కోవిడ్–19 తర్వాత విద్యార్థుల్లో వచ్చిన అభ్యసన అంతరాలను సత్వరమే పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అభ్యసన అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
6, 7, 8 తరగతుల విద్యార్థుల్లో ‘అభ్యసన అభివృద్ధి’
UNICEF, CIPS (Centre for Innovations in Public Systems), సేవ్ ది చిల్డ్రన్తోపాటు గ్రామ, వార్డు సచివాలయ శాఖ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ దీనిని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జూలై 21న సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో పై విభాగాల ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని పాఠశాలలకు చెందిన 6, 7, 8 తరగతుల విద్యార్థుల్లో అభ్యసన నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో ముందుగా అమలు చేస్తారు.