సివిల్స్లో భారత చరిత్ర గురించి అడిగే ముఖ్యమైన అంశాలివే..
ప్రాచీన చరిత్రలో సింధు నాగరికత, వేదకాలం నాటి భారతదేశం, మహా జనపదాలు, బౌద్ధ్దమతం, మౌర్య సామ్రాజ్యం–పరిపాలన, మధ్య ఆసియా నుంచి జరిగిన దాడులు, దక్షిణ భారతంలోని రాజ్యాలు కీలకంగా నిలుస్తాయి. ప్రాచీన చరిత్రలో సింధు నాగరికత, రుగ్వేదం, బౌద్ధ, జైన మతాల కాలం నాటి శిల్ప సంపద, బుద్ధుడి జీవితంతో ముడిపడిన ప్రదేశాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. మధ్యయుగ చరిత్రలో.. ఉత్తర భారత్, దక్కను రాజ్యాలు, ఢిల్లీ సుల్తానులు, భారత్లో ఇస్లామిక్ రాజ్యాలు, విజయనగర సామ్రాజ్యం, భక్తి–ఇతర సాంస్కృతిక, మత ఉద్యమాలు, మొగల్ పరిపాలన, యూరోపియన్ల రాక తదితరాలు కీలకంగా నిలుస్తాయి. మధ్యయుగ చరిత్ర నుంచి 1 లేదా 2 ప్రశ్నలకు మించి రావట్లేదు. ఆధునిక భారతదేశ చరిత్ర, భారత స్వాతంత్య్రోద్యమం నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. పరీక్ష పరంగా ఆధునిక భారత దేశ చరిత్రలో స్వాతంత్య్రోద్యమం అత్యంత ప్రధానమైంది.
చరిత్రలో కీలకం..
- ఆంగ్లో–మైసూరు, ఆంగ్లో–మరాఠా యుద్ధాలు.
- గవర్నర్ జనరల్స్–చట్టాలు, సంస్కరణలు.
- రైత్వారీ, మహల్వారీ విధానాలు.
- బెంగాల్ విభజన, మింటో మార్లే సంస్కరణలు.
- ట్రైబల్ రెబలియన్(1857 సిపాయిల తిరుగుబాటు), ఇతర పౌర తిరుగుబాట్లు.
- భారత ప్రభుత్వ చట్టాలు(1858, 1909, 1919, 1935 తదితరం).
- ప్రముఖ వ్యక్తులు–ఆలోచనలు(గాంధీ, రాజేం ద్రప్రసాద్,దాదాబాయి నౌరోజీ, అంబేద్కర్).
- పూనా ఒప్పందం, రౌండ్ టేబుల్ సమావేశాలు.
- కాంగ్రెస్ మహాసభలు, కేబినెట్ మిషన్, ఆగస్టు ఆఫర్.
- సామాజిక–మత ఉద్యమాలు.
- ఎన్సీఈఆర్టీ, స్పెక్ట్రమ్ పుస్తకం హిస్టరీ ప్రిపరేషన్కు ఉపయోగపడతాయి.
ప్రిలిమ్స్లో సంస్కృతి–కళలను కీలకంగా భావించాలి. వీటి ప్రిపరేషన్కు భిన్న మార్గాలను అనుసరించొచ్చు. ముఖ్యంగా ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చద వడం లాభిస్తుంది. సంస్కృతికి సంబంధించి దేవాలయ శిల్ప సంపద, చిత్రాలు, స్మారక స్థూపాలు, యునెస్కో గుర్తించిన ప్రదేశాల గురించి తెలుసు కోవాలి. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో ముద్రించిన చిత్రపటాలను అధ్యయనం చేయాలి. గుప్తులు, మౌర్యులు, దక్షిణ భారతదేశంలోని సంగమ వంశం కాలం నాటి శిల్పకళపై ప్రశ్నలు వస్తున్నాయి. ఈ దిశగా సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్(సీసీఆర్టీ) వెబ్సైట్లో లభించే సమాచారం అభ్యర్థులకు ఉపయోగపడుతుంది.