Skip to main content

NCHM JEE 2022: ఈ కోర్సు పూర్తి చేసుకుంటే.. రూ. 5 లక్షల వేత‌నంతో ఉద్యోగం

హోటల్‌ మేనేజ్‌మెంట్‌.. సేవల రంగంలో వేగంగా విస్తరిస్తూ వృద్ధి బాటలో పయనిస్తున్న విభాగం. టూరిజం, హాస్పిటాలిటీకి పెరుగుతున్న ఆదరణే ఇందుకు కారణం! ఇలాంటి రంగంలో కెరీర్‌ కోరుకునే వారికి అవకాశాలు రెడ్‌ కార్పెట్‌ స్వాగతం పలుకుతున్నాయి. అందుకు మార్గం.. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌.. జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌! ఈ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే .. ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే బీఎస్సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో అడుగు పెట్టొచ్చు. ఆపై.. ఉజ్వలమైన కెరీర్‌ సొంతం చేసుకోవచ్చు. తాజాగా.. 2022–23లో ప్రవేశాలకు సంబంధించి ఎన్‌సీహెచ్‌ఎం–జేఈఈ నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో.. ఈ టెస్ట్‌ ప్రత్యేకత.. ప్రాధాన్యత, అర్హతలు, పరీక్ష విధానం, అందుబాటులో ఉన్న సీట్లు, కెరీర్‌ అవకాశాలపై ప్రత్యేక కథనం...
NCHMCT JEE 2022 Notification released
NCHMCT JEE 2022 Notification released
  • హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో బీఎస్సీకి ఎన్‌సీహెచ్‌ఎం–జేఈఈ
  • కోర్సు పూర్తి చేసుకుంటే.. విస్తృత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
  • ఇంటర్మీడియెట్‌తోనే ఉజ్వల భవిష్యత్‌ దిశగా అడుగులు
  • ఎన్‌సీహెచ్‌ఎం–జేఈఈ–2022 నోటిఫికేషన్‌ విడుదల

ఇంటర్మీడియెట్‌ తర్వాత విభిన్నంగా ఆలోచించే వారికి మెరుగైన  మార్గం.. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ క్యాంపస్‌లలో ఈ కోర్సు పూర్తి చేసుకుంటే.. అవకాశాలకు కొదవే లేదు అంటున్నారు నిపుణులు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో నిపుణులైన మానవ వనరులను తీర్చిదిద్దే ఉద్దేశంతో కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇన్‌స్టిట్యూట్‌లు.. ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌. ఈ క్యాంపస్‌లలో బీఎస్సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. ఎన్‌సీహెచ్‌ఎం–జేఈఈ. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలో స్కోర్‌ ఆధారంగా.. తదుపరి దశలో ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ద్వారా సీట్లను భర్తీ చేసే విధానం కొనసాగుతోంది.

అర్హతలు

10+2/ఇంటర్మీడియెట్‌ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్హత చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 01.07.2022 నాటికి వయసు 25ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 28ఏళ్లలోపు ఉండాలి. 

78 ఇన్‌స్టిట్యూట్‌లు.. 13 వేలకు పైగా సీట్లు

  • ఎన్‌సీహెచ్‌ఎం–జేఈఈలో స్కోర్‌ ఆధారంగా జాతీయ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లోని 78 హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో 13,118 సీట్లకు పోటీపడొచ్చు. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో 21 ఇన్‌స్టిట్యూట్‌లు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో 27 ఇన్‌స్టిట్యూట్‌లు, 29 ప్రైవేట్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, ఒక పీఎస్‌యూ ఇన్‌స్టిట్యూట్‌లో బీఎస్సీ హోటల్‌మేనేజ్‌మెంట్‌ కోర్సు అందుబాటులో ఉంది. వీటన్నింటి పర్యవేక్షణకు జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కేటరింగ్‌ టెక్నాలజీ సంస్థను కూడా పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. 
  • తెలుగు రాష్ట్రాల్లో.. తెలంగాణలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, ఎస్‌ఐహెచ్‌ఎం–మెదక్, సీఐహెచ్‌ఎం –హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐహెచ్‌ఎం–తిరుపతిలలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్‌లు బీఎస్సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును అందిస్తున్నాయి. వీటితోపాటు పలు ప్రైవేట్‌ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా ఈ కోర్సును అందిస్తున్నాయి.

హోటల్‌ మేనేజ్‌మెంట్‌.. లభించే కొలువులు

హోటల్‌ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సులు పూర్తి చేసిన వారికి.. గెస్ట్‌ రిలేషన్‌ ఎగ్జిక్యూటివ్స్‌; ఫ్రంట్‌ డెస్క్‌ మేనేజర్‌; క్రూయిజ్‌ మేనేజర్‌; కిచెన్‌ ఎగ్జిక్యూటివ్‌; మార్కెటింగ్‌ మేనేజర్‌; సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌; అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌; ట్రిప్‌ అడ్వైజర్‌; బ్యాక్‌ ఎండ్‌ ఎగ్జిక్యూటివ్స్‌; చెఫ్స్‌ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. బీఎస్‌సీ కోర్సులో వీరు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌ ఆధారంగా ఆయా విభాగాల్లో ఎంట్రీ లెవల్‌ కొలువులు దక్కించుకోవచ్చు. ప్రారంభంలో సగటున రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల వేతనాన్ని సంస్థలు అందిస్తున్నాయి.

