Skip to main content

సివిల్స్-2018 ప్రిలిమ్స్...కటాఫ్ ఎంత ?

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్.. దేశంలో 24 ప్రతిష్టాత్మక సర్వీసుల్లో పోస్టులకు ఎంపిక ప్రక్రియలో తొలి దశ. దేశవ్యాప్తంగా జూన్ 3న జరిగిన సివిల్స్ ప్రిలిమ్స్-2018 పరీక్షకు 3లక్షల మందికిపైగా హాజరయ్యారు.
మెయిన్స్కు అర్హత సాధించడంలో కీలకమైన పేపర్ 1 పరీక్ష గతంలో కంటే కష్టంగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రిలిమ్స్‌కు హాజరైన అభ్యర్థులంతా.. కటాఫ్‌పై ఆరాతీస్తున్నారు.. ఈసారి ప్రిలిమ్స్ కటాఫ్ ఎంత ఉండొచ్చు? మెయిన్స్‌కు ప్రిపరేషన్ ప్రారంభించాలా.. వద్దా?! అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. సివిల్స్ ప్రిలిమ్స్ కటాఫ్ అంచనా.. మెయిన్స్కు ప్రిపరేషన్ వ్యూహాల గురించి తెలుసుకుందాం...

గతేడాది కంటే క్లిష్టంగా...
సబ్జెక్ట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం- సివిల్స్ ప్రిలిమ్స్-2018 పరీక్ష గతేడాదితో పోల్చితే క్లిష్టంగానే ఉంది. ముఖ్యంగా జనరల్ స్టడీస్ పేపర్ 1లో అడిగిన ప్రశ్నలను పరిశీలిస్తే.. ఈసారి డెరైక్ట్.. ఇన్‌డెరైక్ట్ ప్రశ్న(స్టేట్‌మెంట్ ఆధారిత)లకు మధ్య సమతుల్యం పాటించినట్లు కనిపించింది. ప్రశ్నల స్థాయి మాత్రం కొంత క్లిష్టంగా ఉందని.. కోర్ కాన్సెప్ట్స్, కాంటెంపరరీ ఇష్యూస్‌పై సమగ్ర అవగాహన ఉంటేనే సమాధానం ఇచ్చే విధంగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. జనరల్ స్టడీస్ ప్రశ్నల పరంగా అనలిటికల్ అప్రోచ్ పెరిగింది. అభ్యర్థి నేరుగా సమాధానాన్ని గుర్తించేలా కాకుండా.. సంబంధిత అంశం, సంఘటనకు సంబంధించిన నేపథ్యం, తాజా పరిణామాలు తెలిసుంటేనే సమాధానాలు గుర్తించగలిగేలా ప్రశ్నలు అడిగారు. సివిల్స్ ప్రిలిమ్స్‌లో సాధారణంగా స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. కానీ, ఈసారి స్టేట్‌మెంట్ కింద ఇచ్చిన ఆప్షన్స్ అభ్యర్థుల అవగాహనను, విశ్లేషణ సామర్థ్యాన్ని లోతుగా పరీక్షించేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

హిస్టరీ కఠినం :
కోర్ సబ్జెక్ట్‌గా పేర్కొనే హిస్టరీ నుంచి క్లిష్టమైన ప్రశ్నలు అడగడం ఈసారి సివిల్స్ ప్రిలిమ్స్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. అవి కూడా స్టేట్‌మెంట్ ఆధారితంగా ఉండటం అభ్యర్థుల ఆలోచన శక్తికి పరీక్ష పెట్టాయి. ఉదాహరణకు.. హిస్టరీలో.. మజ్జిని, గ్యారిబాల్డీ, శివాజీ, శ్రీకృష్ణల బయోగ్రఫీలు రాసిన వ్యక్తి ఎవరు? అతను కొంత కాలం అమెరికాలో ఉండటమే కాకుండా సెంట్రల్ అసెంబ్లీకి కూడా ఎన్నికయ్యారు? అతని పేరు ఏంటి? అనే ప్రశ్న. అదే విధంగా సిక్కిం, మణిపూర్, మిజోరాంలలో సంప్రదాయ రీతులను మ్యాచింగ్ కొశ్చన్‌గా ఇచ్చారు. హిస్టరీలో అభ్యర్థులు అటు ముఖ్యమైన ఘటననలతోపాటు వ్యక్తులు, కళలు, సంస్కృతి వంటి అన్ని అంశాలను చదివుంటేనే సమాధానాలు రాయగలిగేలా ప్రశ్నలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే హిస్టరీ నుంచి 15 ప్రశ్నలు అడగ్గా... పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ సాగించిన అభ్యర్థి 10 నుంచి 12 ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అవకాశముందని నిపుణుల అభిప్రాయం.

