Skip to main content

TSPSC Group-1 Cut Off Marks : గ్రూప్‌-1 మెయిన్స్‌లో నిలవాలంటే ఎన్ని మార్కులు సాధించాలంటే..

TSPSC Group 1 Cut Off Marks 2022 Expected Telangana

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌–1 తొలి దశ ప్రిలిమ్స్‌ పరీక్ష ముగిసింది. ప్రశ్న పత్రం క్లిష్టంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ప్రిలిమ్స్‌లో ఎన్ని మార్కులు వస్తే మెయిన్స్‌ ఎగ్జామినేషన్‌కు అర్హత లభిస్తోందో అనే సందేహం అభ్యర్థులను వెంటాడుతోంది. టీఎస్‌పీఎస్సీ మాత్రం ఎలాంటి కటాఫ్‌ మార్కులు ఉండవని జోన్ల ప్రాతిపదికగా1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు అర్హులను ఎంపిక చేస్తామని ప్రకటించింది.ఈ నేపథ్యంలో.. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షపై విశ్లేషణ, ఎన్ని మార్కులు వస్తే మెయిన్స్‌కు అర్హత లభిస్తుంది.. మెయిన్స్‌ పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌.. 

  • ముగిసిన టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 పరీక్ష
  • 1:50 నిష్పత్తిలో జోన్ల వారీగా మెయిన్స్‌కు ఎంపిక
  • మెయిన్‌కు సమగ్ర అధ్యయనం మేలు

 

  • 503: గ్రూప్‌–1 మొత్తం పోస్ట్‌ల సంఖ్య
  • 3,80,081: గ్రూప్‌–1కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు
  • 2,86,051: గ్రూప్‌–1 తొలిదశ ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య
  • 75 శాతం: పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య.
  • ఈ గణాంకాలను పరిశీలిస్తే ఈసారి గ్రూప్‌–1కు పోటీ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. వాస్తవానికి గ్రూప్‌–1, సివిల్స్‌ వంటి పరీక్షలకు 50 నుంచి 60 శాతం మధ్యలో హాజరు శాతం ఉంటుంది. కాని ఈసారి టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1కు 75 శాతం హాజరు అనేది ఈ పరీక్ష పట్ల అభ్యర్థుల సీరియస్‌నెస్‌ను తెలుపుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.

అతి క్లిష్టంగా ప్రశ్నపత్రం

టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష అతి క్లిష్టంగా ఉందని సబ్జెక్ట్‌ నిపుణులు, అభ్యర్థులు పేర్కొంటున్నారు. సివిల్స్‌ తరహాలో ప్రశ్నల తీరు ఉందని చెబుతున్నారు. పరీక్షకు నిర్దేశించిన అన్ని సిలబస్‌ అంశాల్లో ఫండమెంటల్స్‌ నుంచి సమకాలీన పరిణామాల వరకు ఆమూలాగ్ర అవగాహన ఉంటేనే సమాధానం ఇవ్వగలిగే విధంగా ప్రశ్నలు అడిగారని పేర్కొంటున్నారు.

చ‌ద‌వండి: Group 1 Preliminary Exam: 60 డేస్‌ ప్రిలిమ్స్‌ ప్లాన్‌.. సిలబస్‌, సబ్జెక్ట్‌ అంశాలు..

స్టేట్‌మెంట్‌ ఆధారిత ప్రశ్నలు

గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షలో ఈసారి స్టేట్‌మెంట్‌ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా అడిగారు. దీంతో సుదీర్థంగా ఉన్న స్టేట్‌మెంట్స్‌ చదివి అర్థం చేసుకుని సమాధానాలను గుర్తించడానికి అభ్యర్థులు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చింది. అదే విధంగా మ్యాచింగ్‌ టైప్, విశ్లేషణాత్మక ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యం కనిపించింది. ఇది కూడా సమయాభావ సమస్యకు గురి చేసిందని పలువురు అభ్యర్థులు పేర్కొన్నారు. ప్రశ్నలు సివిల్స్‌ స్థాయిలో ఉన్నాయని.. 150 ప్రశ్నలకు 150 నిమిషాలు మాత్రమే కేటాయించడం వల్ల సమయం సరిపోక పరీక్ష హాల్లో తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లు వాపోతున్నారు. 

