Skip to main content

జాబ్ సీకర్స్ కాదు.. జాబ్ ప్రొవైడర్స్ కావాలి!!

ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగం.. ప్రారంభంలోనే ఐదంకెల జీతం.. అందుకోసం కోర్సులో అడుగుపెట్టిన తొలిరోజు నుంచే.. కోర్సు చివర్లో నిర్వహించే క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ దిశగా ఆలోచించడం- ఇదీ ఇప్పుడు ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే ప్రతి విద్యార్థి లక్ష్యం!! కాని, నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించడమే సర్వస్వం కాకూడదని.. జాబ్ సీకర్స్ నుంచి జాబ్ ప్రొవైడర్స్ స్థాయికి ఎదిగేలా ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ పెంచుకోవాలని సూచిస్తున్నారు.. పద్మశ్రీ బీవీఆర్ ఇన్‌స్టిట్యూట్స్ పేరుతో సుపరిచితమైన శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, అంజనీ సిమెంట్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ కె.వి. విష్ణు రాజు.దశాబ్దాల క్రితమే ప్రతిష్టాత్మక త్రిచీలోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి, విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించిన విష్ణురాజుతో.. ప్రస్తుత మన విద్యారంగ పరిస్థితులు.. తీసుకురావాల్సిన మార్పులు.. విద్యార్థులు మెరుగుపరచుకోవాల్సిన నైపుణ్యాలపై సాక్షి ఎడ్యుకేషన్ ఎడిటర్ ఆర్.ధనుంజయ రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ!!

వైద్య కుటుంబం నుంచి ఇంజనీరింగ్ వైపు:
నేను ఇక్కడే జన్మించినప్పటికీ.. నాన్న బ్రిటన్‌లో డాక్టర్‌గా పనిచేస్తుండటంతో నాలుగేళ్ల వయసులో బ్రిటన్ వెళ్లి.. రెండేళ్లు అక్కడ ప్రాథమిక విద్యనభ్యసించాను. తర్వాత ఆరేళ్ల వయసులో తిరిగొచ్చి అప్పటి నుంచి మా తాతగారు పద్మభూషణ్ బి.వి.రాజు దగ్గరే పెరిగాను. దాంతో నా పాఠశాల విద్య అంతా ఇక్కడే సాగింది. స్వతహాగా నాకు పాఠశాల రోజుల నుంచే మ్యాథ్స్, సైన్స్ అంటే ఆసక్తి . మా తాతగారు వీలైనప్పుడల్లా ఆయన ఆధ్వర్యంలోని సిమెంట్ ఫ్యాక్టరీలకు తీసుకెళ్లి అక్కడి పనితీరును వివరిస్తుండేవారు. ఇవన్నీ నేను ఇంజనీరింగ్‌వైపు దృష్టి సారించడానికి కారణాలుగా చెప్పొచ్చు. ప్రస్తుతం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా వ్యవహరిస్తున్న త్రిచీలోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి.. ఆ తర్వాత అమెరికాలోని మిచిగాన్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాను. అక్కడే 1989 నుంచి 1991 వరకు ఇ.ఐ.డ్యూ పాంట్ డి నెమర్స్ అనే కంపెనీలో కెమికల్ ఇంజనీర్‌గా పనిచేశా. 1992లో భారత్‌కు తిరిగొచ్చాను. అప్పటి నుంచి మా సిమెంట్ కంపెనీల నిర్వహణ బాధ్యతలు, అదే విధంగా మా తాతగారు నెలకొల్పిన శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్‌గా సొసైటీ పరిధిలోని ఆయా కళాశాలలను పర్యవేక్షిస్తున్నాను.

ఆసక్తి, డిమాండ్‌లలో ఏది ప్రధానం:
కచ్చితంగా ఆసక్తి ఆధారంగానే విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులో, బ్రాంచ్‌లో చేరాలి. ఇంజనీరింగ్ అంటే.. కేవలం ఐటీ, సాఫ్ట్‌వేర్ అనే అపోహ వీడాలి. ఇంజనీరింగ్‌లో చేరే నాటికి విద్యార్థుల మానసిక పరిపక్వత కొంత తక్కువగా ఉంటుంది. దాంతో తల్లిదండ్రులు, ఇతరుల సూచనల ఆధారంగా ముందడుగు వేస్తారు. ఈ విషయంలో తల్లిదండ్రుల ధోరణి కూడా మారాలి. కెరీర్ అంటే.. ఇంజనీరింగ్, మెడికల్ మాత్రమే అనే దృక్పథాన్ని మార్చుకోవాలి.

ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అలవర్చుకోవాలి:
వాస్తవానికి ఏ కోర్సయినా విద్యార్థి అంతిమ లక్ష్యం ఉద్యోగం అనేది నిస్సందేహం. అందరూ ఉద్యోగాలు ఆశిస్తే.. ఆ మేరకు ఇచ్చేవారెంతమంది? అందుకే ఉద్యోగం సాధించాలి అనే లక్ష్యం నుంచి మనమే ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎందుకు ఎదగకూడదు? అని ఆలోచించాలి. ఎంతసేపూ పుస్తకాలు, పరీక్షలు, పర్సంటేజీలపైనే దృష్టిపెట్టకుండా వినూత్నంగా వ్యవహరించాలి. జాబ్ సీకర్స్ నుంచి జాబ్ ప్రొవైడర్స్‌గా ఎదగడానికి గల మార్గాలు అన్వేషించాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నైపుణ్యాలు అలవర్చుకుంటూ ఆ దిశగా అడుగులు వేయాలి. ఇక్కడో చిన్న వాస్తవ ఉదాహరణ- మహబూబ్‌నగర్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన క్రాంతి కిరణ్, బీవీఆర్‌ఐటీ మొదటి బ్యాచ్ విద్యార్థి. అకడమిక్ పరంగా యావరేజ్ స్టూడెంట్. కానీ వినూత్నంగా ఆలోచించాడు. భౌతిక శాస్త్రంలోని మనందరికీ తెలిసిన పెల్టియర్ ఎఫెక్ట్ అప్లికేషన్ ఆధారంగా క్లైమాకాన్ పేరుతో.. ఉష్ణోగ్రత స్థాయిలను మార్చే పరికరాలను రూపొందించి అంతర్జాతీయంగా పేటెంట్ కూడా పొందాడు. బ్యాటరీ ఆధారంగా పనిచేసే ఈ పరికరాలు ఉష్ణోగ్రతను సున్నా డిగ్రీల నుంచి వంద డిగ్రీల వరకు పెంచుతుంది, తగ్గిస్తుంది. ఇలా కొత్త పరికరం ఆవిష్కరించి దామా ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక కంపెనీ నెలకొల్పే స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ఈ పరికరాన్ని ఇండియన్ ఆర్మీతోపాటు, పలు శీతల ప్రాంతాల్లో ఎందరో వినియోగిస్తున్నారు. ఇలాంటి వారిని ప్రేరణగా తీసుకుంటే.. ప్రతి విద్యార్థి ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ అలవర్చుకోవడం ఏమంత కష్టంకాదు. ఇందుకు కావల్సింది.. అప్లికేషన్ స్కిల్స్. నేర్చుకున్న అంశాన్ని వాస్తవంగా ఎలా ఉపయోగించాలో ప్రాక్టికల్స్ ద్వారా తెలుసుకోవాలి. అప్పుడే కొత్త ఆలోచనలతో ఆవిష్కరణలు రూపొందుతాయి. అవే విద్యార్థులను ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దడానికి సోపానాలు.

