Skip to main content

అవగాహనతో చదివితేనే ఆశించిన మార్కులు

Bavithaవైద్య వృత్తిలో చేరి సమాజంలో ప్రత్యేక గౌరవం పొందాలని ఎందరో విద్యార్థులు కలలు కంటారు. వీరు తమ కలలను నెరవేర్చుకునేందుకు ఇంటర్మీడియెట్ బైపీసీ తొలి మెట్టు. ఇందులో అధిక మార్కులు సాధించి వైద్యంతో పాటు విభిన్న రంగాల్లో సుస్థిర భవితను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేయొచ్చు. ఈ నేపథ్యంలో ఇంటర్ సెకండియర్ బైపీసీలో ఎక్కువ మార్కుల సాధనకు గెడైన్స్..

బోటనీ
ఇంటర్మీడియెట్ బైపీసీ రెండో సంవత్సరం విద్యార్థులు పబ్లిక్ పరీక్షల ప్రిపరేషన్‌కు సంబంధించి ఫస్టియర్ వార్షిక పరీక్షలు ఎలా రాశారో.. ఏయే తప్పులు చేశారో విశ్లేషించుకోవాలి. ఆ పరీక్షల్లో ఏవైనా పొరపాట్లు చేస్తే, అలాంటివి తిరిగి చేయకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే ద్వితీయ సంవత్సరంలో మంచి మార్కులు సొంతం చేసుకునేందుకు అవకాశముంటుంది.
  • విద్యార్థులు ఇప్పటి వరకు ఒకవైపు అకడమిక్ పరీక్షలకు సిద్ధమవుతూ, మరోవైపు ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు చదువుతూ ఉంటారు. ఇప్పటి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలపై పూర్తిగా దృష్టిసారించాలి. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులను పరీక్షల్లో మంచి మార్కులు సాధించడమే లక్ష్యంగా కాకుండా నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలన్న తపనతో చదివినప్పుడే మంచి ఫలితం ఉంటుంది.
  • మొదటి సంవత్సరంతో పోల్చితే రెండో సంవత్సరం పాఠ్యాంశాలు క్లిష్టంగా ఉంటాయి. తెలుగు అకాడమీ బోటనీ పుస్తకాల్లో కొన్ని అంశాలు సవివరంగా, స్పష్టంగా లేవు. ఇలాంటి అంశాలు మొక్కల శరీర ధర్మ శాస్త్రం, బయోటెక్నాలజీలో ఉన్నాయి. వీటిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి.
వెయిటేజీ కీలకం:
విద్యార్థులు వెయిటేజీని దృష్టిలో ఉంచుకొని పరీక్షలకు సిద్ధంకావాలి. అధిక వెయిటేజీ పాఠ్యాంశాలైన మొక్కల శరీర ధర్మ శాస్త్రం (28 మార్కులు), బయోటెక్నాలజీ (16 మార్కులు), ప్లాంట్స్, మైక్రోబ్స్, హ్యూమన్ వెల్ఫేర్ (12 మార్కులు)కు అధిక సమయం కేటాయించాలి.
  • మొక్కల శరీరధర్మ శాస్త్రం, బయోటెక్నాలజీ యూనిట్ల పాఠ్యాంశాలు క్లిష్టంగా ఉంటాయి కాబట్టి వాటిని ఒకటికి రెండుసార్లు అవగాహన పెంపొందించుకుంటూ చదవాల్సి ఉంటుంది.
  • విద్యార్థులు 60 మార్కులకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ప్రశ్నలకు రాసే సమాధానాల్లో స్పష్టత అధికంగా ఉండాలి. ఫ్లో చార్టులు అవసరమైన చోట వాటినే చిత్రపటాలుగా భావించాలి.
- బి. రాజేంద్ర,
సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.

జువాలజీ
విద్యార్థులు మొత్తం 60 మార్కులకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. సెక్షన్-ఏలో 10 అతిస్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. వీటన్నింటికీ సమాధానాలు రాయాలి. సెక్షన్-బీలో 8 స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో ఆరు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సెక్షన్-సీలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలుంటాయి. రెండింటికి సమాధానాలు రాయాలి. ప్రశ్నపత్రం దాదాపు ఇంటర్‌బోర్డు మాదిరి ప్రశ్నపత్రం తరహాలోనే ఉంటుంది.