రాజ్యాంగం.. సమకాలీనం
పాలిటీ నుంచి అడిగిన ప్రశ్నలు రాజ్యాంగంపై అవగాహన, సమకాలీన అంశాలతో అనుసంధానం చేయగలిగే నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ఉన్నాయి. ఈ విభాగం నుంచి 13 ప్రశ్నలు అడిగారు. ప్రశ్నల స్థాయి మధ్యస్తంగానే ఉన్నందున అభ్యర్థులు 8 నుంచి 10 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అదే విధంగా ఇటీవల కాలంలో అమల్లోకి తెచ్చిన పలు సామాజిక సంక్షేమ చట్టాలు.. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్; నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్‌పై ప్రశ్నలు అడిగారు. వీటితోపాటు తాజాగా ప్రవేశ పెట్టిన పలు ప్రభుత్వ పథకాలపైనా ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటికి సంబంధించి దాదాపు ఆరేడు ప్రశ్నలు కనిపించాయి.

ఎకానమీ.. జాగ్రఫీ.. తీరిదీ
ఎకానమీ విషయంలో ఈసారి ప్రశ్నల తీరు వినూత్నంగా కనిపించడం అభ్యర్థులను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పొచ్చు. కోర్ ఎకానమీ కంటే ఇటీవల కాలంలో ఆర్థిక రంగంలో చోటు చేసుకున్న పరిణామాలపైనే ఎక్కువ ప్రశ్నలు కనిపించాయి. ఉదాహరణకు.. బ్యాంకింగ్, ఆధార్, ఏటీఎంల నియంత్రణ వ్యవస్థ వంటివి. అలాగే జాగ్రఫీలో ప్రశ్నలు విశ్లేషణాత్మక దృక్పథంతో సమాధానం ఇచ్చే విధంగా ఉన్నాయి. ఈ విభాగం నుంచి 10 ప్రశ్నలు అడగ్గా.. వాటిలో అధిక శాతం కోర్ టాపిక్స్ నుంచే వచ్చాయి.

ఎకాలజీ, ఎన్విరాన్‌మెంట్.. ఎస్ అండ్ టీ :
ఎకాలజీ, ఎన్వినార్‌మెంట్‌కు సంబంధించి 14 ప్రశ్నలు అడగ్గా.. వాటిలో క్లైమేట్ ఛేంజ్, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, ప్రస్తుతం అమల్లో ఉన్న పర్యావరణ సంరక్షణ ఒప్పందాలు వంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చారు. అధిక శాతం ప్రశ్నలు సమకాలీన అంశాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినవే. ఉదాహరణకు ఆధార్ సాంకేతికత, త్రీడీ ప్రిటింగ్, సైబర్ ఎటాక్స్/సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వచ్చిన ప్రశ్నలు అభ్యర్థుల్లోని విశ్లేషణ శక్తి, అన్వయ సామర్థ్యాన్ని పరీక్షించేవిగా ఉన్నాయి. విశ్లేషణ పరంగా ఎలాంటి తడబాటుకు గురైనా ఇలాంటి ప్రశ్నలకు సరైన సమాధానాన్ని గుర్తించడం కష్టమవుతుంది. ప్యూర్ ఫిజిక్స్ నుంచి ఎలాంటి ప్రశ్నలు రాలేదు. ఎకాలజీ, బయోడైవర్సిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అడిగిన ప్రశ్నలన్నీ కరెంట్ అఫైర్స్ ఆధారితంగా ఉన్నాయి.

కరెంట్ అఫైర్స్...అంతర్జాతీయ పరిణామాలకు ప్రాధాన్యం
ప్రిలిమ్స్ 2018లో యూపీఎస్‌సీ కరెంట్ అఫైర్స్ ప్రశ్నల తీరులో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ప్యూర్ కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు అడక్కుండా.. ఫ్యాక్ట్ బేస్డ్, కోర్ సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాల నుంచి ప్రశ్నలు అడిగింది. కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు సైతం అనలిటికల్ అప్రోచ్‌తో ఉండటం ఈ ఏడాది ప్రిలిమ్స్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. దాంతోపాటు సివిల్స్ ప్రిలిమ్స్-2018 ప్రశ్న పత్రంలో అంతర్జాతీయ అంశాలకు ప్రాధాన్యం కనిపించింది. దాదాపు 12 ప్రశ్నలు ఈ విభాగం నుంచి అడిగారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్పై ఎక్కువ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ), న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్‌ఎస్‌జీ), ఆసియాన్‌లపై ప్రశ్నలు వచ్చాయి. అలాగే ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ విభాగంలో.. బీమ్ యాప్, ఆధార్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, డిజిటల్ ఇండియాపై ప్రశ్నలు అడిగారు.

