Skip to main content

Indian Polity Study Material: భారత రాజ్యాంగ పీఠికలోని పదజాలం!

constitution of india study material in telugu

ప్రవేశిక-పాఠ్యాంశం

'భారత ప్రజలమైన మేము భారతదేశానికి సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకునేందుకు, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని; ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వాతంత్య్రాన్ని; అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్నీ, జాతీయ సమైక్యతనూ, సమగ్రతనూ సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్‌ 26వ తేదీన మా రాజ్యాంగ పరిషత్‌లో ఆమోదించి, శాసనంగా రూపొందించుకొన్న రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం'.

ప్రవేశిక - తాత్విక పునాదులు (Preamble-Philosophical Foundations)

ఏ ప్రజాస్వామ్య రాజ్యాంగమైనా సాధారణంగా ప్రవేశికతోనే ప్రారంభమవుతుంది.భారత రాజ్యాంగం కూడా ప్రవేశికతోనే మొదలైంది. ప్రవేశికకు బ­దులు పీఠిక, అవతారిక, ముందుమాట, ఉపోద్ఘా­తం లాంటి పర్యాయ పదాలను వాడతారు. ప్రవేశికనే ఆంగ్లంలో 'Preamble' అంటారు. ప్రవేశిక రాజ్యాంగం లక్ష్యాలను, ఆదర్శాలను, మూలతత్వా­న్ని సూచనప్రాయంగా తెలుపుతుంది. రాజ్యాంగా­న్ని ఏ ఉన్నత ఆశయాలతో రచించారు, ఏ తరహా ప్రభుత్వాన్ని,ఎలాంటి సమాజాన్ని నిర్మించాలని భావించారు మొదలైన అంశాలను స్పష్టీకరిస్తూ రా­జ్యాంగ నిర్మాతలు ముందుమాటగా తెలుపుతారు.

ప్రవేశిక-ఆధారం

ప్రవేశిక ఉన్న మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. మన రాజ్యాంగంలో ప్రవేశిక భావాన్ని అమెరికా నుంచి గ్రహించినప్పటికీ, అందులోని లక్ష్యాలు, ఆధారాలకు డిసెంబర్‌ 13, 1946న రాజ్యాంగ పరిషత్‌ సమావేశంలో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రతిపాదించిన 'ఆశయాల' తీర్మానమే ప్రధాన ప్రాతిపదిక. ఫ్రెంచి రాజ్యాంగం నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, గణతంత్రం అనే అంశాలను గ్రహించారు. ఐక్య రాజ్య సమితి చార్టర్‌లోని ప్రవేశిక కూడా భారత రాజ్యాంగానికి ఆధారమని చెప్పవచ్చు.
భారత రాజ్యాంగ ప్రవేశికకు నందన్‌ లాల్‌ బోస్‌ అనే శిల్పి నగిషీ చెక్కారు. 

చ‌ద‌వండి: Indian Polity Study Material: రాజ్యాంగ పరిషత్‌ తొలి సమావేశం ఎక్కడ జరిగింది?

ప్రవేశిక-పదజాలం, భావాలు అర్థవివరణ

ప్రవేశికలో గొప్ప భావజాలాన్ని ప్రయోగించారు. ప్రతి పదానికి, భావానికి ఒక విశిష్ట అర్థాన్ని, పరమార్థాన్ని ఆపాదించవచ్చు. 'భారత ప్రజలమైన మేము' అని ప్రవేశిక ప్రారంభమవుతుంది. ప్రజలే రాజకీయాధికారానికి మూలం, ప్రజలే రాజ్యాంగాన్ని రచించుకున్నారని దీని అర్థం.

రాజకీయ స్వభావాన్ని తెలియజేసే పదాలు:

భారతదేశం ఏ తరహా రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుందో, దాని స్వభావం ఏమిటో స్పష్టంగా పేర్కొన్నారు.

సార్వభౌమత్వం (Sovereignty):

సార్వభౌమత్వం అంటే సర్వోన్నత అధికారం అని అర్థం. భారతదేశం అంతర్గతంగా సర్వోన్నత అధికారాన్ని, బాహ్యంగా విదేశీ, దౌత్య విధానాల్లో స్వేచ్ఛ (External Independence and Inter-nal Supremacy)ను కలిగి ఉంటుంది. ఏ బాహ్య శక్తీ మన విదేశాంగ విధానాన్ని నియంత్రించలేదు.