ఐదు విభాగాలు–200 ప్రశ్నలు

  • ఎన్‌సీహెచ్‌ఎం–జేఈఈ పరీక్ష మొత్తం అయిదు విభాగాల్లో 200 ప్రశ్నలకు జరుగుతుంది. న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ అనలిటికల్‌ అప్టిట్యూడ్‌ 30 ప్రశ్నలు, రీజనింగ్‌ అండ్‌ లాజికల్‌ డిడక్షన్‌ 30 ప్రశ్నలు, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ 30 ప్రశ్నలు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 60 ప్రశ్నలు, అప్టిట్యూడ్‌ ఫర్‌ సర్వీస్‌ సెక్టార్‌ 50 ప్రశ్నలు.. ఇలా మొత్తం మొత్తం 200 ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు. 
  • పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది.
  • ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు.
  • నెగెటివ్‌ మార్కింగ్‌ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్షకు కేటాయించిన సమయం మూడు గంటలు.
  • మెరిట్‌ జాబితాను రూపొందించే క్రమంలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో అత్యధిక మార్కులు పొందిన వారిని ముందుగా పరిగణనలోకి తీసుకుంటారు.

ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌

ఎన్‌సీఎహెచ్‌ఎం–జేఈఈ ఫలితాలు వెల్లడించాక.. సీట్ల భర్తీకి ఉమ్మడి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ ఎంట్రన్స్‌లో స్కోర్‌ ఆధారంగా ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఇన్‌స్టిట్యూట్‌ ప్రాథమ్యాలతో ఛాయిస్‌ ఫిల్లింగ్‌ పూర్తి చేయాలి. అందుబాటులో ఉన్న సీట్లు, స్కోర్‌ ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. గతేడాది రెండు రౌండ్లలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కొన్ని ప్రైవేట్‌ ఇన్‌స్టిట్యూట్స్, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్స్‌ మాత్రం సొంతంగా ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. 

ఎన్‌సీహెచ్‌ఎం–జేఈఈ–2022 ముఖ్య సమాచారం​​​​​​​

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: ఫిబ్రవరి 4 – మే 3, 2022
  • దరఖాస్తు సవరణ అవకాశం: మే 4 నుంచి మే 6 వరకు
  • ఎన్‌సీహెచ్‌ఎం–జేఈఈ పరీక్ష తేదీ: మే 28, 2022
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్,వరంగల్‌
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://nchmjee.nta.nic.in, www.nta.ac.in


విజయం సాధించండిలా
న్యూవురికల్‌ ఎబిలిటీ అండ్‌ అనలిటికల్‌ అప్టిట్యూడ్‌

మ్యాథమెటిక్స్‌లో ఉన్న బేసిక్‌ నైపుణ్యాలను పరీక్షించే విభాగం ఇది. కాబట్టి హైస్కూల్‌ స్థాయిలోని మ్యాథమెటిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి. వీటిలోనూ ముఖ్యంగా శాతాలు, లాభ–నష్టాలు, నెంబర్‌ సిస్టమ్,సగటు,కాలం–పని,సాధారణ వడ్డీ, బారు వడ్డీ, కాలం–వేగం–దూరం, నిష్పత్తులు, జామెట్రీ వంటి వాటిపై మరింత పట్టు సాధించాలి. అనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌లో.. నిర్దిష్టంగా డేటాను విశ్లేషించగలిగే సామర్థ్యం, డేటాలోని ముఖ్య సమాచారాన్ని క్రోడీకరించి.. ఇచ్చిన ప్రశ్నకు అనువుగా, సమాధానం గుర్తించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ఇందుకోసం గ్రాఫ్‌లు, పై చార్ట్‌లు, ఫ్లో చార్ట్‌లు వంటి వాటిని ప్రాక్టీస్‌ చేయాలి.

రీజనింగ్‌ అండ్‌ లాజికల్‌ డిడక్షన్‌

అభ్యర్థుల్లోని సునిశిత పరిశీలన, తార్కిక విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించే విభాగమిది. ఇందులో మెరుగైన ప్రతిభ కనబర్చాలంటే.. మ్యాథమెటికల్‌ ఆపరేషన్స్, కోడింగ్‌–డీకోడింగ్, నంబర్‌ సిరీస్, బ్లడ్‌ రిలేషన్‌ వంటి రీజనింగ్‌ ఆధారిత అంశాలపై పట్టు సాధించాలి. ఇందుకోసం ప్రిపరేషన్‌ సమయంలో ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. అదే విధంగా డేటా సఫీషియన్సీ, వెన్‌ డయాగ్రమ్స్‌ ప్రాక్టీస్‌ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.

