Skip to main content

కేంద్ర బడ్జెట్ 2013-14

ఒకవైపు దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి.. మరో వైపు ఏడాదిలో ఎన్నికలు.. వీటి మధ్య సమన్వయం సాధించేలా బడ్జెట్ ఉంటుందని అందరూ ఆశించారు. కానీ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు మన చిదంబరం. మొత్తం రూ. 16.65 లక్షల కోట్ల బడ్జెట్‌లో.. ఆహార భద్రత బిల్లు కోసం రూ. 10,000 కోట్లు పక్కన పెట్టామని చెప్పటమే కాస్తంత ఊరటనిచ్చే విషయంగా ఉంది. అయితే.. ఆ బిల్లు చట్టమై ఆహార భద్రత ఎప్పటికి లభిస్తుందో ఎవరికి తెలుసు! అయితే మహిళల సాధికారత, వారి భద్రత కోసం.. 1,000 కోట్లతో ‘నిర్భయ నిధి’ని ఏర్పాటు చేయడం, మరో వెయ్యి కోట్లతో మహిళా బ్యాంకు నెలకొల్పుతామనడం, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా యువతకు శిక్షణనివ్వడానికి చర్యలు చేపట్టడం ప్రధనంగా కన్పించే అంశాలు. నగదు బదిలీ, మదుపు దారులకు పన్ను ప్రోత్సాకాహాలు వంటి పలు హామీలతో ఫిబ్రవరి 28న పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవే శపెట్టారు. ఈ హామీలన్నీ నెరవేరతాయో లేదో తెలీదు కానీ పోటీ పరీక్షల్లో మాత్రం బడ్జెట్ మీద ప్రశ్నలు తప్పకుండా వస్తాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమగ్ర సమాచారం మీ కోసం....

భారత ఆర్థిక వ్యవస్థ- సవాళ్లు
8 శాతం వృద్ధి సాధించడమనేది భారత్ ముందున్న అతి పెద్ద సవాల్. 2011లో 3.9 శాతంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2012లో 3.2 శాతానికి పడిపోవడమే మన ఆర్థిక వ్యవస్థ మందగమనానికి కారణం. ప్రపంచంలో చైనా, ఇండోనేషియాలే భారత్ కంటే వేగంగా వృద్ధిని నమోదు చేస్తున్నాయి. 2013-14లో చైనా మాత్రమే ఇండియా కంటే వేగంగా వృద్ధిని నమోదు చేయగలదని అంచనా. 2004-08, 2009-10, 2010-11 లో మన వృద్ధి రేటు 8 శాతం. వీటిలో కొన్ని సార్లు 9 శాతం వృద్ధి కూడా నమోదయింది. 11వ ప్రణాళికలో సరాసరిన 8 శాతం వృద్ధిరేటు నమోదయింది. ఇది అన్ని ప్రణాళికల్లో కంటే ఎక్కువ. అధిక వృద్ధి అనేది సహకారం, సమన్వయంతోనే సాధ్యం. మానవ వనరుల అభివ
ృద్ధి ముఖ్యంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు, ఇతర వెనుకబడిన తరగతుల్లో అభివృద్ధి జరిగితే సమ్మిళిత వృద్ధి జరిగినట్లేనని ప్రభుత్వం భావిస్తోంది.

బడ్జెట్ సమగ్ర స్వరూపం(రూ. కోట్లలో)
2012-13(సవరించిన) 2013-14(ప్రతిపాదిత)
1) రెవెన్యూ వసూళ్లు 871828 1056331
2) పన్ను ఆదాయం 742115 884078
3) పన్నేతర ఆదాయం 129713 172252
4) మూల ధన వసూళ్లు 558998 608967
5) రుణాల రికవరీ 14073 10654
6) ఇతర వసూళ్లు 24000 55814
7) అప్పులు ఇతరత్రాలు 520925 542499
8) మొత్తం వసూళ్ళు 1430825 1665297
9) ప్రణాళికేతర వ్యయం 1001638 1109975
10) రెవెన్యూ ఖాతా 919699 992908
11) వడ్డీ చెల్లింపులు 316674 370684
12) మూలధన ఖాతా 81939 117067
13) ప్రణాళికా వ్యయం 429187 555322
14) రెవెన్యూ ఖాతా 343373 443260
15) మూలధన ఖాతా 85814 112062
16) మొత్తం వ్యయం 1430825 1665297
17) రెవెన్యూ వ్యయం 1263072 1436169
18) మూలధన ఆస్తులకోసం కేటాయించిన గ్రాంటులు 124275 174656
19) మూల ధన వ్యయం 167753 229129
20) రెవెన్యూ లోటు 391245(3.9%) 379838(3.3%)
21. ద్రవ్యలోటు 520925(5.2%) 542499(4.8%)
22. ప్రాథమిక లోటు 204251(2.0%) 171814(1.5%)


మొత్తం రెవెన్యూ వ్యయం నుంచి మొత్తం రెవెన్యూ వసూళ్లను తీసేస్తే రెవెన్యూ లోటు వస్తుంది.
మొత్తం వ్యయం నుంచి మొత్తం రెవెన్యూ వసూళ్లు, రుణాల రికవరీ, ఇతర వసూళ్లు తీసేస్తే ద్రవ్యలోటు వస్తుంది.
మొత్తం ద్రవ్యలోటు నుంచి వడ్డీ చెల్లింపులు తీసేస్తే ప్రాథమిక లోటు వస్తుంది.

