Skip to main content

మాఫలేషు కదాచన

మనుషుల్లో మూడు రకాలుంటారు. ఏదో జరుగుతుందని ఆశిస్తూ కూర్చునేవారు.. ఏదైనా జరిగితే చూసి ఆశ్చర్యపడేవారు.. ఏది జరగాలనుకుంటారో అది జరిగే వరకూ అలుపెరగకుండా.. అవిశ్రాంత పరిశ్రమ చేసి సాధించేవారు. గొప్ప శాస్త్రవేత్తలు కూడా సాధారణ స్థాయి తెలివితేటలు కలిగినవారే. అయితే, ఏదో సాధించి తీరాలన్న తపన కలిగినవారు. ఆశించిన ఫలితం రానప్పుడు నిరుత్సాహం సహజం. అందుకే శరీరానికి స్నానం ఎలాగో.. మనసుకు ప్రేరణ ప్రతిరోజూ అవసరం.

బ్రిటిషర్లు భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజులవి. ప్రభుత్వ కార్యాలయంలో క్లర్క్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ కోసం సిమ్లా వెళ్లాడతను. తనకున్న రెండు జతల్లో... కాస్త బాగున్న జతను శుభ్రంగా ఉతుక్కొని ఇత్తడి చెంబుతో ఇస్త్రీ చేసుకొన్నాడు. అరిగిపోయినా, ఉన్న బూట్లని నూనెతో చక్కగా పాలిష్ చేసుకొని, పరిశుభ్రమైన ఆహార్యంతో, ముఖాభరణమైన చిరునవ్వుతో ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. వాస్తవానికి ఆ ఉద్యోగం అతనికి ఎంతో అవసరం. అన్ని అర్హతలు ఉన్నాయి కదా, ఉద్యోగం వస్తుందిలే..! అనుకున్నాడతను. ఇంటర్వ్యూలో అతని అర్హతలను మెచ్చుకున్నా... ఉద్యోగం మాత్రం మరొకరిని వరించింది. అతనితో వెళ్లిన తోటి మిత్రులు సిమ్లా వచ్చాం కదా! ప్రకృతి రమణీయ దృశ్యాలను చూసి ఎంజాయ్ చేసి వెళదాం అన్నారు. అయితే, అతని మనసు ఒప్పలేదు. నేను రాలేను. కావాలంటే మీరు వెళ్లండి అన్నాడు. ఉద్యోగం రాలేదని నిరాశపడ్డా.. ఎలా అయినా సరే సిమ్లాలో ఉద్యోగం సంపాదించి తీరాల్సిందేనని తీర్మానించుకున్నాడు.

ఓపికగా అన్ని ఆఫీసులు తిరిగాడు. ప్రతిచోటా నో వేకెన్సీ సమాధానమే. విసుగు చెందినా.. నిగ్రహం కోల్పోలేదు. అలా ఒక వీధిలో నడుస్తూ ఉండగా, ఆ వీధికే హుందాతనం తెచ్చే విధంగా ఉన్న ఓ హోటల్ భవనం కన్పించింది. ఆ భవన నిర్మాణానికి, సౌందర్యానికి ముగ్దుడై ఎలాగైనా ఈ భవనంలో ఉద్యోగం చేయాలనుకున్నాడు. కాసేపు అక్కడే తచ్ఛాడి హోటల్‌లోకి ప్రవేశించబోయాడు. సందేహాస్పదంగా అడుగుపెడుతున్న అతన్ని ద్వారపాలకులు ఆపి ప్రశ్నించారు. హోటలు యజమానిని కలవాలని చెప్పాడతను. అపాయింటుమెంట్ ఉందా అని అడిగారు. లేదన్నాడు అతను. అంతే, ఒక్క నెట్టు నెట్టారు. కింద పడబోయినా తమాయించుకొని.. కింద పడనందుకు సంతోషిస్తూ రోడ్డుకు ఆవలివైపున ఉన్న ఒక బడ్డీకొట్టు యజమాని వద్దకు చేరాడు. హోటలు యజమాని ఎన్ని గంటలకు వస్తాడు? ఎన్నింటికి ఇంటికి వెళతాడు? ఇలాంటి విషయాలు సేకరించాడు. హోటలు యజమాని మరికాసేపట్లో లంచ్‌కు వెళతాడు అని తెలుసుకొని ఎలర్ట్ అయ్యాడు.
 
