Skip to main content

మరో 366 ఎస్జీటీ పోస్టులకు కోత!

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయుల్లేక విద్యార్థుల బోధన కొరవడుతున్న సమయంలో ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీచేయించాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా టీచర్ పోస్టులను రద్దుచేస్తోంది.
తాజాగా 366 ఎస్జీటీ పోస్టులకు కోత పెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా హేతుబద్ధీకరణ పేరిట ప్రభుత్వం దాదాపు ఐదు వేలకు పైగా స్కూళ్లను రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఈ స్కూళ్లలోని టీచర్ పోస్టులలో పనిచేస్తున్న వారిని ఇతర స్కూళ్లలో సర్దుబాటు చేయగా ఇతర పోస్టులన్నీ ఇప్పటికే రద్దు జాబితాలో చేరిపోయాయి. ఇందులో అత్యధికం ప్రాథమిక పాఠశాలలకు సంబంధించిన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులే. టీచర్ పోస్టుల భర్తీకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా పీఈటీ పోస్టులు దాదాపు 1100లకు పైగా భర్తీచేయాలని నిర్ణయించినా చివరకు నోటిఫికేషన్లో 47 మాత్రమే పొందుపరిచారు. దీనిపై నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ పోస్టులను పెంచాలని భావించిన ప్రభుత్వం కొత్తగా అదనపు పోస్టులను మంజూరు చేయాల్సి ఉన్నా అందుకు భిన్నంగా కిందిస్థాయిలోని సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను పీఈటీలుగా మార్పు చేసింది. అంతేకాక, ఇటీవల డీఎస్సీలో పీఈటీ పోస్టుల పెంపుకోసం 300లకు పైగా ఎస్‌జీటీ పోస్టులను పీఈటీ పోస్టులుగా ప్రభుత్వం కన్వర్ట్ చేసింది. అలాగే మ్యూజిక్, ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ తదితర పోస్టుల కోసం కూడా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులనే రద్దుచేసి కొత్త పోస్టులను మంజూరు చేశారు. దీనివల్ల డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులు భారీగా తగ్గిపోయాయి. ఇప్పటికే దీనిపై నిరుద్యోగులతో పాటు టీచర్ల సంఘాల్లో, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

డిప్యుటీ డీఈవో పోస్టుల కోసమంటూ..
ఇలా ఉంటే.. ప్రభుత్వం తాజాగా 366 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల రద్దుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో పాఠశాలల పర్యవేక్షణకు క్షేత్రస్థాయిలో మండల విద్యాధికారులు, డిప్యుటీ డీఈఓల వ్యవస్థ ఉంది. ఉన్నత పాఠశాలలను డిప్యుటీ డీఈఓలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఎంఈఓలు పర్యవేక్షించేలా ఏర్పాట్లు ఉన్నాయి. గతంలో మలేసియా ప్రభుత్వానికి సంబంధించిన పెమాండు సంస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యపై ప్రభుత్వం నివేదికలు రూపొందించింది. ఇందులో పలు లోపాలు బయటపడ్డాయి. డిప్యుటీ డీఈఓ పోస్టుల సంఖ్యను పెంచాలని, నియోజకవర్గానికి ఒక డిప్యుటీ డీఈఓ పోస్టు ఏర్పాటుచేసి తమకు పదోన్నతులు పెంచాలని ఉపాధ్యాయ సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల ముందు ఈ సంఘాలను మచ్చిక చేసుకోవడానికి ప్రభుత్వం డిప్యూటీ డీఈఓ పోస్టులను పెంచేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ పోస్టులు 53 మాత్రమే ఉన్నాయి. వీటిని నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175కు పెంచాలంటే అదనంగా 122 డిప్యుటీ డీఈఓ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంటుంది. వీటికి అనుగుణంగా బడ్జెట్‌ను పొందుపరచాలి. అయితే, ఈ అదనపు భారం ప్రభుత్వంపై పడకుండా ఉన్న బడ్జెట్లోనే సర్దుబాటుచేసి కొత్తపోస్టులు ఏర్పాటుచేసేలా సర్కార్ ప్రణాళిక రూపొందించింది. దీనికి అనుగుణంగా ప్రస్తుతం కిందిస్థాయిలో ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను రద్దుచేయాలని నిర్ణయించింది. ఒక్కో డిప్యూటీ డీఈఓ పోస్టుకయ్యే బడ్జెట్ కోసం నియోజకవర్గానికి 3 ఎస్‌జీటీ పోస్టులను తగ్గించి ఆ బడ్జెట్‌ను కొత్త పోస్టులకు మళ్లించేలా పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలను సిద్ధంచేసింది. ఇలా మొత్తం 366 ఎస్‌జీటీ పోస్టులు తగ్గించనున్నారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కొత్త పోస్టులు మంజూరు చేయకుండా పై పోస్టుల కోసం స్కూళ్లలోని టీచర్ పోస్టులను రద్దు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
Published date : 28 Nov 2018 03:40PM

Photo Stories