Coaching Classes : జులై 8 నుంచి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణా తరగతులు..
![Coaching classes for students on Education Science Politics from July 8](/sites/default/files/images/2024/06/27/training-classes-edu-polit-scien-1719461229.jpg)
అనంతపురం: ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకూ కాకినాడ వేదికగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్బాబు మంగళవారం తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను సీపీఐ జిల్లా కార్యాలయంలో విడుదల చేసి ఆయన మాట్లాడారు. విద్యార్థులకు చదువుతో పాటు రాజకీయ పరిణామాలపై అవగాహన, ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవడం ఎంతో అవసరమన్నారు. సమాజం, విద్యా వ్యవస్థలో దాగున్న అవినీతిని వెలికి తీయడానికి, అవినీతి... అక్రమార్కులపై పోరాటాలు చేయడానికి ఈ శిక్షణా తరగతులు దోహదపడతాయన్నారు.
AP PGECET Rankers : పీజీఈసెట్లో జేఎన్టీయూఏ విద్యార్థుల సత్తా..!
విద్యారంగంలో వస్తున్న మార్పులు, సామాజిక, ఆర్థిక,రాజకీయ పరిస్థితులపై విద్యార్థులను చైతన్య పరచనున్నట్లు తెలిపారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఇప్పుడు అమలు చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం కొనసాగించాలన్నారు. పీజీ విద్యార్థులకు కామన్ ఎంట్రన్స్ పరీక్ష రద్దు చేయాలన్నారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రమణయ్య, కుళ్లాయిస్వామి, నాయకులు హనుమంతు, నరసింహయాదవ్, వెంకట్నాయక్, ఆంజనేయులు, వంశీ పాల్గొన్నారు.