Students: విద్యార్థికి నిఘంటువు.. ఆంగ్లం ఇక సులువు
మదనపల్లె సిటీ: ‘విద్యార్థులకు చదువే భవిష్యత్తు. భావితరాలకు ఆస్తి ఇస్తున్నామంటే అది చదువే’ అని సాక్షాత్తూ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఎప్పుడూ చెబుతున్న మాట. ప్రభుత్వ పాఠశాలలను గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో నీరుగారిపోయాయి. నేడు ఆ పరిస్థితి మారింది. పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టిన ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. అన్నమయ్య జిల్లా 2213 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఈ ఏడాది జనగన్న విద్యా కానుక ద్వారా 17750 ఆంగ్ల డిక్షనరీలు ప్రభుత్వం పంపిణీ చేసింది. గతంలో విద్యార్థి ఆంగ్ల పదాలు అర్థంగాక ఇబ్బంది పడ్డారు. ఇపుడు డిక్షనరీలు ఇవ్వడంతో పట్టు సాధిస్తున్నారు. విద్యార్థులలో పఠనాసక్తి పెంచేందుకు డిక్షనరీలు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ఆంగ్లం అంటే భయం పోయింది
ఇప్పటి వరకు ఆంగ్ల పదాలకు సంబంధించి భయం ఉండేది. ఏదైనా సందేహం వస్తే ఉపాద్యాయులను అడగలేక ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం అందించిన డిక్షనరీతో ఆయా పదాలకు అర్థం తెలుసుకుంటున్నారు. ప్రతి దాన్ని ఒకసారి రాయడం వల్ల బాగా గుర్తు ఉంటుంది. భయం పోయింది.
– జశ్వంత్, పదో తరగతి, జెడ్పీహెచ్ఎస్, మదనపల్లె
ప్రత్యేకంగా రూపొందించారు
నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ప్రత్యేకంగా డిక్షనరీలు రూపొందించారు. ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంది.ఉపాధ్యాయులు చెప్పే వాటిని విద్యార్థులు అర్థం చేసుకుంటూనే సొంతంగా తెలుసుకోవచ్చు. ఎక్కువకాలం గుర్తు ఉండిపోతాయి. పదాల ఉచ్ఛరణ తెలుస్తుంది.
– శ్రీరాం పురుషోత్తం, డిఈఓ, అన్నమయ్య జిల్లా
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా కానుక కింద ఉచితంగా పంపిణీ
తెదేపా ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు డిక్షనరీలు ఇవ్వలేదు. టీచర్ చెప్పినా.. బుక్ సెంటర్లలో రూ.300కు కొనుగోలు చేసేందుకు పేద విద్యార్థులు ఇబ్బంది పడ్డారు.
చదవండి: NCCతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి
పాఠశాల తెరిచే రోజునే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా కానుకతోపాటు ఆక్స్ఫర్డ్ తెలుగు, ఆంగ్ల నిఘంటువును విద్యార్థులకు అందజేసింది. దీంతో ఆంగ్ల పదాలకు అర్థాలను సులువుగా తెలుసుకుంటున్నారు.