TS DSC 2024: విధివిధానాలు, రిజర్వేషన్లు, సిలబస్‌ ఇతర వివరాలతో బులెటిన్‌ విడుదల

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 4న‌ ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 2 వరకూ కొనసాగనుంది.

 ఇందుకు సంబంధించిన విధివిధానాలు, రిజర్వేషన్లు, సిలబస్‌ ఇతర వివరాలతో విద్యాశాఖ పూర్తి సమాచార బులెటిన్‌ను https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో మార్చి 4న‌ విడుదల చేయనుంది. దరఖాస్తుల స్వీకరణకు సర్వర్‌ సమస్యల్లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. గతేడాది డీఎస్సీ తేదీలను ప్రకటించినా ప్రస్తుతం దీన్ని రద్దు చేశారు. 

చదవండి: TS Mega DSC 2024: రాష్ట్ర స్థాయిలో డీఎస్సీ ప్రక్రియ.. ప్రశ్నల తయారీ ఇలా.. పాస్‌వర్డ్స్‌ అన్నీ వీరి పర్యవేక్షణలో..
అయితే అప్పుడు దరఖాస్తు చేసుకున్న 1.74 లక్షల మంది తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు ఇప్పటికే ప్రకటించినా ఈసారి 11,062 టీచర్‌ పోస్టులు ఉండటంతో ఎక్కువ మంది పోటీ పడే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.5 లక్షల మంది టెట్‌ పాసయ్యారు. వారిలో చాలా మంది టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

చదవండి: TS DSC Notification: హైదరాబాద్‌లోనే అత్యధికంగా టీచర్‌ పోస్టులు, మిగతా జిల్లాల ఖాళీల వివరాలు ఇవే..

టెట్‌ ఉత్తీర్ణుల్లో చాలా మంది హైదరాబాద్‌లోని కోచింగ్‌ కేంద్రాల బాట పడుతున్నారు. ప్రైవేటు స్కూళ్లలో టీచర్లుగా పనిచేస్తున్న వారిలో చాలా మంది ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఓయూ సహా పలు విశ్వవిద్యాలయ లైబ్రరీల్లోనూ విద్యార్థుల తాకిడి పెరుగుతోంది. మరోవైపు డీఎస్సీ సిలబస్‌తో కూడిన పుస్తకాలు రూపొందించే పనిలో ప్రచురణ సంస్థలు నిమగ్నమయ్యాయి. సబ్జెక్టు పరంగా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని భావిస్తుండటంతో పాత పుస్తకాలనే తిరిగి ముద్రించే పనిలో ఉన్నాయి.  

#Tags