సామ్యవాదం (Socialist): ఈ పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చే­ర్చారు. సామ్యవాదం అంటే సమసమాజ స్థాపన. ప్రజల మధ్య ఆర్థిక అంతరాలను క్రమేణా తగ్గించడం. ఉత్పత్తి శక్తులను (Land, labour and capital) ప్రభుత్వం నియంత్రించడం ద్వారా సంపద కొద్ది మంది వ్యక్తుల చేతిలో కేంద్రీకృతం కాకుండా, సాధ్యమైనంత వరకు జాతీయం చేయడం. తద్వారా ప్రజలకు సమాన అవకాశాలతో పాటు వాటిని అందిపుచ్చుకోవడానికి అవసరమైన తోడ్పాటు అందిస్తారు.
సామ్యవాదానికి వివిధ రూపాలున్నాయి. కమ్యూనిజం, మావోయిజం, సిండికాలిజం, గిల్డ్‌ సోషలిజం, ఫెబియనిజం, స్టేట్‌ సోషలిజం మొదలైన రూపాలు వివిధ దేశాల్లో అమల్లో ఉన్నాయి. భారతదేశంలో ప్రజాస్వామ్యవాదం (Democra-tic Socialism) అమల్లో ఉంది. దీన్నే 'రాజ్యాంగ సామ్యవాదం' అంటారు. అంటే ఆర్థిక వ్యవస్థలో చట్టపరంగా నిర్దిష్ట పద్ధతిలో మార్పులు చేపడతారు. మన సామ్యవాదం గాంధీయిజం+మార్క్సిజంల మేలు కలయిక. కానీ గాంధీతత్వం వైపు కొంత మొగ్గు కనిపిస్తుంది. ప్రపంచీకరణ, ఆర్థిక ఉదారవాదం, ప్రైవేటీకరణ నేపథ్యంలో సామ్యవాదతత్వం మసక బారుతోందని చెప్పవచ్చు.

లౌకిక తత్వం (Secular): ఈ పదాన్ని కూడా 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చారు. లౌకిక రాజ్యం అంటే మత ప్రమే­యం లేని రాజ్యం. లౌకిక దేశాల్లో అధికార మతం, మత వివక్ష ఉండవు. మత విషయంలో పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం ఉంటాయి. మతపరంగా ఎవరికి ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం లేదా నష్టం వాటిల్లదు. అధికార మతం ఉన్న రాజ్యాలను మతస్వామ్య రాజ్యం (Theocratic State) అంటారు. 
ఉదా: పాకిస్తాన్, బంగ్లాదేశ్‌.

ప్రజాస్వామ్యం(Democracy): ప్రజాస్వామ్యం అంటే ప్రజలతో, ప్రజల కోసం, ప్రజల వల్ల ఏర్పా­టు చేసిన ప్రభుత్వం. అంటే ప్రజలే పాలితులు, పాలకులని అబ్రహం లింకన్‌ నిర్వచించారు. భారత్‌లో పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అమ­ల్లో ఉంది. ఎలాంటి వివక్ష లేకుండా కేవలం నిర్ణీత వయసున్న పౌరులందరికీ ఓటు హక్కు, ప్రభుత్వ పదవులకు పోటీ చేసే హక్కును కల్పించారు. పాలన చట్టపరంగా (Rule of law) జరుగుతుంది. చట్టబద్ధత లేకుండా ఏ చర్యా చెల్లుబాటు కాదు. సాధారణంగా ఏ వ్యక్తికీ ప్రత్యేక హోదా లేదా మినహాయింపు ఉండదు.

గణతంత్ర (Republic): 'గణం' అంటే ప్రజలు, తంత్రం అంటే పాలన. ఇది ప్రజాపాలన. వారసత్వ లేదా అధికార హోదాలు ఉండవు. భారత రాష్ట్రపతి, ఇతర ప్రజా పదవుల్లోని వ్యక్తులను నిర్ణీత కాలానికి ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటా­రు. లేదా పరోక్షంగా ఎన్నికవుతారు. బ్రిటిష్‌ రాణి/రాజు తరహాలో వారసత్వ అధికారం ఉండదు.

సామాజిక ఆశయాలు (Social Objectives): ప్రవేశికలో కొన్ని ఉదాత్తమైన ఆశయాలను పొందుపరిచారు. రాజ్యాంగం ద్వారా వాటిని సాకారం చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు.

చ‌ద‌వండి: Indian Polity Partition of India Notes: దేశ విభజనకు దారి తీసిన చట్టం ఏది?

న్యాయం

న్యాయం అంటే ఒక సర్వోన్నతమైన సమతా భావన. అసమానతలు, వివక్షలు లేని ఆదర్శ సమాజాన్ని నిర్మించడం. రాజ్యాంగంలో మూడు రకాల న్యాయాలను ప్రస్తావించారు.

రాజకీయ న్యాయం(Political Justice): రాజ్య కార్యకలాపాల్లో పౌరులంతా ఎలాంటి వివక్ష లేకుండా పాల్గొనడమే రాజకీయ న్యాయం. సార్వజనీన ఓటు హక్కు, పోటీ చేసే హక్కు, ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, విజ్ఞాపన హక్కు మొదలైనవి రాజకీయ న్యాయ సాధనకు ప్రాతిపదికలుగా పేర్కొనవచ్చు.