ఆ యజమాని బయటకు వచ్చి కారు ఎక్కబోయేలోగా.. ఒక్కసారిగా చిరునవ్వుతో అతని దగ్గరకు చేరుకున్నాడు. కళ్లతోనే అతన్ని చదివేశాడు ఆ యజమాని. ఖరీదైనవి కాకపోయినా శుభ్రమైన అతని బట్టలు.. అరిగినా మెరుస్తున్న అతని బూట్లు.. అతను టై కట్టుకున్న విధానం.. హుందాతో కూడిన చిరునవ్వు.. యజమానిని ఆకట్టుకున్నాయి. ఏం కావాలని అడిగాడు? ఏదైనా ఉద్యోగం ఇస్తారా? అని చిరునవ్వు చెదరకుండా అడిగాడతను. నా దగ్గర ప్రస్తుతం ఖాళీలేమీ లేవే! అన్నాడు ఆ యజమాని. మీరే పని ఇచ్చినా చేస్తానని సమాధానమిచ్చాడా కుర్రాడు. ఖాళీలు లేకపోయినా ఆ కుర్రాడి దృక్పథానికి ముచ్చటపడి.. సాయంత్రం వచ్చి కలువు చూద్దాం అన్నాడు. యజమాని ఇంటికెళ్లి తిరిగొచ్చేవరకు ఆ కిళ్లీ కొట్టు దగ్గరే ఎదురుచూస్తూ నిలబడ్డాడు. యజమాని తిరిగి వచ్చిన తరువాత ఆయన్ని కలవటం.. సూపర్‌వైజర్‌గా నెలకు 60 రూపాయల జీతానికి కుదిరిపోవటం చకచకా జరిగిపోయాయి. పనేంటో అతను ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ పనిని బాగా చేయాలన్నదే తపన. ఉదయం పని ప్రారంభించినప్పటి నుంచి పని గంటలు ముగిసే వరకూ తరగని ఉత్సాహంతో పనిచేసే అతడంటే అందరూ ఇష్టపడేవారు. మొదటి నెల జీతం తీసుకున్న అతని ఆనందం వర్ణనాతీతం. స్వార్జితంలో అంత ఆనందం ఉందని, అతనికి అప్పుడే అనుభవమైంది. ఎంతో స్వాతంత్య్రం వచ్చినట్లుగా ఫీలయ్యూడు.

చాణక్యుడు అన్నట్లు...
ఉత్తమా ఆత్మనా ఖ్యాతః
పితుః ఖ్యాతశ్చ మధ్యమాః


స్వశక్తితో పైకి వచ్చిన వాడు ఉత్తముడు. తండ్రి ప్రభావంతో వన్నెకెక్కినవాడు మధ్యముడు.

