University Jobs: యునివర్సిటీల్లో ఉద్యోగాలకు భర్తీలు
సాక్షి ఎడ్యుకేషన్: ఉన్నత విద్యను అభ్యసించి, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు జేఎన్టీయూ(ఏ), ఎస్కేయూ నూతన పాలక మండలి సభ్యులు తీపి కబురు వినిపించారు. ఆయా వర్సిటీల పరిధిలో ఖాళీగా ఉన్న వందలాది ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. త్వరలో నోటిఫికేషన్ల జారీకి రెండు యూనివర్సిటీల యాజమాన్యాలు రంగం సిద్ధం చేస్తున్నాయి.
మొత్తం 564 పోస్టుల
భర్తీకి చర్యలు
జిల్లాకే తలమానికంగా ఉన్న జేఎన్టీయూ(ఏ), ఎస్కేయూ పరిధిలో మొత్తం 564 పోస్టుల భర్తీకి ఆయా వర్సిటీల నూతన పాలక మండలి సభ్యులు ఆమోదం తెలిపారు. ఇందులో ఎస్కేయూ పరిధిలో 268 పోస్టులను భర్తీ చేయనుండగా, జేఎన్టీయూ(ఏ) పరిధిలో 296 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్కేయూలో 35 ప్రొఫెసర్, 65 అసోసియేట్ ప్రొఫెసర్, 168 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అనుమతి లభించింది. ఇప్పటికే భర్తీ కాగా, మిగిలిన పోస్టుల్లో అర్హులను ఎంపిక చేయనున్నారు. ఇందుకు సంబంధించిన రూల్ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాయింట్లు నిర్ధారణ అయింది. వీటికి ఎస్కేయూ పాలకమండలి సభ్యులు ఆమోదం తెలిపారు. అలాగే జేఎన్టీయూ(ఏ) పరిధిలో 26 ప్రొఫెసర్, 50 అసోసియేట్ ప్రొఫెసర్, 220 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పాలకమండలి సభ్యులు ఆమోదం తెలిపారు. అయితే ఇందులో ఇప్పటికే భర్తీ చేసిన పోస్టుల మినహా మిగిలిన వాటిని భర్తీ చేయనున్నారు
తొలి సమావేశంలోనే
విప్లవాత్మక నిర్ణయాలు
జేఎన్టీయూ (ఏ) నూతన పాలక మండలి సభ్యులుగా బాధ్యతలు తీసుకున్న ప్రొఫెసర్ బి.దుర్గాప్రసాద్, ప్రొఫెసర్ వి.వసుంధర, డాక్టర్ డి.జ్యోతీశ్వరి, డాక్టర్ ఎం.రామశేఖరరెడ్డి, డాక్టర్ జి.మేరీమాత, జీవీఎం మోహన్కుమార్, డాక్టర్ డి.హరిశ్చంద్ర రామ, డాక్టర్ ఎం.వంశీకృష్ణను ఆ వర్సిటీ వీసీ డాక్టర్ జింకా రంగజనార్దన, రిజిస్ట్రార్ సి.శశిధర్ ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం వర్సిటీలోని పాలక భవనంలో నూతన సభ్యులతో వారు సమావేశమై మాట్లాడారు. ఈ సందర్భంగా పాలనపరమైన పలు అంశాలపై సుదీర్ఘ చర్చ సాగింది.
అలాగే ఎస్కేయూలో నూతన పాలక మండలి సభ్యులు సోమవారం తొలి సమావేశం నిర్వహించారు. సభ్యులు ప్రొఫెసర్ ఎం. మునినారాయణప్ప, ప్రొఫెసర్ ఎ.కృష్ణకుమారి, డాక్టర్ జేవీవీఎన్ కేశవరావు, డాక్టర్ ఎస్.శ్రీలక్ష్మి, రామిరెడ్డి, దేశాయి మదన్మోహన్ రెడ్డి, ఇలియాజ్ అహమ్మద్, కొమ్ము విజయభాస్కర్ను ఆ వర్సిటీ వీసీ డాక్టర్ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ ఎంవీ లక్ష్మయ్య అభినందించారు. కాగా, రెండు వర్సిటీల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి నూతన సభ్యులు విప్లవాత్మక నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.