Skip to main content

Education Loans: రూ. 15లక్షల వ‌ర‌కు రుణం.. ఈ నిబంధ‌న‌లు పాటిస్తే

education loan for students

భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలన్నా.. సమున్నత అవకాశాలు అందుకోవాలన్నా.. ఉన్నత విద్యతోనే సాధ్యం! అందుకే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నత విద్య కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతారు. అందుకోసం ఎంట్రన్స్‌ టెస్ట్‌ల్లో ప్రతిభ చూపేందుకు కృషిచేస్తుంటారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపినా.. భారీగా ఉండే ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి. దీంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. నిరాశకు గురవుతున్న వైనం! ఇలాంటి విద్యార్థులకు అండగా నిలుస్తోంది..విద్యారుణం!! దేశంలోని పలు బ్యాంకులు ఎడ్యుకేషన్‌ లోన్స్‌ అందిస్తున్నాయి. ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్‌మెంట్‌ తదితర ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతున్న నేపథ్యంలో.. ఎడ్యకేషన్‌ లోన్స్, అందుకునేందుకు అర్హతలు, నియమ నిబంధనలపై ప్రత్యేక కథనం.. 

  • ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర అన్ని కోర్సులకూ రుణం
  • స్వదేశీ, విదేశీ విద్యకు బ్యాంకుల విద్యా రుణాలు
  • కనిష్టంగా రూ.4 లక్షలు గరిష్టంగా రూ.15లక్షల వరకు
  • కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సింగిల్‌ విండో విధానం 
  • విద్యాలక్ష్మి పోర్టల్‌ పేరిట ఆన్‌లైన్‌లో దరఖాస్తు సదుపాయం
  • మహిళా విద్యార్థులను ప్రోత్సహించేలా ఇంట్రస్ట్‌ సబ్సిడీ స్కీమ్‌
     
  • బీటెక్‌.. కాసింత పేరున్న కళాశాలల్లో ఏడాదికి రూ. 60 వేల నుంచి రూ.లక్షన్నర కుపైగా ఫీజు ఉంది. 
  • ఎన్‌ఐటీల్లో సెమిస్టర్‌కు రూ.65 వేల నుంచి రూ.70 వేలు; ఐఐటీల్లో సెమిస్టర్‌కు రూ.లక్ష వరకు ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. 
  • ఐఐఎంలలోనైతే ఎంబీఏ ప్రోగ్రామ్‌కు రూ.20 లక్షలకు పైగానే ఫీజులు.
  • సంప్రదాయ డిగ్రీ కోర్సులను చదవాలన్నా.. మూడేళ్లకు రూ.50 వేల వరకు ఫీజు ఉంటుంది. 
  • మరి విదేశీ విద్య అంటే.. సగటున రూ.50 లక్షల వరకు వ్యయం అవుతుంది.

బ్యాంకుల వెన్నుదన్ను

భారీ ఫీజుల కారణంగా ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థులు, అర్హతలు ఉన్నా.. ఉన్నత విద్య అవకాశాలు తలుపు తట్టినా..వాటిని అందుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఇలాంటి విద్యార్థులు తమ కలలను నెరవేర్చుకునేలా.. బ్యాంకులు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. విద్యా రుణాల పేరుతో ఉన్నత విద్యకు ఊతం ఇస్తున్నాయి. విద్యార్థులు తమ కలల కెరీర్‌కు సోపానం వేసే కోర్సుల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.

చ‌ద‌వండి: IIT Jobs: ఐఐటీల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌.. ఏడాదికి రూ.2కోట్లకు పైగా వేత‌నం..

గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్స్‌కే

ప్రస్తుతం విద్యా రుణాలను అందిస్తున్న బ్యాంకులు కొన్ని అర్హత నిబంధనలను పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఏఐసీటీఈ, యూజీసీ, విద్యాశాఖ, ఆల్‌ ఇండియా అసోసియేషన్‌ ఆఫ్‌ యూనివర్సిటీస్‌ గుర్తింపు ఉన్న కళాశాలలు, కోర్సులనే విద్యా రుణ మంజూరులో పరిగణనలోకి తీసుకుంటాయి. అంటే.. సదరు ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకే విద్యా రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి లభిస్తుంది. అంతేకాకుండా ప్రవేశం పొందిన విధానాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి.

ఎంట్రన్స్‌లో అర్హత

విద్యార్థులు ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణత ద్వారా ప్రవేశం పొందితేనే విద్యా రుణం దరఖాస్తుకు అర్హత కల్పిస్తున్నాయి. అంటే.. ప్రవేశ పరీక్షలో ప్రతిభ ద్వారా కన్వీనర్‌ కోటాలో సీటు దక్కించుకున్న వారికే విద్యా రుణం పొందే అవకాశం ఉంటుంది. మేనేజ్‌మెంట్‌ కోటాలో చేరాలనుకునే వారికి ఎడ్యుకేషన్‌ లోన్‌కు అర్హత ఉండదు. కొన్ని బ్యాంకులు మాత్రమే తమ అంతర్గత విధి విధానాల ప్రకారం మేనేజ్‌మెంట్‌ కోటాలో ప్రవేశం పొందిన వారికి సైతం అవకాశం కల్పిస్తున్నాయి. ఈ బ్యాంకులు అధిక శాతం ప్రైవేట్‌ సెక్టార్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం ఎంట్రన్స్‌లో మెరిట్‌ పొందిన వారికే విద్యా రుణ మంజూరు విషయంలో ప్రాధాన్యం ఇస్తున్నాయి. 