ఉద్యోగం ఇలా సాఫీగా సాగిపోతుండగా..ఆ హోటల్‌కు కస్టమర్‌గా వచ్చిన ఓ ఇంగ్లిష్ వ్యాపారస్తుడు.. అతని చురుకుదనాన్ని, ఉత్సాహాన్ని గమనించి.. నాతో కలసి పనిచేస్తావా అని అడిగాడు. ఒక్క క్షణం ఆలోచించి ‘తప్పకుండా’ అని సమాధానమిచ్చాడు. మంచి ఉద్యోగం, నిలకడైన కంపెనీని వదిలి.. తెలియని భవిష్యత్తులోకి వెళుతూ అనుకున్నాడు... ‘భగవంతుడా! స్వవివేకాన్ని నమ్ముకొని.. స్వచ్ఛమైన మనస్సుతో ముందడుగు వేస్తున్నాను.. ఆశీర్వదించు!!’’, అని. ఆ ఇంగ్లిష్ వ్యాపారస్తునితో కలిసి ఢిల్లీలో, ఒక హోటల్‌ని కాంట్రాక్టుకు తీసుకొని పని చేయటం ప్రారంభించారు. జీతం ఎంత ఇస్తారని అతడు కానీ, ఎంత కావాలని యజమాని కానీ అడగలేదు. నెలయ్యేసరికి 75 రూపాయల కవరు అందించాడు ఆ యజమాని. ఢిల్లీలో లాభం రావటంతో ఆ లాభంతో సిమ్లాలో ఒక పాత హోటల్‌ను కొని అక్కడ వ్యాపారం ప్రారంభించాడు ఆ కొత్త యజమాని. ఈ హోటల్‌లో అడుగడుగునా సమస్యలు, అవాంతరాలే. అయితే నిగ్రహం కోల్పోని మనస్తత్వం కావటంతో.. హోటలు వ్యాపారంలోని మెలకువలన్నీ నేర్చుకోవటానికి ఆ అనుభవం ఎంతో ఉపయోగపడింది. కొత్త యజమాని కోరిక మేరకు ఆ హోటల్‌లో భాగస్వామిగా చేరాడు. అయితే, అప్పటికీ నష్టాల బారిన నడుస్తున్న ఆ హోటలును ఆర్థికమాంద్యం మరింత దెబ్బతీసింది. విసుగుపుట్టి ఆ హోటల్‌ను అమ్మేద్దామనుకున్నాడు ఆ యజమాని.
 
కానీ ఆ కుర్రాడు ఆయన్ని వారించాడు. ఆర్థికమాంద్యంలో రేటు పలకగపోగా బజారున పడతామని వివరించాడు. కానీ, ఆ యజమాని హోటలును అమ్మేసి ఇంగ్లండుకు వెళ్లిపోవటానికి నిశ్చయించుకున్నాడు. భాగస్వామి కావటంతో తనే కొందామా అని అనుకున్నాడతను. కానీ డబ్బేది? నీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇచ్చి హోటల్‌ని తీసేసుకోమన్నాడు ఆ యజమాని. అయితే అతను చేసిన మేలు మర్చిపోనివాడు కావటంతో న్యాయమైన ధరకే కొందామని నిర్ణయించుకున్నాడు. భర్త వ్యధను గమనించిన భార్య... తన నగలను భర్త ముందుంచింది. పనిచేస్తూ తాను కూడబెట్టిన ధనం.. నగలు అమ్మగా వచ్చిన ధనం.. మరికొంత మంది మిత్రుల నుంచి చేబదులుగా తీసుకున్న ధనంతో ధైర్యం చేసి ఆ హోటల్‌ను కొన్నాడు. తన 34వ ఏట కొన్న ఆ హోటల్‌లోకి తన కూతుర్ని ఎత్తుకొని లోపలికి వెళుతూ... నీవు పెద్దయ్యేసరికి నీవు ఏ నగరానికి వెళితే ఆ నగరంలో మన హోటల్ ఉండాలి! అని అనుకుంటూ హోటల్‌లోకి నడిచాడు. తన అనుభవాన్ని అంతా ఉపయోగించి కష్టపడ్డాడు. హోటల్‌లో ప్రతి గదిని ఒక చిన్న స్వర్గసీమలా మార్చాడు. కస్టమర్లతో ఆప్యాయంగా, వినయంగా, హృదయపూర్వకంగా పలుకరించేవాడు. ప్రేమ లేకుండా పెట్టిన అన్నం చేదుగా ఉండటమే కాదు, అది ఆకలిని సగమే తీరుస్తుందని ఖలీల్ జీబ్రా అన్న మాటలను అతను మనస్ఫూర్తిగా వంట పట్టించుకున్నాడు. అలా ప్రారంభమైన అతని హోటల్.. తన కూతురు పెద్దయ్యేసరికి ప్రపంచంలో ఏ పెద్ద నగరానికి వెళ్లినా, బ్రాంచి ఉండే స్థాయికి ఎదిగింది. అతను ఎవరోకాదు ఒబెరాయ్ హోటళ్ల యజమాని మోహన్‌సింగ్ ఒబెరాయ్.

