Skip to main content

సీశాట్ ప్రిపరేషన్‌తో... ఐసెట్ టాపర్‌గా!

‘బీటెక్ చదువుతున్న రోజుల నుంచి సివిల్సే నా లక్ష్యం. ఆ శిక్షణతోపాటు ఐసెట్‌కు ప్రిపరేషన్ సాగించాను. మంచి ర్యాంకు వస్తుందని ఊహించాను. కానీ ఫస్ట్ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది’ అని అంటున్నారు ఏపీ ఐసెట్-2016 టాపర్ (159 మార్కులు) శీని జ్ఞాని రామ్ ప్రసాద్. ఏంబీఏ పూర్తిచేసి ఐఏఎస్‌కు ఎంపికవడమే తన భవిష్యత్ లక్ష్యమని చెబుతున్న రామ్‌ప్రసాద్ సక్సెస్ స్పీక్స్...
విద్యాభ్యాసం వేర్వేరు ప్రాంతాల్లో సాగింది. ఏడో తరగతి వరకు స్వస్థలం రాజమండ్రిలో, ఎనిమిది నుంచి పదో తరగతి వరకు ఏలూరులో చదివాను. పదో తరగతి (2009)లో 560 మార్కులు వచ్చాయి. తర్వాత వేలివెన్నులోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాను. ఇంటర్‌లో 941 మార్కులు సాధించాను. ఎంసెట్‌లో ర్యాంకు ద్వారా గుంటూరులోని ఆర్‌వీఆర్ అండ్ జేసీ కాలేజ్‌లో సీఎస్‌ఈ బ్రాంచ్‌లో గతేడాది బీటెక్ పూర్తిచేశాను. నాన్న శ్రీనివాసరావు వ్యవసాయ వృత్తిపై ఆధారపడినా.. చదివించే విషయంలో ఎప్పుడూ వెనుకడాలేదు. అంతేకాకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కూడా వర్తించడంతో బీటెక్ చదవగలిగాను.

గతేడాది నుంచి సివిల్స్ లక్ష్యంగా..
బీటెక్ పూర్తిచేస్తున్న రోజుల్లోనే సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా పెట్టుకున్నాను. గతేడాది బీటెక్ పూర్తయినప్పటి నుంచి హైదరాబాద్‌లో సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకుంటున్నాను. ఈ సమయంలోనే ఎంబీఏ చదవాలనే ఆలోచన వచ్చింది. దరఖాస్తు చేశాను.

కలిసొచ్చిన సీశాట్ కోచింగ్
ఐసెట్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి ప్రిపరేషన్ సాగించలేదు. సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్-2 (సీశాట్)కు సాగించిన ప్రిపరేషన్‌తోనే ఐసెట్‌కు సన్నద్ధమయ్యాను. ఈ రెండింటి సిలబస్ దాదాపు ఒకేలా ఉండటం, ముఖ్యంగా డేటా ఇంటర్‌ప్రిటేషన్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంశాలు సీశాట్‌లో ఉండటంతో ఆ ప్రిపరేషన్‌తోనే ఐసెట్‌కు సిద్ధమయ్యాను. అయితే పరీక్షకు నెల రోజుల ముందు నుంచి ఐసెట్‌కు ఫోకస్డ్‌గా సన్నద్ధమయ్యాను. అంతేకాకుండా 2014లో క్యాట్‌కు హాజరైన అనుభవం కూడా ఉపయోగపడింది. క్యాట్‌లో 94.73 పర్సంటైల్ వచ్చినా ఐఐఎంల నుంచి ఇంటర్వ్యూ కాల్ రాలేదు. ఇతర బి-స్కూల్స్ నుంచి కాల్స్ వచ్చినా ఆసక్తి లేక చేరలేదు.

టైం మేనేజ్‌మెంట్ ముఖ్యం
ఐసెట్ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించేది టైం మేనేజ్‌మెంట్. 200 ప్రశ్నలను 150 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రిపరేషన్ సమయంలోనే ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ క్రమంలో మాక్‌టెస్ట్‌లకు హాజరు కావాలి. బీటెక్ విద్యార్థులకే ఎంబీఏ, క్యాట్, సీశాట్ పరీక్షలు అనుకూలమని, వారు మాత్రమే ఈ పరీక్షల్లో రాణించగలరనే అభిప్రాయాలు అపోహలు మాత్రమే. సంప్రదాయ డిగ్రీ విద్యార్థులు సైతం ఈ పరీక్షల్లో రాణించొచ్చు. కావాల్సిందల్లా మ్యాథమెటికల్ స్కిల్స్, స్వీయ విశ్లేషణ నైపుణ్యాలు.

ప్రత్యేక దృష్టి సారిస్తే..
సంప్రదాయ డిగ్రీ విద్యార్థులు ఐసెట్‌లో రాణించాలంటే ముఖ్యంగా మ్యాథమెటికల్ ఎబిలిటీ విషయంలో పదో తరగతి స్థాయిలో అర్థమెటిక్‌పై ప్రత్యేక దృష్టిసారించాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్, డేటా సఫిషియన్సీ విషయంలో స్వీయ విశ్లేషణ, ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి.

ఏయూ క్యాంపస్‌లో ఎంబీఏ.. ఆపై ఐఏఎస్
ప్రస్తుత ర్యాంకుతో ఏయూ క్యాంపస్ కళాశాలలో ఎంబీఏ పూర్తిచేస్తాను. తర్వాత సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతా. ఐఏఎస్ సాధించడమే నా లక్ష్యం.
Published date : 28 May 2016 04:00PM

Photo Stories