Skip to main content

SKU University: కరువు సీమలో చదువుల సిరులు

సాక్షి ఎడ్యుకేష‌న్ : కరువు సీమలో కల్పతరువుగా భాసిల్లుతున్న శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఏర్పడి నేటితో 41 సంవత్సరాలు పూర్తయింది. 42వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 28న వర్సిటీ ఆవిర్భావ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో క్యాంపస్‌లో పండుగ వాతావరణం నెలకొంది.
SKU University Streams of studies in the drought zone
SKU University Streams of studies in the drought zone

ఎస్వీయూ పీజీ అధ్యయన కేంద్రంతో మొదలై..

అనంతపురం కేంద్రంగా 1967లో శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పీజీ సెంటర్‌గా ఏర్పాటై 1976లో అటానమస్‌ పీజీ సెంటర్‌గా గుర్తింపు దక్కించుకుంది. 1981లో ఎస్కేయూనివర్సిటీగా రూపాంతరం చెందింది. జ్ఞానం (విద్య), కర్మలు (పనులు) రెండింటినీ కలిపి తెలుసుకున్నవాడు కర్మల ద్వారా మరణాన్ని దాటి, జ్ఞానం ద్వారా అమర్‌ాత్వన్ని పొందుతాడనే ఈశావాస్యోపనిషత్తులో పేర్కొన్న 11వ శ్లోకం లోని ముక్తాయింపు ‘విద్యయామృతశ్నుతే’ను జోడించి వర్సిటీ లోగోను రూపొందించారు. 487 ఎకరాల సువిశాలమైన క్యాంపస్‌తో 1988 నాటికి పూర్తిస్థాయి వర్సిటీగా గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం క్యాంపస్‌లో 4,312 మంది విద్యార్థులతో పాటు రెండు అటానమస్‌ కళాశాలలున్నాయి. 112 అనుబంధ డిగ్రీ కళాశాలల్లో లక్ష మంది విద్యార్థులు డిగ్రీ కోర్సులు చేస్తున్నారు. 13 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 76 ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు, 11 బీఈడీ కళాశాలలు, 1 బీపీఈడీ, 1 లా కళాశాల, 10 ఎంబీఏ /ఎంసీఏ కళాశాలలు, 17 పీజీ కళాశాలలు ఉన్నాయి. ఇప్పటి వరకూ 3,113 మంది డాక్టరేట్‌ అవార్డులు అందుకున్నారు. 8 వేల అంతర్జాతీయ జర్నల్స్‌ ముద్రించారు. రూ.50 కోట్ల విలువైన ఇస్రో, డీఎస్‌టీ, డీబీటీ, యూజీసీ, నీతి అయోగ్‌ ప్రాజెక్ట్‌లు నిర్వహించారు. బోటనీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ అండ్‌ పాలిమర్‌సైన్సెస్‌ విభాగాల్లో గణనీయమైన పరిశోధనలు జరిగాయి.

Postpone All Exams: వానలు తగ్గేదాకా.. పరీక్షలన్నీ వాయిదా!

అంచలంచెలుగా అంతర్జాతీయ స్థాయికి..

వర్సీటీలో ఆర్ట్స్‌, సైన్స్‌ క్యాంపస్‌ కళాశాలలతో పాటు, ఇంజినీరింగ్‌, ఫార్మసీ, బీఈడీ కళాశాలలున్నాయి. ఎస్వీయూ పీజీ సెంటర్‌గా ఉన్నప్పుడే ఇంగ్లిష్‌, తెలుగు, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌, జువాలజీ, కామర్స్‌, లా, ఎకనామిక్స్‌, రూరల్‌డెవలప్‌మెంట్‌ కోర్సులు నిర్వహించారు. 1981లో ఇన్‌స్ట్రుమెంటేషన్‌, పాలిమర్‌ సైన్సెస్‌, స్టాటిస్టిక్స్‌ , హిస్టరీ కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చారు. 1982లో లైబ్రరీ సైన్సెస్‌, 1984లో పొలిటికల్‌ సైన్సెస్‌, జియాగ్రఫీ, 1985లో బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బోటనీ, సోషియాలజీ, అడల్డ్‌ ఎడ్యుకేషన్‌, 1986లో ఎంబీఏ, 1991లో ఎంపీఈడీ, 1994లో కంప్యూటర్‌ సైన్సెస్‌, 1998లో బయోటెక్నాలజీ, 2006లో ఇంజినీరింగ్‌ కళాశాల, 2007లో ఎడ్యుకేషన్‌ కళాశాల, 2008లో ఫార్మసీ కళాశాల, 2013లో హిందీ విభాగాలను ఏర్పాటు చేశారు. ఆర్ట్స్‌లో 13 విభాగాల్లో 18 పీజీ కోర్సులు, సైన్సెస్‌లో 16 విభాగాల్లో 19 పీజీ కోర్సులు, ఇస్రో ప్రాజెక్ట్‌, బొటానికల్‌ గార్డెన్‌, సైన్సెస్‌లో విదేశాల్లో పీడీఎఫ్‌లు, పటిష్టమైన, నాణ్యమైన పరిశోధనలు, దక్షిణ భారతదేశంలోనే తొలి అటల్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రం ఏర్పాటుతో ఎస్కేయూ జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. ఇస్రో ఆధ్వర్యంలో ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం ఏర్పాటుతో అంతర్జాతీయ స్థాయిలో వర్సిటీకి గుర్తింపు దక్కింది. ఈ నెల 28న నిర్వహించబోయే వర్సిటీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నత విద్యామండలి చైర్మన్‌ డాక్టర్‌ కె.హేమచంద్రారెడ్డి, విశిష్ట అతిథులుగా యూపీఎస్‌సీ మాజీ సభ్యుడు డాక్టర్‌ వై.వెంకట్రామిరెడ్డి, ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ వి.పద్మనాభరెడ్డి, జేఎన్‌టీయూ(ఏ)వీసీ జింకా రంగజనార్ధన, రాయలసీమ వర్సిటీ వీసీ ఎ.ఆనందరావు, యోగివేమన వర్సిటీ వీసీ సి.సుధాకర్‌, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి హాజరుకానున్నారు. కార్యక్రమానికి ఎస్కేయూ వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించనున్నారు. ఉదయం 10:30 గంటలకు నిర్వహిస్తున్న స్పోర్ట్స్‌ డే కార్యక్రమానికి అనంతపురం రేంజ్‌ డీఐజీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సాయంత్రం 5:30 గంటలకు ఆడిటోరియంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

Published date : 27 Jul 2023 01:53PM

Photo Stories