Skip to main content

NEST, CEBS: ఇంటర్‌తోనే ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీలో ప్రవేశాలు.. పరీక్ష విధానం, అర్హతలు, విజయానికి మార్గాలు ఇలా..

ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ.. ఇంటర్‌తోనే పీజీకి మార్గం! భవిష్యత్తులో పీహెచ్‌డీ, పరిశోధనల దిశగా.. సమర్థవంతంగా రాణించేందుకు చక్కటి అవకాశం!! ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీని.. దేశంలోని ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌లో చదివే వీలు కల్పిస్తోంది.. నెస్ట్‌(నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌). అయిదేళ్ల ఈ ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులో చేరితే.. స్కాలర్‌షిప్, ఇతర ఆర్థిక ప్రోత్సాహకాలు సైతం లభిస్తాయి! నెస్ట్‌లో ర్యాంకు ఆధారంగా సైన్స్‌ ఎడ్యుకేషన్‌లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన.. నైసర్, ముంబై యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌లలో.. ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీలో చేరొచ్చు. తాజాగా.. నెస్ట్‌–2022కు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. నెస్ట్‌ ప్రాధాన్యత, పరీక్ష విధానం, అర్హతలు, విజయానికి మార్గాల గురించి తెలుసుకుందాం...
NEST Notification Released
NEST Notification Released
  • ఇంటర్‌తోనే నైసర్, సీఈబీఎస్‌లో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీలో ప్రవేశానికి నెస్ట్‌
  • ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు అర్హులుగా నెస్ట్‌–2022 నోటిఫికేషన్‌ వెల్లడి
  • ప్రవేశం ఖరారు చేసుకుంటే స్కాలర్‌షిప్, ఇతర ఆర్థిక ప్రోత్సాహకాలు
  • కోర్సు వ్యవధిలోనే పరిశోధనలపై ఆసక్తిగలిగేలా బోధన విధానాలు

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌.. సంక్షిప్తంగా.. నైసర్‌. జాతీయ స్థాయిలో సైన్స్‌ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌ కార్యకలాపాల కోణంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్‌స్టిట్యూట్‌గా గుర్తింపు. అదే విధంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌.. కేంద్ర ప్రభుత్వ ఆధ్యరంలో యూనివర్సిటీ ఆఫ్‌ ముంబై క్యాంపస్‌లో ఏర్పాటైన ఇన్‌స్టిట్యూట్‌. ఈ రెండు ఇన్‌స్టిట్యూట్‌లకు సైన్స్‌ విభాగాల్లో ఉన్నత విద్య, రీసెర్చ్‌ దిశగా ఎంతో గుర్తింపు ఉంది. ఈ విద్యాసంస్థలు ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశానికి ప్రతి ఏటా నెస్ట్‌ (నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌) పేరుతో పరీక్ష నిర్వహించి.. అందులో ర్యాంకు ఆధారంగా సీట్లు ఖరారు చేస్తున్నారు.

నెస్ట్‌కు అర్హత

  • అర్హత: సైన్స్‌ గ్రూప్‌లతో 2020, 2021, 2022లో ఇంటర్మీడియెట్‌ తత్సమాన కోర్సులో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 2022లో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • వయసు: ఆగస్ట్‌ 1, 2002 తర్వాత జన్మించి ఉండాలి.

ప్రవేశం లభించే ప్రోగ్రామ్‌లు

నెస్ట్‌ ద్వారా బయలాజికల్‌ సైన్సెస్‌; కెమికల్‌ సైన్సెస్‌; మ్యాథమెటిక్స్‌; ఫిజిక్స్‌లలో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశం లభిస్తుంది. అభ్యర్థులు ఇంటర్మీడియెట్‌లో తాము చదివిన గ్రూప్‌ సబ్జెక్ట్‌లు లేదా నెస్ట్‌లో బెస్ట్‌ స్కోర్‌ సాధించిన సెక్షన్‌ల ఆధారంగా ఈ స్పెషలైజేషన్లను ఎంచుకోవచ్చు.


చ‌ద‌వండి: After Inter: ఇంటర్మీడియెట్‌ తర్వాత.. ఏకకాలంలో డిగ్రీతోపాటు పీజీ పూర్తి..

రెండు ఇన్‌స్టిట్యూట్‌లు.. 257 సీట్లు

నెస్ట్‌ ద్వారా ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశం కల్పిస్తున్న నైసర్‌–భువనేశ్వర్, సీఈబీఎస్‌–యూనివర్సిటీ ఆఫ్‌ ముంబై క్యాంపస్‌లలో మొత్తం 257 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నైసర్‌–భువనేశ్వర్‌లో 200, సీఈబీఎస్‌లో 57 సీట్లు ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి అభ్యర్థులు నెస్ట్‌ ర్యాంకు ఆధారంగా వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులు, అభ్యర్థులు పొందిన నెస్ట్‌ ర్యాంకు, రిజర్వేషన్‌ నిబంధనలను పరిగణనలోకి తీసుకొని సీటు ఖరారు చేస్తారు. కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత నైసర్‌లో సీటు పొందిన విద్యార్థులకు నైసర్‌ నుంచి; సీఈబీఎస్‌లో చేరిన విద్యార్థులకు యూనివర్సిటీ ఆఫ్‌ ముంబై నుంచి సర్టిఫికెట్లు అందిస్తారు.

