Women's IPS Success Story : పెళ్లి తర్వాత కూడా ఐపీఎస్ కొట్టారిలా.. ఇప్పుడంతా వీళ్లదే హవా..
![A Veeravanita IPS officer in uniform., A married woman successfully cracking the UPSC Civil Services Exam., IPS Success Stories in Telugu,A determined woman studying for UPSC Civil Services Exam.,](/sites/default/files/images/2023/10/27/upsc-civils-ranekers-succcess-story-telugu-1698377913.jpg)
తాజాగా హైదరాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ(ఎస్వీపీఎన్పీఏ)లో తొలి విడత ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకుని అక్టోబర్ 27వ తేదీన పరేడ్కు సిద్ధమవుతున్న 75వ బ్యాచ్లో శిక్షణ పొందిన 155 మంది ప్రొబేషనర్లలో 24 శాతం(73వ బ్యాచ్లో పెళ్లయిన వారు 20%, 74లో 22%) మంది వివాహితులే కావడం దానికి నిదర్శనం. ఈసారి పరేడ్కు అనుష్తా కాలియా కమాండర్గా వ్యవహరించనున్నారు.
☛ Women IPS Success Stories : యూట్యూబ్లో వీడియోలు చూసి యూపీఎస్సీ సివిల్స్ కొట్టానిలా.. కానీ..
వివాహితుల సంఖ్య ఏటా పెరుగుతూ..
యూపీఎస్సీ సివిల్స్ కల నెరవేర్చుకోవాలంటే పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నించాల్సిందే. ఏళ్ల తరబడి శ్రమించడంతోపాటు ఏకాగ్రత కూడా అవసరమే. అయినా సరే వివాహానంతరం కూడా కొందరు అంత సమయమూ వెచ్చించి.. అకుంఠిత దీక్షతో ఆ కలను సాకారం చేసుకుంటున్నారు. అలా ఐపీఎస్ సాధిస్తున్న వివాహితుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది కూడా.
75వ ఐపీఎస్ బ్యాచ్లో తొలుత 187 మంది ఎంపికయ్యారు. వారిలో 12 మంది ఐఏఎస్లుగా ఎంపికై శిక్షణ మధ్యలోనే వెళ్లిపోయారు. మరో 20 మంది రాయల్ భూటాన్, మాల్దీవియన్, నేపాల్ పోలీస్ ఆఫీసర్, మారిషస్ పోలీస్ ఫోర్స్కు చెందినవారు. ఈ దఫా శిక్షణ పొందిన ఐపీఎస్ ప్రొబేషనర్ల సగటు వయసు 28 కాగా, 25 ఏళ్ల లోపు మహిళలు ముగ్గురు, పురుషులు ఆరుగురు ఉన్నారు. 25-28 ఏళ్లలోపు మహిళలు 19 మంది, పురుషులు 61 మంది ఉన్నారు.
ఈ రాష్ట్రం నుంచే అత్యధికం
మొత్తం ఐపీఎస్ ప్రొబేషనర్లలో 123 మంది పురుషులు, 32 మంది మహిళలు ఉన్నారు. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 23 మంది ఎంపిక కాగా, తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్లలో 21 మంది చొప్పున ఉన్నారు.ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరుగురు(ఒక మహిళ), తెలంగాణ నుంచి అయిదుగురు(ఇద్దరు మహిళలు) ఉన్నారు. వీరిలో తెలంగాణ కేడర్కు తొమ్మిది మంది(ముగ్గురు మహిళలు), ఆంధ్రప్రదేశ్ కేడర్కు అయిదుగురు(ఒక మహిళ) ఎంపికయ్యారు.
ఇప్పుడంతా ఇంజనీర్లదే హవా..
![women ips success story in telugu](/sites/default/files/inline-images/women%20ips%20success%20story%20in%20telugu_0.jpg)
ఇప్పుడంతా ఇంజనీర్ల హవా నడుస్తోంది. గతంలో అయితే సివిల్స్ అంటేనే హిస్టరీ, జాగ్రఫీ, ఆంత్రోపాలజీ, ఆర్ట్స్, మొదలైన సబ్జెక్టులు చదివిన వారిదే పైచేయి. కానీ ట్రెండ్ మారింది. 75వ ఐపీఎస్ బ్యాచ్లో మొత్తం 155 మంది కెడేట్లకుగాను.. 102 మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు కావడం ఇందుకు నిదర్శనం. ఆర్ట్స్(17), సైన్స్(12), కామర్స్(10), ఎంబీబీఎస్(9), న్యాయశాస్త్రం(3), ఇతర సబెక్టులు(2) చదివిన వారు ఉన్నారు.