చ‌ద‌వండి: Latest Current Affairs

జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌

అభ్యర్థులకు సామాజిక, సమకాలీన అంశాలపై ఉన్న అవగాహనను పరీక్షించే విభాగం ఇది. ఇందులో మంచి మార్కులు పొందాలంటే.. హైస్కూల్‌ స్థాయిలోని పుస్తకాల్లో ఉండే చరిత్ర, రాజ్యాంగం, జాగ్రఫీ, ఎకనామిక్స్‌ పాఠ్యాంశాలు చదవాలి. హిస్టరీలో ముఖ్యమైన యుద్ధాలు–పరిణామాలు–పర్యవసానాలు, స్వాతంత్య్రోద్యమం వంటి అంశాలపై అవగాహన లాభిస్తుంది. జాగ్రఫీలో దేశంలో ముఖ్యమైన ప్రదేశాలు, ఖనిజ వనరులు– అవి ఎక్కువగా లభించే ప్రాంతాలు, నదులు, సరస్సులు, పర్వతాల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. కరెంట్‌ అఫైర్స్‌లో ముఖ్యమైన సదస్సులు, సమావేశాలు, వార్తల్లోని వ్యక్తులు, ఇటీవల కాలంలో అంతర్జాతీయ ప్రాముఖ్యం సంతరించుకున్న అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌

తుది జాబితా రూపకల్పనలో కీలకం ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌. ఈ విభాగంలో రాణించడానికి అభ్యర్థులు గ్రామర్‌ను అవపోసన పట్టాల్సిందే. టెన్సెస్, ప్రిపోజిషన్స్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూట్స్, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్, యాంటానిమ్స్, సినానిమ్స్, సెంటెన్స్‌ ఫార్మేషన్, స్పాటింగ్‌ ద ఎర్రర్స్, సీక్వెన్స్‌ ఆఫ్‌ వర్డ్స్‌పై పూర్తి పట్టు సాధించాలి. దీనికోసం బేసిక్‌ గ్రామర్‌ పుస్తకాలను అధ్యయనం చేయాలి. న్యూస్‌ పేపర్లను చదవడం,వాటిలోని కొత్త పదాలను తెలుసుకోవడం, ఆ పదాలను వినియోగించిన తీరుపై అవగాహన పెంచుకోవడం వంటివి లాభిస్తాయి.

అప్టిట్యూడ్‌ ఫర్‌ సర్వీస్‌ సెక్టార్‌.. స్పెషల్‌ సెక్షన్‌

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈలో ప్రత్యేకమైన విభాగంగా అప్టిట్యూడ్‌ ఫర్‌ సర్వీస్‌ సెక్టార్‌ విభాగాన్ని పేర్కొనొచ్చు. ఇందులో ప్రధానంగా అభ్యర్థికి ఆతిథ్య, పర్యాటక రంగాలపై ఉన్న ఆసక్తిని, అభ్యర్థి దృక్పథాన్ని పరీక్షించేవిధంగా ప్రశ్నలు ఉంటాయి. వాస్తవ సంఘటన లేదా అంశం ఇచ్చి దానికి ఎలా స్పందిస్తారు? అనే తరహా ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలు అభ్యర్థుల్లో ఎదుటి వారిని మెప్పించే తీరుకు సంబంధించి ఉంటాయి.

విస్తృత అవకాశాలు

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు అభ్యర్థులకు బ్యాచిలర్‌ డిగ్రీతోనే విస్తృత అవకాశాలు సొంతమవుతున్నాయి. ఎన్‌సీహెచ్‌ఎం–జేఈఈ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ క్యాంపస్‌లలోని విద్యార్థులకు ఇండస్ట్రీ నుంచి ఎంతో ఆదరణ లభిస్తోంది. స్టార్‌ హోటల్స్, టూరిజం ఏజెన్సీల్లో కొలువులు లభిస్తున్నాయి. ప్రారంభంలోనే రూ.4 లక్షల నుంచి రూ. 5 లక్షల వార్షిక వేతనం అందించే సంస్థలు కూడా ఉన్నాయి. ఐటీసీ, ఒబెరాయ్, తాజ్‌ గ్రూప్‌ వంటి హోటల్‌ ఇండస్ట్రీలోని ప్రముఖ సంస్థలు క్యాంపస్‌ డ్రైవ్స్‌ నిర్వహిస్తున్నాయి. ఈ రంగంలో రాణించాలంటే.. ఓర్పు, ఎదుటి వారిని మెప్పించే నేర్పు ఎంతో అవసరం.
–ప్రొ‘‘చిన్నంరెడ్డి, డైరెక్టర్,ఎన్‌ఐటీహెచ్‌ఎం

​​​​​​​చ‌ద‌వండి: Management​​​​​​​

Published date : 12 Mar 2022 11:07AM

Photo Stories