సామాజిక న్యాయం (Social Justice): సమాజంలో పౌరులంతా సమానులే. జాతి, మత, కుల, లింగ, పుట్టుక అనే తేడాలు లేకుండా అందరికీ సమాన హోదాను, గౌరవాన్ని కల్పించడమే సామాజిక న్యాయం. అన్ని రకాల సామాజిక వివక్షలను రద్దు చేయడం, సామాజికంగా వెనుకబడిన వర్గాలు, కులాలు, తెగల అభ్యున్నతికి కృషి చేయడం ఇందులో భాగం.

ఆర్థిక న్యాయం (Economic Justice): ఆర్థి­క అంతరాలను తగ్గించడం,సంపద ఉత్పత్తి, పంపిణీ, వృత్తి, ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు, పేదరిక నిర్మూలన, ఆకలి నుంచి విముక్తులను చేయడం. 

చ‌ద‌వండి: Indian Polity: రాష్ట్ర విధాన పరిషత్‌ బిల్లును తిరస్కరిస్తే..

ఉన్నత ఆదర్శాలు

స్వేచ్ఛ(Liberty): నిజమైన ప్రజాస్వామ్య రాజ్య స్థాపనకు, ఉదాత్త నాగరిక, సామాజిక జీవనానికి స్వేచ్ఛాయుత వాతావరణం అవసరం. స్వేచ్ఛ అంటే నిర్హేతుకమైన పరిమితులు, నిర్భంధాలు లేకుండా వ్యక్తి పరిపూర్ణ వికాసానికి అవసరమైన పరిస్థితులను కల్పించడం. ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, ఆరాధనలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛ ఉండాలి.
ఉదా: లౌకిక రాజ్య స్థాపనకు పునాది మత స్వేచ్ఛ.

సమానత్వం(Equality): ప్రజాస్వామ్యంలో అతి ముఖ్య ఆదర్శం సమానత్వం. అంటే అన్ని రకాల అసమానతలను, వివక్షలను రద్దు చేసి, ప్రతి వ్యక్తి వికాసానికి అవసరమైన అవకాశాలను కల్పించడం.

సౌభ్రాతృత్వం (Fraternity): సౌభ్రాతృత్వం అంటే సోదర భావం అని అర్థం. పౌరుల మధ్య సంఘీభావం, పరస్పర గౌరవం ఉండాలి. అసమానతలు, వివక్షలు లేనప్పుడు పౌరుల మధ్య సోదరభావం వర్థిల్లుతుంది. సార్వజనీన సోదర భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో సౌభ్రాతృత్వం అనే భావనను ప్రవేశికలో పొందుపరచాలని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ప్రతిపాదించారు.

ఐక్యత, సమగ్రత (Unity & integrity):
ఐక్యతా భావం దేశ ప్రజలు కలిసి ఉండేందుకు దోహదం చేస్తుంది. ఇది ఒక మానసిక ఉద్వేగం (Psychlological emotion). మతం, కులం, ప్రాంతం లాంటి సంకుచిత ఆలోచనలకు అతీతమైన ఆదర్శం. సమగ్రత అనే పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. సమగ్రత ప్రజల్లో జాతీయ దృక్ఫథాన్ని పెంపొందిస్తుంది.

సమగ్రతను చేర్చాల్సిన ఆవశ్యకత: 1970 తరువాత దేశంలో అనేక ప్రాంతాల్లో ప్రాంతీయవాదం, వేర్పాటువాదం తలెత్తాయి. దేశ సమగ్రతను దెబ్బతీసేలా మిలిటెంట్‌ పోరాటాలు జరిగాయి. ఈ నేపథ్యంలో సమగ్రత అనే పదాన్ని చేర్చాల్సిన పరిస్థితి అనివార్యమైంది.

చ‌ద‌వండి: Indian Polity Study Material: ద్విసభా పద్ధతి అమల్లో ఉన్న రాష్ట్రాలేవి?

ప్రవేశిక సవరణకు అతీతం కాదు

ఆర్టికల్‌ 368 ప్రకారం ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉందని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ప్రవేశిక రాజ్యాంగ మౌలిక నిర్మాణం అనే నిర్వచనం పరిధిలోకి వస్తుంది కాబట్టి దాని సారాంశం (Spirit) మార్చకుండా, ప్రాముఖ్యతను ద్విగుణీకృతం చేసేలా నిర్మాణాత్మకంగా సవరణలు చేయవచ్చని స్పష్టం చేసింది. అందువల్ల స్వరణ్‌ సింగ్‌ కమిటీ సిఫారసుల మేరకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం, లౌకికతత్వం, సమగ్రత అనే పదాలను చేర్చారు. ఇప్పటి వరకూ ఒకసారి మాత్రమే ప్రవేశికను సవరించారు.

చ‌ద‌వండి: Indian Polity Bit Bank

గతంలో వచ్చిన ప్రశ్నలు

Published date : 14 Mar 2023 05:35PM

Photo Stories