1:50 జాబితాలో నిలవాలంటే..

రెండు మల్టీ జోన్లు, కేటగిరీలను పరిగణనలోకి తీసుకుంటూ 1:50 నిష్పత్తిలో అంటే ఒక్కో పోస్ట్‌కు 50 మందిని చొప్పున మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేస్తామని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. దీంతో..ప్రశ్నల శైలి, కాఠిన్య స్థాయిని దృష్టిలో పెట్టుకుంటే 75 నుంచి 80 మధ్యలో మార్కులు సాధించిన వారికి 1:50 జాబితాలో చోటు లభించే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. టీఎస్‌పీఎస్సీ విడుదల చేసే కీ ఆధారంగా ఈ మార్కుల శ్రేణిలో ఉంటామని భావించే అభ్యర్థులు మెయిన్‌ పరీక్షకు సన్నద్ధత ప్రారంభించొచ్చని సూచిస్తున్నారు.

చ‌ద‌వండి: Reference Books for Groups Preparation: చదివే పుస్తకాలే.. విజయానికి చుక్కానీ!

మెయిన్స్‌లో విజయం ఇలా..

గ్రూప్‌–1 మెయిన్స్‌లో ఎగ్జామినేషన్‌.. పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో 900 మార్కులకు ఆరు పేపర్లతో నిర్వహించనున్నారు. దీంతోపాటు.. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ కూడా ఉంటుంది. ఈ పేపర్‌ను‡ కేవలం అర్హత పేపర్‌గానే నిర్దేశించారు. ప్రతి పేపర్‌ 150 మార్కులకు ఉంటుంది.

సమగ్ర అవగాహన

మెయిన్స్‌ పరీక్ష అభ్యర్థులకు ఆయా అంశాలపై పూర్తి స్థాయి పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు సిలబస్‌లోని ప్రతిటాపిక్‌పైనా ఆమూలాగ్ర అవగాహన ఏర్పరచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే మెయిన్‌ పరీక్ష కోణంలో ప్రిపరేషన్‌ సాగించి.. ప్రిలిమ్స్‌కు హాజరైన అభ్యర్థులకు కొంత సానుకూలత ఉంటుందని.. ఇప్పుడే మెయిన్‌కు ప్రిపరేషన్‌ ప్రారంభించే వారు మాత్రం తీవ్రంగా కృషి చేయాలని సూచిస్తున్నారు.

ఈ అంశాలు కీలకంగా

  • మెయిన్‌కు హాజరయ్యే అభ్యర్థులు తెలంగాణ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ ఉద్యమాలను అధ్యయనం చేయాలి. జనరల్‌ ఎస్సే పేపర్‌లో, హిస్టరీ పేపర్‌లో ఉండే తెలంగాణ రాష్ట్ర విధానాలు, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం, హక్కులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 
  • జనరల్‌ ఎస్సే పేపర్‌గా పేర్కొనే పేపర్‌–1 కోసం సమకాలీన సామాజిక అంశాలు, సమస్యలు, ఆర్థిక వృద్ధి, భారత చారిత్రక, వారసత్వ సంపద, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో తాజా పరిణామాలు తదితర అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
  • పేపర్‌–2లో ఆధునిక భారత దేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమం, భారత చరిత్ర, సంస్కృతి; అదే విధంగా తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం అంశాలను చదవాలి. వీటితోపాటు భారత, రాష్ట్ర భౌగోళిక అంశాలపైనా పట్టు సాధించాలి.
  • పేపర్‌–3 కోసం భారత రాజ్యాంగం, పాలనా వ్యవస్థ, భారత సమాజం, సమస్యలు, సాంఘిక ఉద్యమాలపై దృష్టి పెట్టాలి.
  • ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ సబ్జెక్ట్‌గా పేర్కొనే పేపర్‌–4 కోసం భారత, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ–అభివృద్ధి, అభివృద్ధి, పర్యావరణ సమస్యల గురించి అవగాహన పెంచుకోవాలి.
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(పేపర్‌–5)లో..సామాజిక అభివృద్ధికి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ దోహద పడుతున్న తీరు, శాస్త్రా సాంకేతిక రంగాల్లో ఆధునిక పద్ధతుల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి.