క్లర్క్ ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటేనో..విధిని, సమాజాన్ని నిందిస్తూ నిరాశావాదంతో కుమిలిపోతేనో.. తనకెవరూ సాయం చేయట్లేదని బంధుమిత్రులను నిందిస్తూ కూర్చుంటేనో.. ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు తలవంచి ఓటమిని అంగీకరిస్తేనో.. ప్రపంచానికే తలమానికంగా నిలచిన ఒబెరాయ్ హోటల్‌లు ఉండేవి కావేమో!!

ఒబెరాయ్ జీవితాన్ని పరిశీలిస్తే...

ఉత్సాహ సంపన్న మదీర్ఘ సూత్రం
క్రియూ విధిజ్ఞ విషయేష్వసక్తమ్
శూరః కృతజ్ఞం ధృఢ నిశ్చయూచ
లక్ష్మీః స్వయం వాంఛతి వాసహేతోః


నిత్యం ఉత్సాహంగా ఉండేవారికీ... నైపుణ్యం, పట్టుదల, చొరవ, లక్ష్యాన్ని విస్మరించకపోవటం అనే గుణాలున్నవారికీ.. అనవసర విషయాలపట్ల అనాసక్తంగా ఉండేవారికీ.. ధైర్యవంతులకూ, దృఢ సంకల్పులకూ.. చేసిన మేలు గుర్తుంచుకుని కృతజ్ఞులుగా ఉండేవారికీ.. సద్గుణాలే ఆభరణాలుగా గలవారికీ... తనకు తానై లక్ష్మి అనే అదృష్ట దేవత వరిస్తుంది.. కార్యసాఫల్యం చేకూరుతుంది- అన్న భర్తృహరి మాటలు గుర్తొస్తాయి.

ప్రతి మనిషికీ జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఉండాలి. ఎందుకంటే.. లక్ష్యంలేని వ్యక్తి నిజమైన పేదవాడు. అలా అని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగినవారిని చూసి.. రాత్రికి రాత్రే గొప్పవారుగా మారదామన్నా కష్టమే. ఎందుకంటే... మనకు వారి ఈనాటి ఉన్నత స్థానమే కనిపిస్తుంది. గానీ, దాని వెనుక ఉన్న ఏళ్ల తరబడి తపస్సు కనిపించదు. 1974లో దేశం కాని దేశంలో.. 21 గంటలపాటు ఒంటరిగా ఆకలితో, చలిలో, గార్డుబోగీలో చేసిన రైలు ప్రయాణం... ఆకలి, పేదరికం, సంపద అనే విషయాలపై తీవ్రంగా ఆలోచింపచేసింది. మానవ విలువలే స్థిరమైన ఆస్థులుగా.. ఆ విలువలే మూలాలుగా సంపద సృష్టించాలన్న దృఢ సంకల్పం కలిగించింది. ఆ తర్వాత మరో 25 ఏళ్లు రాత్రింబవళ్లు సహచరులతో శ్రమిస్తేనే... నారాయణమూర్తి అనే వ్యక్తి ఇన్ఫోసిస్ అనే సంస్థను సృష్టించి.. ప్రపంచ స్థాయిలో విలువల ఆధారిత పారిశ్రామికవేత్తగా ఎదిగారంటే... జీవితంలో ఏదైనా సాధించటానికి కావలసిన ముడిపదార్థాలు ఏమిటో అర్థమవుతాయి. జీవితమంటే వడ్డించిన విస్తరి కాదు. సృష్టిలో ఏ ప్రాణికీ కూడా కష్టపడకుండా సుఖపడగలిగే మార్గం లేదు. ఎందుకంటే.. అది ప్రకృతి విరుద్ధం కాబట్టి. తేలికగా వచ్చింది తేలికగానే పోతుంది. ప్రకృతిని దగ్గరగా పరిశీలిస్తే... అనేక జీవిత సత్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు ఫలాలు అందినట్లే దగ్గరకు వచ్చి చేజారతాయి. అయినా కృషీవలుడు తన ప్రయత్నలోపం లేకుండా ముందుకు సాగుతాడు. ఆ కృషిఫలాలు అతన్ని అనుసరిస్తాయి.