కొన్ని ప్రధాన రంగాలు- కేటాయింపులు(కోట్లలో)
1. సాంఘిక సేవా రంగాలు 1,93,043
2. శక్తి, వనరలు 1,58,287
3. రవాణా 1,33,488
4. గ్రామీణాభివృద్ధి 56,438
5. పరిశ్రమలు, గనులు 48,010
6. సాధారణ ఆర్థిక సేవలు 31,602
7. వ్యవసాయం 18,781
8. సైన్స్ అండ్ టెక్నాలజీ, వాతావరణం 17,587
9. కమ్యూనికేషన్స్ 12,380
10. ఇతర సేవలు 9,307


బడ్జెట్ ప్రధానాంశాలు

వ్యవ‘సాయానికి’ రూ.27,049 కోట్లు
  1. 2013-14 ఆర్థిక సంవత్సరానికిగాను వ్యవసాయ రంగానికి రూ.27,049 కోట్లు కేటాయించారు. ఇది 2012-13లో కేటాయించిన రూ.20,208 కోట్ల కంటే 22 శాతం అధికం.
  2. ఈ ఏడాది పంట రుణాల లక్ష్యం రూ. 7 లక్షల కోట్లు. కిందటేడాది అది రూ.5.75 లక్షల కోట్లు. ఇక నుంచి రైతులకు ప్రైవేటు బ్యాంకుల నుంచి రుణం అందే అవకాశం ఉంది.
  3. జాతీయ ఆహార భద్రత చట్టం తీసుకువచ్చేందుకు కేంద్రం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఆహార భద్రతకు రూ.10 వేల కోట్లు కేటాయించారు.
  4. ‘గ్రీన్ రెవల్యూషన్’ విస్తరణలో భాగంగా అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు రూ.1,000 కోట్లు కేటాయించారు.
  5. సన్న, చిన్నకారు రైతులకు సాగునీటి సదుపాయం కల్పించడం కోసం ‘సమగ్ర వాటర్‌షెడ్ పథకం’ కింద రూ.5,387 కోట్లు కేటాయించారు.
  6. జార్ఖండ్ రాజధాని రాంచీలో అగ్రికల్చర్ బయోటెక్నాలజీ సంస్థ ఏర్పాటు చేయనున్నారు.
  7. పంటల సంరక్షణపై పరిశోధనల కోసం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్’ సంస్థ ఏర్పాటు
  8. పంచాయతీల సహకారంతో గోదాముల నిర్మాణం, నిల్వ సదుపాయాల కల్పన కోసం నాబార్డ్‌కు రూ.5 వేల కోట్లు కేటాయించారు.
  9. వ్యవసాయ పరిశోధనలకు రూ.3,415 కోట్లు
  10. పంటల మార్పిడి దిశగా రైతులను ప్రోత్సహించేందుకు రూ.500 కోట్లు
  11. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకానికి రూ.9,954 కోట్లు, జాతీయ ఆహార భద్రత మిషన్‌కు రూ.2,250 కోట్లు కేటాయించారు
  12. కొబ్బరి తోటల అభివృద్ధి కోసం కేరళలోని కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాతిపదికన చేపట్టిన పథకాన్ని ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించనున్నారు.
  13. చిన్న రైతులకు రూ.100 కోట్లతో రుణ హమీ నిధి ఏర్పాటు చేయనున్నారు
  14. రూ.307 కోట్లతో పశుగణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేస్తారు.
  15. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్‌ను ఏర్పాటు చేయడానికి రూ. 307 కోట్లు కేటాయించారు.
  16. 2012-13లో ఆహార ఉత్పత్తులు 25 కోట్ల టన్నులకు పైగా వస్తాయని అంచనా.
రక్షణ రంగానికి రూ. 2,03,672 కోట్లు
  1. 2013-14 బడ్జెట్‌లో రక్షణకు రూ. 2,03,672 కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది కంటే 14 శాతం అంటే రూ.25,169 కోట్లు ఎక్కువ.
  2. 126 బహుళ వినియోగ ‘రాఫేల్’యుద్ధ విమానాలు, 22 అపాచీ యుద్ధ హెలికాప్టర్లు, భారీ బరువులు తరలించే 15 చైనూక్ హెలికాప్టర్లు కొనుగోలుకు రూ.25 వేల కోట్ల కేటాయించారు.
  3. రిటైర్డ్ భద్రతా సిబ్బంది పింఛన్లకు రూ.44,500 కోట్లు, భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ)కు రూ.5,500 కోట్లు కేటాయించారు.
  4. జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రానికి (ఎన్‌సీటీసీ)సంబంధించి ఎలాంటి నిధులూ కేటాయించలేదు.
  5. నక్సల్స్ వేటలో ముందున్న అతిపెద్ద పారామిలటరీ బలగం సీఆర్‌పీఎఫ్‌కు హోం నిధుల్లో సింహభాగం రూ.10,496.53 కోట్లు కేటాయించారు. బీఎస్‌ఎఫ్‌కు 9,811.46 కోట్లు, అస్సాం రైఫిల్స్‌కి 3,297.68 కోట్లు, ఐటీబీపీకు 2,726.73 కోట్లు కేటాయించారు.
  6. తాజా బడ్జెట్‌లో సీబీఐకి స్వల్పంగా పెంచి రూ.461.66 కోట్లు కేటాయించారు.
  7. విమానాలు, ఏరో ఇంజన్ల కోసం రూ.33 వేల కోట్లు కేటాయించారు.
విద్యకు 65,867 కోట్లు
  1. విద్యా రంగానికి 65, 867 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కంటే 17 శాతం అధికం.
  2. సర్వశిక్షా అభియాన్‌కు రూ. 27,258 కోట్లు కేటాయించారు.
  3. పాఠశాల విద్యాశాఖకు రూ. 49,659 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు రూ. 16,198 కోట్లు కేటాయించారు.
  4. మాధ్యమిక విద్యను అందరికి అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ కార్యక్రమానికి ఈ బడ్జెట్‌లో రూ. 3,983 కోట్లు కేటాయించారు.
  5. ఎడ్యుకేషన్ సెస్ 3 శాతం కొనసాగుతుంది.
ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖకు రూ. 37,330 కోట్లు
