Skip to main content

Reference Books for Groups Preparation: చదివే పుస్తకాలే.. విజయానికి చుక్కానీ!

Reference Books for Groups Preparation
Reference Books for Groups Preparation

గ్రూప్‌–1, 2 ఎగ్జామ్స్‌.. అభ్యర్థుల్లో సందడి నెలకొంది. కోచింగ్‌ సెంటర్లకు, గ్రంథాలయాలకు క్యూ కడుతున్నారు. హడావుడిగా ప్రిపరేషన్‌ ప్రారంభిస్తున్నారు. అయితే చాలామంది అభ్యర్థులు పుస్తకాలు లేదా మెటీరియల్‌ ఎంపికలో..తడబాటుకు గురవుతున్నారు!! మార్కెట్లో.. ఒక్కో సబ్జెక్ట్‌కు పదుల సంఖ్యలో పుస్తకాలు, ప్రచురణలు! దీంతో.. ఏ పుస్తకాన్ని ఎంచుకోవాలి.. ఏ పుస్తకంలో ఎంత సమాచారం ఉంది.. ఆ సమాచారాన్ని ఎలా చదవాలి.. సిలబస్‌కు అనుగుణంగా సొంతం నోట్స్‌ రాసుకోవడం ఎలా.. ఇలా.. అనేక సందేహాలు!! ఈ నేపథ్యంలో.. గ్రూప్స్‌ పరీక్షల అభ్యర్థులు మెటీరియల్‌ ఎంపికలో పాటించాల్సిన మెళకువలు.. చదవాల్సిన విధానంపై విశ్లేషణ..

  • గెలుపు బాటలో కీలకం పుస్తకాల ఎంపిక 
  • ప్రతి సబ్జెక్ట్‌కు పదుల సంఖ్యలో బుక్స్‌
  • ఎన్‌సీఈఆర్‌టీ, అకడెమిక్‌ బుక్స్‌కు ప్రాధాన్యం
  • సరైన మెటీరియల్‌ ఎంచుకోవడం ముఖ్యం అంటున్న నిపుణులు

గ్రూప్స్, సివిల్స్‌ వంటి పోటీ పరీక్షల విజయంలో అభ్యర్థులు చదివే పుస్తకాలు కీలకంగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి అభ్యర్థులు మెటీరియల్‌ లేదా పుస్తకాల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి. సంబంధిత పరీక్షకు సరితూగే ప్రామాణిక పుస్తకాలనే ప్రిపరేషన్‌కు ఎంచుకోవాలి. దీనికి భిన్నంగా ఎక్కువ పుస్తకాలు చదివితే అధిక జ్ఞానం లభిస్తుందని భావిస్తే పొరపాటే అంటున్నారు నిపుణులు. చదివేది ఒకట్రెండు పుస్తకాలైనా.. పరీక్ష సిలబస్, శైలికి అనుగుణంగా బుక్స్‌ను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. 

చ‌ద‌వండి: Books for Groups Preparation: కోచింగ్‌ తీసుకోకుండా గ్రూప్స్‌లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం..

సిలబస్‌కు సరితూగే పుస్తకాలు

ప్రస్తుతం మార్కెట్లో ప్రతి సబ్జెక్ట్‌కు సగటున పదుల సంఖ్యలో పుస్తకాలు అందుబాటులో ఉంటున్నాయి. దాంతో పుస్తకాల ఎంపికలో అభ్యర్థులు కొంత అయోమయానికి గురవుతున్నారు. ఇన్ని పుస్తకాల్లో దేన్ని ఎంచుకోవాలి? అనేది అత్యంత ప్రధానమైన సమస్యగా మారుతోంది. దీనికి పరిష్కారంగా అభ్యర్థులు తొలుత పరీక్ష సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలించాలి. వాటి ఆధారంగా పుస్తకాలను ఎంచుకోవాలి. ఒక పుస్తకాన్ని ఎంచుకునే ముందు సిలబస్‌లోని అన్ని అంశాలు అందులో ఉన్నాయా? లేదా? అని ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి. అదే విధంగా ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి సమకాలీన అంశాలతో ప్రచురితమవుతున్న మోనోగ్రాఫ్‌లను కూడా చదివేలా వాటిని సేకరించుకోవాలి. ఒకవేళ ఒక ప్రామాణిక పుస్తకంలో సిలబస్‌లోని అన్ని అంశాలు లేవని గుర్తిస్తే..దీనికి అదనంగా మరో ప్రామాణిక పుస్తకాన్ని ఎంచుకోవచ్చు. 

