Students Talent : విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచేలా ప్రోత్సాహించాలి..
![Government should encourage students and talent to achieve their goals](/sites/default/files/images/2024/07/04/school-students-encouragement-1720085366.jpg)
కొత్తపేట: ప్రతి విద్యార్థికీ ప్రోత్సాహం అనేది ఎంతో బలాన్ని ఇస్తుంది. మరిన్ని విజయాలు సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. వారు జీవితంతో ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు సాయపడుతుంది. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తించారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆణిముత్యాలు పేరిట నగదు ప్రోత్సాహకాలు అందించారు. రాష్ట్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గత ఏడాది జూన్లోనే అన్ని స్థాయిల్లో ఉత్తమ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందాయి. అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని విస్మరించింది. ప్రస్తుతం జూలై ప్రారంభమైనా ఆ విషయం గురించి ఆలోచించడం లేదు.
విద్యార్థులకు ప్రోత్సాహం
విద్యారంగానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలోని గత ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తూ, మరోవైపు ప్రతిభ చాటిన విద్యార్థులను వెన్నుతట్టి ప్రోత్సహించింది. ఆ క్రమంలోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో పోటీతత్వం పెంచడంతో పాటు మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలనే గొప్ప ఆశయంతో జగనన్న ఆణిముత్యాలు పేరిట విద్యార్థుల ప్రోత్సాహక పథకానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల స్థాయి నుంచి నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ విద్యార్థులను గుర్తించింది. వారిని నగదు ప్రోత్సాహకాలతో సత్కరించింది.
Soumya Mishra IPS: శిక్ష కాదు.. శిక్షణ ఇచ్చాం.. అక్షర జ్ఞానం లేనివారు గోల్డ్మెడల్స్ సాధించారు
నగదు బహుమతులు
రాష్ట్ర స్థాయిలో టెన్త్ టాపర్గా నిలచిన వారికి రూ.లక్ష, ద్వితీయ స్థానం సాధించిన వారికి రూ.75 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి రూ. 50 వేల చొప్పున గత జగన్ ప్రభుత్వం అందించింది. జిల్లా స్థాయిలో టెన్త్ టాపర్లకు రూ.50 వేలు, రూ.35 వేలు, రూ.15 వేలు చొప్పున, నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ చూపిన వారికి రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పున, పాఠశాల స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన వారికి రూ.3 వేలు, రూ.2 వేలు, రూ.వెయ్యి చొప్పున అందజేసింది. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కూడా ఘనంగా సత్కరించింది.
Degree Admissions 2024: డిగ్రీ అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు
విద్యార్థులకు సత్కారం
గత ఏడాది అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్ర స్థాయిలో 42 మంది పదో తరగతి విద్యార్థులకు, 35 మంది ఇంటర్ విద్యార్థులకు నగదుతో పాటు షీల్డ్, మెడల్ అందజేసి సత్కరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పదో తరగతి విద్యార్థులు 51 మంది జిల్లా స్థాయిలో, 70 మంది నియోజకవర్గ స్థాయిలో ప్రథమ స్థానాలు సాధించారు. వారిని జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు నగదు ప్రోత్సాహకాలతో సత్కరించారు.
Gurukul Admission Counselling : గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ ముగిసింది..
నిరాశలో ఈ ఏడాది టాపర్లు
ఈ ఏడాది ప్రభుత్వం మారడంతో ఆణిముత్యాలు పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత ప్రభుత్వం సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకంపై ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. విద్యాశాఖాధికారులను అడిగినా తమకూ ఏ విధమైన స్పష్టత లేదంటున్నారు. దీంతో 2023–24 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులు నిరాశ చెందుతున్నారు. గత ఏడాది మాదిరిగానే నగదు ప్రోత్సాహకాలు అందజేయాలని కోరుతున్నారు.