  1. తాజా బడ్జెట్‌లో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ. 37,330 కోట్లు కేటాయించారు.
  2. గ్రామీణ మిషన్, ప్రతిపాదిత పట్టణ ఆరోగ్య మిషన్‌లను అనుసంధానించి కొత్తగా ఏర్పాటుచేసే జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ.21,239 కోట్లు ఇచ్చారు. (పల్లెల్లో నివసించే జనాభాకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించటం గ్రామీణ మిషన్ లక్ష్యం)
  3. వైద్య విద్య, శిక్షణ, పరిశోధనలకు రూ. 4,724 కోట్లు కేటాయించారు.
  4. జాతీయ వృద్ధుల సంరక్షణ పథకం రూ. 150 కోట్లు(దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 100 జిల్లాల్లో అమలు)
  5. అయుష్ విభాగానికి రూ. 1,069 కోట్లు, ఎయిమ్స్ అనుబంధ కళాశాలలు, ఆస్పత్రులకు 1,650 కోట్లు కేటాయించారు.
  6. జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకానికి(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) రూ. 600 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కింద రాష్ట్రానికి రూ.1,700 కోట్లు మంజూరయ్యాయి.
క్రీడలు, యువజన సంక్షేయ మంత్రిత్వ శాఖకు 1294 కోట్లు
  1. ఈసారి బడ్జెట్‌లో క్రీడలకు కొద్దిగా ప్రాధాన్యత ఇచ్చారు. గతం కంటే 214 కోట్లు పెంచి మొత్తం 792.72 కోట్లు కేటాయించారు.
  2. యువజన సంక్షేమ పథకాలకు రూ. 301 కోట్లు కేటాయించారు.
  3. దేశంలో క్రీడా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (పాటియాల)లో కోచ్‌లకు శిక్షణ ఇవ్వడానికి 250 కోట్లు కేటాయించారు.
  4. ఇతర పథకాల కింద సిక్కీం, నార్తన్ ఈస్ట్రన్ ప్రాంతాల వారికి ప్రయోజనం చేకూర్చే విధంగా రూ. 109.40 కోట్లు కేటాయించారు.
  5. ఈ బడ్జెట్‌లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) అత్యధికంగా రూ. 326 కోట్లు అందుకోనుంది.
  6. జాతీయ క్రీడా సమాఖ్యల సహాయార్థం రూ. 160 కోట్లు ఇచ్చారు.
మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.1,74,374 కోట్లు
  1. మహిళలకు బడ్జెట్ కింద రూ.97,134 కోట్లు, శిశు సంక్షేమం కోసం రూ.77,236 కోట్లు కేటాయించారు.
  2. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రూ.3,511 కోట్లు కేటాయించారు.
  3. మహిళ, శిశు అభివృద్ధి శాఖ నేతృత్వంలోని సమీకృత శిశు అభివృద్ధి పథకానికి (ఐసీడీఎస్) రూ.17,700 కోట్లు ప్రతిపాదించారు.
  4. వెయ్యి కోట్లతో ‘నిర్భయ’నిధి ఏర్పాటు: మహిళలపై జరుగుతున్న అకృత్యాలను నియంత్రించే ఉద్దేశంతో ఢిల్లీలో డిసెంబర్ 16న సామూహిక లైంగిక దాడికి గురై మరణించిన బాధితురాలి జ్ఞాపకార్థం ఈ నిధిని ఏర్పాటు చేస్తారు.
  5. మహిళల కోసం మహిళలే నిర్వహించే మహిళా బ్యాంకును దేశంలో తొలిసారిగా రూ. 1,000 కోట్ల మూలధనంతో ఏర్పాటు చేయనున్నారు.
సామాజిక న్యాయ శాఖకు రూ.6,725 కోట్లు
  1. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంక్షేమానికి రూ. 6,725 కోట్లు కేటాయించారు.
  2. గిరిజన సంక్షేమానికి రూ.4,295.94 కోట్లు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతులు, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) సంక్షేమానికి రూ.1,518.27 కోట్లు కేటాయించారు.
పన్ను ప్రతిపాదనలు
బడ్జెట్‌లో అదనంగా రూ. 18,000 కోట్ల ఆదాయార్జనకు కొన్ని కొత్త పన్నులు వేశారు. ఇందులో ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ. 13,300 కోట్లు, పరోక్ష పన్నుల ద్వారా రూ. 4,700 కోట్లు అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా.
  1. వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లించే వారికి( 2లక్షల నుంచి 5 లక్షల శ్లాబు) రూ. 2000 రాయితీ(ట్యాక్స్ క్రెడిట్ ప్రకటించారు.
  2. ఆదాయం కోటి దాటిన వారికి అదనంగా 10 శాతం సర్ ఛార్జి విధించారు.
వ్యక్తిగ త ఆదాయ పన్నులు
60 ఏళ్ళలోపు వారు
ఆదాయం పన్ను శాతం
0-2 లక్షలు లేదు
2,00,001-5,00,000 10%(2వేలు (రాయితీ)
5,00,001-10,00,000 20%
10 లక్షలు దాటితే 30%
కోటి రూపాయలు దాటితే 30+3%(పది శాతం సర్‌చార్జి)


60-80 ఏళ్ళలోపు(సీనియర్ సిటిజన్స్)
0-2.50 లక్షలు లేదు
2,50,001-5,00,000 10%(2వేలు (రాయితీ)
5,00,001-10,00,000 20%
10 లక్షలు దాటితే 30%
కోటి రూపాయలు దాటితే 30+3%(పది శాతం సర్‌చార్జి)


80 ఏళ్ళు దాటిన(వెరీ సీనియర్ సిటిజన్స్)
0-5,00,000 లేదు
5,00,001-10,00,000 20%
10 లక్షలు దాటితే 30%
కోటి రూపాయలు దాటితే 30+3%(పది శాతం సర్‌చార్జి)


జీఎస్‌టీ: కేంద్ర అమ్మకపు పన్ను(సీఎస్‌టీ) రేటు తగ్గింపు పరిహారంగా రాష్ట్రాలకు అందించనున్న రూ.34,000 కోట్లలో తొలి విడతగా 2013-14లో రూ.9000 కోట్లు విడుదల చేస్తారు.

