Skip to main content

ఐఏఎస్‌లో తెలుగు ‘జీరో’!

నిన్నటి దాకా తెలుగులో పరీక్షలు రాసి, తిరిగి పరీక్షలకు సిద్ధపడుతున్నవారు హఠాత్తుగా ఇంగ్లిష్‌లోకి మారిపోవడం అసాధ్యం. క్రీడలు, పరీక్షలు, యుద్ధాలు... ఒక్కసారి ఆరంభిస్తే ఇక నియమనిబంధనలు మార్చడం కుదరదు. కొత్త ఉత్తర్వులతో ప్రాంతీయ భాషలో పరీక్షలు రాయాలనుకునే అభ్యర్థులను కమిషన్ చావుదెబ్బ తీసింది. ఇది కమిషన్ చిత్తరంజన్ కేసులో చేసిన ప్రమాణానికి విరుద్ధం. ఇది కోర్టు ధిక్కారం, భాషా స్వేచ్ఛాహరణం. ఆంగ్లభాషా దురహంకారం. రాజ్యాంగం ప్రకారం ఇది చెల్లదు. చెల్లనేరదు. దెబ్బతిన్న రాష్ట్ర ప్రభుత్వాలు నిలదీయాల్సిన అన్యాయం ఇది.

ప్రతిభ, విద్యా, వివేకాలతో సంబంధం లేదు. పట్టణ ప్రాంతపు ఆంగ్లభాష విద్యార్థులకు ప్రాధాన్యం. హిందీ భాషా అభ్యర్థులకు ప్రయోజనం. పల్లె ప్రాంతపు తెలుగు (భారతీయ) భాషా మాధ్యమం విద్యార్థులకు తిరస్కారం. మానవ-సామాజిక శాస్త్రాలు కాకుండా వృత్తివిద్యలు అభ్యసించిన వారికి చుక్కెదురు... ఇవీ యూపీఎస్‌సీ వారి కొత్త చిక్కు పత్రాలు. భాషా సూత్రాలు. పట్టభద్ర విద్య తెలుగులో చదివితేనే మెయిన్స్ తెలుగులో రాయడానికి అనుమతి. 25 మందికన్నా తక్కువ అభ్యర్థులు ఉంటే అందుకు అవకాశం పూజ్యం. డిగ్రీలో తెలుగు రెండో భాషగా తీసుకున్న వారికి కూడా తెలుగు మాధ్యమంలో రాసే వీల్లేదు. డిగ్రీలో తెలుగును ఐచ్ఛికంగా తీసుకున్న వారికే తెలుగులో రాసే అవకాశం. డిగ్రీలో తెలుగు స్పెషల్ సబ్జెక్టు చాలాచోట్ల ఉండదు. ఉన్నచోట కూడా చాలా తక్కువమంది చదువుతారు. స్పెషల్ తెలుగు చదివిన వారినే సివిల్స్ తెలుగులో రాసేందుకు పరిమితం చేయడమంటే తెలుగును దాదాపు రద్దు చేసినట్టే. విశ్వవిద్యాలయాల్లో ఎంఏ తెలుగు చదవడానికి డిగ్రీలో రెండో భాషగా తెలుగు ఉంటే చాలు. కానీ ఆ అర్హత సివిల్స్‌కు సరిపోదా? ఇదెక్కడి న్యాయం!

ఇంతేకాదు! 600 మార్కుల ఆప్షనల్ ప్రశ్న పత్రాలను మార్చి 250 మార్కుల ప్రశ్నపత్రాలు రెండింటిని ప్రవేశ పెట్టడంవల్ల పరీక్షలకు విద్యార్థుల సన్నాహాలు తలకిందులైపోతున్నాయి. నైతిక విలువలు (మోరల్ వాల్యూస్), నడవడి (ఇంటిగ్రిటీ), దృక్కోణం (ఆప్టిట్యూడ్) అంశాలపై మరో ప్రశ్నపత్రం ప్రవేశపెడుతున్నారు. ఏప్రిల్ 4వ తేదీ ఇంటర్నెట్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. మరో ప్రయత్నం చేసే వారికి కొత్తవిధానాన్ని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా సిద్ధం కావడానికి సరైన సమయం లేదు. చివరిసారి ప్రయత్నం చేసే సీనియర్లు ఈ కొత్త పద్ధతిలో నెట్టుకు రాలేమని ఆందోళన చెందుతున్నారు.