భగవద్గీతలో చెప్పినట్లు..
కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన

చేసే పని ఫలాన్ని గురించి ఎక్కువ ఆందోళన చెందకుండా... పనిపైనే శ్రద్ధ అంతా ఉంచి పనిచేయాలి అన్న మాటలు సరిగా అర్థం చేసుకుంటే... కోరిన కాలేజీలో సీటు రాలేదని ఆత్మహత్య చేసుకోవడం.. నచ్చిన ఉద్యోగం దొరకలేదని డిప్రషన్‌లోకి వెళ్లటం.. ఫలితం పైనే ధ్యాసతో తీవ్ర వత్తిడికి గురై, చేసే పనిని సరిగా చేయలేకపోవటం... లాంటి పరిస్థితులు ఎదురు కావు.

ప్రకృతిలో అల్పప్రాణిగా భావించే కోడిని చూడండి...

యుద్ధంచ ప్రాతురుత్థానాం భోజనం సహబంధుభిః
స్త్రియ మాపద్గతాం రక్షేత్ చుతుః శిక్షేత కుక్కుటం


పోరాడటం, ఉదయాన్నే నిద్రలేవటం, బంధువులతో కూడి భుజించటం, ఆపదలో ఉన్న స్త్రీని రక్షించడం... ఈ నాలుగు కోడి పుంజు నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణాలు. మరి ప్రకృతిలో ఉత్కృష్ట ప్రాణులమైన మనలో ఎన్ని గొప్ప గుణాలు ఉండాలి. ప్రకృతికి దగ్గరగా జీవించేవారు వాస్తవాన్ని నిర్భయంగా ఎదుర్కొని పోరాడతారే కానీ, పలాయన వాదాన్ని ఆశ్రయించి...తమ దురదృష్టాన్ని నిందించుకుంటూ.. దురవ్యాపకాల్లో పడి తాత్కాలిక ఉపశమనాలను వెతుక్కోరు.

అతడు ఏడేళ్ల ప్రాయంలోనే కుటుంబ పోషణ కోసం కార్మికుడిగా పనిచేశాడు. తొమ్మిదేళ్ల వయసులో తల్లి చనిపోయింది. ఇరవై ఏట ప్రియురాలు మరణించింది. 22 ఏట చేసే ఉద్యోగం నుంచి తొలగించారు. ఇరవై మూడేళ్లకు సొంతంగా దుకాణం తెరచి అప్పుల్లో మునిగాడు. 26 ఏళ్లకు వ్యాపార సహభాగస్వామి హఠాత్తుగా మరణించాడు. అదే సంవత్సరం శాసనసభ్యుడిగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయాడు. ఇరవై ఏడేళ్లకు నరాల బలహీనతతో మంచం పట్టాడు. 29 ఏళ్లకు ప్రొవెన్షియల్ అసెంబ్లీ స్పీకర్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. 31 ఏళ్లకు పార్లమెంటు దిగువసభ సభ్యునిగా పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. 39 ఏళ్లకు మళ్లీ అదే తంతు. 41 ఏళ్లకు కుమారుడు మరణించాడు. 42వ ఏట వరించిందనుకున్న ప్రభుత్వ పదవి నుంచి గెంటివేతకు గురయ్యాడు. 45వ సంవత్సరంలో పార్లమెంటు ఎగువ సభకు పోటీ చేసి ఓడిపోయాడు. 47వ ఏట ఉపరాష్ట్రపతిగా పోటీ చేయాలని ఆశించి భంగపడ్డాడు. 49వ సంవత్సరంలో పార్లమెంటు ఎగువసభకు మళ్లీ పోటీ చేసి ఓడిపోయాడు. అలాంటి వ్యక్తి.. అత్యంత సంక్షోభ సమయంలో.. దేశాధ్యక్షుడిగా, దేశాన్ని సంక్షోభాన్నుంచి బయటపడేయటమే కాకుండా.. దేశంలో అంతర్యుద్ధాన్ని రూపు మాపి.. ముక్కలు కాకుండా కాపాడాడు. ఆ దేశానికి అత్యుత్తమ దేశాధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయనే అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్. ఆయన మాటల్లోనే చెప్పాలంటే... జీవితంలో ఓటమి అనేది ఒక సంఘటనే.. కానీ ఒక సమస్య కాదు!!