పౌర విమానమాన శాఖకు రూ.8,865.40 కోట్లు
  1. 2013-14 బడ్జెట్‌లో పౌర విమానయానశాఖకు ప్రణాళికా కేటాయింపు రూ.8,865.40 కోట్లు.
  2. ఎయిర్ ఇండియాకు ఊరట కలిగిస్తూ రూ.5 వేల కోట్ల ప్రణాళికా కేటాయింపునకు ప్రతిపాదన. ప్రణాళికేతర వ్యయం కింద రూ.1,318 కోట్ల కేటాయింపు.
  3. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కి ప్రణాళికేతర కేటాయింపు రూ.2,260 కోట్లు.
  4. ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అయిన హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ప్రణాళికా కేటాయింపు రూ.5 కోట్లు. పవన్‌హాన్స్ హెలికాప్టర్స్ లిమిటెడ్‌కు ప్రణాళికేతర కేటాయింపు రూ.86.8 కోట్లు.
సబ్సిడీలకు రూ. 2,20,971.50 కోట్లు
  1. ఈ బడ్జెట్‌లో ఆహారం, ఇంధనం, ఎరువులపై సబ్సిడీలకు రూ. 2,20,971.50 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది గత బడ్జెట్‌ కంటే 11 శాతం తక్కువ.
  2. డీజిల్, వంటగ్యాస్, కిరోసిన్‌ను తక్కువ ధరలకు విక్రయించే ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లకు 2013-14 సంవత్సరానికి సబ్సిడీ మొత్తంగా రూ. 65 వేల కోట్లు మాత్రమే కేటాయించారు.
  3. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే ఆహార పదార్థాలకు మాత్రం రూ. 90 వేల కోట్లు కేటాయించారు.
  4. ఎరువుల సబ్సిడీకి 2013-14 ఆర్థిక సంవత్సరానికి రూ. 65,971.50 కోట్లు మాత్రమే కేటాయించారు. ఎరువుల సబ్సిడీ కింద ప్రభుత్వం దిగుమతి చేసుకున్న యూరియాకు రూ. 15,544.44 కోట్లు, స్వదేశీ యూరియాకు రూ. 21 వేల కోట్లు కేటాయించనుంది.
ప్రభుత్వ బ్యాంకులకు 14,000 కోట్లు
  1. తాజా బడ్జెట్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 14,000 కోట్లు కేటాయించారు.
  2. మహిళల కోసం మహిళలే నిర్వహించే మహిళా బ్యాంకును రూ. 1,000 కోట్ల మూలధనంతో దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేయనున్నారు.
శాస్త్ర సాంకేతిక రంగానికి 17,770 కోట్లు
  1. తాజా బడ్జెట్‌లో శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖకు రూ. 6,275 కోట్లు కేటాయించారు.
  2. అంతరిక్ష శాఖకు రూ. 5,615 కోట్లు (గతేడాది రూ. 3,800 కోట్లు), అణుశక్తి సంస్థకు రూ. 5,880 కోట్లు (గతేడాది రూ. 2,600 కోట్లు) కేటాయించారు.
  3. అంగారక యాత్రకు గతేడాది కేటాయించిన రూ. 125 కోట్లకు అదనంగా ఈ ఏడాది రూ.167 కోట్లు కేటాయించారు.
  4. భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖకు గతేడాది రూ. 820 కోట్లు కేటాయించగా, తాజాగా రూ. 1,281 కోట్లకు పెంచారు.
  5. సామాన్యుడి జీవితం మెరుగుదలకు ఉపయోగపడే శాస్త్రీయ ఆవిష్కరణలు, ఉత్పత్తుల కోసం తాజా బడ్జెట్‌లో రూ.2,000 కోట్లు కేటాయించడం విశేషం.
  6. అణుశక్తి నుంచి బయోటెక్నాలజీ వరకూ అన్ని శాస్త్రీయ పరిశోధనలకు కలిపి మొత్తంగా రూ. 20,051 కోట్లు కేటాయించారు.
జాతీయ పథకాలు-కేటాయింపులు
భారత్ నిర్మాణ్: గ్రామాల్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ఫ్లాగ్‌షిప్ పథకమిది. ఇందులో ప్రధానంగా రోడ్లు, గృహకల్పన, తాగునీరు, సాగునీరు, టెలికం-ఐటీ సేవల కల్పన, విద్యుదీకరణ... ఇలా ఆరు స్కీమ్‌లు ఉన్నాయి. వీటిలో రోడ్లు, గృహాలు, తాగునీటి సరఫరాలు గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోకి వస్తాయి. 2005-09 మధ్య భారత్ నిర్మాణ్ తొలి దశ అమలు చేశారు. దీనికి మొత్తం బడ్జెట్ రూ.1.74 లక్షల కోట్లు. ప్రస్తుతం రెండో దశ అమలవుతోంది. ఇందులో ఒక్క రోడ్ల అభివృద్ధికే రూ.1.32 లక్షల కోట్ల వ్యయాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌లోని పథకాల పరిస్థితి ఇదీ...

