Skip to main content

UPSC NDA, NA(2) 2022: ఇంటర్‌ అర్హతతోనే ఎవర్‌గ్రీన్‌ కెరీర్‌... శిక్షణ సమయంలోనే రూ.56,100 స్టైపెండ్‌

UPSC NDA, NA(2) 2022 career guidance
UPSC NDA, NA(2) 2022 career guidance

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌..దేశ రక్షణలో కీలకంగా నిలుస్తున్న త్రివిధ దళాలు. ఇంటర్‌ అర్హతతోనే.. త్రివిధ దళాల్లో కొలువుతోపాటు ఉన్నత చదువుకు అవకాశం కల్పించే పరీక్ష..ఎన్‌డీఏ,ఎన్‌ఏ!! జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ వంటి ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌లకు, ఇతర పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు..అదే ప్రిపరేషన్‌తో ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎగ్జామ్‌లోనూ విజయం సాధించి.. రక్షణ దళాల్లో కొలువు సొంతం చేసుకోవచ్చు. బ్యాచిలర్‌ డిగ్రీ కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. తాజాగా.. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. ఎన్‌డీఏ,ఎన్‌ఏ–2(2022) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఎన్‌డీఏ,ఎన్‌ఏకు అర్హతలు, ఎంపిక విధానం, పరీక్ష స్వరూపం, విజయం సాధిస్తే లభించే అవకాశాలు, పరీక్షలో విజయానికి మార్గాలపై ప్రత్యేక కథనం...

  • ఇంటర్‌ అర్హతతోనే త్రివిధ దళాల్లో ఉన్నత కొలువు
  • ఉద్యోగంతోపాటు బ్యాచిలర్‌ డిగ్రీకి మార్గం 
  • ఎన్‌డీఏ,ఎన్‌ఏ–2(2022) ప్రక్రియ ప్రారంభం
  • శిక్షణ సమయంలోనే రూ.56,100 స్టైపెండ్‌

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నేవల్‌ అకాడమీలనే సంక్షిప్తంగా ఎన్‌డీఏ, ఎన్‌ఏ అని పిలుస్తారు. ఈ అకాడమీల్లో శిక్షణకు, ఆ తర్వాత అభ్యర్థులు ఎంచుకున్న విభాగంలో పర్మనెంట్‌ కమిషన్‌ హోదా పొందేందుకు తొలి అడుగుగా నిలిచే పరీక్ష.. ఎన్‌డీఏ, ఎన్‌ఏ. ప్రతి ఏటా రెండుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఎన్‌డీఏ,ఎన్‌ఏ–2(2022)కు ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది.

నాలుగు వందల ఖాళీలు

ఎన్‌డీఏ, ఎన్‌ఏ(2)–2022 ఎంపిక ప్రక్రియ ద్వారా.. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నేవల్‌ అకాడమీల్లో మొత్తం నాలుగు వందల పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలోని పోస్ట్‌లలో భాగంగానే.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకు వేర్వేరుగా ఖాళీలను ప్రకటించారు. 

అర్హతలు

  • ఆర్మీ వింగ్‌: ఏదైనా గ్రూప్‌లో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
  • ఎయిర్‌ఫోర్స్, నేవీ, నేవల్‌ అకాడమీ: మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్ట్‌లుగా ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు 24 జూన్‌ 2023 నాటికి సర్టిఫికెట్లు అందించాల్సి ఉంటుంది. 
  • వయోపరిమితి: జనవరి 2, 2004–జనవరి 1, 2007 మధ్య జన్మించి ఉండాలి. 
  • అవివాహిత పురుష/మహిళ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
  • నేవల్‌ అకాడమీకి పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు.

UPSC NDAN-NA(2) 2022: నోటిఫికేషన్‌ విడుదల... 400 ఉద్యోగాలు!

