Kids Health: చిన్నారులకు రక్షణగా ‘ఇంద్రధనుష్’ Vaccination
!['Indradhanush' Vaccination](/sites/default/files/images/2023/08/11/kids-1691756054.jpg)
ఆగస్టు 7వ తేదీ నుంచి జిల్లాలోని ఐదేళ్లలోపు చిన్నారులకు, గర్భిణులకు ఈ టీకాలు వేయడం ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా ఆస్పత్రి తాండూరుతో పాటు, ఏరియా ఆస్పత్రుల్లో, పీహెచ్సీల్లో ఈ టీకాలు వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని 2016లో ప్రారంభించింది. ఇందులో భాగంగా అంతకుముందు రోగనిరోధక శక్తి పెంచేందుకు ఏడు వ్యాక్సిన్లు వేసేవారు. ప్రస్తుతం టీకాల సంఖ్యను 12కి పెంచారు.
Also read: kids health tips: పిల్లల్లోనూ ఫ్యాటీ లివర్!
వీటిలో గర్భిణులకు.. టీడీ (టెటానస్ అండ్ డిఫ్తీరియా), చిన్నారులకు.. టీబీ, పోలియో, హెపటైటిస్–బి, రోటావైరస్, నిమోకోకల్ న్యుమోనియా, రెబెల్లా, జపనీస్ ఎన్సెఫలిస్, మీజిల్స్ ఉన్నాయి. సమ యానికి వీటిని వేయించుకోని గర్భిణులు, చిన్నారుల కోసం ఏటా మూడు విడతల్లో మిషన్ ఇంద్రధనుష్ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది తొలివిడత కార్యక్రమం ఆగస్టు 7వ తేదీ నుంచి ప్రారంభించారు.
Also read: English భాష సామర్థ్యాల సాధనకు కృషి చేయాలి
ఆస్పత్రులకు వెళ్లనివారికి...
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీలు, బస్తీ దవాఖానాల్లో ఈ టీకాలు అందుబాటులో ఉంచారు. ఈ టీకాలను ప్రతి బుధవారం పిల్లలకు ఇస్తారు. నేరుగా ఈ కేంద్రాలకు వెళ్లి టీకాలను పిల్లలకు ఇప్పించవచ్చు. ఆస్పత్రులకు వెళ్లని వారికోసం మిషన్ ఇంద్రధనుష్ పేరిట ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి టీకాలు ఇస్తున్నారు. ఇప్పటివరకు ఆస్పత్రులకు వచ్చి ఈ టీకాలు తీసుకోని వారి వివరాలను వైద్య ఆరోగ్యశాఖ ఇటీవలే సేకరించింది.
Also read: Velugu Abhyasamithra: విద్యార్థుల్లోని సామర్థ్యాలు వెలికితీయాలి: నోడల్ అధికారి వెంకటయ్య
మూడు విడతల్లో...
జిల్లాలో మిషన్ ఇంద్రధనుష్ టీకాలను మూడు విడతల్లో వేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా మొదటి విడతలో ఆగస్టు 7 నుంచి 12వ తేదీ వరకు టీకాలు వేయనున్నారు. రెండో విడతలో సెప్టెంబర్ 11 నుండి 16వరకు, మూడో విడతలో అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 14 వరకు టీకాలు వేసేందుకు చర్యలు చేపట్టారు.
Also read: తల్లిపాల వారోత్సవాలు: శిశువులకు తల్లి పాలే శ్రేయస్కరం
శిశుమరణాలను తగ్గించడమే లక్ష్యంగా..
తప్పిపోయిన పిల్లలుకు, మతాచారాల ప్రకారం టీకాలు తీసుకోని పిల్లలకు, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చినవారి పిల్లలకు, స్లమ్ ఏరియాల్లో నివాసం ఉండే పిల్లలకు, ఇటుక బట్టీలు, నిర్మాణ రంగాల వద్ద పనిచేస్తున్న పిల్లలకు మిషన్ ఇంద్రధనుష్ టీకాలు ఇచ్చి శిశు మరణాలను తగ్గించాలనేదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
- మొదలైన మొదటి విడత టీకాల పంపిణీ
- జిల్లాలో 542 మంది చిన్నారులు, 32 మంది గర్భిణుల గుర్తింపు
- తప్పక వేయించాలంటున్న వైద్యాధికారులు
Also read: National Pest Control Day: శారీరకంగా, మానసికంగా ఎదగాలి: కలెక్టర్ భవేష్మిశ్రా
టీకాలు వేయించాలి
మిషన్ ఇంద్రధనుష్ టీకాలను గర్భిణులు, ఐదేళ్లలోపు చిన్నారులకు ఇప్పించాలి. జిల్లా, ఏరియా ఆస్పత్రులతో పాటు ఈ టీకాలను పీహెచ్సీలు, బస్తీ దవాఖానాల్లో కూడా అందుబాటులో ఉంచాం. ఇప్పటివరకు ఈ టీకాలు వేయించని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా దగ్గర్లోని సెంటర్లకు వెళ్లి వేయించాలి. టీకాలు వేయడంతో పిల్లలకు దీర్ఘకాలిక రోగాలతో పాటు, అంటువ్యాధులు కూడా సోకకుండా ఇమ్యూనిటీని ఇస్తాయి. జిల్లాలో ఈ టీకాలు ఎంతమందికి ఇవ్వాలనే దానిపై ఇప్పటికే వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి లెక్కలు తీశారు.
– డాక్టర్ పాల్వాన్ కుమార్,
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి