UPSC Civils Results 2022: పరీక్ష రాయలేని స్మరణ్ను.. అమ్మ గెలిపించిదిలా.. గంటకు 40 పేజీలు..
సివిల్స్కోసం స్మరణ్తో పాటు ఆమె సైతం అహర్నిశలు శ్రమించారు. 27ఏళ్ల క్రితం డిగ్రీతో చదువు ఆపేసిన ఆమె కలానికి పదును పెట్టి.. సెకన్లు, నిమిషాలను లెక్కిస్తూ కాగితాలు నింపేశారు. ప్రతి ప్రశ్నకు అతడు మాటల్లో సమాధానం చెబుతుంటే ఆమె తన కలంతో అక్షరాలను పరుగులు పెట్టించారు. కొడుకు విజయంలో ప్రత్యక్ష భాగస్వామిగా నిలిచిన నాగరాణి ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్య్వూ..
ఆకస్మాత్తుగా అతని ఆరోగ్యం బాగా..
హైదరాబాద్ తార్నాకకు చెందిన స్మరణ్ చెన్నై ఐఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ (బీటెక్) పూర్తి చేశారు. 2016 డిసెంబర్లో ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం కూడా వచ్చింది. చేరిన కొద్ది రోజులకే 2017 ఫిబ్రవరిలో ఆకస్మాత్తుగా అతని ఆరోగ్యం దెబ్బతిన్నది. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న స్మరణ్ను పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ హేమరేజ్గా నిర్ధారించారు. శస్త్రచికిత్స తప్పనిసరైంది.
UPSC Civils Ranker Sridhar Interview : అసెంబ్లీ వద్ద ఆ ఘటన చూసే.. సివిల్స్ వైపు వచ్చా..
కలం పట్టుకోవడమే కష్టమే.. కానీ..
చెన్నైలోనే ఓ ప్రముఖ ఆసుపత్రిలో జరిగిన అరుదైన సర్జరీతో అతడు మృత్యుముఖం నుంచి బయటపడ్డాడు. మెదడుకు రక్షణగా ఉండే కపాల భాగాన్ని 37 రోజులు అతని పొట్టలోనే భద్రపరిచి అనంతరం తలకు అమర్చి కుట్లువేశారు. కానీ బ్రెయిన్ హేమరేజ్తో కుడివైపు శరీరానికి పక్షవాతం వచ్చింది. మరో మూడున్నరేళ్ల పాటు ఫిజియోథెరపీ చికిత్స పొందాడు. కుడివైపు భాగం అతని స్వాధీనంలోకి వచ్చింది. కానీ చేతివేళ్ల కదలిక కష్టమైంది. చదవగలడు. కానీ రాయలేడు. ఐఏఎస్ కావాలని కలలుగన్న స్మరణ్కు అది అవరోధంగా మారింది. అంతేకాదు.. కొన్ని సంస్థలైతే అతనికి శిక్షణనిచ్చేందుకూ నిరాకరించాయి. మరోసారి నిరాశకు గురైన స్మరణ్ కలను సాకారం చేయాలని తల్లిదండ్రులు నాగరాణి, రమేష్లు సంకల్పించారు. సివిల్స్ కోచింగ్ ఇస్తోన్న బాలలతను సంప్రదించారు. అక్కడ అతని ఆశయానికి అండ లభించింది.
అమ్మ గెలిపించిందిలా..
ఆ శిక్షణ స్మరణ్కు మాత్రమే కాదు. అతని తల్లికి కూడా. ఇద్దరికీ కలిపి పరీక్షలు నిర్వహించిన బాలలత.. కొడుకు చెప్పే వేగాన్ని ఆమె అందుకోగలుగుతుందా? లేదా? అని పరీక్షించారు. అలా 37 పరీక్షలు నిర్వహించారు. కొడుకు కోసం పరీక్షలు రాసేందుకు ఏడాది పాటు ప్రాక్టీస్ చేశారామె. స్మరణ్ రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పడితే.. ఆ అంశాలను వేగంగా రాసేందుకు నాగరాణి పోటీపడ్డారు.
4 గంటల్లో 40 పేజీలు రాసేలా..
తప్పుల్లేకుండా స్పష్టంగా రాసేందుకు యూట్యూబ్ శిక్షణ తీసుకున్నారు. నిమిషానికి రాయగలిగే అక్షరాలను లెక్కిస్తూ వేగం పెంచారు. ‘మొదట్లో గంటకో పేజీ రాయడం కష్టంగా ఉండేది. క్రమంగా 4 గంటల్లో 40 పేజీలు రాసే నైపుణ్యం వచ్చింది. స్మరణ్ చదివే పుస్తకాల్లోని అంశాలే రాయడం వల్ల సివిల్స్ పరీక్షల్లో ఇబ్బంది కాలేదు’ అని నాగరాణి చెప్పారు.
మా అబ్బాయి గెలుపు కోసం..
సాధారణంగా ఏ పరీక్షల్లో అయినా రాయలేనంత వైకల్యం ఉన్న వాళ్లు స్క్రైబ్ను ఏర్పాటు చేసుకోవచ్చు. అభ్యర్ధి చెప్పే సమాధానాలను స్క్రైబ్ తప్పుల్లేకుండా, ఉన్నదున్నట్లుగా రాయాలి. ‘స్క్రైబ్గా వ్యవహరించేందుకు బయటివాళ్లు అందుబాటులో ఉండొచ్చు. కానీ వాళ్లకు మా అబ్బాయి గెలుపు పట్ల తపన, అంకితభావం ఉండవు కదా. అందుకే స్మరణ్ తల్లి ఆ బాధ్యతను తీసుకుంది’ అని స్మరణ్ తండ్రి రమేష్కుమార్ చెప్పారు. పైగా స్క్రైబ్గా వ్యవహరించేవాళ్లు యూపీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలు రాసే అర్హతను కోల్పోతారు. ‘నాకు, మా అబ్బాయిని గెలిపించడం కంటే గొప్ప పోటీ పరీక్ష మరొకటి లేదు కదా’ అని నవ్వేశారు నాగరాణి.
UPSC Civils Ranker : ఓటమిలోనే.. విజయం దొరికిందిలా..