రెండు దశల ఎంపిక ప్రక్రియ

  • ఎన్‌డీఏ, ఎన్‌ఏకు రెండు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. అవి..
  • రాత పరీక్ష (ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌), ఎస్‌ఎస్‌బీ సెలక్షన్‌ ప్రక్రియ.
    తొలుత యూపీఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ రాత పరీక్షను నిర్వహిస్తుంది. ఇందులో సాధించిన ప్రతిభ ఆధారంగా.. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న ప్రాథమ్యాలను పరిగణనలోకి తీసుకొని మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో చోటు పొందిన వారికి తదుపరి దశలో సదరు విభాగాల్లో (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌) ఎస్‌ఎస్‌బీ ఆధ్వర్యంలో ప్రత్యేక పరీక్షలు ఉంటాయి. వీటిలోనూ ఉత్తీర్ణత సాధిస్తే..త్రివిధ దళాల్లో పర్మనెంట్‌ కమిషన్డ్‌ ర్యాంకుతో కొలువు ఖాయం అవుతుంది. 

శిక్షణ, డిగ్రీ సర్టిఫికెట్‌

  • ఎన్‌డీఏ, ఎన్‌ఏలో పైన పేర్కొన్న రెండు దశల ఎంపిక ప్రక్రియల్లో విజయం సాధించి.. తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నేవల్‌ అకాడమీల్లో శిక్షణనిస్తారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ విభాగాలకు సంబంధించి నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ పుణెలో, నేవల్‌ అకాడమీ అభ్యర్థులకు ఎజిమలలోని నేవల్‌ అకాడమీలో శిక్షణనిస్తారు. 
  • అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తమకు ఆసక్తి ఉన్న విభాగాలను ప్రాధాన్యత క్రమంలో పేర్కొనాల్సి ఉంటుంది. 
  • శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి బీఏ, బీఎస్సీ, బీటెక్‌ పట్టాలు కూడా అందజేస్తారు. అంటే.. ఒకే సమయంలో కొలువు, ఉన్నత విద్య రెండింటినీ సొంతం చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. 

UPSC CDS-II 2022: నోటిఫికేషన్‌ విడుదల... 339 ఉద్యోగాలు!

శిక్షణ..మూడేళ్ల వ్యవధి

  • ఎన్‌డీఏ, ఎన్‌ఏ రాత పరీక్ష, ఆ తర్వాత నిర్వహించే ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలోనూ విజయం సాధించిన వారికి నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ–పుణెలో మూడేళ్ల పాటు శిక్షణ ఇస్తారు. మొదటి రెండున్నరేళ్లు అన్ని విభాగాల అభ్యర్థులకు శిక్షణ ఒకే విధంగా ఉంటుంది. చివరి ఆరు నెలలు అభ్యర్థులు ఎంపికైన విభాగం ఆధారంగా ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. ఇలా..మొత్తం మూడేళ్ల శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు వారు ఎంపిక చేసుకున్న కోర్సు ఆధారంగా జేఎన్‌యూ–ఢిల్లీ నుంచి బీఏ, బీఎస్సీ, బీఎస్సీ(కంప్యూటర్‌ సైన్స్‌) డిగ్రీలను అందిస్తారు. 
  • ఎయిర్‌ఫోర్స్, నేవల్‌ విభాగాలను ప్రాథమ్యంగా ఎంపిక చేసుకున్న వారికి బీటెక్‌ చదివేందుకు కూడా అవకాశం ఉంటుంది. వీరు ఈ విషయాన్ని ముందుగానే తెలియజేయాలి.
  • ఎన్‌డీఏ,ఎన్‌ఏ రాత పరీక్ష,ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూల్లోనూ విజయం సాధించి.. ఎన్‌డీఏలో అడుగుపెట్టిన అభ్యర్థులకు ప్రిలిమినరీ ఎగ్జామ్‌ పేరుతో మరో పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్,మ్యాథమెటిక్స్,సైన్స్,హిందీ సబ్జెక్ట్‌లలో ఈ పరీక్ష ఉంటుంది. 

ఎన్‌ఏ 10+2 క్యాడెట్‌ ఎంట్రీ.. ప్రత్యేక శిక్షణ

నేవల్‌ అకాడెమీ(ఎన్‌ఏ),10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌కు ఎంపికైన వారికి నేవల్‌ అకాడమీ(ఎజిమల)లో నాలుగేళ్లపాటు ప్రత్యేకంగా శిక్షణనిస్తారు. ఆ తర్వాత వీరికి అప్లయిడ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, నేవల్‌ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ బ్రాంచ్‌లలో ఏదో ఒక బ్రాంచ్‌తో బీటెక్‌ సర్టిఫికెట్‌ అందిస్తారు.