సృష్టిలో ప్రతి జీవి తనదైన విలక్షణతతో జన్మిస్తుంది. అయితే, ఇతరులతో పోల్చుకోవడంవల్లో... కృత్రిమంగా అనుకరించడంవల్లో, సామాజిక ఒత్తిడి వల్లో అది మరుగున పడిపోతుంది. మరి ఆ విలక్షణాలను రక్షించుకోవటం ఎలా? ఇది ఎవరికి వారు తాము ఏ విషయాల్లో ఇతరుల కంటే సహజంగా ఇష్టపడుతూ... బాగా చేయగలమో ప్రశ్నించుకుంటే అర్థమవుతుంది. అదే వారి మూల బలం (Strength). ఈ మూలబలాలకు చక్కని ప్రణాళిక, నాణ్యత, కొత్తదనం లాంటి దినుసులు జోడించి.. శాశ్వత విలువలైన కఠోర పరిశ్రమ, స్థితప్రజ్ఞత్వం, దార్శనిక దృష్టి, మానవీయత అనే పాత్రలో వండితే.. తయారయ్యే వంట (ఫలితం) అందరికీ ఆస్వాద యోగ్యంగా ఉంటుంది. మనం ఎంచుకోబోయే వృత్తే మన జీవితంలో ఎక్కువ భాగం ఆక్రమించబోతోంది. ఆనందంగా జీవించాలంటే మనం ఇష్టపడి సంతృప్తినిచ్చే పనిని ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత దానిలో సత్ఫలితం సాధించటానికి ఆసక్తి, నమ్మకం, ఆశావాద దృక్పథం... అనే మూడు విషయాలు ముఖ్యం.

తనకు ఆకాశ రహస్యాలన్నా, పక్షులన్నా ఎంతో ఆసక్తి అని... వాటిలా ఎగరాలని ఆశపడేవాడినని.. ఏదో ఒకరోజు ఆకాశంలో విహరించగలనని గట్టిగా నమ్మానని..ఆ ఆసక్తి, నమ్మకాలే తనను ముందుకు నడిపాయని అంటారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. వైమానిక దళంలో కోరుకున్న ఉద్యోగం రాకపోతే ‘‘నీ భవిష్యత్ వైపు నిన్ను నడిపించటానికి ఈ వైఫల్యం కూడా అవసరమేనని భావించి, అన్వేషించు’’ అని ఒక మహానుభావుడు చెప్పిన మాటలు... తర్వాత 20 సంవత్సరాలు ఎదుర్కొన్న వైఫల్యాలను పట్టుదలతో అధిగమిస్తూ... ముందుకు చొచ్చుకెళ్లిపోవటానికి తనకవసరమైన సాంఘిక, ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చాయంటారాయన.