చ‌ద‌వండి: Higher Education Loans: కనిష్టంగా రూ.4 లక్షలు.. గరిష్టంగా రూ.20 లక్షల వరకు రుణం

రూ.10 లక్షలు, రూ.20 లక్షలు

  • ప్రస్తుతం బ్యాంకులు విద్యా రుణాల మంజూరు.. రుణ మొత్తం విషయంలో రెండు రకాల విధానాలు అమలు చేస్తున్నాయి. అవి.. 
  • మన దేశంలోని ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు గరిష్టంగా రూ.పది లక్షలు రుణం మంజూరు చేస్తున్నాయి.
  • విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్‌ లభించిన వారికి గరిష్టంగా రూ.20 లక్షల వరకూ రుణం అందిస్తున్నాయి. 

మూడు శ్లాబ్‌లలో రుణాలు

  • విద్యా రుణాలను అందించే క్రమంలో బ్యాంకులు మూడు శ్లాబ్‌ల విధానాన్ని అమలు చేస్తున్నాయి.
  • శ్లాబ్‌-1లో రూ.4 లక్షల రుణ మొత్తంగా నిర్ణయించారు. ఈ శ్లాబ్‌లో విద్యార్థులు ఎలాంటి హామీ ఇవ్వక్కర్లేదు.
  • శ్లాబ్‌-2లో రూ.4 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు రుణ మొత్తాన్ని కేటాయిస్తున్నారు. ఇందుకోసం తల్లిదండ్రుల హామీ, థర్డ్‌ పార్టీ గ్యారెంటీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.
  • శ్లాబ్‌-3లో రూ.7.5 లక్షలకు పైగా రుణ మొత్తం ఉంటోంది. దీనికి దరఖాస్తు చేయాలనుకుంటే.. ఈ మొత్తానికి సరిపడే కొల్లేటరల్‌ సెక్యూరిటీ(స్థిరాస్థి పత్రాలను) ఇవ్వాల్సి ఉంటుంది.

మార్జిన్‌ మనీ చెల్లింపు

విద్యార్థులు కొంత మొత్తాన్ని మార్జిన్‌ మనీగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. రూ.4లక్షల వరకు ఎలాంటి మార్జిన్‌ మనీ ఉండదు. రూ.4 లక్షలు దాటిన రుణ దరఖాస్తులకు స్వదేశంలో చదివే విద్యార్థులు అయిదు శాతం, విదేశీ విద్య అభ్యర్థులు 15 శాతం మార్జిన్‌ మనీని సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

ఈ వ్యయాలకే రుణం

  • ట్యూషన్‌ ఫీజు, హాస్టల్‌ ఫీజు, ఎగ్జామినేషన్‌/ లైబ్రరీ/ లేబొరేటరీ ఫీజు. 
  • విదేశీ విద్య విద్యార్థులకు ప్రయాణానికి అయ్యే ఖర్చులు.
  • పుస్తకాలు, యూనిఫామ్, కంప్యూటర్, ఇతర అకడమిక్‌ సంబంధిత పరికరాలు కొనుగోలుకు అయ్యే వ్యయం.
  • కోర్సు పరంగా అవసరమైన స్టడీ టూర్స్, ప్రాజెక్ట్‌ వర్క్స్‌ తదితరాలకు అయ్యే ఖర్చు.
  • ఇన్‌స్టిట్యూట్‌లు వసూలు చేసే కాషన్‌ డిపాజిట్, బిల్డింగ్‌ ఫండ్,రిఫండబుల్‌ డిపాజిట్‌లకు రుణం మంజూరు చేస్తారు. ఇవి నిర్దేశిత ట్యూషన్‌ ఫీజు మొత్తంలో 10 శాతానికి మించకుండా ఉండాలి.
  • కంప్యూటర్‌ కొనుగోలు వ్యయం, స్టడీ టూర్స్, ప్రాజెక్ట్‌ వర్క్స్‌ కోసం ఇచ్చే మొత్తం ట్యూషన్‌ ఫీజులో 20 శాతానికి మించకుండా ఉంటుంది.