శారీరక శిక్షణ

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో మూడేళ్ల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి.. వారు ఎంపికైన విభాగం పరిధిలో నిర్దిష్ట వ్యవధిలో మళ్లీ ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఉంటుంది. ఆర్మీ క్యాడెట్లకు ఐఎంఏ(డెహ్రాడూన్‌), నేవీ క్యాడెట్స్‌కు నేవల్‌ అకాడమీ (ఎజిమల),ఎయిర్‌ఫోర్స్‌ క్యాడెట్లకు ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ(హైదరాబాద్‌)ల్లో ఫీల్డ్‌ ట్రైనింగ్‌ ఉంటుంది.

శిక్షణ సమయంలో స్టయిపెండ్‌

ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన వారికి శిక్షణ సమయంలో పే లెవల్‌– 10కు సమానమైన రూ.56,100 స్టయిపెండ్‌గా అందిస్తారు. ఆ తర్వాత ఫీల్డ్‌ ట్రైనింగ్‌ కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి రూ.56,100–1,77,500 వేతన శ్రేణితో కెరీర్‌ ప్రారంభం అవుతుంది. ప్రారంభంలో ఆర్మీ విభాగంలో లెఫ్ట్‌నెంట్, నేవీ విభాగంలో సబ్‌ లెఫ్ట్‌నెంట్, ఎయిర్‌ఫోర్స్‌ విభాగంలో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ కేడర్‌తో కెరీర్‌ ప్రారంభమవుతుంది.

ఎన్‌డీఏ, ఎన్‌ఏ రాత పరీక్ష.. ఇలా

ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎంపిక ప్రక్రియలో తొలి దశ రాత పరీక్షను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. ఆ వివరాలు.. 

పేపర్‌ సబ్జెక్ట్‌ మార్కులు సమయం
1 మ్యాథమెటిక్స్‌  300 150 ని.
2 జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ 600 150 ని.
మొత్తం మార్కులు       900  
  • పరీక్ష బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. 
  • పేపర్‌–2 పార్ట్‌ ఏలో జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌లో 200 మార్కులకు ఇంగ్లిష్‌ విభాగంపై ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌–2లో పార్ట్‌ బీ– జనరల్‌ నాలెడ్జ్‌ విభాగం 400 మార్కులకు నిర్వహిస్తారు. 

పార్ట్‌–బి..ఆరు విభాగాలు

  • 400 మార్కులకు పేపర్‌–2గా నిర్వహించే పార్ట్‌–బి పరీక్షలో మొత్తం ఆరు విభాగాలు(ఫిజిక్స్‌; కెమిస్ట్రీ; జనరల్‌ సైన్స్‌; హిస్టరీ, భారత స్వాతంత్య్రోద్యమం;జాగ్రఫీ; కరెంట్‌ ఈవెంట్స్‌) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఫిజిక్స్‌కు 25శాతం; కెమిస్ట్రీకి 15శాతం, జనరల్‌ సైన్స్‌కు 10శాతం, హిస్టరీ, భారత స్వాతంత్య్రోద్యమానికి 20 శాతం, జాగ్రఫీకి 20 శాతం, కరెంట్‌ ఈవెంట్స్‌కు పది శాతం వెయిటేజీ కల్పించారు. ఈ వెయిటేజీ ప్రకారమే–ఆయా విభాగాల్లో ప్రశ్నల సంఖ్య, మార్కులు ఉంటాయి. పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉండే పేపర్‌–1, పేపర్‌–2లలో నిర్దేశిత కటాఫ్‌ మార్కులు సాధించిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు.

