career after polytechnic: పాలిటెక్నిక్తో.. అద్భుత అవకాశాలు
![polycet 2023 students awareness programme news in telugu](/sites/default/files/images/2023/06/19/students7-1687181064.jpg)
పదో తరగతి తర్వాత మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు అభ్యసిస్తే జూనియర్ ఇంజనీర్ స్ధాయిలో ప్రభుత్వ, ప్రవేట్ రంగాలలో మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా పాలిటెక్నిక్ పూర్తి చేశాక ఇంజనీరింగ్ చదవాలనుకుంటే ఏపీ ఈసెట్ రాసి నేరుగా ఇంజనీరింగ్ సెకండియర్లో చేరే అవకాశం కూడా ఉంది. అలాగే పాలిటెక్నిక్ చదవడం వలన ఇంజనీరింగ్ బేసిక్స్ బాగా అర్ధమవడం వలన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ కోర్సులు చదివేవారికి సత్వర ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
2023–24 విద్యా సంవత్సరానికిగాను 1,59,144 మంది దరఖాస్తు చేసుకొనగా 1,43,625 మంది విద్యార్ధులు పరీక్షకు హజరయ్యారు. ఇందులో 86.35 శాతంతో 1,24,021 మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.
2023–24 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 34 వేల మందికి పైగా విద్యార్థులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రాష్ట్రంలో 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 17 వేల సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో 250కి పైగా కాలేజీలు ఉన్నాయి.పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్–2023లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా ఇటీవలే పూర్తయింది.
విద్యార్థులు కళాశాలల్లో చేరికకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోరుకున్న కాలేజీలో నచ్చిన బ్రాంచ్ ఎంచుకునేలా సాంకేతిక విద్యాశాఖాధికారులు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 26 జిల్లాల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో జూన్ 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సదస్సులు నిర్వహింస్తున్నారు.
పాలిటెక్నిక్తో కూడా మంచి అవకాశాలు :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు తరలివస్తున్నాయి. పారిశ్రామికీకరణతో భవిష్యత్తులో సాంకేతిక కోర్సులు చేసిన వారికి మంచి ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. మూడేళ్లకే చేతికొచ్చే పాలిటెక్నిక్ సర్టిఫికెట్తో చిన్న వయస్సులోనే జూనియర్ ఇంజనీర్ స్ధాయిలో ప్రభుత్వ మరియు ప్రవేట్ రంగాలలో మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది.
చదవండి : Check AP POLYCET Colleges, Fee Structure and List of Courses for Counselling 2023
ప్రభుత్వ కాలేజీల బలోపేతం దిశగా :
పాలిటెక్నిక్ కోర్సులకు డిమాండ్ పెరగడంతో అధికారులు ప్రభుత్వ కాలేజీల్లో నూరు శాతం సీట్లు భర్తీ అయ్యేలా చర్యలు మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హులకు ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో ఇస్తుండటంతో గతంలో మూత పడిన కాలేజీలను సైతం ప్రై వేట్ యాజమాన్యాలు మళ్లీ తిరిగి ప్రారంభిస్తున్నాయి. అయితే ఇలాంటి ప్రమాణాలు లేని కళాశాలల్లో విద్యార్థులు చేరకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
అవగాహన సదస్సుల్లో భాగంగా కాలేజీల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న మౌలిక సౌకర్యాలు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ వంటి అంశాలపై విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను సదస్సులకు ఆహ్వానించి విద్యార్థులకు వారి అనుభవాలను తెలియపరుస్తూ అందరికీ అవగాహన కల్పిస్తున్నారు.
ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు:
ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా మంచి అవకాశాలు ఉండటంతో విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో విశాలమైన తిరగతి గదులు, ప్రాక్టికల్స్కు అధునాతన ల్యాబులు, ఆట స్ధలాలు వంటి మెరుగైన వసతులున్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. అవగాహన సదస్సుల ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని ఆలిండియా ఫెడరేషన్ అఫ్ పాలిటెక్నిక్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎన్. చంద్రశేఖర్ తెలిపారు.
చదవండి : 20 Best Polytechnic Colleges in Andhra Pradesh