ఇందిరా ఆవాస్ యోజన:(15,184 కోట్లు)
  1. 2002 జనాభా లెక్కల ప్రకారం దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న కుటుంబాలు, ఎస్‌సీ/ఎస్‌టీలు, వికలాంగులు, బీపీఎల్ మైనారిటీలు ఈ పథకంలో లబ్ధిదారులు.
  2. 2011-12లో దేశవ్యాప్తంగా మొత్తం 28.77 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం కాగా, 19.19 లక్షల ఇళ్లను మంజూరు చేశారు. పూర్తయినవి 6.22 లక్షలే(21.64 శాతం మాత్రమే).
  3. 2012-13లో 30.09 లక్షల లబ్ధిదారులను నమోదు చేశారు. ఇందులో 20.57 లక్షల మందికి ఇళ్లు మంజూరయ్యాయి. ఆగస్టు నాటికి 3.83 లక్షల ఇళ్లే నిర్మించారు.
  4. ఆర్థిక సాయం పెంపు: ప్రస్తుతం సాధారణ స్థలాల్లో నిర్మించే ఇంటికి లబ్ధ్దిదారులకు ఇచ్చే ఆర్థిక సాయం రూ.45,000గా, కొండ ప్రాంతాల్లో ఇంటికి రూ.48,500గా అమల్లో ఉంది. మైదాన ప్రాంతాల్లో సాయాన్ని రూ.70,000కు, కొండప్రాంతాల్లో రూ.75,000కు పెంచుతున్నట్లు 2013-14 బడ్జెట్‌లో ప్రకటించారు.

రాజీవ్ గాంధీ తాగునీటి మిషన్:(11,000 కోట్లు)
  1. దేశంలో తాగునీటి సౌకర్యం లేని(అన్‌కవర్డ్) అన్ని మారుమూల గ్రామీణ ప్రాంతాలకూ తాగునీటిని అందించాలనేది ఈ పథకం లక్ష్యం.
  2. 2012-13లో నాణ్యమైన తాగునీటి సౌకర్యం లేని 26,521 ప్రాంతాలకు ఈ పథకం కింద నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా, సెప్టెంబర్ నాటికి 4,036 ప్రాంతాలే(15.22%) కవర్ అయ్యాయి.
  3. పాక్షిక తాగునీటి సౌకర్యం ఉన్న 1,15,139 ప్రాంతాలకు పూర్తి స్థాయిలో నీటిని అందించాలనేది 2012-13 లక్ష్యం. ఇందులో సెప్టెంబర్ నాటికి 27,273 ప్రాంతాలే(23.61%) సౌకర్యానికి నోచుకున్నాయి.
ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన(21,700 కోట్లు)
  1. మారుమూల గ్రామీణ ప్రాంతాలకూ రోడ్డు సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో 2000లో అప్పటి ఎన్‌డీఏ హయాంలో ప్రారంభించిన ఈ పథకం పూర్తిగా కేంద్రం స్పాన్సర్ చేస్తున్నదే. 2005లో యూపీఏ దీన్ని భారత్ నిర్మాణ్‌లోకి చేర్చింది.
  2. 2012-13లో కొత్త నిర్మాణ లక్ష్యం భారీగా తగ్గిపోయి 3,000 కిలోమీటర్లకే పరిమితమైంది. ఇందులో కూడా కేవలం 996 కిలోమీటర్లే(అక్టోబర్ వరకూ) పూర్తయ్యాయి. మొత్తం 505 ప్రాంతాలకు గాను 75 ప్రాంతాలే కవర్ అయ్యాయి. ఇక గతేడాది అక్టోబర్ నాటికి రూ.1,700 కోట్లు ఖర్చయ్యాయి.

రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన(4,500 కోట్లు)
  1. విద్యుత్ సౌకర్యం లేని లక్ష గ్రామాలకు కరెంటు... దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న 2.34 కోట్ల కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యంతో 2005లో ఈ పథకం ప్రారంభమైంది. నోడల్ ఏజెన్సీగా ఆర్‌ఈసీ వ్యవహరిస్తోంది.
  2. ఇప్పటిదాకా కనీసం 300 కుటుంబాలున్న గ్రామాలకు విద్యుదీకరణ లక్ష్యంకాగా, ఇకపై 100 కుటుంబాలున్న గ్రామాలకూ పూర్తి విద్యుదీకరణ చేయాలనేది ప్రణాళిక.
  3. 2012-13లో 14,500 విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలను లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటిదాకా 5,050 గ్రామాలకే విద్యుత్ సదుపాయాన్ని కల్పించగలిగారు.
  4. ఇక 36.80 లక్షల బీపీఎల్ కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లను ఇవ్యాలన్న లక్ష్యంలో 11.20 లక్షల కుటుంబాలకే పరిమితం కావడం గమనార్హం.
  5. ఇక 2013-14లో 3,300 విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలకు విద్యుదీకరణ, 20 లక్షల బీపీఎల్ కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
గ్రామీణ టెలిఫొనీ...(3,000 కోట్లు)
  1. 2014కల్లా గ్రామాల్లో ప్రతి 100 మందిలో కనీసం 40 మందిని టెలిఫోన్ వినియోగదారులుగా చేయాలనేది లక్ష్యం. దేశంలోని మొత్తం 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్, పంచాయతీ స్థాయిలో భారత్ నిర్మాణ్ కామన్ సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
  2. ఇక బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం అమలు కూడా నత్తనడకన సాగుతోంది. గతేడాది జనవరి నాటికి 1,43 714 పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించారు. ఇక 62,302 గ్రామాలకుగాను 62,046 గ్రామాల్లో విలేజ్ పబ్లిక్ టెలిఫోన్(వీపీటీ)లను అందించారు.
  3. టెలికం శాఖకు చెందిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ నిధి(యూఎస్‌ఓఎఫ్) నుంచి ఈ స్కీమ్‌కు ఫండ్స్‌ను అందిస్తున్నారు. ఈ ఫండ్‌కు 2013-14 బడ్జెట్‌లో రూ.3,000 కోట్లను కేటాయించారు.
గ్రామీణ సాగునీటి పథకం(1,207 కోట్లు)
  1. 2005-09 మధ్య కోటి హెక్టార్లకు అదనంగా సాగునీటి వసతి కల్పించాలనేది లక్ష్యం. కేంద్ర జలవనరుల శాఖ నేతృత్వంలో ఇవి చేపడుతున్నారు.
  2. ఇందులో 42 లక్షల హెక్టార్ల లక్ష్యాన్ని ఇప్పటికే కొనసాగుతున్న భారీ, మధ్య స్థాయి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా సాధించాలని ప్రణాళిక.
  3. మరో 10 లక్షల హెక్టార్లకు ప్రస్తుత ప్రాజెక్టుల విస్తరణ, ఆధునికీకరణతో పాటు కమాండ్ ఏరియా అభివృద్ధి, వాటర్ మేనేజ్‌మెంట్ ప్రక్రియల ద్వారా సాగునీటిని అందించాలని నిర్ణయించారు.
  4. 2008-09 మధ్య మరో 19.3 లక్షల హెక్టార్లు, 2009-10లో 18.5 లక్షల హెక్టార్లను సాగునీటి వసతి పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. 2010-11లో వివిధ రాష్ట్రాలు 8.1 లక్షల హెక్టార్లకు సాగునీటి సౌకర్యం కల్పించినట్లు నివేదించాయి.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం:
ఈసారి ఉపాధి హామీ పథకానికి రూ.33 వేల కోట్లు కేటాయించారు. యూపీఏ ప్రభుత్వం తొలివిడత అధికారంలోకి వచ్చిన తర్వాత 2005లో చట్టరూపం దాల్చింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)గా దీనికి నామకరణం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటు కచ్చితంగా ఉపాధి భద్రతను కల్పించడం ఈ పథకం ఉద్దేశం. 2006 ఫిబ్రవరి 2న మన రాష్ట్రంలోని అనంతపురంలో తొలిదశ ఆరంభమైంది. 2008 ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలకూ విస్తరించారు. గతేడాది దేశంలోని అనేక ప్రాంతాల్లో కరువు నెలకొన్నా... ఉపాధి హామీ పనులకు డిమాండ్ పెరగకపోవడం చూస్తే... ప్రజల్లో ఈ పథకంపై ఆసక్తి తగ్గుతోందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి.

పథకం పనితీరు:
  1. పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 12.55 కోట్ల మేర జాబ్ కార్డులు జారీ అయ్యాయి.
  2. రోజువారీ వేతనం ప్రస్తుతం రూ.100గా ఉంది. దీనిపై ఎంతైనా అదనంగా చెల్లించే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంది.
  3. 2012-13లో ఇప్పటిదాకా 4.49 కోట్ల కుటుంబాలకు పనికల్పించారు.
  4. 65.47 లక్షల పనులను చేపట్టారు. ఇందులో 12.12 లక్షల పనులే పూర్తిచేశారు. 53.35 లక్షల పనులు నత్తనడకతో అసంపూర్తిగా మిగిలాయి. డిసెంబర్ వరకూ చూస్తే... పనుల పూర్తి దాదాపు 20 శాతానికే పరిమితమైంది.
  5. నిధులను ఖర్చుచేయడంలో రాష్ట్రాలు వెనుకబడుతున్నాయి. 2012-13లో రూ.25 వేల కోట్లే ఖర్చు చేశారు.
  6. కరువు ప్రాంతాల్లో ఈ పథకం కింద ఏడాదికి పని రోజులను 100 నుంచి 150కి పెంచారు.
  7. ఈ స్కీమ్ లబ్ధిదారులకు వేతనాలను బ్యాంక్ ఖాతాలకే జమ చేసేలా ఆధార్ ఆధారిత చెల్లింపు విధానాన్ని 46 గ్రామీణ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుకింద అమల్లోకి తీసుకొచ్చారు.
రాష్ట్రంలో పరిస్థితి ఇదీ..
1. ఇప్పటిదాకా 1.31 కోట్ల జాబ్ కార్డులు ఇచ్చారు. 2012-13లో కొత్తగా 6.76 లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులు జారీ అయ్యాయి.
2. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 56.32 లక్షల కుటుంబాలకు పని కల్పించారు.
3. 7.92 లక్షల కుటుంబాలు 100 రోజుల పనిని సద్వినియోగం చేసుకున్నాయి.
4. 2012-13లో 15.26 లక్షల పనులను చేపట్టగా ఇప్పటిదాకా 6.73 లక్షల పనులే పూర్తయ్యాయి. ఈ పనులకు రూ1,743 కోట్లు అందుబాటులో ఉన్నప్పటికీ, రూ.558 కోట్లే పూర్తయిన పనులకు ఖర్చు చేశారు.

