National Pest Control Day: శారీరకంగా, మానసికంగా ఎదగాలి: కలెక్టర్ భవేష్మిశ్రా
Sakshi Education
భూపాలపల్లి అర్బన్: పిల్లలు పరిశుభ్రమైన వాతావరణంతో ఉంటూ శారీరకంగా, మానసికంగా ఎదగాలని కలెక్టర్ భవేష్మిశ్రా విద్యార్థులకు సూచించారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు.
మాత్రలు పంపిణీ చేస్తున్న కలెక్టర్
● కలెక్టర్ భవేష్మిశ్రా
ఈ సందర్భంగా కలెక్టర్ భవేష్మిశ్రా మాట్లాడుతూ.. జిల్లాలోని 1నుంచి 19 సంవత్సరాల వయస్సు ఉన్న 66,052 మంది పిల్లలకు నులిపురుగుల నివారణ మందులు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పిల్లలందరూ ఆల్బెండజోల్ మాత్రలు తీసుకొని నులిపురుగుల బారి నుంచి రక్షణ పొందాలన్నారు. జిల్లాలోని పీహెచ్సీలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, సాంకేతిక కళాశాలల్లో మందులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అన్వేషిని, డాక్టర్ ఉమాదేవి పాల్గొన్నారు.