ప్రాథమిక అవగాహనకు ఎన్‌సీఈఆర్‌టీ

గ్రూప్స్‌ అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి ప్రాథమిక అవగాహనను అందించే పుస్తకాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. అందుకోసం ఎన్‌సీఈఆర్‌టీ 6 నుంచి 12వ తరగతి పుస్తకాలను చదవాలి. దీనివల్ల హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వంటి అంశాల్లో ప్రాథమిక భావనలపై అవగాహన వస్తుంది. వాస్తవానికి గ్రూప్స్‌కు పోటీ పడే అభ్యర్థుల్లో ఎక్కువ మంది డిగ్రీ తర్వాత అకడమిక్స్‌కు దూరమవుతారు. ఉద్యోగాలు, ఇతర వ్యాపకాల్లో ఉంటారు. ఇలాంటి వారు తమకున్న సబ్జెక్ట్‌ అవగాహనను పునరావలోకనం చేసుకునేందుకు ప్రాథమిక భావనలతో ప్రిపరేషన్‌ ప్రారంభించడం మేలు చేస్తుంది. ఇందుకోసం ఎన్‌సీఈఆర్‌టీ ప్రచురణలను చదవడం మేలు చేస్తుందని గత విజేతల అభిప్రాయం.

అకాడమీ పుస్తకాలు

గ్రూప్స్‌ అభ్యర్థులు కోర్‌ సబ్జెక్ట్‌లపై పట్టు కోసం ముఖ్యంగా హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీకి డిగ్రీ స్థాయిలోని అకాడమీ పుస్తకాలను చదవాలి. అకాడమీ పుస్తకాలు ప్రభుత్వ ప్రచురణలు కావడంతో.. వీటిలో పొరపాట్లకు ఆస్కారం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఆయా అంశాలకు సంబంధించి వాస్తవిక సమాచారం విషయంలో కచ్చితత్వం కూడా ఉంటుంది. ప్రాంతీయ ప్రాధాన్యమైన అంశాలుగా భావించే.. రాష్ట్ర చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ వంటి విషయాల్లో కచ్చితత్వంతో కూడిన సమాచారం లభిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అకాడమీ పుస్తకాలను చదవాలి. అదేవిధంగా అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పుస్తకాలు, ఇగ్నో పుస్తకాలను చదవడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది.

చ‌ద‌వండి: Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!

ప్రభుత్వ ప్రచురణలు

గ్రూప్స్‌ అభ్యర్థులు సమకాలీన అంశాలపై పట్టు కోసం ప్రభుత్వ ప్రచురణలను చదవడం ముఖ్యమని గుర్తించాలి. యోజన, ఇండియా ఇయర్‌ బుక్, రాష్ట్ర ప్రభుత్వ సామాజిక–ఆర్థిక సర్వే, బడ్జెట్‌ ప్రచురణలు చదవాలి. వీటిని చదవడం ద్వారా ఇటీవల కాలంలో ఆయా రంగాల్లో జరుగుతున్న తాజా పరిణామాలు, ప్రభుత్వ పథకాలు, కేటాయింపులు, లక్షిత వర్గాలు.. వంటి వాటిపై సమగ్ర అవగాహన లభిస్తుంది. గణాంకాలతో కూడిన సమాచారంపై స్పష్టత వస్తుంది. అదే విధంగా ఎకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ వంటి మ్యాగజైన్లు చదవడం కూడా తాజా పరిణామాలపై అవగాహనకు దోహదం చేస్తుంది.

