FIPIC Summit 2023: మూడు దేశాల అధినేతలతో మోదీ భేటీ
![PM Modi attends the FIPIC Summit](/sites/default/files/images/2023/05/23/new-guinia-1684852398.jpg)
పపువా న్యూ గినియా రాజధాని పోర్ట్ మోరిస్బైలో మే 22న ఫోరమ్ ఫర్ ఇండియా–పసిఫిక్ ఐలాండ్స్ కో–ఆపరేషన్(ఎఫ్ఐపీఐసీ) శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు. 14 పసిఫిక్ ద్వీప దేశాల అధినేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పసిఫిక్ ద్వీప దేశాలకు భారత్ అండగా నిలుస్తోందని మోదీ గుర్తుచేశారు. భారత్ను విశ్వసనీయ అభివృద్ధి భాగస్వామిగా పరిగణించవచ్చని ఆయా దేశాలకు సూచించారు. తమ శక్తి సామర్థ్యాలను, అనుభవాలను పసిఫిక్ ద్వీప దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రతి మార్గంలోనూ తోడుగా ఉంటామని మోదీ వివరించారు. తమ దృష్టిలో ఈ దేశాలు చిన్న దేశాలు ఎంతమాత్రం కావని, భారీ సముద్ర దేశాలుగా వాటిని పరిగణిస్తున్నామని మోదీ చెప్పారు.
మూడు దేశాల అధినేతలతో భేటీ..
మోదీ మే 22న న్యూజిలాండ్ ప్రధాని క్రిష్ హిప్కిన్స్, రిపబ్లిక్ ఆఫ్ పాలౌ అధ్యక్షుడు సురాంగెల్ ఎస్.విప్స్ జూనియర్, పపువా న్యూగినియా ప్రధాని జేమ్స్ మరాపేతో వేర్వేరుగా సమావేశమయ్యారు. వ్యాపారం, వాణిజ్యం, విద్య, క్రీడలు, సాంకేతికత, అంతరిక్షం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు. హిప్కిన్స్తో భేటీ అద్భుతంగా జరిగిందని మోదీ ట్వీట్ చేశారు. పాలౌ ప్రజలు వాడే ఎబాకిల్ పరికరాన్ని మోదీకి సురాంగెల్ బహూకరించారు.
Queen Elizabeth: ఎలిజబెత్ అంత్యక్రియలకు ఎంత ఖర్చయిందో తెలుసా..?
ఆస్ట్రేలియాతో సుదృఢ బంధం
‘‘నేనంత త్వరగా తృప్తిపడే రకం కాదు. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ కూడా అంతే. ఇద్దరమూ కలిసి ఆస్ట్రేలియా, భారత బంధాలను మరింత దృఢతరం చేసి తీరతాం’’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సిడ్నీలో ‘ద ఆస్ట్రేలియన్’ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై తన మనోగతాన్ని పంచుకున్నారు. వాతావరణ మార్పులు మొదలుకుని ఉగ్రవాదం, సముద్ర తీర భద్రత, పైరసీ దాకా ఇండో–పసిఫిక్ ప్రాంతం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందంటూ ఆందోళన వెలిబుచ్చారు.
విందులో భారతీయ రుచులు
ఎఫ్ఐపీఐసీ శిఖరాగ్రం సందర్భంగా ఫసిఫిక్ ద్వీప దేశాల అధినేతలకు మే 22న మధ్యాహ్నం మోదీ ఇచ్చిన విందులో భారతీయ వంటకాలు, ముఖ్యంగా తృణధాన్యాల వెరైటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అతిథులు తృణధాన్యాల విశిష్టితను అడిగి తెలుసుకున్నారు. ఖాండ్వీ, వెజిటెబుల్ సూప్, మలై కోఫ్తా, రాజస్తానీ రాగి గట్టా కర్రీ, దాల్ పంచ్మెల్, మిలెట్ బిర్యానీ, నాన్ ఫుల్కా, మసాలా చాస్, పాన్ కుల్ఫీ, మాల్పువా, మసాలా టీ, గ్రీన్ టీ, మింట్ టీ, పీఎన్జీ కాఫీ తదితరాలను రుచిచూసి బాగున్నాయంటూ మెచ్చుకున్నారు.