతున్నప్పుడే ముఖ్యమైన అంశాలను పాయింట్ల వారీగా సొంతంగా నోట్స్‌లో రాసుకోవాలి. మతాలు, సామాజిక వర్గాలు, గిరిజన సమస్యలు, ప్రాంతీయ సమస్యలు వంటి స్థానిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా ఒక అంశాన్ని చదివేటప్పుడు అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. ఉదాహరణకు సామాజిక వర్గాలనే పరిగణనలోకి తీసుకుంటే.. ఆ వర్గాల నిర్వచనం, ఆవిర్భావ చరిత్ర, విస్తరణ, తాజా పరిస్థితులు ఇలా అన్నింటినీ చదవాలి. అప్పుడే ఒక అంశంపై సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది.

ప్రభుత్వ విధానాలు

జాతీయ, రాష్ట్ర స్థాయిలో సామాజిక సమస్యలు; వాటి పరిష్కారానికి ప్రభుత్వాల విధానాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. మహిళా సాధికారత కోసం జాతీయస్థాయిలో పలు పథకాలు తెచ్చారు. మైనారిటీ, వెనుకబడిన తరగతులు, గిరిజన సంక్షేమం కోసం విధానాలు రూపొందిస్తున్నారు. అదే విధంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు నూతన పాలసీలు అమలు చేస్తున్నాయి. వాటి గురించి కూలంకషంగా అధ్యయనం చేయాలి. ఉదాహరణకు నూతన విద్యా విధానం ముఖ్యంశాలతోపాటు ఇప్పటి వరకు తీసుకొచ్చిన విద్యా విధానాలు, ప్రస్తుత విధానానికి మధ్య ఉన్న వ్యత్యాసం, ఉద్దేశం, ప్రధానాంశాలు, లక్ష్యాలు.. ఇలా అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి.

తెలంగాణపై ప్రత్యేక దృష్టి

తెలంగాణ ప్రత్యేక ప్రాధాన్యం ఉన్న అంశాలపై పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా తెలంగాణ పాలసీలపై అవగాహన పెంచుకోవాలి. తెలంగాణ ఏర్పాటు, దానికి సంబంధించి ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్న నీళ్లు.. నిధులు.. నియామకాలు.. వంటి అంశాలపై ఎలాంటి విధానాలు తెచ్చారన్నది తెలుసుకోవాలి. రాష్ట్రంలో ఆయా వర్గాల కోసం అమలు చేస్తున్న నూతన విధానాలపై అవగాహన పెంచుకోవాలి. వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, గిరిజనులకు సంబంధించిన విధానాలపై ఏ పథకాలు తెచ్చారో తెలుసుకోవాలి.

పేపర్‌-4 ప్రత్యేకంగా

గ్రూప్‌-2లో నాలుగో పేపర్‌గా పేర్కొన్న.. తెలంగాణ ఆలోచన(1948-1970), ఉద్యమ దశ(1971-1990), తెలంగాణ ఏర్పాటు దశ, ఆవిర్భావం(1991-2014)) అంశాలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. ముఖ్యంగా సిలబస్‌లో నిర్దేశించిన ప్రకారం-1948 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు జరిగిన ముఖ్య ఉద్యమాలు, ఒప్పందాలు, ముల్కీ నిబంధనలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు-వాటి సిఫార్సులు వంటి వాటిపై అవగాహన ఏర్పరచుకోవాలి. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రూపొందించిన పునర్‌ వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా పొందుపరచిన అంశాలు; తెలంగాణకు కల్పించిన హక్కులపై దృష్టి సారించాలి.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ప్రత్యేక అంశాలకు ఇలా

చరిత్రకు సంబంధించి తెలంగాణలో రాజులు, ముఖ్య యుద్ధాలు, ఒప్పందాలు, తెలంగాణలోని కవులు-రచనలు; కళలు; ముఖ్య కట్టడాలు-వాటిని నిర్మించిన రాజులు తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అదే విధంగా స్వాతంత్య్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రాంత ప్రమేయం ఉన్న సంఘటనలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
జాగ్రఫీలో.. తెలంగాణలోని ముఖ్యమైన నదులు-పరీవాహక ప్రాంతాలు; ముఖ్యమైన పంటలు; భౌగోళిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. దీంతోపాటు తెలంగాణ భౌగోళిక స్వరూపం విస్తీర్ణం, జనాభా వంటి అంశాలపై అవగాహన కూడా అవసరం.
ఎకానమీలో.. తెలంగాణ స్థూల రాష్ట్రీయోత్పత్తి, ముఖ్యమైన పథకాలు, 2011 జనాభా గణాంకాలు; ముఖ్యమైన పరిశ్రమలు-ఉత్పత్తిదాయకత, రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులపై అవగాహన ఏర్పరచుకోవాలి. సిలబస్‌ పరిశీలన నుంచి పేపర్‌ వారీగా నిర్దిష్ట ప్రణాళికతో అడుగులు వేస్తే.. ఒకే సమయంలో గ్రూప్‌-2, 3, 4 లకు సన్నద్ధత పొందే అవకాశం లభిస్తుంది.

Published date : 14 Jun 2023 03:34PM

Photo Stories