ప్రశ్నార్హ అంశాలను గుర్తించే నేర్పు

  • పుస్తకాలు, ప్రచురణలపై కసరత్తు పూర్తి చేసి.. ప్రిపరేషన్‌ సాగించే క్రమంలో అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌లు, టాపిక్స్‌కు సంబంధించి ప్రశ్నార్హమైన అంశాలను గుర్తించే నేర్పు సొంతం చేసుకోవాలి. వాస్తవానికి పుస్తకాల్లో సమాచారం సుదీర్ఘంగా వ్యాస రూపంలో ఉంటుంది. ఈ సమాచారం నుంచి పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉన్న వాటిని గుర్తించగలగాలి. ఆయా అంశాలకు అనుగుణంగా గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తూ.. ప్రశ్నార్హమైన వాటిని గుర్తించే నైపుణ్యం సొంతం చేసుకోవచ్చు. 
  • ఉదాహరణకు..భౌగోళిక శాస్త్రాన్నే పరిగణనలోకి తీసుకుంటే..పుస్తకాల్లో విస్తృతమైన సమాచారం ఉంటుంది. పోటీ పరీక్షల కోణంలో ముఖ్యమైన భౌగోళిక ప్రాంతాలు– వాటి స్వరూపం, సహజ వనరులు–అవి ఎక్కువగా లభిస్తున్న ప్రాంతాలు, సాగు భూములు–వాటి విస్తీర్ణం–పంటల స్వరూపం వంటి వాటిని ప్రధానమైనవిగా భావించొచ్చు. 
  • అదే విధంగా చరిత్ర విషయానికొస్తే.. ముఖ్యమైన ఘట్టాలతోపాటు వాటి ప్రభావం.. కొత్త పరిస్థితులకు దారితీసిన వైనం తెలుసుకోవడం వంటివి చేయాలి. ఇలా శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేస్తే.. విస్తారంగా ఉండే సమాచారంలో పోటీ పరీక్షలకు ఉపయోగపడే అంశాలను గుర్తించడం తేలికవుతుందని నిపుణులు అంటున్నారు.

సొంత నోట్స్‌.. ఎంతో మేలు

  • పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు సొంత నోట్స్‌ రాసుకునే విధానాన్ని పాటించాలి. ఇది వారికి మలి దశలో ఎంతో మేలు చేస్తుందని నిపుణులు, గత విజేతలు చెబుతున్నారు. ఈ సొంత నోట్స్‌ రాసుకునే విషయంలో కూడా అభ్యర్థులు కొంత గందరగోళానికి గురయ్యే ఆస్కారం ఉంది. ఇలాంటి అభ్యర్థులు.. ఏదైనా అంశాన్ని చదువుతున్నప్పుడు ముందుగా వాటి ప్రాథమిక భావనలు నోట్స్‌లో పొందుపరుచుకోవాలి. ఆ తర్వాత వాటిని సమకాలీన అంశాలతో అనుసంధానిస్తూ.. తగిన సమాచారాన్ని సదరు నోట్స్‌లో రాసుకోవాలి.
  • గణాంకాలు, ముఖ్యమైన ఘట్టాలు, సంవత్సరాలు ఉండే ఎకానమీ, హిస్టరీ వంటి వాటికి ఆయా సంవత్సరాల్లో జరిగిన సంఘటనల ప్రాధాన్యతను బట్టి నోట్స్‌లో రాసుకోవాలి.
  • ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశాలను చదువుతున్నప్పుడు.. ఆయా పథకాల లక్ష్యం, లక్షిత వర్గాలు, లబ్ధిదారులు, ఆర్థిక కేటాయింపులు, సదరు పథకాల ప్రస్తుత పరిస్థితి వంటి అంశాలను నోట్స్‌లో రాసుకోవాలి.
  • బడ్జెట్, సామాజిక సర్వేల్లో ఎక్కువగా గణాంకాలే ఉంటాయి. కాబట్టి పరీక్ష ప్రాధాన్యత ఆధారంగా వాటిని నోట్స్‌గా పొందుపర్చుకోవాలి. వాటికి సమకాలీన అంశాలను అనుసంధానం చేసుకునేలా వ్యవహరించాలి.

