Fake jobs: బెస్కాంలో ఉద్యోగాలంటూ శఠగోపం
![Fake jobs offer letter in bescom bangalore](/sites/default/files/images/2024/01/11/fake-jobs-1704948508.jpg)
రాయచూరు రూరల్: బెస్కాంలో మీటర్ రీడర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు దండుకొని నకిలీ నియామక పత్రాలు జారీ చేసి పంగనామం పెట్టిన ఘటన జిల్లాలోని లింగసూగూరు తాలూకాలో వెలుగు చూసింది. పదో తరగతి, ఐటీఐ పాసైన 15 మంది నిరుద్యోగ యువకుల నుంచి దేవదుర్గ తాలూకా గబ్బూరుకు చెందిన సురేష్, బసప్ప, నేతాజీ, వేణు, హసన్ అనే వ్యక్తులు తాము కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆప్తులమంటూ నమ్మించి డబ్బు వసూలు చేశారు. అనంతరం బెంగళూరు ఎంఎస్ భవన్లో అభ్యర్థులకు నకిలీ ఇంటర్వ్యూలు జరిపించారు. అనంతరం ఐడియా ఇనఫిటి కంపెనీలో శిక్షణకు సిఫార్సు చేసినప్పుడు అసలు బండారం బయట పడింది. లింగసూగూరుకు చెందిన విక్రం సింగ్ రూ.13 లక్షలు, శరణప్ప రూ.12 లక్షలు, ప్రభుగౌడ రూ.9 లక్షలు, ఆనంద్ రూ.6 లక్షలు, దేవరాజ్ రూ.12 లక్షలు, బలరాం రూ.12 లక్షలు, వెంకట సింగ్ రూ.12లక్షలు, రాజు రూ.7 లక్షలు, రాహుల్ రూ.7లక్షలు, ముస్తాఫా రూ.3 లక్షలు ఇచ్చినట్లు పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: Courses and Jobs: ఖర్చు లేకుండా శిక్షణతో ఉద్యోగం