ఇంగ్లిష్‌కు పెద్దపీట
ఇది వరకు జనరల్ నాలెడ్జ్‌లో పరీక్ష ఉండేది. దాని స్థాయి తగ్గించి జనరల్ స్టడీస్ అని మార్చారు. అందులో 300 మార్కుల ప్రశ్నపత్రాలు రెండు ఉండేవి. వాటి స్థానంలో 250 మార్కుల ప్రశ్నపత్రాలు నాలుగు ప్రవేశపెడుతున్నారు. ఇందులో ‘సమాచారం’ తాలూకు ప్రశ్నలే అధికం. లోతైన విజ్ఞానాన్ని పరీక్షించే ఆస్కారం లేదు. ఆంగ్లభాషకు సంబంధించి ఒక పేపర్‌ను ప్రవేశపెట్టారు. ఇంజనీరింగ్ లేదా ఇతర వృత్తి విద్యల నేపథ్యం నుంచి వచ్చిన వారిని ఉన్నట్టుండి ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం చూపాలని అడిగితే సివిల్ అధికార మార్గాలు వారికి మూసుకుపోయినట్టే.

హిందీకి మేలు తెలుగుకు కీడు
ప్రాంతీయ భాషల వారికి చిక్కులు తెచ్చినా హిందీ వారికి ప్రత్యేక ప్రయోజనాలు ఉండేట్టు నియమాలు రూపొందించారు. సివిల్ సర్వీసును జీవనమార్గంగా ఎంచుకున్న వారికి ఈ నియమాలు ఇక్కట్లు తెచ్చిపెడుతున్నాయి. మన దేశంలోని కళాశాలలు బోధించే కోర్సుల గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా కొత్త నియమాలు రూపొందించడం విడ్డూరం. ఇంజనీరింగ్, వైద్య కళాశాలల్లో ఇంగ్లిష్ పాఠాలు చెప్పరు. వృత్తివిద్యలు చదివినవారికి అవకాశాలు లేకుండా చేస్తున్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల వెంట వేలంవెర్రితో పరుగులు తీసే తల్లిదండ్రులు, విద్యార్థులు ఉన్న మన రాష్ట్రంలోని యువతరం ఆశలకు గండి కొడుతున్నారు.

నవీన బానిసత్వం
కేంద్రానికి, ఆంధ్రావనికి, యూపీఎస్‌సీకి ఆంగ్లభాషా బానిసత్వం, మాతృభాషా దారిద్య్రం పట్టింది. ప్రపంచ తెలుగు సభలు జరుపుకుని శాలువాలు కప్పి తెలుగుకు న్యాయం చేశామని చెప్పుకునే తెలుగు పెద్దలకు యూపీ ఎస్‌సీ దెబ్బ తగిలిందో లేదో తెలియడంలేదు. తెలుగులో పరీక్షలు రాయడానికి సిద్ధపడ్డ వారు ఎంత ప్రతిభ ఉన్నా పాలకులు కాలేరని యూపీఎస్‌సీ నీళ్లు నమలకుండా చెప్పేసింది. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన యూపీఎస్‌సీని యూనియన్ సంస్థ అనడానికి వీలులేదు. ఇది ఆంగ్లభాషా భిమానుల జేబు సంస్థ లేదా హిందీభాషా పక్షపాత సంస్థ. అన్ని భాషలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలనే ఇంగిత జ్ఞానంలేని సంస్థ ‘యూనియన్’ కాజాలదు. గుజరాతీ, మరాఠీ, కన్నడ, తమిళ, తెలుగు వంటి హిందీయేతర భాషల అభ్యర్థులకు పోటీపరీక్షలు రాసే అవకాశాలను నిరాకరించే వివక్ష ఖచ్చితంగా భాషాపరమైన వివక్షే. సమహక్కులు ఇస్తామని చెప్పే ఆర్టికల్ 14ను పాతరబెట్టే పాతకం. అమ్మతో మాట్లాడుకున్న భాషకు అనర్హతలను ఆపాదించి ఆర్టికల్ 15, 16లను ఉల్లంఘించిన భాషా ద్రోహం. కనుక యూపీఎస్‌సీ చర్య రాజ్యాంగ వ్యతిరేకం.