అమెరికా, బ్రిటన్, భారత్..విద్యా విధానంలో తేడా
వాస్తవానికి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ విషయంలో యావత్ ప్రపంచంలోనే భారత్ బెస్ట్ అనేది నా అభిప్రాయం. కానీ అమెరికా, యూకేలతో పోల్చితే.. ఇక్కడ ప్రాక్టికల్ అప్రోచ్ లేకపోవడం ప్రధాన సమస్య. అది మన విద్యా విధానంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అమెరికా, యూకేల్లో గ్రాడ్యుయేట్ స్థాయి నుంచే పరిశ్రమలతో ఒప్పందాల ద్వారా క్షేత్రస్థాయి నైపుణ్యాలు అందించే విధంగా బోధన సాగుతుంది. ప్రతి సెమిస్టర్‌కు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. మన దగ్గర బోధించేది ఒకరైతే, పరీక్ష పేపర్ రూపొందించేది మరొకరు.. మూల్యాంకనం చేసేది వేరొకరు. దీనివల్ల ఆయా అధ్యాపకుల దృక్పథం ఆధారంగానూ విద్యార్థుల ఫలితాలు ప్రతిబింబిస్తాయి. ముందుగానే బ్లూ ప్రింట్స్ రిలీజ్ చేయడం.. ఏ చాప్టర్‌కు ఎంత వెయిటేజ్ ఇస్తున్నారో తెలపడం వంటివి కూడా సరికాదు. దీనివల్ల విద్యార్థులు తమకు క్లిష్టమైన అంశాల్ని చాయిస్ బేస్డ్‌గా వదిలేస్తున్నారు. దీంతో సదరు సబ్జెక్టులో అన్ని అంశాల్లో నిష్ణాతులు అయ్యే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది.

పేటెంట్లకు ప్రధాన సమస్య.. ఆర్థిక వనరులే:
ఇటీవల కాలంలో మన దేశంలో పరిశోధనలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న మాట వాస్తవం. అయితే, అది పేటెంట్స్ పొందే స్థాయికి చేరుకోవట్లేదు. దీనికి ప్రధాన కారణం.. ఆర్థిక చేయూత తగినంతగా లేకపోవడంతోపాటు ఆర్‌అండ్‌డీకి సంబంధించి పరిశ్రమలతో ఒప్పందాలు తక్కువగా ఉండటమే. ఐఐటీలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. కానీ ఎంఐటీ వంటి విదేశీ వర్సిటీలను చూస్తే ఆర్‌అండ్‌డీ విషయంలో అవి నిరంతరం పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు సాగిస్తూ నిధులు సమకూర్చుకుంటున్నాయి. తద్వారా ఆవిష్కరణలు చేయడంతోపాటు పేటెంట్లు కూడా సొంతం చేసుకుంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ ఆలోచన ధోరణి మారాలి. పరిశోధనల ద్వారా ఆవిష్కరణలతోపాటు వాటికి సంబంధించి పేటెంట్లు పొందే విధంగా ఆర్థిక చేయూతనందించేందుకు చొరవ చూపాలి.

ఆరో తరగతి నుంచే పోటీ పరీక్షలంటూ:
ప్రస్తుత విద్యా విధానాన్ని పరిశీలిస్తే ఆరో తరగతి నుంచే ఐఐటీ, ఎంసెట్ అంటూ.. విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నారు. పోటీతత్వం మంచిదే. కానీ అది ఏ ఒక్క విభాగానికో పరిమితం కాకూడదు. దీనివల్ల విద్యార్థుల మానసికోల్లాసం దెబ్బతింటుంది. వాస్తవానికి విద్యార్థుల్లోని సృజనాత్మకత వెలుగులోకి వచ్చేది చిన్నతనంలోనే! వారికి ఏ అంశంలో ఆసక్తి ఉందో అప్పుడే తెలిసిపోతుంది. దీన్ని గమనించి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుకు సరైన మార్గం చూపాలి. స్కూల్/కాలేజీల బోధన అటు విషయ పరిజ్ఞానాన్ని, మరోవైపు ఎక్స్‌ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌లో నైపుణ్యాన్ని పెంచే విధంగా ఉండాలి. మేం చదువుకునే రోజుల్లో జీకే, ఎస్సే రైటింగ్ వంటివి ఉండేవి. అవి ఇప్పుడు మచ్చుకైనా కనిపించట్లేదు. ఇప్పుడంతా ఒకటే లక్ష్యం.. ఇంజనీరింగ్, లేదంటే మెడిసిన్. ఇందుకోసం ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేయడం అటు తల్లిదండ్రులకు, ఇటు సమాజానికి కూడా భవిష్యత్తులో చేటు చేస్తుంది. నా అభిప్రాయంలో ఇతిహాసాల్లోని గురుకుల విధానాన్ని మళ్లీ తెస్తే ఉత్తమ విద్యార్థులు రూపొందుతారు.

