Skip to main content

సివిల్స్ మెయిన్-2019 గెలుపు వ్యూహం ఇదిగో...

సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష-2019 ఫలితాలు కొంతకాలం క్రితం వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా జూన్‌లో జరిగిన ప్రిలిమ్స్‌కు సుమారు నాలుగున్నర లక్షల మంది పోటీపడగా.. 11,845 మంది అభ్యర్థులు మెయిన్‌కు ఎంపికయ్యారు.
 తాజాగా మెయిన్ పరీక్షలకు షెడ్యూల్‌ను సైతం యూపీఎస్సీ ప్రకటించింది. సెప్టెంబర్ 20 నుంచి ఐదు రోజుల పాటు మెయిన్ పరీక్షలు నిర్వహించనుంది. అంటే.. మెయిన్‌కు తక్కువ సమయం మాత్రమే అందుబాటులో ఉంది. ఎంతో కాలంగా సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు పరీక్షకు ముందు ప్రణాళికాబద్ధంగా కష్టపడితే.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి ప్రతిష్టాత్మక అఖిల భారత సర్వీసుల్లో చేరే సువర్ణవకాశం సొంతమవుతుంది. సివిల్స్ మెయిన్‌లో విజయానికి అభ్యర్థులు ఈ ఉన్న తక్కువ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం...

దాదాపు 8 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసుకుంటే... అందులో సుమారు నాలుగున్నర లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. మెయిన్‌కు ఎంపికైంది కేవలం 11,845 మంది. అంటే.. లక్షల మంది పోటీపడే ప్రిలిమినరీ దశ దాటి.. మెయిన్‌కు అర్హత సాధించింది చాలా తక్కువ మంది. ఇలా మెయిన్‌కు అర్హత పొందిన వారిలో గత కొన్నేళ్లుగా సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులతోపాటు కొత్తవారు కూడా ఉన్నారు. ఎక్కువ శాతం మంది రిపీటర్స్ ఉన్నట్లు అంచనా. గతంలో కొద్దిపాటి మార్కులతో మెయిన్‌లో వెనుకబడ్డ అభ్యర్థులు.. పర్సనాలిటీ టెస్టు వరకు వచ్చినా తృటిలో అవకాశం చేజారిన వారు.. ఇప్పటికే సర్వీస్ సాధించినా.. ఐఏఎస్, ఐపీఎస్ వంటి మెరుగైన సర్వీసు కోసం కృషిచేస్తున్న అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువే! దీన్నిబట్టి పోటీ తీవ్రంగా ఉంటుందని చెప్పొచ్చు. గట్టి పోటీ దృష్ట్యా అభ్యర్థులు మూసధోరణిలో కాకుండా.. ప్రణాళికాబద్ధంగా వినూత్న పంథాలో విభిన్నంగా ప్రిపరేషన్ కొనసాగిస్తేనే సక్సెస్ సొంతమవుతుంది అంటున్నారు నిపుణులు.

మెయిన్ పరీక్ష ఇలా...
సివిల్స్ మెయిన్ పరీక్షలో ఇంగ్లిష్, స్థానిక భాష(తెలుగు).. రెండూ ఒక్కోటి 300 మార్కులకు జరిగే అర్హత పరీక్షలు. జనరల్ ఎస్సే 250 మార్కులకు ఉంటుంది. దీంతోపాటు జనరల్ స్టడీస్ నాలుగు పేపర్లు 250 మార్కుల చొప్పున నిర్వహిస్తారు. అదేవిధంగా ఒక ఆప్షనల్ సబ్జెక్టుకు సంబంధించి రెండు పేపర్లు ఒక్కోటి 250 మార్కులు చొప్పున ఉంటాయి. మెయిన్‌లో సాధించిన మార్కుల ఆధారంగా.. భర్తీ చేసే పోస్టులకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. మెయిన్ రాత పరీక్ష 1750 మార్కులకు, పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) 275 మార్కులు కలిపి మొత్తం 2025 మార్కులకు గాను అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా విజేతలను యూపీఎస్సీ ప్రకటిస్తుంది.