సీశాట్ సులభంగా..
గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సీశాట్)గా పేర్కొనే పేపర్ 2 సులభంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది కేవలం అర్హత పరీక్షే కాబట్టి దీని విషయంలో పెద్దగా ఆందోళన చెందక్కర్లేదని నిపుణులు సూచిస్తున్నారు. సీశాట్‌లో అనలిటికల్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ప్రశ్నలు ప్రాథమిక స్థాయిలో ఉండటంతో కనీస మ్యాథమెటికల్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులంతా మంచి స్కోరు చేసే అవకాశం ఉంది. క్వాంటిటేటివ్ అనాలసిస్‌కు సంబంధించి డేటా ఇంటర్‌ప్రిటేషన్, నంబర్లు, భిన్నాల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు.

కటాఫ్... 98-105 ?
ఇక.. మెయిన్ దిశగా ప్రిపరేషన్ ప్రారంభించాలా? వద్దా? అనే సందేహంలో ఉన్న అభ్యర్థులు.. తాము పేపర్ 1లో గుర్తించిన సమాధానాలను సరిచూసుకుని 98 నుంచి 105 మధ్యలో మార్కులు వస్తాయనుకుంటే.. మెయిన్‌కు ప్రిపరేషన్ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. 100 దాటతాయనుకుంటే ఎలాంటి సంశయం లేకుండా సాధ్యమైనంత త్వరగా మెయిన్ ప్రిపరేషన్‌కు శ్రీకారం చుట్టడమే మేలని పేర్కొంటున్నారు.

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్-2018
మొత్తం పోస్టుల సంఖ్య
: 782.
తొలి దశ ప్రిలిమినరీకి హాజరైన అభ్యర్థుల సంఖ్య: దాదాపు 3.2 లక్షలు.
తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన వారు: 38,875(ఏపీ: 13,604 ; తెలంగాణ : 25,271)

విభాగాల వారీగా ప్రశ్నల సంఖ్య :

విభాగం

ప్రశ్నలు

జాగ్రఫీ

11

పాలిటీ

13

హిస్టరీ

15

ఎకానమీ

9

ఎకాలజీ

9

ఆర్ట్ అండ్ కల్చర్

6

అంతర్జాతీయ అంశాలు

5

జీఎస్, ఎస్ అండ్ టీ

9

జీకే, కరెంట్ అఫైర్స్

22


సివిల్స్ ప్రిలిమ్స్ గత రెండేళ్ల కటాఫ్‌లు :

కేటగిరీ

2017

2016

జనరల్

105.34

116

ఓబీసీ

102.66

110.66

ఎస్‌సీ

88.66

99.34

ఎస్టీ

88.66

96


క్లిష్టమే కానీ...
ప్రిలిమ్స్ ప్రశ్న పత్రం కొంత క్లిష్టంగానే ఉందన్న మాట వాస్తవం. అయితే ఆయా సబ్జెక్ట్‌లలో పూర్తి స్థాయి అవగాహన పొందిన అభ్యర్థులు సులువుగా కటాఫ్‌ను దాటే అవకాశముంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది పోస్ట్‌ల సంఖ్య తగ్గిన నేపథ్యంలో.. కటాఫ్ కూడా తగ్గి 105కు ఒకట్రెండు మార్కులు అటు, ఇటుగా ఉండొచ్చు. రెండో పేపర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో క్వాంటిటేటివ్ ఎబిలిటీ ప్రశ్నలకు ప్రాధాన్యం కనిపించినా.. కాంప్రహెన్షన్ ప్రశ్నలు సులువుగా ఉండటం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కలిసొచ్చే అంశమనే చెప్పాలి.
- శ్రీరంగం శ్రీరామ్, శ్రీరామ్స్ ఐఏఎస్ అకాడమీ

