Entrance Exams: అన్ని యూనివర్సిటీలకు కలిపి ఒకే ప్రవేశ పరీక్ష: ఉన్నత విద్యామండలి చైర్మన్
Sakshi Education
రాష్ట్రంలోని 15 విశ్వవిద్యాలయాలలో నిర్వహిస్తున్న 144 పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంసీజే, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, ఎంఈడీ తదితర) కోర్సుల్లో ప్రవేశానికి మొట్టమొదటిసారిగా అన్ని విశ్వవిద్యాలయాలకు కలిపి ఏకీకృత సాధారణ ప్రవేశ పరీక్ష (ఏపీపీజీఈసెట్)ను నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య హేమచంద్రారెడ్డి తెలిపారు.
అన్ని యూనివర్సిటీలకు కలిపి ఒకే ప్రవేశ పరీక్ష: ఉన్నత విద్యామండలి చైర్మన్
ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఈ ఏకీకృత ప్రవేశ పరీక్ష వలన విద్యార్ధులు ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ఏ విశ్వవిద్యాలయంలో అయినా ప్రవేశం పొందడానికి వీలవుతుంది. దీని వలన విద్యార్థులకు సమయం, డబ్బు ఆదా అవుతాయి’ అని చైర్మన్ సూచించారు. ఇలా ఉండగా, ఈ ఏపీపీజీఈసెట్ దరఖాస్తు గడువును అక్టోబర్ 6 వరకు పొడిగించినట్లు ఆయన చెప్పారు. మరిన్ని వివరాలకు, దరఖాస్తు చేసుకోవడానికి ‘https://sche.ap.gov.in/APPGCET/UI/HomePages/Home’ వెబ్సైట్ను సందర్శించాలని పేర్కొన్నారు.