Skip to main content

బాలికా విద్యకు కేజీబీవీతో భరోసా

రాయవరం: పేద, అనాధ బాలికల విద్యకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) భరోసాగా నిలుస్తున్నాయి.
Girls education ensured with KGBV
బాలికా విద్యకు కేజీబీవీతో భరోసా

కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా బోధన సాగిస్తున్న కేజీబీవీల్లో ప్రవేశాలకు ఏటా డిమాండ్‌ పెరుగుతోంది. ఇక్కడ సాధారణ విద్యతో పాటు ఒకేషనల్‌, కంప్యూటర్‌ విద్యను సైతం అందిస్తున్నారు. ఆంగ్ల బోధనతో పాటు ఉచిత భోజనం, వసతి, పుస్తకాలు, యూనిఫామ్‌ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాకినాడ జిల్లాలో నాలుగు కేజీబీవీల్లో ప్రవేశానికి అవకాశముంది. ఇందులో ఆరో తరగతిలో ప్రవేశానికి మార్చి 27 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రతి పాఠశాలలో 6వ తరగతికి 40 సీట్లు ఉన్నాయి.

చదవండి:

EAMCET 2023: ఎంసెట్‌కు ఇన్ని లక్షల దరఖాస్తులు.. ఈసారి పరీక్ష ఇలా..

TSPSC: ‘అడ్డదారి అభ్యర్థుల’ గుర్తింపే లక్ష్యం

9,231 Jobs: అవరోహణ విధానంలో గురుకుల పోస్టుల భర్తీ

Fake Job Notification: ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్‌సైట్‌

విద్యాలయాలు.. కోర్సులు

జిల్లా సమగ్ర శిక్షా ప్రాజెక్టు కింద మైదాన ప్రాంతాల్లో తుని, కోటనందూరు, శంఖవరం, తొండంగిలలో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు ఉన్నాయి. గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మైదాన ప్రాంతంలోని నాలుగు కేజీబీవీలతో పాటు రంపచోడవరం, మారేడుమిల్లి, గంగవరం, వై.రామవరం, ఎటపాక, కూనవరం, వీఆర్‌ పురం, చింతూరులో ఉండేవి. జిల్లాల విభజన అనంతరం ఏజెన్సీ కేజీబీవీలు అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోకి వెళ్లాయి. ఇప్పుడు కేవలం కాకినాడ జిల్లా పరిధిలో నాలుగు కేజీబీవీల్లో కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలోని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశముంది. ఇందులో ఏడాదికి 40 చొప్పున 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 7, 8 తరగతుల్లో ఖాళీలను బట్టి సీట్లు కేటాయిస్తారు. జిల్లాలోని నాలుగు కేజీబీవీలో ఇంటర్‌ విద్యను ప్రవేశ పెట్టారు. శంఖవరం కేజీబీవీలో ఎంపీసీ, తుని కేజీబీవీలో బైపీసీ, తొండంగి కేజీబీవీలో హెచ్‌ఈసీ, కోటనందూరు కేజీబీవీలో ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులున్నాయి.
తొలి ప్రాధాన్యం వీరికే.. : అనాథ వీధి బాలికలు, పేద పిల్లలతో పాటు బడిబయట పిల్లలు, బడి మానేసిన వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బాలికలకు తొలి ప్రాధాన్యం కింద ప్రవేశాలు కల్పిస్తారు. వలస కూలీల చిన్నారులు, కార్మిక శాఖ అధికారులు సిఫారసు చేసిన వారికీ ప్రవేశాల్లో ప్రాధాన్యం ఉంటుంది. 2018 నుంచి కేజీబీవీల్లో ఇంటర్‌ విద్యనూ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఫిమే ల్‌ లిటరసీ రేటు తక్కువగా ఉన్న మండలాలకు చెందిన విద్యార్థినులకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. మొదటి ప్రాధాన్యం కాకినాడ జిల్లాలోని ఫిమేల్‌ లిటరసీ తక్కువగా ఉన్న మండలాల విద్యార్థినులకు ఇస్తారు. సీట్లు భర్తీ కాకపోతే ఆ సీట్లను కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో విద్యార్థినులతో భర్తీ చేస్తారు.

గుణాత్మక విద్యాబోధన :

కేజీబీవీల్లో బాలికలకు క్వాలిఫైడ్‌ ఉపాధ్యాయులతో గుణాత్మక విద్య అందిస్తున్నారు. వీటితో పాటు ఆంగ్ల మాధ్యమం కూడా బోధిస్తున్నారు. కార్పొరేట్‌ పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోని విధంగా బోధన సాగిస్తున్నారు. రెగ్యులర్‌ పాఠ్యాంశాలతో పాటు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు, కంప్యూటర్‌ విద్య, క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. అలాగే కేజీబీవీల్లో విద్యార్థినులకు విద్యతో పాటు కుట్లు, అల్లికలు, టైలరింగ్‌లో తర్ఫీదు అందిస్తున్నారు. బొమ్మల తయారీ, పేపర్స్‌తో వివిధ రకాల నమూనాలు తయారు చేయడం నేర్పిస్తున్నారు. కబడ్డీ, టెన్నిస్‌, వాలీబాల్‌, సాఫ్ట్‌బాల్‌, హాకీ, టెన్నికాయిట్‌ తదితర క్రీడల్లో శిక్షణ అందిస్తున్నారు.

తేదీలు ఇలా..

దరఖాస్తుల ప్రారంభ తేదీ: మార్చి 27
స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్‌ 20
ఎంపికై న విద్యార్థులకు ఇంటిమేషన్‌: ఏప్రిల్‌ 21 నుంచి 25 వరకు..
సర్టిఫికెట్ల పరిశీలన: ఏప్రిల్‌ 26 నుంచి 30 వరకు

Published date : 11 Apr 2023 04:25PM

Photo Stories