ఇది నియమోల్లంఘన
హఠాత్తుగా కొత్త నిర్ణయాలు తీసుకుని, అంతకు ముందు అర్హులైన వారిని కొత్తగా అనర్హులను చేయడం వల్ల వేలాది మంది తెలుగు అభ్యర్థులకు పరీక్ష రాసే అవకాశం, తద్వారా పాలనాధికారులయ్యే అవకాశం నిరాకరిస్తున్నది యూపీఎస్‌సీ. డిగ్రీ చదువు తెలుగులో చదివి ఆ పరీక్షలు తెలుగులో రాసిన వారికే సివిల్ పరీక్ష రాసే అర్హత ఉంటుందని ఉత్తర్వులు జారీచేసే ముందు, అన్ని డిగ్రీ చదువులు తెలుగు మాధ్యమంలో ఉన్నాయో లేవో తెలుసుకునే బాధ్యతలేదా? ఇంజనీరింగ్, మెడిసిన్ పరీక్షలు తెలుగులో ఎక్కడైనా నిర్వహిస్తున్నారా? ఇంగ్లిష్ మీడియంలో చదివినంత మాత్రాన, ఇంజనీర్లకు, డాక్టర్లకు ఇంగ్లిష్ భాషలో సౌలభ్యం ఉంటుందని ఎవరైనా చెప్పగలరా? ఇంజనీరింగ్ పాఠాలు అర్థం కాకపోవడం, ఇంజనీరింగ్ పదాలే ఎక్కువై ఇంగ్లిష్ తక్కువ కావడంవల్ల ఆ భాషలో ముందుకు పోలేకపోవడం మాత్రమే సాధ్యం. ఆ అభ్యర్థులు తెలుగులో సివిల్స్ పరీక్ష రాయాలనుకుంటే తప్పేమిటి? ఇదివరకు ఉన్న అవకాశం ఇప్పుడు తొలగించడానికి కారణం ప్రాంతీయ వివక్షా?

సివిల్ పరీక్షలు రాయడానికి 4 సార్లు మాత్రమే అవకాశం ఉంటుంది. వయోపరిమితి కూడా ఉంటుంది. రెండుసార్లు తెలుగులో పరీక్ష రాసి చివరి అవకాశం కోసం చూస్తున్న వారికి ఈ తాజా ఉత్తర్వు పిడుగుపాటే. నిన్నటి దాకా తెలుగులో పరీక్షలు రాసి, తిరిగి పరీక్షలకు సిద్ధపడుతున్నవారు హఠాత్తుగా ఇంగ్లిష్‌లోకి మారిపోవడం అసాధ్యం. క్రీడలు, పరీక్షలు, యుద్ధాలు... ఒక్కసారి ఆరంభిస్తే ఇక నియమనిబంధనలు మార్చడం కుదరదు.

‘మాతృ’ద్రోహం!
యూపీఎస్‌సీ నియమం ఒక్క తెలుగువారినే కాదు ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసే ఇతర ప్రాంతాల వారిని కూడా దెబ్బతీస్తుంది. 2009లో తుది పరీక్షలు (మెయిన్స్) రాసిన వారు 11,514 మంది అయితే వారిలో ప్రాంతీయ భాషలో రాసిన వారు 2,117 మంది. ఇంటర్వ్యూ దశకు చేరినవారు 2,281 మంది అయితే, 721 మంది ప్రాంతీయ భాషల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. 2010లో 11,865 మంది తుది పరీక్షలు రాస్తే ప్రాంతీయభాషల వారు 2,111 మంది. ఇంటర్వ్యూకు 2,431 మంది వెళితే తమ తమ మాతృభాషలో మాట్లాడినవారు 803 మంది. 2011 లో మెయిన్స్ రాసినవారు 11,237. ప్రాంతీయ భాషా అభ్యర్థులు 1,437. ఇంటర్వ్యూలకు వెళ్లిన 2,587 మందిలో ప్రాంతీయ భాషీయులు 643 మంది. ఇంత మందికి యూపీఎస్‌సీ అన్యాయం చేయడం ఏ విధంగా సబబు?