పాఠ్యాంశాలు-వెయిటేజీ:
యూనిట్ 1: 8 మార్కులు; యూనిట్ 2: 10 మార్కులు; యూనిట్ 3: 8 మార్కులు; యూనిట్ 4: 10 మార్కులు; యూనిట్ 5: 12 మార్కులు; యూనిట్ 6: 12 మార్కులు; యూనిట్ 7: 8 మార్కులు; యూనిట్ 8: 8 మార్కులు.

ప్రిపరేషన్ వ్యూహం:
  • 2, 5, 6 యూనిట్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ఈ ప్రశ్నల్లో పటాలు కీలకంగా ఉంటాయి. అందువల్ల విద్యార్థులు వీలైనన్ని సార్లు పటాలను సాధన చేయాలి. రంగు పెన్సిళ్లు ఉపయోగించి పటాలను గీస్తే భాగాలను స్పష్టంగా గుర్తించేందుకు అవకాశముంటుంది.
  • ప్రతి యూనిట్‌లోనూ అతిస్వల్ప సమాధాన ప్రశ్నలకు సమాధానాలను స్పష్టంగా నేర్చుకోవాలి. ఎక్కువ మార్కులు సాధించేందుకు ఈ విభాగం చాలా ముఖ్యం.
  • ప్రతి యూనిట్ చివర్లో ఇచ్చిన పారిభాషిక పదకోశాన్ని సాధన చేయాలి. దీనివల్ల వివిధ విషయాలపై విద్యార్థులకు స్పష్టత ఏర్పడుతుంది.
  • పాఠ్యపుస్తకాల్లో నేరుగా సమాధానాలు లేని ప్రశ్నలకు అధ్యాపకులను సంప్రదించి సమాధానాలు రాసుకోవాలి. తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకంలో ప్రతి యూనిట్ చివర్లో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను సాధన చేయాలి.
  • కళాశాలలో ఏ రోజు విన్న పాఠాన్ని ఆ రోజే ఇంటి దగ్గర సమీక్షించుకోవాలి.
  • తోటి విద్యార్థులతో క్లిష్టమైన పాఠ్యాంశాలపై చర్చించడం వల్ల పరోక్షంగా పునశ్చరణకు వీలవుతుంది.
-కె. శ్రీనివాసులు,
శ్రీచైతన్య విద్యాసంస్థలు.

ఫిజిక్స్
ఇంటర్ సెకండియర్ ఫిజిక్స్ పేపర్‌కు 60 మార్కులు కేటాయించారు. ప్రశ్నపత్రంలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఇస్తారు. విద్యార్థులు రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 8 స్వల్ప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఆరింటికి సమాధానాలు రాయాలి. 10 అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. అన్నింటికీ సమాధానాలు రాయాలి.
  • సెకండియర్ విద్యార్థులు ఫిజిక్స్‌లోని ఎలక్ట్రో స్టాటిక్, వేవ్ మోషన్, ఆప్టిక్స్‌లను కష్టమైనవిగా భావిస్తారు. డా ప్లర్ ఎఫెక్ట్ చాలా ముఖ్యమైనది. విద్యార్థులు స్థిర, అనుదైర్ఘ్య తరంగాల ధర్మాలు, వాటి భేదాలను నేర్చుకోవాలి.
  • మారిన సిలబస్ ప్రకారం ప్రతి చాప్టర్‌లోనూ విశ్లేషణాత్మక ప్రశ్నలు, సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు తెలుగు అకాడమీ ఫిజిక్స్ పుస్తకాన్ని క్షుణ్నంగా చదవాలి. ప్రతి చాప్టర్‌కు వెనకున్న ప్రశ్నలన్నింటినీ సాధించాలి.
  • వేవ్ మోషన్, సెమీ కండక్టర్ డివెసైస్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఎలక్ట్రో మాగ్నటిక్స్ నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
కెమిస్ట్రీ
సెకండియర్ కెమిస్ట్రీకి 60 మార్కులు కేటాయించారు. ప్రశ్నపత్రంలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 8 స్వల్ప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఆరింటికి సమాధానాలు రాయాలి. 10 అతి స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. విద్యార్థులు అన్నింటికీ సమాధానాలు రాయాలి.
  • విద్యార్థులు సెకండియర్ కెమిస్ట్రీ సిలబస్‌లోని సాలిడ్ స్టేట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కాంప్లెక్స్ కాంపౌండ్స్‌లను కష్టమైనవిగా భావిస్తారు. కొత్త సిలబస్ ప్రకారం ఆర్గానిక్‌లో చాలా రీజనింగ్ ప్రశ్నలున్నాయి. వాటిని చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి.
  • ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ.. ఈ మూడింటిలో మూడు వ్యాసరూప ప్రశ్నలు వస్తాయి. వీటిలో అధిక ప్రాధాన్యం గల చాప్టర్లు.. ఆల్కహాల్స్, అమైన్స్, సాలిడ్ స్టేట్, కార్బొనిల్ కాంపౌండ్‌‌స, ఎలక్ట్రో కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కాంప్లెక్స్ కాంపౌండ్స్.
  • కెమిస్ట్రీలో ఏదైనా చాప్టర్ చదివేటప్పుడు తెలుగు అకాడమీ బుక్‌లోని ప్రతి ముఖ్యమైన పాయింట్‌ను అండర్‌లైన్ చేసుకోవాలి. వాటిని రివిజన్ చేయాలి. దీనివల్ల విద్యార్థులు లఘు సమాధాన ప్రశ్నలన్నింటికీ తేలిగ్గా సమాధానాలు రాయగలుగుతారు.
-ఎం.ఎన్.రావు,
శ్రీచైతన్య విద్యాసంస్థలు.