గుర్తుంచుకోవడం ఎలా?

  • విస్తృతమైన సమాచారంతో ఉండే పుస్తకాలను చదివేటప్పుడు ఆయా అంశాలను గుర్తుంచుకోవడం ఎలా? అనే ఆందోళన కూడా కలుగుతుంది. దీనికి పరిష్కారంగా అభ్యర్థులు తమ వ్యక్తిగత సామర్థ్యం ఆధారంగా మెమొరీ టిప్స్‌ పాటించాలి.
  • ముఖ్యమైన అంశాలను పాయింట్స్‌గా రాసుకోవడం; విజువలైజేషన్‌ టిప్స్‌ను పాటించడం; పిక్టోరియల్‌ అప్రోచ్‌(అంటే ఆయా అంశాలకు సంబంధించి చార్ట్‌లు, డయాగ్రమ్స్‌ రూపంలో పొందుపర్చుకోవడం) వంటి వాటిని అనుసరించాలి. ఈ మెమొరీ టిప్స్‌ అనేవి అభ్యర్థుల వ్యక్తిగత సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి. 

గణాంకాలు, కాన్సెప్ట్‌లు

  • గ్రూప్స్‌ అభ్యర్థులు ప్రిపరేషన్‌ సమయంలో ఎదుర్కొనే మరో ప్రధాన సమస్య.. గణాంకాలకు ప్రాధాన్యం ఇవ్వాలా? లేదా కాన్సెప్ట్‌లు ముఖ్యమా అనేది? ఇది అభ్యర్థులు చదివే అంశం, పోటీ పడే పరీక్ష స్థాయిపై ఆధారపడి ఉంటుందని గుర్తించాలి. 
  • పథకాలు లేదా వనరుల కేటాయింపునకు సంబంధించిన అంశాలను చదువుతున్నప్పుడు గణాంకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వాటిని సమకాలీన అంశాలతో సమ్మిళితం చేసుకోవాలి. కాన్సెప్ట్యువల్‌ ప్రిపరేషన్‌ ఉపయుక్తంగా ఉంటుంది.
  • ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉండే గ్రూప్‌–2లో గణాంకాలకు కొంత ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కేవలం గ్రూప్‌–2కే పోటీ పడే అభ్యర్థులు ఆయా గణాంకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
  • గ్రూప్‌–1, 2 రెండింటికీ ప్రిపరేషన్‌ సాగించే అభ్యర్థులు.. ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉండే గ్రూప్‌–1 ప్రిలిమ్స్, గ్రూప్‌2కు ప్రిపరేషన్‌ సాగిస్తూనే.. గ్రూప్‌1 మెయిన్స్‌ పరీక్షను పరిగణనలోకి తీసుకుని డిస్క్రిప్టివ్‌ విధానంలో చదవడం ఉపయుక్తంగా ఉంటుంది.
  • ఇలా..మెటీరియల్‌ ఎంపిక నుంచి పరీక్ష స్థాయి వరకూ..ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటూ..శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేస్తే..పరీక్షలో మెరుగైన ప్రతిభ చూపే అవకాశం ఉంటుంది.


చ‌ద‌వండి: TSPSC Group1 Guidance: విజేతగా నిలవాలంటే.. 60 రోజుల ప్రిపరేషన్‌ ప్రణాళికను రూపొందించుకోవాలి!!