ఆశావాహ దృక్పథంతో ఉండండి..
సివిల్స్ ప్రిలిమ్స్ ముగిసింది..ఇప్పుడు దాని గురించి అతిగా ఆలోచించడం అనవసరం. సివిల్స్ ఔత్సాహికులు.. ఏ దశలోనూ భవిష్యత్ పట్ల ఆశావాహ దృక్పథాన్ని విడనాడొద్దన్నది నా సలహా!. సివిల్స్ విజయాన్ని ఇంటెలిజెన్స్, నాలెడ్‌‌జ, హార్డ్‌వర్క్, గెడైన్స్ తదితర అంశాలు ప్రభావితం చేస్తాయి. సివిల్స్.. ఎప్పుడూ ఒకే ధోరణిలో సాగే పరీక్ష కాదు.. కాబట్టి ఒకసారి నిరాశ ఎదురైనా పట్టు వదలకుండా ప్రయత్నించండి... తప్పక విజయం సాధిస్తారు.
- ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్ ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్.

పేపర్ డైనమిక్‌గా ఉంది :
సివిల్స్ ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ పేపర్ 1 డైనమిక్‌గా ఉంది. పాలిటీకి సంబంధించి పార్లమెంటు, రాజ్యాంగం, రాష్ట్రపతిపై ప్రశ్నలు వచ్చాయి. పాలిటీ అండ్ గవర్నెన్స్ నుంచి దాదాపు 13 ప్రశ్నల వరకు అడిగారు. సివిల్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు సాధారణంగా అధికరణలు, పరిపాలనా యంత్రాంగం, కమిటీలపై ఎక్కువ దృష్టిపెడతారు. కానీ ఈసారి ఆ కోణంలో ప్రశ్నలు అడక్కుండా.. పొలిటకల్ థియరీపై ఫోకస్ చేశారు. రూల్ ఆఫ్ లా, స్వేచ్ఛ, గోప్యత హక్కు వంటి అంశాలు దీనికి ఉదాహరణ. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీంలకు సంబంధించి ఈసారి కేవలం ఒక్క ప్రశ్న మాత్రమే వచ్చింది. మొత్తంగా పేపర్ ఊహించిన స్థాయిలోనే ఉంది.
- డా.బి.జె.బి.కృపాదానం, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ, పాలిటీ

స్టేట్‌మెంట్స్‌కు ప్రాధాన్యం :
ఈ ఏడాది కూడా స్టేట్‌మెంట్స్ ఆధారిత ప్రశ్నలే అధికంగా ఉన్నాయి. హిస్టరీ, జాగ్రఫీ వంటి కోర్ టాపిక్స్‌లో సైతం స్టేట్‌మెంట్స్, మ్యాచింగ్ టైప్ ప్రశ్నలు అడగటం చూస్తే.. అభ్యర్థుల్లోని లోతైన పరిజ్ఞానాన్ని పరీక్షించడమే యూపీఎస్‌సీ ఉద్దేశంగా కనిపిస్తోంది. కోర్‌తోపాటు సమకాలీన అంశాలు, ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌పై అభ్యర్థుల శ్రద్ధను పరీక్షించేలా ప్రశ్నలు అడిగారు. కటాఫ్ పరంగా 100 నుంచి 105 మధ్యలో మార్కులు వస్తాయనుకుంటే.. మెయిన్‌కు ప్రిపరేషన్ మొదలుపెట్టొచ్చు.
- వి.గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ


మెయిన్‌పై దృష్టిసారించాలిలా...!
నిపుణుల అభిప్రాయం ప్రకారం- ప్రిలిమ్స్‌లో వంద మార్కులు వస్తున్నాయనుకునే అభ్యర్థులు మెయిన్ ప్రిపరేషన్‌ను తక్షణమే ప్రారంభించడం మేలు చేస్తుంది. మెయిన్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ దిశగా ముందుగా అభ్యర్థులు వారు ఎంపిక చేసుకున్న ఆప్షనల్ సబ్జెక్ట్‌పై అవగాహన పెంచుకోవడానికి కృషి చేయాలి. ఇదే సమయంలో జనరల్ స్టడీస్‌ను విస్మరించడం సరికాదు. జీఎస్ పేపర్లు, ఆప్షనల్ ప్రిపరేషన్‌కు కేటాయించే సమయం మధ్య సమతుల్యత పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