900 మార్కులకు ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియ

  • ఎన్‌డీఏ, ఎన్‌ఏ రాత పరీక్షలో విజయం సాధించి.. మెరిట్‌ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు మలిదశలో మరో 900 మార్కులకు ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 
  • అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న సమయంలో పేర్కొన్న ప్రాథమ్యతలు, రాత పరీక్షలో పొందిన మెరిట్‌ ఆధారంగా.. నిర్దేశిత విభాగం ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌బీ(సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డ్‌) నిర్వహించే ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌లోనూ నెగ్గాల్సి ఉంటుంది. 
  • ఎయిర్‌ఫోర్స్‌ విభాగాన్ని ప్రాథమ్యంగా ఎంపిక చేసుకున్న అభ్యర్థులు.. ఎస్‌ఎస్‌బీ తర్వాత నిర్వహించే కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టమ్‌లో కూడా విజయం సాధించాల్సి ఉంటుంది. 

ఎస్‌ఎస్‌బీ ప్రక్రియ.. కాసింత క్లిష్టంగా

  • ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్ష తర్వాత నిర్వహించే ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియ కాసింత క్లిష్టంగానే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే.. అభ్యర్థుల్లోని మానసిక, శారీరక ద్రుఢత్వాన్ని పరిశీలించే ప్రధాన ఉద్దేశంతో ఈ ప్రక్రియ ఉంటుంది. మొత్తం 900 మార్కులకు నిర్వహించే ఎస్‌ఎస్‌బీలో ఇంటెలిజెన్స్‌ టెస్ట్, వెర్బల్‌ టెస్ట్, నాన్‌ వెర్బల్‌ లెస్ట్, సామాజిక అంశాలపై ఉన్న అవగాహన, తార్కిక విశ్లేషణ సామర్థ్యాలను పరీక్షిస్తారు. అదే విధంగా పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్క్రిప్షన్‌ టెస్ట్‌ కూడా నిర్వహిస్తారు. ఇలా మొత్తం అయిదు రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులోనూ తుది జాబితాలో నిలిచిన వారికి ప్రాథమికంగా నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ–పుణె, నేవల్‌ అకాడమీ(ఎజిమల)లో శిక్షణ ఇస్తారు.

NDA for Women: దీటుగా రాణించి.. ధీర వనితలుగా నిలిచే ఆస్కారం

కెరీర్‌ ఉజ్వలం  

  • ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి.. ఆయా అకాడమీల్లో శిక్షణ పూర్తి చేసుకున్న వారు పర్మనెంట్‌ కమిషన్‌ ర్యాంకుతో ఎంట్రీ కొలువుల్లో చేరి.. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. 
  • ఆర్మీలో.. లెఫ్ట్‌నెంట్, కెప్టెన్, మేజర్, లెఫ్ట్‌నెంట్‌ కల్నల్, కల్నల్‌(సెలక్షన్‌), కల్నల్‌ (టైమ్‌ స్కేల్‌), బ్రిగేడియర్, మేజర్‌ జనరల్, లెఫ్ట్‌నెంట్‌ జనరల్, జనరల్‌ స్థాయికి చేరుకోవచ్చు.
  • నేవీలో సబ్‌ లెఫ్ట్‌నెంట్‌తో ప్రారంభించి, లెఫ్ట్‌నెంట్, లెఫ్ట్‌నెంట్‌ కమాండర్, కమాండర్, కెప్టెన్‌(సెలక్షన్‌),కెప్టెన్‌(టైమ్‌ స్కేల్‌),కమొడోర్,రేర్‌ అడ్మిరల్, వైస్‌ అడ్మిరల్, అడ్మిరల్‌ హోదాలు అందుకోవచ్చు.
  • ఎయిర్‌ ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌తో కెరీర్‌ ప్రారంభించి..ఫ్లైట్‌ లెఫ్ట్‌నెంట్, స్క్వాడ్రన్‌ లీడర్, వింగ్‌ కమాండర్, గ్రూప్‌ కెప్టెన్‌(సెలక్షన్‌), గ్రూప్‌ కెప్టెన్‌(టైమ్‌ స్కేల్‌), ఎయిర్‌ కమొడోర్, ఎయిర్‌ వైస్‌ మార్షల్, ఎయిర్‌ మార్షల్, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ స్థాయికి చేరుకోవచ్చు.