గ్రూప్స్‌ అభ్యర్థులు–చదవాల్సిన పుస్తకాలు

  • ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు(6 నుంచి 12వ తరగతి వరకు)
  • అకాడమీ పుస్తకాలు
  • బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయి పుస్తకాలు
  • కేంద్ర, రాష్ట్ర సామాజిక– ఆర్థిక సర్వేలు, బడ్జెట్‌ ప్రచురణలు
  • ఇండియా ఇయర్‌ బుక్, యోజన, ఈపీడబ్ల్యూ
  • జాగ్రఫీ: ఇండియన్‌ జాగ్రఫీ–మాజిద్‌ హుస్సేన్, వరల్డ్‌ జాగ్రఫీ–మాజిద్‌ హుస్సేన్‌
  • ఎకానమీ: ఇండియన్‌ ఎకానమీ–ఉమా కపిల; ఇండియన్‌ ఎకానమీ–మిశ్రా అండ్‌ పూరి; ఎకనామిక్స్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌–ఎం.ఎల్‌.జింగన్‌
  • పాలిటీ: ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్‌ అండ్‌ గవర్నమెంట్‌–ఎస్‌.పి.వర్మ; డెమోక్రసీ ఇన్‌ ఇండియా–రషీదుద్దీన్‌ ఖాన్‌; ది కాన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇండియా–పి.ఎం.భక్షి; ఇన్‌ట్రడక్షన్‌ టు ది కాన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇండియా–డి.డి.బసు; పబ్లిక్‌ అడ్మినిస్ట్రే్టషన్‌– అవస్థి అండ్‌ మహేశ్వరి చాప్టర్స్‌ ఆన్‌ గుడ్‌ గవర్నెన్స్‌; ఇండియన్‌ పాలిటీ–లక్ష్మికాంత్‌.
  • హిస్టరీ: ఏన్షియంట్‌ ఇండియా–ఆర్‌.ఎస్‌.శర్మ; మిడీవల్‌ ఇండియా–సతీష్‌ చంద్ర; మోడ్రన్‌ ఇండియా–బిపిన్‌ చంద్ర.
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ: సైన్స్‌ స్పెక్ట్రమ్, యోజన, ప్రభుత్వ ప్రచురణలు.
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలకు సంబంధించిన అంశాలను చదివేటప్పుడు అకాడమీ పుస్తకాలకు, వాటి తాజా ప్రచురణలకు ప్రాధాన్యం ఇవ్వాలి. 
  • అదే విధంగా శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్, రాష్ట్ర పునర్విభజన చట్టం, రాష్ట్రాల విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ అమలవుతున్న పథకాలు, సమస్యలకు సంబంధించి ప్రభుత్వ ప్రచురణలు చదవడం ఉపయుక్తంగా ఉంటుంది.

చ‌ద‌వండి: History Notes for Groups: శాతవాహనులు–సంస్కృతి​​​​​​​

ప్రత్యేక కసరత్తు

గ్రూప్స్‌ అభ్యర్థులు ప్రామాణిక పుస్తకాల ఎంపికలో ప్రత్యేక కసరత్తు చేయాలి. ఇందుకోసం కొంత సమయం కేటాయించి.. ఆయా పుస్తకాలను సంబంధిత పరీక్ష సిలబస్‌తో బేరీజు వేసుకోవాలి. ఆ తర్వాత సిలబస్‌కు సరితూగుతున్న పుస్తకాలపై స్పష్టత తెచ్చుకుని వాటినే చదవాలి. ఒకే టాపిక్‌కు సంబంధించి నాలుగైదు పుస్తకాలు చదివే బదులు.. సదరు టాపిక్‌పై సమగ్ర సమాచారం ఉండే ఒకటి లేదా రెండు పుస్తకాలను ఎంపిక చేసుకోవాలి. అకాడమీ పుస్తకాలను చదవడం విస్మరించొద్దు. అంతేకాకుండా వీటి ఆధారంగా ప్రశ్నలు–సమాధానాలు ప్రాక్టీస్‌ చేయడం ద్వారా.. సబ్జెక్ట్‌పై అవగాహనతోపాటు రైటింగ్‌ నైపుణ్యాలు కూడా అలవడుతాయి.
–జి.ఆర్‌.మధుసూదన్, ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 విజేత(2016) (డిప్యూటీ కలెక్టర్‌)

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

Published date : 09 May 2022 05:21PM

Photo Stories