జీఎస్‌తోపాటు కరెంట్ అఫైర్స్
సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ గత నాలుగైదేళ్ల సరళిని పరిశీలిస్తే.. అభ్యర్థులు జనరల్ ఎస్సే విషయంలో మరింత ప్రత్యేక వ్యూహంతో అడుగులు వేయాలి. ప్రధానంగా కరెంట్ అఫైర్స్ ఆధారితంగా ఉండే అంశాలకు ప్రాధాన్యమిస్తూ వాటిని వ్యాసరూపంలో విశ్లేషించే విధంగా కసరత్తు చేయాలి.
  • పేపర్ 2(జనరల్ స్టడీస్-1) విషయంలో భారత సంస్కృతి, వారసత్వ అంశాలకు ప్రాధాన్యమివ్వాలని, ఫ్యాక్ట్స్‌తోపాటు ఆయా రాజ్య వంశాల కాలంలోని ముఖ్యమైన ఘట్టాల గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి.
  • పేపర్ 3(జనరల్ స్టడీస్-2)లో పేర్కొన్న గవర్నెన్స్, కాన్‌స్టిట్యూషన్, పాలిటీ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ అంశాల ప్రిపరేషన్ పరంగా.. కోర్ అంశాలతోపాటు ఇటీవల కాలంలో జరిగిన రాజ్యాంగ సవరణలు, అంతర్జాతీయంగా ప్రాముఖ్యం సంతరించుకున్న ఘట్టాలు, ఒప్పందాలు, వాటి ద్వారా మనకు లభించే ప్రయోజనాల గురించి ఔపోసన పట్టాలి.
  • పేపర్ 4(జనరల్ స్టడీస్-3)లో పేర్కొన్న టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్‌మెంట్, జీవ వైవిధ్యం, పర్యావరణం, విపత్తు నిర్వహణ అంశాల్లో... జీవ వైవిధ్యం, విపత్తు నిర్వహణ అంశాలకు కొంత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ చదవడం మంచిదని, అదే విధంగా ఇటీవల కాలంలో మన దేశ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి పూర్తిగా తెలుసుకోవాలని పేర్కొంటున్నారు.
  • పేపర్-5 (జనరల్ స్టడీస్-4)లో అభ్యర్థుల్లోని నిర్ణయాత్మక నైపుణ్యాలు, ప్రభుత్వ ఉద్యోగిగా పాటించాల్సిన నైతిక విలువలకు సంబంధించి పరీక్షించే ఈ పేపర్ కోసం అభ్యర్థులు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పుస్తకాలను, వాస్తవ పరిస్థితులను సమన్వయం చేసుకుంటూ చదవాలని సూచిస్తున్నారు.

మెయిన్ ఎగ్జామ్ విధానం :
డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించే యూపీఎస్‌సీ మెయిన్ ఎగ్జామినేషన్ ఏడు పేపర్లుగా 1750 మార్కులకు ఉంటుంది. వివరాలు..

పేపర్

సబ్జెక్ట్

మార్కులు

పేపర్-1

ఎస్సే

250

పేపర్-2

జీఎస్-1 (ఇండియన్ హెరిటేజ్, కల్చర్, హిస్టరీ,వరల్డ్ జాగ్రఫీ, సొసైటీ)

250

పేపర్-3

జీఎస్-2 (గవర్నెన్స్, కాన్‌స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్,ఇంటర్నేషనల్ రిలేషన్స్)

250

పేపర్-4

జీఎస్-3 (టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్‌మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్)

250

పేపర్-5

జీఎస్-4 (ఎథిక్స్, ఇంటెగ్రిటీ, ఆప్టిట్యూడ్)

250

పేపర్-6

ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్-1

250

పేపర్-7

ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్-2

250

మొత్తం మార్కులు 1750
మెయిన్ పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 28 నుంచి అయిదు రోజులు

అనలిటికల్ అప్రోచ్ ముఖ్యం :
మెయిన్స్కు ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులు అనలిటికల్ అప్రోచ్‌తో ముందుకు సాగాలి. ఒక విషయాన్ని విభిన్న కోణాల్లో విశ్లేషించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. మెయిన్ ఎగ్జామినేషన్‌కు అందుబాటులో ఉండే సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ.. ఆ వ్యవధిలో పూర్తి చేసే విధంగా మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం మేలు చేస్తుంది.
-ఇమ్మడి ఫృథ్వితేజ, సివిల్స్-2017 24వ ర్యాంకు
Published date : 06 Jun 2018 02:16PM

Photo Stories