స్కాలర్‌షిప్‌

  • ఈ రెండు ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తున్నారు. 
  • ఇన్‌స్పైర్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి నేరుగా ఇన్‌స్పైర్‌ స్కాలర్‌షిప్‌ పేరుతో నెలకు రూ.5,000 స్కాలర్‌షిప్‌ అందుతుంది.
  • ఇన్‌స్పైర్‌ స్కాలర్‌షిప్‌ లేని వారికి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రవేశ పెట్టిన దిశ ప్రోగ్రామ్‌ ద్వారా నెలకు రూ.5000 స్కాలర్‌షిప్‌ లభిస్తుంది. 
  • దీంతోపాటు ప్రతి ఏటా సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ కోసం రూ.20 వేలు గ్రాంట్‌ మంజూరు చేస్తారు.

నెస్ట్‌.. 200 మార్కులు

  • నెస్ట్‌ ఎంట్రన్స్‌ను పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్ట్‌ టెస్ట్‌గా నిర్వహిస్తారు. మొత్తం రెండు సెషన్లుగా పరీక్షను నిర్వహిస్తారు. అభ్యర్థులు ఏదో ఒక సెషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. 
  • పరీక్షను నాలుగు సెక్షన్లుగా 200 మార్కులకు నిర్వహిస్తున్నారు. బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 50 మార్కులు కేటాయించారు. అభ్యర్థులు నాలుగు సెక్షన్లలో మూడు సెక్షన్లు ఎంచుకునే అవకాశం ఉంది. నాలుగు సెక్షన్లు కూడా రాయొచ్చు. మెరిట్‌ లిస్ట్‌ రూపకల్పనలో.. నాలుగు సెక్షన్లలో అత్యధిక మార్కులు సాధించిన మూడు సెక్షన్లనే పరిగణనలోకి తీసుకుని.. అందులో పొందిన మార్కులను గణించి మెరిట్‌ లిస్ట్‌ రూపొందిస్తారు. 
  • ప్రతి సెక్షన్‌లోనూ కొన్ని ప్రశ్నలకు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.
  • కొన్ని ప్రశ్నలు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలతో ఉంటాయి.

కనీస అర్హత మార్కులు

  • నెస్ట్‌లో స్కోర్‌ ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌లో చోటు కల్పించే క్రమంలో ప్రతి సెక్షన్‌లోనూ అభ్యర్థులు పొందాల్సిన కనీస అర్హత మార్కులను నిర్దేశించారు. 200 మార్కులకు నిర్వహించే పరీక్షలో అభ్యర్థులు ఎక్కువ మార్కులు పొందిన మూడు సెక్షన్లనే పరిగణనలోకి తీసుకుని 150 మార్కుల ప్రాతిపదికగా మూల్యాంకన చేస్తారు.
  • ప్రతి సెక్షన్‌లోనూ బెస్ట్‌–100 స్కోర్స్‌ నుంచి సగటును లెక్కించి.. అందులో 20 శాతాన్ని కనీస అర్హత మార్కులుగా పేర్కొన్నారు. ఉదాహరణకు ఫిజిక్స్‌ విభాగంలో 50 మార్కులకు గాను బెస్ట్‌–100 స్కోర్స్‌ సగటు 40 మార్కులుగా ఉంటే.. అందులో 20 శాతం మార్కులను(8 మార్కులను) ఈ సెక్షన్‌కు సంబంధించి కనీస అర్హత మార్కులుగా నిర్దేశిస్తారు.
  • విద్యార్థుల మెరిట్‌ లిస్ట్‌ రూపకల్పనలో సెక్షన్‌వారీగా కనీస అర్హత మార్కుల నిబంధన మాత్రమే కాకుండా.. కనీస అడ్మిషబుల్‌ పర్సంటైల్‌ పేరుతో ఓవరాల్‌ కటాఫ్‌ను కూడా నిర్దేశిస్తున్నారు. 
  • జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 95 పర్సంటైల్, ఓబీసీ అభ్యర్థులు 90 పర్సంటైల్, ఎస్‌సీ, ఎస్టీ, దివ్యాంగుల కేటగిరీ అభ్యర్థులు 75 పర్సంటైల్‌ సాధించాల్సి ఉంటుంది.


చ‌ద‌వండి: After Inter: ఇంటర్‌తోనే.. ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు..

