న్యూఢిల్లీ: ఆవర్తన పట్టిక (పీరియాడిక్ టేబుల్)పై అధ్యయాలు, దేశ ఆర్థిక రంగంలో వ్యవసాయ రంగం పాత్ర, ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సవాళ్లు, సహజ వనరుల సమర్థ నిర్వహణ.. ఇలాంటి కీలకమైన అంశాలను పదో తరగతి పాఠ్య పుస్తకాల నుంచి జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఎన్సీఈఆర్టీ) తొలగించింది.
కొత్త పాఠ్యపుస్తకాలు మార్కెట్లోకి వచ్చాయి. పదో తరగతి రసాయనశాస్త్ర పుస్తకంలో ఆవర్తన పట్టిక చాప్టర్ను పూర్తిగా తొలగించారు. ఈ చాప్టర్ను పదకొండో తరగతి పుస్తకంలో చదువుకోవాల్సి ఉంటుంది. 9, 10, 11, 12 తరగతులకు సంబంధించిన పాఠ్యాంశాల్లో కొన్నింటిని ఎన్సీఈఆర్టీ ఇటీవలే తొలగించడం తెలిసిందే.
విద్యార్థులపై భారాన్ని తగ్గించడమే దీని ఉద్దేశమని ఎన్సీఈఆర్టీ వివరణ ఇచ్చింది. ఇవన్నీ చిన్నచిన్న మార్పులేనని వెల్లడించింది. అయితే, ముఖ్యమైన అధ్యాయాలను తొలగించడం పట్ల విద్యారంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.