Skip to main content

China Protest: తిరగబడ్డ చైనా.. భారీగా వీధుల్లోకి వచ్చి నిరసనలు

కరోనా కట్టడి పేరుతో జిన్‌పింగ్‌ సర్కారు విధించిన మితిమీరిన ఆంక్షలపై చైనా ప్రజలు తిరగబడ్డారు. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ వీధుల్లోకి వెల్లువెత్తుతూ నిరసనలకు దిగుతున్నారు.

స్వేచ్ఛ కావాలంటూ నింగినంటేలా నినదిస్తున్నారు. పాలక కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా (సీపీసీ)కి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తక్షణం తప్పుకోవాలంటూ ముక్త కంఠంతో డిమాండ్‌ చేస్తున్నారు.  పలుచోట్ల యువతీ యువకులు నేరుగా పోలీసులతోనే బాహాబాహీ తలపడుతున్నారు. దేశవ్యాప్తంగా యూనివర్సిటీల క్యాంపస్‌లన్నీ నిరసన కేంద్రాలుగా మారుతున్నాయి. స్టూడెంట్లు కూడా భారీగా రోడ్లెక్కుతున్నారు. సోషల్‌ డిస్టెన్సింగ్‌ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లు తదితర అడ్డంకులన్నింటినీ బద్దలు కొడుతూ కదం తొక్కుతున్నారు. నిరసనకారులను పెద్ద సంఖ్యలో అరెస్టు చేస్తున్నా ఆందోళనలు నెమ్మదించడం లేదు. మతిలేని లాక్‌డౌన్‌ నిబంధనలను ఎత్తేయాలన్న డిమాండ్‌ దేశమంతటా ప్రతిధ్వనిస్తోంది.  మరోవైపు కరోనా కల్లోలం కూడా చైనాలో నానాటికీ పెరుగుతూనే వస్తోంది. 

Avian Flu: అమెరికాలో ఎవియన్‌ ఫ్లూ.. 5 కోట్ల కోళ్లు బలి
మార్మోగుతున్న షాంఘై.. 
కరోనా నేపథ్యంలో మూడేళ్లుగా ఏదో ఒక రూపంలో చైనాలో ఆంక్షలు కొనసాగుతూనే వస్తున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా మళ్లీ జీరో కొవిడ్‌ విధానం అమలవుతోంది. దీనిపై కొంతకాలంగా జనంలో పెల్లుబుకుతున్న వ్యతిరేకత  కట్టలు తెంచుకుంటోంది. అతి పెద్ద నగరమైన షాంఘై ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లపైకొచ్చి నిరసన ప్రదర్శనలకు దిగారు. సీపీసీకి, జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం మారాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ‘‘షాంఘైలో ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలను కల్లో కూడా ఊహించలేం! అలాంటిది ఇంత భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి రావడం, అధ్యక్షుడు దిగిపోవాలంటూ బాహాటంగా నినాదాలు చేయడం నమ్మశక్యంగా లేదు. ఇది మా జీవితకాలంలో ఎన్నడూ చూడనిది’’ అంటూ స్వయానా నిరసనకారులే ఆశ్చర్యానందాలకు లోనవుతున్నారు. బీజింగ్‌లోని ప్రతిష్టాత్మక సిన్‌గువా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ సెన్సార్‌షిప్‌కు వ్యతిరేకంగా తెల్ల కాగితాలను ప్రదర్శిస్తూ ప్రతీకాత్మకంగా నిరసన తెలుపుతున్నారు. మరోవైపు ఉరుంఖిలో వారం రోజులుగా జరుగుతున్న ఆందోళనల్లో కమ్యూనిస్టు ప్రభుత్వం చేతుల్లో ఏళ్లుగా తీవ్ర అణచివేతకు గురవుతున్న ఉయ్‌గర్‌ ముస్లింలు భారీగా పాల్గొంటున్నారు.

అగ్ని ప్రమాదానికి పదిమంది బలి 
కరోనా ఆంక్షలున్న చోట్ల ఇళ్లలోంచి జనం బయటికి రాకుండా అధికారులు బయటి నుంచి తాళాలు వేసి సీల్‌ చేస్తున్నారు. ఈ చర్య జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌ రాజధాని ఉరుంఖిలో పది మంది ఉసురు తీసింది. నవంబర్‌ 24వ తేదీ ఓ అపార్ట్‌మెంట్లో అగ్ని ప్ర‌మాదం సంభవించడంతో ఫ్లాట్లలో ఉన్న పది మంది ఎటూ తప్పించుకోలేక పొగకు ఉక్కిరిబిక్కిరై నిస్సహాయంగా చనిపోయారు. దీనిపై వెల్లువెత్తిన జనాగ్రహానికి వెరచి ఉరుంఖిలోనే గాక రాజధాని బీజింగ్‌తో పాటు పలుచోట్ల లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించాల్సి వచ్చింది. జీరో కోవిడ్‌ విధానంపై జనం నుంచి ఇంతటి ప్రతిఘటన ఎదురవుతుందని ప్రభుత్వం ఊహించలేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవలే పార్టీ నియమావళిని సవరించి మరీ వరుసగా మూడోసారి అధ్యక్షునిగా ఎన్నికైన జిన్‌పింగ్‌కు ఈ ఉదంతం అగ్నిపరీక్షగా మారింది.  

➤ మనిషిలో తొలిసారి బర్డ్‌ఫ్లూ వైరస్‌ను ఏ దేశంలో గుర్తించారు?

 

Published date : 28 Nov 2022 06:02PM

Photo Stories