ఐఐటీలు ఏమంటున్నాయంటే:
మన దేశంలో ఇంజనీరింగ్ విద్యలో ప్రతిష్టాత్మక ఐఐటీలు ఏమంటున్నాయంటే.. we are getting smarter student but not best and different. చిన్నప్పటి నుంచే పిల్లలను పోటీ పరీక్షల దిశగా బట్టీలు పట్టించి, చదివించి ర్యాంకులతో ఐఐటీల్లో సీట్లు సాధించినా.. ఆ విద్యార్థుల్లో ఐఐటీ స్థాయి నైపుణ్యాలు ఉండట్లేదని దీనర్థం. విభిన్నంగా, వినూత్నంగా ఆలోచించే వారి సంఖ్య చాలా తక్కువని ఐఐటీలు అంటున్నాయి. ఐఐటీల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. సమాజాభివృద్ధి కోణంలో భవిష్యత్తులో ఎంత ప్రతికూల ప్రభావం పడుతుందో అర్థం చేసుకోవచ్చు.

కరిక్యులంలోనూ మార్పులు తేవాలి:
మన విద్యా విధానంలో మార్పుల విషయానికొస్తే.. ప్రాథమికంగా చేపట్టాల్సిన చర్య కరిక్యులంలో నిరంతరం సామాజిక, పారిశ్రామిక పరిణామాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడం. సమాజం ఎటువైపు పయనిస్తోంది? వాస్తవ అవసరాలు ఏంటి? అని నిరంతరం గమనిస్తూ, గుర్తిస్తూ ఆ మేరకు కరిక్యులంలో మార్పులు తేవాలి. కొన్ని ప్రత్యేక కోర్సులకు సంబంధించి ఇంటర్ డిసిప్లినరీ లింకేజ్(ఉదాహరణకు ఫార్మసీని కెమికల్ ఇంజనీరింగ్‌తో అనుసంధానం చేయడం వంటివి) విధానంలో సిలబస్ రూపొందించాలి. ఇక సర్క్యూట్ బ్రాంచ్‌ల విషయంలో కోర్సులో చేరిన తొలిరోజుకి, సర్టిఫికెట్ చేతికందే రోజుకి.. అంటే నాలుగేళ్ల వ్యవధిలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు ఇప్పుడు చాలామంది చేతిలో కనిపించే ఆండ్రాయిడ్ ఫోన్, దాని అప్లికేషన్స్ నాలుగైదేళ్ల క్రితం మనకు తెలియని అంశాలు. గత రెండేళ్లుగా ఇవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. అంటే.. నాలుగేళ్ల క్రితం ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థికి.. మన ప్రస్తుత కరిక్యులం ప్రకారం వీటిపై అవగాహన లభించడం కష్టం. కాబట్టి సమాజంలో టెక్నాలజీ, ఇండస్ట్రీ పరంగా జరుగుతున్న మార్పుల మేరకు సిలబస్‌లోనూ నిరంతరం మార్పులు చేయాలి.

కార్పొరేట్ లీడర్‌గా ఎదగాలంటే:
విద్యార్థులు డిగ్రీలు పూర్తిచేసుకుని ఉద్యోగం సంపాదించి కంపెనీలో చేరాక.. ‘కంపెనీ మనకు అవకాశం ఇచ్చింది. మనం తిరిగి కంపెనీకి ఏం ఇవ్వగలం’ అని ప్రశ్నించుకుంటే కెరీర్‌లో చక్కగా రాణించడానికి సగం సమాధానం లభించినట్లే. ఇలాంటి సానుకూల ఆలోచన దృక్పథం ఉంటే.. కష్టపడి పనిచేసేతత్వం, కంపెనీ అవసరాలు తీర్చేవిధంగా నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకెళ్లే లక్షణాలు వాటంతటవే లభిస్తాయి. దీంతోపాటు కొత్తగా కంపెనీల్లో చేరే విద్యార్థులు టీంవర్క్ కల్చర్‌ను అలవర్చుకోవాలి. ఇక కంపెనీలో చేరి వచ్చిన అవకాశంతో సంతృప్తి చెందుదాం.. అనే ధోరణి కాకుండా కార్పొరేట్ లీడర్‌గా ఎదగాలనే ఆలోచనను అలవర్చుకోవాలి. కార్పొరేట్ లీడర్‌గా ఎదగాలనుకునే వ్యక్తి సదరు విభాగంలో స్పెషలిస్ట్ కానక్కర్లేదు. కానీ ఉద్యోగుల నుంచి మంచి అవుట్‌పుట్ పొందడం, మోటివేట్ చేయడం, మార్కెటింగ్ స్కిల్స్ అలవర్చుకోవడం ద్వారా ఆ స్థాయిని అందుకోవచ్చు.