వీరిలో తెలుగు వారి సంఖ్య పరిశీలిద్దాం. 2009లో 555, 2010లో 700, 2011లో 722 మంది మెయిన్స్ పరీ క్షలు రాశారు. వీరిలో ఆయా సంవత్సరాల్లో తెలుగులో రాసిన వారి సంఖ్య వరుసగా 84, 70, 31. ఇంటర్వ్యూకు (వరుసగా ఆ సంవత్సరాల్లో) 134, 116, 80 మంది హాజ రైతే వారిలో తెలుగులో సమాధానాలు చెప్పినవారు 14, 28, 18. ఈ మధ్యలో సి శాట్ అనే కొత్త ‘షాట్’ ఒకటి కొట్టారు. ఇది 2011లో మొదలైంది. సి శాట్ అంటే సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఇది ప్రాథమిక పరీక్ష (ప్రిలిమినరీ). ఈ దేశాన్ని పాలించాలంటే ప్రతిభ, సేవాశీలం ఉన్నా లేకపోయినా ఫరవాలేదు. ఇంగ్లిష్ మాత్రం వచ్చి ఉండాలి. అభ్యర్థికి ఇంగ్లిష్‌లో ఉన్న తెలివితేటలను సి శాట్‌లో పరీక్షిస్తారు. తెలుగు అభ్యర్థులంతా ఈ విధంగా ఆదిలోనే దెబ్బతింటారు. మళ్లీ లేవరు. ఒకవేళ లేచినా ఇంగ్లిష్‌లో తయారయ్యేలోగా వయసు, అవకాశాలు కరిగిపోతాయి. 2011లో ప్రాంతీయ భాషల్లో రాసిన వారి సంఖ్య తగ్గిపోవడానికి ఈ సి శాట్ దెబ్బే కారణం.

రాజ్యాంగ వ్యతిరేకం
ఇక్కడ రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి- ఇంగ్లిష్‌లో డిగ్రీ చదివినా సరే తెలుగులో ఎందుకు ప్రాథమిక పరీక్ష రాయకూడదు? రెండు- ఇంగ్లిష్‌లో మెయిన్స్ రాసినా సరే తరువాత ఇంటర్వ్యూ ప్రాంతీయ భాషలో ఎందుకు నిర్వహించకూడదు? రెండో ప్రశ్న వేసింది చిత్తరంజన్ దాస్ అనే యువకుడు. బొంబాయి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ఆయన సవాలుకు యూపీఎస్‌సీ జవాబిస్తూ మెయిన్స్ ఆంగ్లంలో రాసినా ఇంటర్వ్యూలో మాతృభాషలో సమాధానాలు ఇవ్వవచ్చని ప్రకటించింది. మాతృభాషలో పరీక్షలు రాయడానికి, ఇంటర్వ్యూలలో జవాబివ్వడానికి అవకాశం వచ్చిందని ఆ రోజు అందరూ సంతోషించారు. పరీక్షల్లో భాషాపరమైన నియమాలను నిర్ణయించేందుకు ఒక నిపుణుల సంఘం అధ్యయనం చేస్తున్నదని కమిషన్ కోర్టుకు తెలిపింది. కానీ కొత్త ఉత్తర్వులతో ప్రాంతీయ భాషలో పరీక్షలు రాయాలనుకునే అభ్యర్థులను కమిషన్ చావుదెబ్బ తీసింది. ఇది కమిషన్ చిత్తరంజన్ కేసులో చేసిన ప్రమాణానికి విరుద్ధం. ఇది కోర్టు ధిక్కారం, భాషా స్వేచ్ఛా హరణం. ఆంగ్లభాషా దురహంకారం. రాజ్యాంగం ప్రకారం ఇది చెల్లదు. చెల్లనేరదు. దెబ్బతిన్న రాష్ట్ర ప్రభుత్వాలు నిలదీయాల్సిన అన్యాయం ఇది.

- మాడభూషి శ్రీధర్
Published date : 15 Mar 2013 02:46PM

Photo Stories