జనరల్ ఎస్సే :
కొంత అప్రమత్తంగా ఉంటే... మంచి స్కోరింగ్‌కు అవకాశమున్న పేపర్ జనరల్ ఎస్సే! కొత్తగా పరీక్ష రాస్తున్న అభ్యర్థులు జనరల్ ఎస్సేను తేలిగ్గా తీసుకోవడం సరికాదు. జీఎస్ పేపర్లో ఉండే ప్రశ్నలు.. ఎస్సేలో అడిగే ప్రశ్నల సరళి వేర్వేరుగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి. ఏ మాత్రం అలసత్వం వహించినా.. ఎస్సేలో విలువైన మార్కులు కోల్పోయే ఆస్కారముంది. విభిన్న అంశాలపై లోతైన అవగాహన పెంచుకున్న వారే జనరల్ ఎస్సే పేపర్‌లో రాణించగలరు. జీఎస్ సన్నద్ధత జనరల్ ఎస్సేకు ఉపయోగపడినా.. ఎస్సే సన్నద్ధత మాత్రం వైవిధ్యంగా ఉండేలా చూసుకోవాలి.
  • గత సివిల్స్ విజేతలు ప్రిపరేషన్ వ్యూహాలను సోషల్ మీడియాలో, బ్లాగుల్లో విపులంగా చెబుతున్నారు. వాటిని అనుసరించడం లాభిస్తుంది. 2016 విజేత సిద్ధార్థ్ జైన్ ఎస్సేలు రాసే విధానాలను వివరించారు. అలానే గత విజేతలు అనుదీప్ దురిశెట్టి, గౌరవ్ అగర్వాల్ వంటి టాపర్స్ బ్లాగులు రాశారు. వారు సివిల్స్ అభ్యర్థులకు ఎంతో విలువైన సమాచారం అందుబాటులోకి తెచ్చారు. సివిల్స్ మెయిన్‌కు ప్రిపేర్ కావాల్సిన విధానాలను స్పష్టంగా వివరించారు. ఇవి మెయిన్ రాయబోయే వారికి ఉపయుక్తమని చెప్పొచ్చు.
  • ఎస్సే రాసే క్రమంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, పర్యావరణ, సాంస్కృతిక, న్యాయ, చారిత్రక, అంతర్జాతీయ కోణాల్లో స్పృశించడం లాభిస్తుంది. అలానే, ఎస్సే మొదలుపెట్టే ముందు ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలి. ప్రారంభం ఎలా ఉండాలి.. ఏ విధంగా రాయాలి, ఏ అంశాలను ఉటంకించాలి.. అనే విషయాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అందుకోసం ప్రత్యేకంగా సమయం కేటాయించుకోవాలి. ఎస్సే ప్రారంభంలో, చివర్లో ‘కోట్స్’ ఉటంకించడం వల్ల మంచి మార్కులు పొందొచ్చు.
  • ఒకటి, రెండు ఎస్సే టెస్టు సిరీస్‌లు రాసి నిపుణులతో మూల్యాంకనం చేయించుకోవాలి. మొదటి ప్రయత్నంలో మెయిన్ రాసే వారు ఇతరులతో పోల్చుకోకుండా.. నిపుణుల గెడైన్స్ తీసుకోవాలి. నిర్ణీత గడువు విధించుకొని ప్రాక్టీస్ చేయడం మేలు. మొదట్లో నిర్ణీత సమయంలో 2,3 వ్యాసాలు రాయాలి. ఆ తర్వాత ఒక పరిమిత సమయం కేటాయించుకొని ప్రాక్టీస్ చేయాలి.

