Skip to main content

After Inter: ఇంటర్ తర్వాత.. ఎన్నెన్నో అవకాశాలు

After Inter(12th): which Course is Best for Future
After Inter(12th): which Course is Best for Future
గ్రూప్ ఏదైనా పక్కాగా ప్లానింగ్ చేసుకోవాలి.. అప్పుడే సరైన గమ్యం దిశగా అడుగులు పడతాయి. ఇంటర్మీడియెట్ పరీక్షలు మరో నాలుగు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో ఆయా గ్రూప్‌ల వారీగా విద్యార్థులకు అందుబాటులోఉన్న ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై ఫోకస్...

ఎంపీసీ.. ఇంజనీరింగ్‌తోపాటు ఎన్నెన్నో అవకాశాలు
ఎంపీసీ.. ఇంటర్మీడియెట్‌లో అత్యధికులు ఎంచుకునే గ్రూప్. ఇంటర్ ఎంపీసీ పూర్తయ్యాక ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో కోర్సుల్లో చేరొచ్చు. ఈ గ్రూప్‌తో అందుబాటులో ఉన్న కోర్సులు, ఉద్యోగావకాశాలు..

ఇంజనీరింగ్: ఎంపీసీ విద్యార్థుల్లో 90 శాతం మంది లక్ష్యం ఇంజనీరింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం మన దేశంలో ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, యూనివర్సిటీల పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అందుకోసం ప్రతి ఏటా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎంట్రెన్‌‌సలు నిర్వహిస్తారు.

ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలకు జేఈఈ: దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇది మెయిన్, అడ్వాన్స్‌డ్ అనే రెండు దశలుగా ఉంటుంది. మెయిన్‌లో ఉత్తీర్ణులకు ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశ కౌన్సెలింగ్‌కు అర్హత లభిస్తుంది. మెయిన్ మార్కులు, ఇంటర్మీడియెట్ మార్కుల పర్సంటైల్ ప్రాతిపదికన నిర్వహించే అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశానికి మార్గం సుగమం చేసుకోవచ్చు.

ఎంసెట్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష ఎంసెట్. ప్రతి ఏటా మేలో ఈ పరీక్ష జరుగుతుంది. ఎంసెట్ ర్యాంకు ద్వారా రెండు రాష్ట్రాల్లోని 700కు పైగా కళాశాలల్లో అడ్మిషన్ కల్పిస్తారు. మూడు లక్షలకుపైగా ఇంజనీరింగ్ సీట్లకు కౌన్సెలింగ్ జరుగుతుంది. బిట్‌శాట్: దీని ద్వారా ప్రముఖ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో ఇంజనీరింగ్ కోర్సుల్లో అడుగుపెట్టొచ్చు. అలాగే వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, తదితర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు ప్రవేశ పరీక్షల ద్వారా అడ్మిషన్‌లు కల్పిస్తున్నాయి.

బీఎస్సీ: ఎంపీసీ ఉత్తీర్ణులకు సంప్రదాయ డిగ్రీ కోర్సుగా పేరు గడించింది బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్సీ). ఇప్పుడు బీఎస్సీ కోర్సులోనూ కొత్త స్పెషలైజేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్ వంటి మల్టీడిసిప్లినరీ స్పెషలైజేషన్స్‌ను యూనివర్సిటీలు ప్రవేశపెడుతున్నాయి. దాంతో బీఎస్సీని చక్కటి ఉన్నత విద్యా మార్గంగా ఎంచుకోవచ్చు.

ఉద్యోగావకాశాలు: ఎంపీసీ అర్హతగా ఎన్నో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా యూపీఎస్సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామినేషన్, స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామినేషన్ (ఎస్‌సీఆర్‌ఏ).

ఎన్‌డీఏ: ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవల్ అకాడమీల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష నేషనల్ డిఫెన్‌‌స అకాడమీ ఎగ్జామినేషన్. ఈ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా అభ్యర్థులు ఎంచుకున్న విభాగం ఆధారంగా ఆయా అకాడమీల్లో శిక్షణ ఉంటుంది. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీల్లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బీఎస్సీ/బీఏ డిగ్రీ; నేవల్ అకాడమీలో శిక్షణ పొందిన వారికి బీటెక్ డిగ్రీతోపాటు పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకు హోదాతో త్రివిధ దళాల్లో కెరీర్ ప్రారంభమవుతుంది.