తిరిగి చెల్లింపు.. నిబంధనలివే

విద్యా రుణం తిరిగి చెల్లించే విషయంలో బ్యాంకులు కొంత సరళీకృత నిబంధనలు పాటిస్తున్నాయి. రీ పేమంట్‌ హాలిడే పేరుతో కోర్సు పూర్తయిన తర్వాత సంవత్సరం నుంచి లేదా కోర్సు పూర్తయి ఉద్యోగం లభించినప్పటి నుంచి వాయిదాల విధానంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా గరిష్టంగా 15 ఏళ్ల వ్యవధిలో ఈఎంఐ విధానంలో చెల్లించొచ్చు.

మహిళలను ప్రోత్సహించేలా

  • ఉన్నత విద్యనభ్యసించేలా మహిళా విద్యార్థులను ప్రోత్సహించేందుకు బ్యాంకులు విద్యా రుణాలకు సంబంధించి వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా వడ్డీ రేట్లలో 0.5 శాతం నుంచి ఒక శాతం వరకు మహిళా విద్యార్థులకు రాయితీ ఇస్తున్నాయి. 
  • రుణ తిరిగి చెల్లింపు పరంగా స్టార్టప్‌ ఔత్సాహిక విద్యార్థులకు ప్రత్యేక సదుపాయాన్ని కల్పిస్తూ గత ఏడాది కొత్త వెసులుబాటు కల్పించారు. స్టార్టప్‌ ఏర్పాటు వైపు అడుగులు వేసిన విద్యార్థులు.. కోర్సు పూర్తయ్యాక రెండేళ్ల తర్వాత నుంచి రుణం తిరిగి చెల్లించే వీలుంది.

ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌

ఐబీఏ (ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌) మార్గనిర్దేశకాల ప్రకారం-విద్యార్థులు ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందితే ఆ గరిష్ట రుణ మొత్తాన్ని పెంచే విచక్షణాధికారాన్ని బ్యాంకులకు కల్పించింది. ఉదాహరణకు ఐఐఎంలు, ఐఐటీల వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో రూ పది లక్షల కంటే ఎక్కువ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందిన వారికి గరిష్ట రుణ పరిమితిలో సడలింపు లభిస్తుంది.

అకడమిక్‌ ప్రతిభపై సమీక్ష

విద్యా రుణం మంజూరు అయిన విద్యార్థికి సంబంధించిన ఫీజులను బ్యాంకులు నేరుగా సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌కే పంపుతాయి. ఒకవేళ తొలి దశలో విద్యార్థులు సొంతంగా ఫీజు చెల్లిస్తే సంబంధిత రశీదులు ఆధారంగా తొలి దశ ఫీజును విద్యార్థికి అందిస్తాయి. ఆ తర్వాత దశ నుంచి ఇన్‌స్టిట్యూట్‌కు పంపుతాయి. అంతేకాకుండా ప్రతి ఏటా రుణ మొత్తాన్ని పంపించే బ్యాంకులు..అంతకుముందు విద్యా సంవత్సరంలో సదరు విద్యార్థి ప్రతిభ గురించి కూడా సమీక్ష చేస్తున్నాయి. 

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు

  • ప్రవేశ ధ్రువీకరణ పత్రం; అకడమిక్‌ అర్హతల సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలు; తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ; తల్లిదండ్రుల ఆదాయ స్థితిగతుల వివరాలు, బ్యాంకు అకౌంట్‌ స్టేట్‌మెంట్స్‌; నివాస ధ్రువీకరణ; థర్డ్‌పార్టీ ఆదాయ ధ్రువీకరణ
  • కోర్సు వ్యయానికి సంబంధించి ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి అధీకృత లెటర్స్‌
  • వివరాలకు వెబ్‌సైట్‌: https://www.iba.org.in/

విద్యా లక్ష్మి పోర్టల్‌

విద్యా రుణాల దరఖాస్తుకు కేంద్ర ప్రభుత్వం సింగిల్‌ విండో విధానాన్ని అమలు చేస్తోంది. విద్యార్థులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. విద్యాలక్ష్మి పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం-విద్యార్థులు ఈ పోర్టల్‌లో లాగిన్‌ అయి.. కామన్‌ ఎడ్యుకేషనల్‌ లోన్‌ అప్లికేషన్‌ ఫామ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్టంగా మూడు బ్యాంకులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను అభ్యర్థులు ప్రాథమ్యాల ఆధారంగా ఆయా బ్యాంకులకు పంపిస్తారు. తర్వాత దశలో సదరు బ్యాంకులు దరఖాస్తును పరిశీలించి.. సంతృప్తి చెందితే తదుపరి దశలో ఏ బ్రాంచ్‌లో సంప్రదించాలి, ఏ ఏ పత్రాలు తీసుకెళ్లాలి అనే వివరాలను విద్యార్థులకు పంపుతాయి. విద్యాలక్ష్మి పోర్టల్‌ విద్యార్థులకు, బ్యాంకులకు అనుసంధానకర్తగా ఉంటుంది. 

  • వివరాలకు వెబ్‌సైట్‌: https://www.vidyalakshmi.co.in/
Published date : 27 Oct 2022 05:29PM

Photo Stories