చ‌ద‌వండి: Books for Groups Preparation: కోచింగ్‌ తీసుకోకుండా గ్రూప్స్‌లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం..

ఆరో పేపర్‌కు ప్రత్యేకంగా

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 మెయిన్స్‌లో ఆరో పేపర్‌గా పేర్కొన్న.. తెలంగాణ ఆలోచన (1948–1970), ఉద్యమ దశ(1971–1990), తెలంగాణ ఏర్పాటు దశ, ఆవిర్భావం (1991–2014)) అంశాలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. ముఖ్యంగా సిలబస్‌లో నిర్దేశించిన ప్రకారం–1948 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు జరిగిన ముఖ్య ఉద్యమాలు, ఒప్పందాలు, ముల్కీ నిబంధనలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు–వాటి సిఫార్సులు వంటి వాటిపై పట్టు సాధించాలి. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రూపొందించిన పునర్‌ వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా పొందుపరచిన అంశాలు; తెలంగాణ రాష్ట్రానికి కల్పించిన హక్కులపై దృష్టి సారించాలి.

సమకాలీన ప్రాధాన్య అంశాలు

తెలంగాణకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి వంటి వాటిపై మరింత ప్రత్యేక దృష్టితో అభ్యసనం సాగించాలి. ఆర్థిక వనరుల అభివృద్ధి, రాష్ట్రంలో వ్యవసాయం, సాగు పరిస్థితులు, పారిశ్రామిక విధానాలు వంటి అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.

 టీఎస్‌పీఎస్సీ → స్టడీ మెటీరియల్ → బిట్ బ్యాంక్ → సక్సెస్ స్టోరీస్ → గైడెన్స్ → సిలబస్ → ప్రివియస్‌ పేపర్స్ → ఎఫ్‌ఏక్యూస్‌ → ఆన్‌లైన్ క్లాస్ → ఆన్‌లైన్ టెస్ట్స్

తెలంగాణ అంశాలపై పట్టు

  • తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ పేరుతో ప్రత్యేకంగా ఉన్న సిలబస్‌ అంశాల విషయంలో అభ్యర్థులు మరింత లోతైన అవగాహన ఏర్పరచుకుంటే మార్కులు పెంచుకునే అవకాశం ఉంది. 
  • చరిత్రలో తెలంగాణలో.. రాజులు, ముఖ్య యుద్ధాలు, ఒప్పందాలు, తెలంగాణలోని కవులు–రచనలు; కళలు; ముఖ్య కట్టడాలు–వాటిని నిర్మించిన రాజులు తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. స్వాతంత్య్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రాంత ప్రమేయం ఉన్న సంఘటనలపై అవగాహన పెంచుకోవాలి.
  • జాగ్రఫీ విషయంలో.. తెలంగాణలోని ముఖ్యమైన నదులు–పరీవాహక ప్రాంతాలు; ముఖ్యమైన పంటలు; భౌగోళిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. దీంతోపాటు తెలంగాణ భౌగోళిక స్వరూపం విస్తీర్ణం, జనాభా వంటి అంశాలపై అవగాహన అవసరం.
  • ఎకానమీ పేపర్‌ కోసం తెలంగాణ స్థూల రాష్ట్రీయోత్పత్తి, ముఖ్యమైన పథకాలు, 2011 జనాభా గణాంకాలు; ముఖ్యమైన పరిశ్రమలు–ఉత్పత్తిదాయకత, రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులపై పట్టుసాధించాలి. 
Published date : 25 Oct 2022 06:04PM

Photo Stories