ఇతర కేటాయింపులు
  1. ప్రైవేటు ఎఫ్‌ఎం రేడియో సేవలను మరో 294 నగరాలకు విస్తరించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
  2. ప్రసార భారతికి సహాయ నిధి కింద 2,180 కోట్లు కేటాయించారు.
  3. ఈ బడ్జెట్‌లో పర్యాటక శాఖకు రూ.1,297.66 కోట్లనిచ్చారు.
  4. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సూచించే శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని పాస్ అయ్యేవారికి ఇకపై రూ. 10 వేల నజరానా అందిస్తారు.
  5. పన్నెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మంది నైపుణ్యం గల మానవ వనరులను తయారుచేయాలన్న లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు
  6. గ్రామీణ ఉపాధి హామీ, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) వంటి కీలక పథకాలను అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.80,194 కోట్లు కేటాయించారు.
  7. జనాభా లెక్కల సేకరణకు రూ.1,401.23 కోట్లు, అధికార భాషా ప్రచారానికి రూ.46.98 కోట్లు ఇచ్చారు.
  8. లగ్జరీ కార్లు, లగ్జరీ మోటార్‌సైకిళ్లు, లగ్జరీ బోట్లపై దిగుమతి సుంకాన్ని 75 శాతం నుంచి ఏకంగా 100 శాతానికి పెంచేశారు.
  9. బడ్జెట్‌లో 2013-14 ఆర్థిక సంవత్సరంలో డిసిన్వెస్ట్ మెంట్ లక్ష్యం రూ. 55,814 కోట్లు. గతేడాది ఇది రూ. 30,000 కోట్లు.
  10. పవన విద్యుత్‌కు 2013-14 సంవత్సరానికి రూ.800 కోట్లు కేటాయించారు.
  11. పోస్టాఫీసులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.532 కోట్లు కేటాయించింది.
  12. 2013-14 ఆర్థిక సంవత్సరానికి రూ.2,062 కోట్లు కేటాయించారు.
  13. రాష్ట్రంలో ఫ్లోరైడ్, ఉప్పునీటి గ్రామాలు 396 ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఫ్లోరైడ్, రసాయన పదార్థాలున్న కలుషిత నీటి నుంచి గ్రామాలకు విముక్తి కలిగించడానికి కేంద్రం రూ.1,400 కోట్లు కేటాయించింది.
కేంద్ర పన్నుల రూపంలో రాష్ట్రానికి లభించేది రూ. 24,132 కోట్లు!
రానున్న పన్నులు సుంకాల వాటా వివరాలు (రూ.కోట్లలో)
కార్పొరేషన్ పన్ను 353.07
ఆదాయ పన్ను 170.41
సంపద పన్ను     20.88
కస్టమ్స్ సుంకం 899.56
కేంద్ర ఎక్సయిజ్ సుంకం 745.60
ఇతర పన్నులు సుంకాలు 0.01
సేవా పన్ను 942.85
మొత్తం 24 132.36


బడ్జెట్ స్పెషల్

బడ్జెట్ అంటే...
ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌లో క్లిష్టమైన పదాలు ఎన్నో ఉంటాయి. అయితే వీటిని సులభతర రీతిలోకి మారిస్తే- నెలవారీ బడ్జెట్‌లో సామాన్యుడు వినియోగించే పదాలే ఇవి. ఇలాంటి కొన్ని ముఖ్య పదజాలం గురించి పరిశీలిద్దాం..

వార్షిక ఆర్థిక నివేదిక

సింపుల్‌గా చెప్పుకుంటే ఇదే బడ్జెట్. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం- ప్రభుత్వం ఖర్చుపెట్టే మొత్తాలు ఇందులో పొందుపరుస్తారు. ఆర్థిక సంవత్సరం మన దేశానికి ఏప్రిల్ నుంచి వరుసగా 12 నెలలు అంటే ఆ తదుపరి సంవత్సరం మార్చి వరకూ కొనసాగుతుంది. కొన్ని దేశాలు క్యాలెండర్ ఇయర్‌నే ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తాయి. ‘క్రితం ఆర్థిక సంవత్సరం ఆదాయం-వ్యయం-మిగులు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయం-వ్యయం-మిగులు, వచ్చే ఆర్థిక సంవత్సరం ఆదాయం-వ్యయం-మిగులు’ అన్న అంశం ప్రాతిపదికన పలు అంచనాలు, సవరణలతో ఈ బడ్జెట్ రూపొందుతుంది.

బడ్జెట్ ఫండ్స్
బడ్జెట్ కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్, పబ్లిక్ అకౌంట్.. ఇలా మూడు భాగాలుగా ఉంటుంది.
వసూళ్లు-వ్యయాలు అంటూ రెండు విభాగాలుగా ఈ మూడూ భాగాలూ రూపొందుతాయి. కన్సాలిడేటెడ్ ఫండ్, కంటెజెన్సీ ఫండ్ నుంచి వ్యయాలకు పార్లమెంటు ఆమోదం తప్పనిసరి.

కన్సాలిడేటెడ్ ఫండ్:
ప్రభుత్వానికి ఇది ఒక రకంగా ప్రాణం వంటిది. అన్ని రకాల ఆదాయాలు, ప్రభుత్వం తీసుకున్న రుణాలు, ప్రభుత్వం ఇచ్చిన రుణాలపై వచ్చే వడ్డీలు ఈ అకౌంట్‌లో చేరిపోతాయి. అలాగే ప్రభుత్వం చేసే అన్ని రకాల ఖర్చులూ ఈ ఫండ్ నుంచే వెచ్చించాలి.

కంటింజెన్సీ ఫండ్:
ఇది రూ.500 కోట్లతో ఏర్పాటైన నిధి. ఉన్నట్లుండి అనుకోకుండా ఏర్పడే ఖర్చులకు వినియోగించడానికి ఈ నిధిలోని ధనాన్ని రాష్ట్రపతి సంతకం ద్వారా ప్రభుత్వం వినియోగిస్తుంది. ఈ నిధి నుంచి డబ్బును తిరిగి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి భర్తీ చేయాల్సి ఉంటుంది.