ఎథిక్స్ పేపర్.. ప్రత్యేక వ్యూహం :
ఎథిక్స్ పేపర్‌కు ప్రత్యేక ప్రిపరేషన్ అవసరం లేదనుకోవద్దు. ఈ పేపర్ విస్మరించడానికి వీలులేనిది. ఈ విభాగం చూడటానికి సులువుగా అనిపిస్తున్నా.. ప్రత్యేక వ్యూహాంతో చదవాలి. ఎథిక్స్‌కు సంబంధించి యూపీఎస్సీ అభ్యర్థుల నుంచి ఎలాంటి సమాధానాలు ఆశిస్తుందో తెలుసుకోవాలి. అందుకోసం నిపుణుల సలహాలు తీసుకోవచ్చు. మెయిన్ సిలబస్‌లోని ప్రతి అంశాన్ని మొదట సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. బేసిక్స్ తెలుసుకున్న తర్వాత కాన్సెప్టులను అర్థం చేసుకోవాలి. ఎథిక్స్ పేపర్‌కు సంబంధించి తక్కువ మెటీరియల్‌ను చదివి ఎక్కువ మార్కులు పొందొచ్చు. సివిల్స్ సర్వీసెస్ పరంగా నైతిక నిష్ట, జవాబుదారీతనం, పారదర్శకత, నిజాయితీ తదితర అంశాలపై వ్యక్తిగత ఉదాహరణలు సిద్ధం చేసుకోవాలి. వీటిని పరీక్షల్లో రాయడం ద్వారా మంచి మార్కులు సొంతం చేసుకునే అవకాశముంది. ఎక్కువగా కేస్‌స్టడీస్ అధ్యయనం చేయడం పరీక్ష పరంగా ఉపయోగపడుతుంది.