సక్సెస్ సోపానాలు
  • పబ్లిక్ పరీక్షల కోణంలో అతి ముఖ్యమైన చాప్టర్లను, కాన్సెప్ట్‌లను గుర్తించి వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
  • ప్రతి ప్రధాన కాన్సెప్ట్‌ను చదవడంతోపాటు సంబంధిత కాన్సెప్ట్‌నకు సంబంధించిన లెక్చర్ నోట్స్‌ను, మెటీరియల్‌ను బాగా అధ్యయనం చేయాలి.
  • ప్రతి కాన్సెప్ట్‌ను నిర్వచించడం-విశ్లేషించడం-అనువర్తించడం విధానంలో చదవాలి.
  • ఏ అంశాన్ని చదువుతున్నా సమయ పాలన, కచ్చితత్వం ప్రధానం. వీటిని తప్పకుండా పాటించాలి.
  • ప్రతి సబ్జెక్టుకు ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించుకోవాలి. దానికి తగినట్లు ఏ రోజు చదవాల్సిన అంశాలను ఆ రోజే పూర్తిచేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదు.
  • ప్రతి చాప్టర్‌కు సంబంధించిన ముఖ్యమైన సినాప్సిస్‌ను నోట్ బుక్‌లో రాసుకొని బాగా చదవాలి.
అకాడమీ అసలైన ఆయుధం
పబ్లిక్ పరీక్షలకు ఇంకా చాలా కొద్ది సమయమే ఉంది కాబట్టి ఈ సమయంలో ఐదారు పుస్తకాలను పోగేసుకొని చదవకుండా అకాడమీ పుస్తకాలు, కాలేజీ మెటీరియల్‌కి పరిమితమై వాటిలోని అంశాలపై పూర్తిగా అవగాహన పెంపొందించుకోవాలి. సిలబస్‌ను పూర్తిగా చదవడం పూర్తయిన తర్వాత మొదటి, రెండో రివిజన్ సమయంలో వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, ఉదాహరణలకు ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యార్థులు తొలుత తేలికైన టాపిక్స్‌ను చదవడం దిగ్విజయంగా పూర్తిచేస్తే తర్వాత కష్టమైన అంశాలను పూర్తిచేసేందుకు తగిన ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది.

చాప్టర్లను విడిచిపెట్టొద్దు
సాధారణంగా కొందరు విద్యార్థులు కష్టంగా ఉన్నాయనే భావనతోనో లేదంటే సరైన టైమ్ మేనేజ్‌మెంట్ లేకపోవడం వల్లో కొన్ని చాప్టర్లను చదవకుండా వదిలేస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదు. ప్రతి చాప్టర్‌కు దానికి ముందున్న చాప్టర్‌తో సంబంధముంటుంది. ప్రస్తుతం ఇంటర్మీ డియెట్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు ఒకవేళ మొదటి సంవత్సరంలో ఏవైనా చాప్టర్లను వదిలేస్తే వాటిని ఒకసారి చదివి, తర్వాత వాటితో సంబంధమున్న ద్వితీయ సంవత్సరం టాపిక్స్‌ను చదవాలి.

Published date : 31 Jan 2014 05:42PM

Photo Stories