విజయం సాధించేలా..

  • ఇంటర్‌తోనే కొలువుతోపాటు చదువుకు మార్గం వేసే ఎన్‌డీఏ, ఎన్‌ఏ రాత పరీక్షలో విజయం సాధించాలంటే.. అభ్యర్థులు సిలబస్‌కు అనుగుణంగా ప్రిపరేషన్‌ సాగించాలి. 
  • పేపర్‌–1లో మంచి మార్కులు సాధించాలంటే.. అల్జీబ్రా, మ్యాట్రిక్స్‌ అండ్‌ డిటర్మినెంట్స్, అనలిటికల్‌ జామెట్రీ, ఇంటిగ్రల్‌ కాలిక్యులస్, డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్, వెక్టార్‌ అల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ట్రిగ్నోమెట్రీ అంశాలపై పట్టు సాధించాలి. ఇందుకోసం ఇంటర్మీడియెట్‌ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేయాలి. ప్రాక్టీస్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లు రాయడం కూడా మేలు చేస్తుంది. బేíసిక్‌ ప్రిన్సిపుల్స్, వివిధ సిద్ధాంతాలు, సూత్రాలు, ఫార్ములాలపై పట్టు సాధించాలి. ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. 
  • జనరల్‌ ఎబిలిటీ పేపర్‌గా పేర్కొనే పేపర్‌–2లో విజయానికి బేసిక్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌;వొకాబ్యులరీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లపై పట్టు సాధించాలి. 
  • జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించి.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్‌ సైన్స్, చరిత్ర–భారత స్వాతంత్య్రోద్యమం, జాగ్రఫీ, కరెంట్‌ అఫైర్స్‌లను అవగాహన చేసుకోవాలి. 
  • ఫిజిక్స్‌లో ఎలక్ట్రోమాగ్నటిజం, మెకానిక్స్, డైనమిక్స్‌లోని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. 
  • కెమిస్ట్రీలో కెమికల్‌ అనాలసిస్,ఇనార్గానిక్‌ కాంపౌండ్స్, పిరియాడిక్‌ టేబుల్స్, కాన్సెప్ట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ కెమిస్ట్రీ, ఈక్విలిబ్రియమ్, థర్మోడైనమిక్స్, క్వాంటమ్‌ మెకానిక్స్‌పై ప్రధానంగా దృష్టి సారించాలి. 
  • జనరల్‌ సైన్స్‌లో.. వ్యాధులు–కారకాలు, ప్లాంట్‌ అనాటమీ, మార్ఫాలజీ, యానిమల్‌ కింగ్‌డమ్‌లపై అవగాహన పెంచుకోవాలి.
  • కరెంట్‌ అఫైర్స్‌ కోసం పరీక్ష తేదీకి ముందు ఆరు నెలల వ్యవధిలో జరిగిన సమకాలీన పరిణామాలపై దృష్టి సారించాలి. 
  • హిస్టరీకి సంబంధించి.. స్వాతంత్రోద్యమ ఘటనలు, రాజులు–రాజ్య వంశాలు, చారిత్రక కట్టడాలు, యుద్ధాలు సంబంధిత అంశాలను అధ్యయనం చేయాలి.
  • భౌగోళిక శాస్త్రానికి సంబంధించి ప్రకృతి వనరులు, విపత్తులు, నదులు, పర్వతాలు, పర్యావరణం వంటి అంశాల్లో పట్టు సాధించడం మేలు చేస్తుంది. 
  • ఆరు నుంచి పన్నెండో తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను కూలంకషంగా అధ్యయనం చేయాలి.

ఎన్‌డీఏ–ఎన్‌ఏ(2)–2022 ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: జూన్‌ 7, 2022
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు ఉపసంహరణ: జూన్‌ 14–జూన్‌ 20
  • ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్ష తేదీ: సెప్టెంబర్‌ 4, 2022
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌: upsconline.nic.in
  • వెబ్‌సైట్‌: www.upsc.gov.in

After Inter: ఇంటర్ తర్వాత.. ఎన్నెన్నో అవకాశాలు

Published date : 31 May 2022 04:32PM

Photo Stories