జీఎస్ ప్రిపరేషన్ :
  • చరిత్ర, జాగ్రఫీ, సొసైటీ పేపర్‌లో స్కోర్ చేసేందుకు ఒకటికి నాలుగుసార్లు చదవడమొక్కటే మార్గం. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి... ముఖ్యమైన అంశాలను గుర్తించాలి. ఆయా టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడిగే తీరును గమనించాలి. అందుకుతగ్గట్లు ప్రిపరేషన్ గమనం ఉండాలి. సంస్కృతి, కళలు, స్వాతంత్య్ర ఉద్యమం, భారత సమాజం-భిన్నత్వంలో ఏకత్వాన్ని అవగాహన చేసుకోవాలి. మహిళా సాధికారత, సమాజంపై ప్రపంచీకరణ ప్రభావం, పట్టణీకరణ తదితర అంశాలను లోతుగా అవగాహన చేసుకోవాలి. అలాగే జాగ్రఫీ పరంగా ముఖ్యమైన సహజ వనరులు, తుఫాన్లు, భూకంపాలు, సునామీల గురించి చదువుకోవాలి.
  • పాలిటీ చదివేటప్పుడు ప్రభుత్వం తాజాగా అమలుచేస్తున్న పథకాలతో అనుసంధానిస్తూ చదవాలి. సామాజిక సూచికలు, పేదరికం, ఆకలి అంశాలపై మృణాల్ వీడియోలు ఉపయుక్తం. పాలిటీ పేపర్‌లో భారత రాజ్యాంగం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధులు, బాధ్యతలు, పార్లమెంటు, కార్యనిర్వాహక వర్గం, న్యాయవ్యవస్థ, రాజ్యాంగ పదవులు తదితర అంశాలను అధ్యయనం చేయాలి. ప్రజాస్వామ్యంలో సివిల్ సర్వీసుల పాత్ర, పాలనలో పారదర్శకత, ఈ-గవర్నెన్స్‌ను చదువుకోవాలి. పాలిటీ పరంగా మోడల్ ప్రశ్నలు-సమాధానాలు ప్రాక్టీస్ చేయాలి. ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలపై నిశిత దృష్టి అవసరం. ప్రాక్టీస్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి.
  • అంతర్జాతీయ సంబంధాలు అంశం కోసం.. నిత్యం పేపర్ చదువుతూ నోట్సు రాసుకోవాలి. భారత్-సరిహద్దు దేశాలు, ద్వైపాక్షిక సంబంధాలు, ఆయా ముఖ్య దేశాలతో సంబంధాలు-ఒప్పందాలు, ముఖ్య అంతర్జాతీయ సంస్థలు తదితర అంశాలను అవసరం మేరకు చదవాలి.
  • ఎకానమీ మెయిన్‌లో మంచి మార్కులకు ప్రాక్టీస్‌కు మించిన మార్గంలేదు. ఎకానమీకి సంబంధించి సమ్మిళిత వృద్ధి, వనరుల సమీకరణ, తాజా బడ్జెట్-ముఖ్యాంశాలు, పారిశ్రామిక ప్రగతిపై సరళీకరణ విధానాలు, కొత్త పారిశ్రామిక విధానం- ప్రభావం; రోడ్లు, రైల్వేలు, పోర్టులు, ఇంధనం వంటి మౌలిక వసతులు తదితర అంశాలపై దృష్టిపెట్టాలి. వ్యవసాయం సబ్జెక్టుకు మృణాల్ వీడియోలతోపాటు శంకర్ ఐఏఎస్ పుస్తకాలు ఉపయోగపడతాయి. పర్యావరణం అంశానికి సంబంధించి వివిధ సదస్సులపై దృష్టిపెట్టాలి. ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (ఈఐఏ)పై తదేక దృష్టి అవసరం.
  • సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి తాజా పరిణామాలు ముఖ్యంగా చంద్రయాన్ 2 ప్రయోగం-ప్రయోజనాల గురించి అన్ని కోణాల్లో తెలుసుకోవాలి. అలాగే భారత అంతరిక్ష కార్యక్రమాలు, ఐటీలో ప్రగతి, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ తదితర అంశాలపై ఫోకస్ చేయాలి. నాలుగైదేళ్ల పాత పేపర్లను సేకరించి.. సాధన చేయాలి.
  • విపత్తుల నిర్వహణ అంశం సన్నద్ధతకు అధికారిక నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్(ఎన్‌డీఎం) అథారిటీ వెబ్‌సైట్ ఉపయోగపడుతుంది. దీనికోసం ఎక్కువ సమయం కేటాయించకుండా.. ఎన్‌డీఎం విధానాలు, ప్రణాళికలు చూసుకోవాలి. అంతర్గత భద్రత అంశమూ ముఖ్యమైనదే.
కొత్త మెటీరియల్ వద్దు :
  • సీరియస్ అభ్యర్థులంతా ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తిచేసి ఉంటారు. ఇలాంటి వారు కొత్తగా వేరే మెటీరియల్ జోలికి వెళ్లకుండా.. గతంలో చదివిన వాటినే మళ్లీ మళ్లీ చదవాలి. పాలిటీ, ఎకానమీ, సైన్‌‌స అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్, ఇంటర్నేషనల్ అఫైర్స్‌కు సంబంధించిన కోర్ అంశాలను సమకాలీన పరిణామాలతో జోడించి పదే పదే చదువుతుండాలి. జీఎస్ పేపర్ 1 మినహా అన్ని పేపర్లలోనూ కరెంట్ అఫైర్స్‌దే కీలక పాత్ర. ఈ పేపర్‌లో అడిగే ప్రశ్నలకు సమకాలీన పరిణామాలను ప్రస్తావిస్తూ రాయడం కలిసొస్తుంది.