తనిసిరే వేల్పులుదధి రత్నముల చేత
వెరచిరే ఘోరకాకోల విషముచేత
విడచిరే యత్న మమృతంబు వొడముదనుక
నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు


క్షీరసాగర మధనంలో కల్పవృక్షం కామధేనువు, రత్నాదులెన్నో వచ్చినా దేవతలు పొంగిపోలేదు. తర్వాత జనించిన కాలకూట విషానికి కృంగిపోలేదు. తమ లక్ష్యమెన అమృతాన్ని సాధించే వరకు ప్రయత్నాన్ని ఆపలేదు. ధీరులు స్థితప్రజ్ఞత్వంతో తలచిన కార్యం నెరవేరేవరకు ప్రయత్నాన్ని సాగిస్తారు. మనుషుల్లో మూడు రకాలుంటారు. ఏదో జరుగుతుందని ఆశిస్తూ కూర్చునేవారు.. ఏదైనా జరిగితే చూసి ఆశ్చర్యపడేవారు.. ఏది జరగాలనుకుంటారో అది జరిగే వరకూ అలుపెరగకుండా.. అవిశ్రాంత పరిశ్రమ చేసి సాధించేవారు. గొప్ప శాస్త్రవేత్తలు కూడా సాధారణ స్థాయి తెలివి తేటలు కలిగినవారే. అయితే ఏదో సాధించి తీరాలన్న తపన కలిగినవారు. ఆశించిన ఫలితం రానప్పుడు నిరుత్సాహం సహజం. అందుకే శరీరానికి స్నానం ఎలాగో.. మనసుకు ప్రేరణ ప్రతిరోజూ అవసరం. ‘‘నన్ను ఎక్కడ్నుంచి ఎన్నిసార్లు తోసేసినా.. పిల్లిలా కాళ్లమీదే నిలబడేటట్లు పడతా’’ అంటారు.. పాల ఉత్పత్తిలో విప్లవం తెచ్చిన వర్గీస్ కురియన్.

కందుకమువోలె సుజనుడు
క్రిందంబడి మగుటమీది కిన్నెగయు జుమీ
ముందుడు మృత్పిండము వలె
క్రిందంబడి యడడి యుండు కృపణత్వమున్


బంతి కిందకు ఎంత వేగంగా పడుతుందో అంత త్వరగా తిరిగి పైకి లేస్తుంది. అంతేవేగంతో పడిన మట్టిముద్ద అక్కడే నేలకు కరచుకుని ఉండిపోతుంది. పైన పేర్కొన్న 3 రకాల్లో మొదటి 2 రకాలు మట్టిముద్ద లాంటివారు. 3వ రకం బంతిలాంటి వారు. సాలగ్రామశిల బంగారాన్ని తయారు చేయటంలో ఉపకరిస్తుందంటారు. గీటురాయి బంగారాన్ని పరీక్షిస్తుంది. ఈ రెండూ రాళ్లే. రెండూ నల్లనివే. ఒకటి సువర్ణాన్ని పుట్టించే దయితే.. మరొకటి ఆ సువర్ణాన్ని పరీక్షించేది అయింది. పరిశ్రమ సాలగ్రామమయితే.. ఓటమి గీటురాయి!!

ప్రతి మనిషికీ జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఉండాలి. ఎందుకంటే.. లక్ష్యంలేని వ్యక్తి నిజమైన పేదవాడు. అలా అని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగినవారిని చూసి.. రాత్రికి రాత్రే గొప్పవారుగా మారదామన్నా కష్టమే. ఎందుకంటే...మనకు వారి ఈనాటి ఉన్నత స్థానమే కనిపిస్తుంది. గానీ, దాని వెనుక ఉన్న ఏళ్ల తరబడి తపస్సు కనిపించదు. జీవితమంటే వడ్డించిన విస్తరి కాదు. సృష్టిలో ఏ ప్రాణికీ కూడా కష్టపడకుండా సుఖపడగలిగే మార్గం లేదు. ఎందుకంటే.. అది ప్రకృతి విరుద్ధం కాబట్టి. తేలికగా వచ్చింది తేలికగానే పోతుంది. ప్రకృతిని దగ్గరగా పరిశీలిస్తే... అనేక జీవిత సత్యాలు స్పష్టంగా కనిపిస్తాయి.
 
A.V.Rajamouli, IAS
Published date : 20 Nov 2021 02:47PM

Photo Stories