ఎస్‌సీఆర్‌ఏ: ఇండియన్ రైల్వేస్‌లోని మెకానికల్ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్ష స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామినేషన్. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ఉచితంగా బీటెక్ డిగ్రీతోపాటు రైల్వేలో కేంద్ర ప్రభుత్వ కొలువు సొంతమవుతుంది.

టెక్నికల్ ఎంట్రీ స్కీమ్‌తోనూ డిఫెన్స్‌లో ఎంట్రీ: త్రివిధ దళాల్లో ఉన్నత విద్య, ఉద్యోగాలపరంగా లభించే మరో అవకాశం ఇండియన్ ఆర్మీ నిర్వహించే 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్. అకడమిక్ మెరిట్ ఆధారంగా నిర్వహించే ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. తర్వాత శిక్షణ లభిస్తుంది. దీన్ని పూర్తి చేసుకుంటే.. బీటెక్ డిగ్రీతోపాటు పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకుతో కెరీర్ ప్రారంభించొచ్చు.

బహుళ అవకాశాల బైపీసీ
ఇంటర్మీడియెట్ స్థాయిలో విద్యార్థులకు మరో క్రేజీ గ్రూప్ బైపీసీ. డాక్టర్ కల నెరవేర్చుకునేందుకు ఎంబీబీఎస్‌లో చేరే అవకాశం ఉండటమే అందుకు కారణం. కానీ పరిమిత సీట్ల సంఖ్య కారణంగా ప్రతిభ ఉన్నప్పటికీ ఆ అవకాశాన్ని అందుకోలేని విద్యార్థులు ఎందరో! అలాంటి వారికి మెడికల్‌కు దీటుగా కెరీర్ అవకాశాలను కల్పించే మరెన్నో ప్రత్యామ్నాయ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిపై అవగా హన పొంది తమకు తగిన కోర్సును ఎంచుకుంటే అద్భుత కెరీర్ సొంతమవుతుంది.

ఫార్మసీ కోర్సులు: బైపీసీ ఉత్తీర్ణులకు తమ కోర్ విభాగంలో మంచి భవిష్యత్తును అందించే కోర్సులు.. ఫార్మసీ. ప్రస్తుతం బీఫార్మసీ, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ(ఫార్మా-డీ), డిప్లొమా ఇన్ ఫార్మసీ అనే మూడు స్థాయిల కోర్సులకు బైపీసీ విద్యార్థులు అర్హులు. బీఫార్మసీ, ఫార్మా-డీకి ఎంసెట్‌లో ర్యాంకు ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. ఇవి పూర్తి చేసుకున్న వారికి కోర్సు స్థాయి ఆధారంగా ఫార్మసీలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, క్లినికల్ రీసెర్చ్ కంపెనీల్లో ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగాలు లభిస్తాయి.

మరెన్నో ప్రత్యామ్నాయాలు: బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్‌‌స అండ్ యానిమల్ హస్బెండ్రీ, డైరీ టెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, ఫిషరీస్, ఆక్వాకల్చర్ వంటి మరెన్నో కోర్సులు కూడా ఉన్నాయి. వీటితోపాటు బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయిలో బీజడ్‌సీతోపాటు బయోకెమిస్ట్రీ, బయో ఫిజిక్స్, బయోఇన్ఫర్మాటిక్స్, మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్ తదితర లైఫ్ సెన్సైస్ కోర్సులు కూడా చక్కటి కెరీర్ మార్గాలుగా నిలుస్తున్నాయి. వీటిని పూర్తి చేస్తే ప్రతిభ ఆధారంగా మంచి కెరీర్ అందుకోవచ్చు.

మెడికల్ రంగంలోనే: బైపీసీ విద్యార్థుల లక్ష్యం మెడికల్ రంగంలో అడుగు పెట్టడం. అందుకోసం ఎంబీబీఎస్, బీడీఎస్, బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ సెన్సైస్‌లు మొదటి వరుసలో ఉంటున్నాయి. ఇవి అందుకోలేనివారికి, మెడికల్ రంగంలోనే కెరీర్ కోరుకునే వారికి సైతం ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి..

పారా మెడికల్ కోర్సులు: ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ఆప్టోమెట్రీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వంటివి. వీటిని పూర్తి చేసుకున్నవారికి కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.