పరిశోధనలకు మార్గం

ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీలో ప్రవేశం పొందిన విద్యార్థులు.. ఐదేళ్ల వ్యవధిలో పది సెమిస్టర్లుగా కోర్సు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పది సెమిస్టర్లలోనూ.. ఆరు సెమిస్టర్లలో సదరు క్యాంపస్‌లోని ఫ్యాకల్టీ చేస్తున్న పరిశోధనల్లో తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుంది. దీని ఆధారంగానూ అభ్యర్థులకు మార్కులు, క్రెడిట్స్‌ కేటాయిస్తారు. ఇలాంటి నిబంధనతో విద్యార్థులు పీజీ స్థాయిలోనే రీసెర్చ్‌ దిశగా ఆసక్తిని పెంచుకునే అవకాశం లభిస్తోంది. రీసెర్చ్‌ కార్యకలాపాలపై అవగాహన పెరుగుతోంది. మొత్తంగా ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీలో చేరిన విద్యార్థులకు పరిశోధన నైపుణ్యాలు అందించేలా కోర్సు బోధన కొనసాగుతుంది.

బార్క్‌లో నేరుగా ఇంటర్వ్యూకి!

నెస్ట్‌ స్కోర్‌తో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీలో చేరి.. కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులు ప్రతిష్టాత్మక పరిశోధన కేంద్రం బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ట్రైనింగ్‌ స్కూల్‌లో ప్రవేశానికి నేరుగా ఇంటర్వ్యూకి హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం అభ్యర్థులు ఎమ్మెస్సీ కోర్సులో నిర్దిష్ట మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ మార్కులను ప్రతి ఏటా బార్క్‌ నిర్దేశిస్తుంది.

కెరీర్‌ స్కోప్‌

  • నైసర్‌–భువనేశ్వర్, యూనివర్సిటీ ఆఫ్‌ ముంబై–డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌లో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ పూర్తి చేసిన వారికి పీహెచ్‌డీ ప్రవేశాల్లోనూ ప్రాధాన్యత లభిస్తుంది.
  • ఈ ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి భవిష్యత్తులో రీసెర్చ్‌ ల్యాబ్స్, సంస్థల ఆర్‌ అండ్‌ డీ సెంటర్లలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. 
  • ఈ అర్హతతో పీహెచ్‌డీలో ప్రవేశం పొంది.. దాన్ని పూర్తి చేస్తే యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీగా, ప్రముఖ రీసెర్చ్‌ సంస్థల్లో సైంటిస్ట్‌లుగా రూ.లక్షల వేతనంతో కెరీర్‌ సొంతం చేసుకోవచ్చు.

నెస్ట్‌లో విజయం సాధించాలంటే

  • నెస్ట్‌లో విజయం సాధించాలంటే విద్యార్థులు ప్రధానంగా ఇంటర్మీడియెట్‌ స్థాయిలో తాము చదివిన అకడమిక్స్‌పై పూర్తి అవగాహనతో అడుగులు వేయాలి. 
  • ప్రధానంగా..బయాలజీ,కెమిస్ట్రీ,మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌ విభాగాలకు సంబంధించి అడిగే ప్రశ్నలు.. విద్యార్థుల్లోని విశ్లేషణాత్మక దృక్పథం, సంగ్రహణ సామర్థ్యం, తులనాత్మక విశ్లేషణను గుర్తించేలా ఉంటాయి.కాబట్టి విద్యార్థులు ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలి. దాంతోపాటు వాస్తవ పరిస్థితుల్లో అన్వయించగలిగే నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఇందుకోసం చదువుతున్న అంశాలను ప్రాక్టీస్‌ చేయడం ఎంతో లాభిస్తుంది.
  • గత ప్రశ్న పత్రాలను సాధన చేయడం ద్వారా పరీక్షలో అడుగుతున్న ప్రశ్నల తీరుపైనా స్పష్టమైన అవగాహన లభిస్తుంది. 

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలతో మేలు

  • నెస్ట్‌ ఎంట్రన్స్‌.. విభాగాల వారీగా సిలబస్‌కు సంబంధించి గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే.. ప్రశ్నలు సీబీఎస్‌ఈ సిలబస్‌ ఆధారంగా అడుగుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు పది, పదకొండు, పన్నెండు తరగతుల సీబీఎస్‌ఈ పుస్తకాలను అవపోసన పట్టడం మంచిది. ముఖ్యంగా కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలి.
  • ఇలా అకడమిక్‌ సబ్జెక్ట్‌లపై కాన్సెప్ట్‌లతోపాటు అప్లికేషన్‌ దృక్పథంతో ప్రిపరేషన్‌ సాగిస్తే నెస్ట్‌లో విజయావకాశాలు మెరుగవుతాయి. జేఈఈ–మెయిన్, జేఈఈ–అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు అదే సన్నద్ధతతో నెస్ట్‌కు కూడా హాజరై ప్రతిభ చూపే అవకాశం ఉంది.


చ‌ద‌వండి: Inter Special: ఎంపీసీ.. అకడమిక్‌ సిలబస్‌తోపాటే పోటీ పరీక్షలకూ ప్రిపరేషన్‌!!
​​​​​​​
ముఖ్య తేదీలు

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 18.05.2022
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం:  జూన్‌ 6, 2022
  • నెస్ట్‌ పరీక్ష తేదీ: జూన్‌ 18, 2022
  • ఫలితాల వెల్లడి: జూలై 5, 2022
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.nestexam.in


చ‌ద‌వండి: Study Material

Published date : 07 Mar 2022 05:41PM

Photo Stories