స్వదేశీ బాట పడుతున్న పలువురు:
ఇంజనీరింగ్, ఎంబీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థులు.. అక్కడే పలు ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించి రాణిస్తున్న మాట వాస్తవమే. కానీ ఇటీవల కాలంలో ఈ విషయంలో కొంత మార్పు వచ్చింది. విదేశాల్లో స్థిరపడిన వారిలో చాలామంది మళ్లీ మన దేశంలో అడుగుపెడుతున్నారు. దీనికి ప్రధాన కారణం యూఎస్, యూకేలతో పోల్చితే మన ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా ఉండటమే. మన ఆర్థిక వ్యవస్థలో కొద్దిపాటి ఒడిదుడుకులు ఎదురవుతున్నప్పటికీ.. ఇక్కడి ప్రభుత్వం చేపడుతున్న చర్యల ఆధారంగా సస్టెయినబిలిటీ పొందుతోంది. ఈ కారణంతో చాలా మంది స్వదేశీ బాట పడుతున్నారు.

స్వీయ పరిమితులతోనే నిరుద్యోగులుగా:
ఒకవైపు కొందరు విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య, ఆపై అత్యున్నత సంస్థల్లో ఉద్యోగాలు సాధిస్తుంటే.. ఇక్కడి విద్యార్థుల్లో అధిక శాతం మంది నిరుద్యోగులుగానే మిగలడానికి ప్రధాన కారణాలు.. స్వీయ పరిమితులు విధించుకోవడం (ఫలానా కంపెనీ అనో లేదా ఫలానా ప్రాంతమనో), విషయ పరిజ్ఞానంతోపాటు పరిశ్రమలకు అవసరమైన పీపుల్ స్కిల్స్‌ను అలవర్చుకోకపోవడమే. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం సంపాదించడం ఎంతో క్లిష్టంగా మారింది. క్యాంపస్ సెలక్షన్స్‌లో రిక్రూట్ అయితేనే ఉద్యోగం ఖాయం అనే పరిస్థితి నెలకొంది. తాజా ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ విషయంలోనూ టీసీఎస్, ఒరాకిల్ వంటి సంస్థలు ఈ ఏడాది తక్కువ సంఖ్యలో నియామకాలు ఉంటాయని చెప్పాయి. ఈ పరిస్థితుల్లో క్యాంపస్ సెలక్షన్ టార్గెట్‌గా పెట్టుకున్న విద్యార్థులు ముఖ్యంగా స్వీయ పరిమితులకు స్వస్తి పలకాలి. అప్పుడే పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

‘అవుట్ ఆఫ్ ది బాక్స్’ అప్రోచ్‌తో:
కేవలం పుస్తకాల పురుగులుగా మారొద్దు. అవుటాఫ్ ది బాక్స్ దృక్పథంతో ఆలోచించి వినూత్నంగా అడుగులు వేయండి. నేటి పోటీ ప్రపంచంలో ఇతరులకంటే ఒకడుగు ముందుండాలంటే.. విశాల దృష్టితో వాస్తవ సమాజాన్ని పరిశీలించాలి. నిరంతరం నాలెడ్జ్‌ను అప్‌డేట్ చేసుకుంటూ.. అప్లికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ..సాగితే అద్భుత అవకాశాలు లభిస్తాయి.

Published date : 12 Sep 2013 04:41PM

Photo Stories