నర్సింగ్: రోగులతో నేరుగా సంప్రదిస్తూ సేవలందించే విధంగా తోడ్పడే కోర్సు.. నర్సింగ్. ప్రస్తుతం బైపీసీ ఉత్తీర్ణులకు డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయిల్లో నర్సింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బైపీసీలో ఉత్తీర్ణత సాధించిన మహిళా అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కోర్సులో ప్రవేశం కల్పిస్తుంది. దీని ద్వారా నాలుగేళ్లపాటు శిక్షణనిచ్చి బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికెట్‌తోపాటు ఇండియన్ ఆర్మీకి చెందిన హాస్పిటల్స్‌లో పర్మనెంట్ హోదాలో ఉద్యోగం ఖరారు చేస్తుంది.

జాబ్స్: ఇంటర్ అర్హతగా నిర్వహించే పలు ఉద్యోగ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కాంపిటీషన్‌లో కలిసొచ్చే హెచ్‌ఈసీ
హెచ్‌ఈసీ విద్యార్థులు సాధారణంగా డిగ్రీ స్థాయిలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌ను ఎంచుకుంటారు. హెచ్‌ఈసీ ఫౌండేషన్‌తో భవిష్యత్తులో పలు కాంపిటీటివ్ పోటీ పరీక్షల్లో ముందుండేందుకు ఎంతో ఆస్కారం లభిస్తుంది. అత్యున్నత సివిల్ సర్వీసెస్ నుంచి వీఆర్‌వో/వీఆర్‌ఏ వరకూ అన్ని పోటీ పరీక్షల్లోనూ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ తదితర సబ్జెక్ట్‌ల ప్రశ్నలు తప్పనిసరిగా ఉండటం.. వాటిని ఇంటర్మీడియెట్, బీఏ స్థాయిలో అధ్యయనం చేసి ఉండటంతో హెచ్‌ఈసీ విద్యార్థులు పోటీలో ముందంజలో నిలుస్తారు.

ప్రొఫెషనల్‌గా రూపుదిద్దుకుంటున్న బీఏ: హెచ్‌ఈసీ విద్యార్థులు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే బీఏ కోర్సు.. గ్రూప్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్ల విషయంలోనూ ఆధునిక అవసరాలకు అనుగుణంగా ప్రొఫెషనల్ రూపు సంతరించుకుంటోంది. ఈ క్రమంలో బీఏ స్థాయిలోనే కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి.

‘లా’ కోర్సులతో కెరీర్ కళ: ఇంటర్మీడియెట్ హెచ్‌ఈసీ విద్యార్థులకు సంప్రదాయ బీఏ కోర్సుకు ప్రత్యామ్నాయంగా నేటి పోటీ ప్రపంచంలో చక్కటి కెరీర్ అవకాశాలు అందించే మార్గంగా నిలుస్తున్న కోర్సు బీఏ-ఎల్‌ఎల్‌బీ. ఇంటర్మీడియెట్ అర్హతతో ఐదేళ్ల లా కోర్సులో అడుగుపెట్టొచ్చు. ఈ ‘లా’ కోర్సులోనూ కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా కొత్త సబ్జెక్ట్‌లు (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, కార్పొరేట్ లా తదితర) మేజర్లుగా అందుబాటులో ఉంటున్నాయి. దీంతో లా పూర్తి చేసిన అభ్యర్థులు కేవలం న్యాయవాద వృత్తికే పరిమితం కాకుండా కార్పొరేట్ కొలువులు సొంతం చేసుకోవడానికి అవకాశం లభిస్తోంది.

సీఈసీ.. కార్పొరేట్ కొలువులకు మార్గం
ప్రస్తుత కార్పొరేట్ యుగంలో బహుళ జాతి సంస్థల్లో వైట్ కాలర్ ఉద్యోగాలకు మార్గం సీఈసీ. దీని అర్హతగా అటు బ్యాచిలర్‌‌స డిగ్రీతోపాటు సీఏ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులను పూర్తిచేయొచ్చు. తద్వారా కార్పొరేట్ కొలువులు సొంతం చేసుకోవచ్చు. సీఈసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న కోర్సులు..

బీకాం: సాధారణంగా సీఈసీ విద్యార్థుల్లో అధిక శాతం మందికి మొదటి ఆప్షన్ బీకాం (బ్యాచిలర్ ఆఫ్ కామర్స్). ఇప్పుడు బీకాం కోర్సు సైతం ఆధునికత సంతరించుకుంది. సంప్రదాయ కామర్స్, అకౌంటింగ్ స్పెషలైజేషన్లతోపాటు పోటీ ప్రపంచానికి, పరిశ్రమ అవసరాలకు సరితూగేలా బీకాం స్థాయిలోనే ఈ-కామర్స్, టాక్స్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీస్, అడ్వర్టయిజింగ్ అండ్ మార్కెటింగ్ వంటి విభిన్న స్పెషలైజేషన్స్ అందుబాటులోకి వస్తున్నాయి.

