Nepal PM Prachanda India Visit: నేపాల్ ప్రధాని ప్రచండతో మోదీ ద్వైపాక్షిక చర్చలు
![Nepal PM Prachanda India Visit](/sites/default/files/images/2023/06/02/nepal-pm-prachanda-1685711617.jpg)
నాలుగురోజుల పర్యటనలో భాగంగా భారత్కు చేరుకున్న నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహాల్(ప్రచండ)తో జూన్ 1న ఢిల్లీలో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సరిహద్దు సమస్యలను ఇరు దేశాల మధ్య మరింత ముడిపడిన మైత్రీబంధం స్ఫూర్తితో పరిష్కరించుకుంటామని మోదీ అన్నారు. ద్వైపాక్షిక చర్చల తర్వాత ప్రచండ సమక్షంలో మోదీ మీడియాతో మాట్లాడారు. ‘నేడు రెండు దేశాల మధ్య ఒప్పందం సూపర్హిట్ అయ్యేలా మేమిద్దరం ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం.
ప్రధానంగా వాణిజ్యం, ఇంధనం, సాంస్కృతిక, మౌలికవసతుల కల్పన రంగాలపై విస్తృతంగా చర్చించాం. చర్చలు ఫలవంతంగా సాగాయి. 2014లో తొలిసారి ప్రధాని అయిన మూడునెలల్లోపే నేపాల్లో పర్యటించా. రెండు దేశాలకు ‘హిట్– హెచ్(హైవేలు), ఐ(వేస్), టీ(ట్రాన్స్–వేస్) ఫార్ములా అందించా. ఇలా సత్సంబంధం నెలకొంటే అదే మన రెండు దేశాలకు వారధిలా మారుతుంది. ఈ తొమ్మిది వసంతాల్లో మన బంధం నిజంగా హిట్ అయింది. సాంస్కృతిక, ప్రాంతీయ ఒప్పందాలు బలపడాలంటే రామాయణ సర్క్యూట్ సంబంధ ప్రాజెక్టులను విస్తరించాలని నిర్ణయించాం’అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు రెండు దేశాల్లోని పలు ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో ప్రారంభించడంతోపాటు మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు.
Narendra Modi: నమ్మకమే పునాది.. ఆ్రస్టేలియాతో సుదృఢ బంధం: మోదీ
పదేళ్లలో 10వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు !
సీమాంతర పెట్రోలియం పైప్లైన్సహా పెట్రోలియం మౌలిక వసతులు, రైల్వేల అనుసంధానం, సీమాంతర చెల్లింపుల వ్యవస్థ, సాగు, వాణిజ్యం, పెట్టుబడులు, సమీకృత చెక్పోస్ట్ల అభివృద్ధి, హైడ్రో ఎలక్టిక్ విద్యుత్ తదితర రంగాల్లో పరస్పర సహకారం కోసం రెండు దేశాలు ఏడు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం నేపాల్ నుంచి భారత్ 450 మెగావాట్ల విద్యుత్ను కొనుగోలుచేస్తుండగా ఇకపై వచ్చే పదేళ్లలో ఆ మొత్తాన్ని 10వేల మెగావాట్లకు పెంచుకోనుంది. ఒప్పందంలో భాగంగా నేపాల్ తొలిసారి భారత అంతర్గత జలవనరులను వినియోగించుకోనుంది. దీంతో వాణిజ్యం, పెట్టుబడులు పెరగనున్నాయి. ప్రాంతీయ సహకార స్ఫూర్తికి గొడుగుపడుతూ త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా 40 మెగావాట్ల నేపాల్ విద్యుత్ను భారత్ మీదుగా బంగ్లాదేశ్కు సరఫరా చేయనున్నారు. మూడు ప్రధాన రవాణా కారిడార్ల కోసం నేపాల్కు భారత్ దాదాపు రూ.5,600 కోట్ల రుణసాయం అందించనుంది.
FIPIC Summit 2023: మూడు దేశాల అధినేతలతో మోదీ భేటీ
పొరుగు ప్రాధాన్యం అద్భుతం: ప్రచండ
‘బహుముఖ లక్ష్యాలను సాధించి తొమ్మిదేళ్ల పాలన పూర్తిచేసుకున్న మోదీకి నా శుభాకాంక్షలు. మోదీ నాయకత్వంలో భారత ఆర్థికాభివృద్ధి ముఖచిత్రంగా గొప్పగా ఆవిష్కృతమైంది. మోదీజీ పొరుగుదేశాలకు తొలిప్రాధాన్యత విధానం అద్భుతం’అని నేపాల్ ప్రధాని ప్రచండ కొనియాడారు. దశాబ్దాలుగా రెండు దేశాలకు చెందిన సరిహద్దు ప్రాంతాల ప్రజల పరస్పర వివాహాల నేపథ్యంలో ఇరుదేశాల సంబంధాన్ని రోటీ–బేటీ బంధంగా పిలిచేవారు.
సిక్కిం, పశ్చిమబెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లతో సరిహద్దు పంచుకుంటూ భారత్తో నేపాల్ 1,850 కి.మీ.ల మేర సరిహద్దును కలిగి ఉంది. వస్తుసేవల రవాణాకు నేపాల్ ఎక్కువగా భారత్పైనే ఆధారపడుతోంది. గతంలో భారత భూభాగంలోని మూడు ప్రాంతాలు లింపియాధురా, కాలాపానీ, లిపూలేఖ్లను తమ భూభాగాలుగా పేర్కొంటూ 2020లో నేపాల్ ఒక భౌగోళిక చిత్రపటాన్ని ప్రచురించింది. దీంతో ఆనాడు నేపాల్ వైఖరిని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (30 ఏప్రిల్ - 06 మే 2023)