రైటింగ్ స్కిల్స్ :
మెయిన్‌లో మార్కులకు రైటింగ్ స్కిల్స్ చాలా కీలకం. కాబట్టి ప్రశ్నల రైటింగ్ ప్రాక్టీస్‌లో.. భాష సరళంగా, స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి. సంక్లిష్ట పదాలు ఉపయోగించే క్రమంలో మొదట వాటి పరిచయాలు రాయాలి. వాక్యాలను చిన్నగా, ప్రభావవంతంగా రాయడం అలవాటు చేసుకోవాలి. అవసరం మేరకు పదప్రయోగం, ఫ్రేజెస్ ఉపయోగిస్తే సమాధానం ఆకట్టుకునేలా ఉంటుంది. కొత్త పదాలు నేర్చుకోవడం, వాటిని అర్థవంతంగా సరైన స్థానంలో రాయడం మంచిది. పదజాలం పెంచుకునేందుకు కృషిచేయాలి.
  • హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ ఆకర్షణీయంగా ఉండాలి. ఎస్సే రాసేటప్పుడు సానుకూల, ప్రతికూల అంశాలు ప్రస్తావిస్తూ.. సమతూకంతో కూడిన ముగింపు ఇవ్వాలి. అభిప్రాయాలను వ్యక్తంచేసే క్రమంలో ఇచ్చే గణాంకాలతోపాటు, సమాచారానికి సహేతుక కారణాలు ఇవ్వడం తప్పనిసరి.
  • జీఎస్ పేపర్లకు గత ప్రశ్నలు, సమాధానాలు సేకరించుకొని సాధన చేయాలి. గత పేపర్లు ప్రాక్టీస్ చేయడం వల్ల సబ్జెక్టుతోపాటు సమాధానాలు రాసే పద్ధతులు అర్థం చేసుకోవచ్చు. ప్రశ్నకు సమాధానం రాసేటప్పుడు ఆలోచనలను ఒక క్రమంలో అమర్చుకోవాలి. ఒక అంశం మీద సబ్జెక్టుపరంగా విస్తృత పరిజ్ఞానమున్నా.. దాన్ని ఒక క్రమానుగతంగా వివరించే నేర్పు చాలా అవసరం. స్థూలంగా చెప్పాలంటే.. చెల్లాచెదురుగా ఉండే ఆలోచనలను అర్థమయ్యేరీతిలో పొందికగా, క్రమపద్ధతిలో రాయాలి. ఇప్పటి నుంచే ఈ దిశగా సాధన చేయాలి.
  • ప్రధానంగా అభ్యర్థులు చేసే పొరపాటు.. ఒక ప్రశ్నకే ఎక్కువ సమయం కేటాయించడం. దీనివల్ల అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయలేరు. కాబట్టి అడిగిన ప్రశ్నలన్నింటికీ సముచిత సమయం కేటాయించేలా చూసుకోవాలి.
  • అభ్యర్థులకు సబ్జెక్ట్ పరిజ్ఞానం ఎక్కువగా ఉన్నా.. పరీక్షలో ఏం రాశారనే దానిపై వారి విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. సగటున 150 నుంచి 200 పదాలలో సంపూర్ణంగా సమాధానాలు రాసేలా సిద్ధమవ్వాలి. అందుకోసం ప్రతి వారం పూర్తిస్థాయి పరీక్షలకు హాజరవుతూ నిపుణులతో మూల్యాంకనం చేయించుకోవాలి. ఆయా టెస్టుల ఫలితాలను సమీక్షించుకుంటూ.. పొరపాట్లను సరిదిద్దుకోవాలి.

మెయిన్ పరీక్ష టైం టేబుల్ :
పేపర్ సబ్జెక్ట్ తేదీ సమయం
పేపర్ -1 ఎస్సే సెప్టెంబర్ 20 ఉదయం 9 నుంచి 12 గంటల వరకు
పేపర్ -2 జీఎస్ - 1 సెప్టెంబర్ 21 ఉదయం 9 నుంచి 12 గంటల వరకు
పేపర్ -3 జీఎస్ - 2 సెప్టెంబర్ 21 మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు
పేపర్ -4 జీఎస్ - 3 సెప్టెంబర్ 22 ఉదయం 9 నుంచి 12 గంటల వరకు
పేపర్-5 జీఎస్ - 4 సెప్టెంబర్ 22 మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు
పేపర్ -ఎ లాంగ్వేజ్ టెస్ట్ సెప్టెంబర్ 28 ఉదయం 9 నుంచి 12 గంటల వరకు
పేపర్ -బి లాంగ్వేజ్ టెస్ట్ (ఇంగ్లిష్) సెప్టెంబర్ 28 మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు
పేపర్ - 6 ఆప్షనల్ పేపర్ -1 సెప్టెంబర్ 29 ఉదయం 9 నుంచి 12 గంటల వరకు
పేపర్ - 7 ఆప్షనల్ పేపర్-2 సెప్టెంబర్ 29 మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు
Published date : 08 Aug 2019 05:33PM

Photo Stories