ప్రొఫెషనల్ కోర్సులు: చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ.. సీఈసీ విద్యార్థులకు అనుకూలించే మూడు ముఖ్యమైన ప్రొఫెషనల్ కోర్సులు. వీటి లో తమకు సరితూగే కోర్సును పూర్తిచేయడం ద్వారా ఉజ్వల కెరీర్‌కు మార్గం వేసుకోవచ్చు. ఎంబీఏలకు దీటుగా జీతభత్యాలు అందుకోవచ్చు. రెగ్యులర్‌గా డిగ్రీ చదువుతూనే ఈ ప్రొఫెషనల్ కోర్సులను పూర్తిచేసుకోవచ్చు. దీనివల్ల విద్యార్థులకు సమయం వృథా కాదు. ఏకకాలంలో అటు డిగ్రీ కోర్సు, మరోవైపు జాబ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న చక్కటి ప్రొఫెషనల్ కోర్సు సర్టిఫికెట్ చేతికందుతుంది.

ఉద్యోగావకాశాలు:
సీఈసీ విద్యార్థులు అకౌంటింగ్‌లో స్వల్పకాలిక సాఫ్ట్‌వేర్ ప్యాకేజ్ కోర్సులు(ట్యాలీ, వింగ్స్, ఫోకస్ తదితర) పూర్తి చేస్తే కంపెనీల్లో అకౌంటెంట్ ఉద్యోగాలు అందుకోవచ్చు.

ఎనీ గ్రూప్.. ఉద్యోగ పరీక్షలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్: కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్ష ఇది. ఇంటర్మీడియెట్ అర్హతతోపాటు డేటా ఎంట్రీ, కంప్యూటర్ టైపింగ్‌లో అనుభవం ఉంటే ఈ పరీక్షలో సులువుగా రాణించొచ్చు.

పోస్టల్ అసిస్టెంట్స్, సార్టింగ్ అసిస్టెంట్స్: తపాలా శాఖలో ఆయా రాష్ట్రాల స్థాయిలోనే నియామకాలు చేపట్టే ఉద్యోగాలు పోస్టల్ అసిస్టెంట్స్, సార్టింగ్ అసిస్టెంట్స్. వీటికోసం రాత పరీక్ష, కంప్యూటర్/టైపింగ్ టెస్ట్‌లో ప్రతిభ కనబర్చాల్సి ఉంటుంది.

పోలీస్ శాఖలో కానిస్టేబుల్: పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా ఇంటర్మీడియెట్ కనీస అర్హత. దీంతోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రాత పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా కొలువు సొంతం చేసుకోవచ్చు.

పారా మిలిటరీ: జాతీయ స్థాయిలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఇండో-టిబెటిన్ బోర్డర్ ఫోర్స్ తదితర పారా మిలిటరీ విభాగాల్లోనూ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్మీడియెట్ అర్హతగా దరఖాస్తు చేసుకోవచ్చు.

గ్రూప్-4 ఉద్యోగాలు: రాష్ట్ర స్థాయిలో ఆయా శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాల భర్తీకి చేపట్టే గ్రూప్-4 నియామక పరీక్షలకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోనే పోటీ పడొచ్చు. అదే విధంగా రెవెన్యూ శాఖ పరిధిలో వీఆర్‌ఓ (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్) పోస్టులకు కూడా అర్హులే.

ఉన్నత విద్య మార్గాలు:
గ్రూప్‌తో సంబంధం లేకుండా ఇంటర్మీడియెట్ విద్యార్థులందరూ డీఈడీ(డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్)లో చేరొచ్చు. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడేందుకు దోహదం చేసే కోర్సు ఇది. డైట్ సెట్‌లో ర్యాంకు ఆధారంగా ఈ కోర్సు పూర్తి చేసుకుంటే డీఎస్సీ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌జీటీ ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది.

పర్యాటకం, ఆతిథ్యం: ఇటీవల కాలంలో విస్తృ తంగా వృద్ధి చెందుతున్న రంగంగా పేరు పొందిన టూరిజం అండ్ హాస్పిటాలిటీకి సంబంధించి ప్రస్తుతం పలు కోర్సులు బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. వీటికి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
 
పక్కా ప్లానింగ్‌తో పటిష్ట కెరీర్
విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైన ఇంటర్మీడియట్ దశ నుంచి భవిష్యత్తు ప్రణాళిక పకడ్బందీగా సాగించాలి. అప్పుడే పటిష్టమైన కెరీర్‌కు మార్గం ఏర్పడుతుంది. ఇప్పుడు అధిక శాతం మంది విద్యార్థులు ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులు లక్ష్యంగా ఎంచుకుని ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌ల్లో చేరుతున్నారు. ఆ తర్వాత నిరాశాజనక ఫలితాలు ఎదురైతే ఎంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు. విశాల దృక్పథంతో ఆలోచించే మనస్తత్వం అలవర్చుకోవాలి. కెరీర్ అంటే ఇంజనీరింగ్, మెడికల్ అనే భావన వీడాలి. వాటికి దీటుగా ఉన్న అవకాశాలను అన్వేషించాలి. వాటిలో ఉన్నతంగా రాణించేందుకు మార్గాలు తెలుసుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా కీలకపాత్ర వహించాలి.
డా॥సుశీలా రావు, డెరైక్టర్, సాఫ్ట్‌స్కిల్ ఇండియా లిమిటెడ్

 

కామర్స్ రంగంలో ఎన్నెన్నో అవకాశాలు
కామర్స్ ప్రొఫెషనల్ కోర్సుల్లో ఇప్పుడు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సీఏ, కాస్ట్ అకౌంటెన్సీ, సీఎస్ కోర్సులకు ఇంటర్మీడియెట్‌లో ఏ గ్రూప్‌లో ఉత్తీర్ణత సాధించినా అర్హత లభిస్తుంది. వీటిని పూర్తి చేస్తే లభించే ఉద్యోగాలు, హోదాలు కూడా ఉన్నతంగా ఉంటాయి. ప్రత్యేకించి కావాల్సిన లక్షణాలు విశ్లేషణ నైపుణ్యం, తులనాత్మక అధ్యయనం. కాబట్టి ఇంటర్మీడియెట్ విద్యార్థులు కేవలం తమ గ్రూప్‌నకు సంబంధించిన అవకాశాలపైనే కాకుండా ప్రత్యామ్నాయాలపైనా దృష్టిపెట్టాలి. అప్పుడే కొత్త మార్గాలు తెలుస్తాయి. కొత్త లక్ష్యాలు ఏర్పరచుకుని ముందుకు సాగడానికి సంసిద్ధత లభిస్తుంది.
ఆర్. చెంగల్‌రెడ్డి, చైర్మన్, ఎస్‌ఐసీఏఎస్‌ఏ

 

సహజ ఆసక్తికి అనుగుణంగా
నేటి తరం విద్యార్థులు.. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి. కోర్సు, కెరీర్ ఎంపికలో ఇది ఎంతో ముఖ్యం. ఏ గ్రూప్ విద్యార్థులైనా ప్రస్తుతం మార్కెట్ అవసరాలు ఎలా ఉన్నాయి? తాము చదివిన గ్రూప్ అర్హతతో సదరు అవసరాలకు సరితూగే ఉన్నత విద్య కోర్సులు ఏంటి? అనే అంశంపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఇంటర్మీడియెట్ స్థాయిలోని విద్యార్థులకు మానసికంగా ఆ స్థాయి పరిపక్వత ఉండదు. కాబట్టి ఈ విషయంలో తల్లిదండ్రులు, అధ్యాపకులు సహకరించాలి. విద్యార్థుల్లోని సహజ ఆసక్తిని గుర్తించి దానికి అనుగుణమైన కోర్సులు, కెరీర్ అవకాశాల గురించి తెలుసుకుని సరైన ప్రణాళికతో వ్యవహరిస్తే ఏ గ్రూప్ అయినా భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది.
ప్రొఫెసర్ టి.ఎల్.ఎన్.స్వామి, ప్రిన్సిపాల్, నిజాం కాలేజ్

చ‌ద‌వండి: 
Inter Special: ఎంపీసీ.. అకడమిక్‌ సిలబస్‌తోపాటే పోటీ పరీక్షలకూ ప్రిపరేషన్‌!!
After 10+2/Inter: బైపీసీతో విస్తృతావకాశాలు!!

After 10+2/Inter: ఇంటర్ ఎంపీసీ తర్వాత ఎన్నో అవకాశాలు

Published date : 08 Jan 2022 12:36PM

Photo Stories