పబ్లిక్ అకౌంట్:
ఈ అకౌంట్‌కు సంబంధించి ప్రభుత్వం ఒక రకంగా బ్యాంకర్‌లాగా పనిచేస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి నిధుల వసూళ్లు ఈ అకౌంట్ కిందకు వస్తాయి.

రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్
ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాలు రెండింటినీ బడ్జెట్‌లో రెండు పద్దులుగా విభజిస్తారు. అందులో ఒకటి రెవెన్యూ అకౌంట్. రెండు క్యాపిటల్ అకౌంట్. అంటే కన్సాలిడేటెడ్ ఫండ్‌లోకి వచ్చీ, పోయే నిధులను రెవెన్యూ బడ్జెట్ (రెవెన్యూ అకౌంట్) క్యాపిటల్ బడ్జెట్ (క్యాపిటల్ అకౌంట్)గా పరిగణించడం జరుగుతుంది.
రెవెన్యూ విభాగంలోకి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాలు: పన్నుల వంటి అన్ని రకాలు ఆదాయాలు ఇక వేతనాలు, సబ్సిడీలు, వడ్డీ చెల్లింపులు వంటి అన్ని రకాల వ్యయాలు అన్నీ ఈ అకౌంట్‌లోకి చేరతాయి.
క్యాపిటల్ విభాగంలోకి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాలు: ప్రభుత్వ కంపెనీల్లో వాటాల విక్రయం వంటి అంశాల ద్వారా వచ్చే ఆదాయాలు, వడ్డీల ద్వారా ఆదాయాలు తెచ్చుకోడానికి ఉద్దేశించి ఇచ్చే రుణ వ్యయాలు అన్నీ ఈ అకౌంట్‌లో చేరతాయి.

పబ్లిక్ డెట్
ప్రభుత్వం వివిధ కార్యక్రమాల కోసం అప్పులు చేస్తుంది. అది నేరుగా ప్రజలపై భారంగానే భావిస్తారు. మొత్తం ప్రభుత్వ అప్పులను దేశ జనాభాతో భాగించగా వచ్చేదాన్ని దేశ ప్రజల తలసరి అప్పుగా అంటే ఒకొక్కరి తలమీద ఎంత అప్పు భారం ఉందన్న విషయం తెలుస్తుంది. ప్రభుత్వం దేశీయంగా, విదేశాల నుంచి కూడా అప్పులను స్వీకరిస్తుంది. ఈ మొత్తాన్ని పబ్లిక్ డెట్‌గా వ్యవహరిస్తారు.

ద్రవ్య లోటు
సాధారణంగా ప్రభుత్వం తన ఆదాయాన్ని మించి వ్యయం చేస్తుంది. ఇలా అదనంగా కావల్సిన మొత్తాన్ని రుణాల ద్వారా సమీకరిస్తుంది. ఆదాయం కంటే చేసిన అధిక వ్యయాలనే ద్రవ్యలోటు (ఫిస్కల్ డెఫిసిట్)గా వ్యవహరిస్తారు.

రెవిన్యూ లోటు
ప్రభుత్వం తన రెవిన్యూ ఆదాయం కంటే అధికంగా రెవిన్యూ వ్యయాలను చేసినప్పుడు ఏర్పడే లోటును రెవిన్యూ లోటుగా పరిగణిస్తారు. సాధారణంగా ఈ రెవిన్యూలోటు సున్నాగా ఉండాలి. అలా ఉం టే ప్రభుత్వం చేసిన రెవిన్యూ వ్యయం కేవలం వినియోగానికి కాకుండా ఒక సంపదను సృష్టించినట్లు లెక్క.

జీడీపీలో లోటు శాతం
ద్రవ్యలోటు ఎంత ఉందన్నది శాతాల్లో లెక్కిస్తారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఈ లోటు శాతం ఎంత ఉందన్నది కీలకం. ఉదాహరణకు ప్రస్తుతం మన ద్రవ్యలోటు జీడీపీలో 5.1 శాతంగా ఉంటుందని ఎకనామిక్ సర్వే అంచనా వేసింది.

ట్రెజరీ బిల్స్
ఒక సంవత్సరం లోపు కాలపరిమితి ఉన్న బాండ్లను ట్రెజరీ బిల్స్‌గా పేర్కొంటారు. వసూళ్ళు, చెల్లింపుల్లో వచ్చే తేడాలను సర్దుబాటు చేసుకోవడానికి ట్రెజరీ బిల్స్‌ను ఆశ్రయిస్తారు. ఈ బాండ్స్ కాలపరిమితి ఒక సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటే వాటిని డెట్ సెక్యూరిటీస్‌గా పేర్కొంటారు.

వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్వల్పకాలిక చెల్లింపుల్లో తేడా వచ్చినప్పుడు ఆర్‌బీఐ సహకారాన్ని తీసుకుంటాయి. ఇలా ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వాలు తీసుకునే స్వల్ప కాలిక రుణాలను వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్‌గా వ్యవహరిస్తారు.

ప్రధాన ఆదాయమార్గాలివే..
ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుల్లో పన్నులు కూడా ఒకటి. వివిధ శాఖలకు చేసే కేటాయింపులు పన్నుల వసూళ్ళపైనే ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వం విధించే పన్నులను రెండు రకాలుగా ప్రత్యక్ష, పరోక్ష పన్నులుగా విభజించవచ్చు.

ప్రత్యక్ష పన్నులు
ఒక వ్యక్తి లేదా సంస్థ ఆదాయం, సంపాదనపై చెల్లించే పన్నులన్నీ ఈ ప్రత్యక్ష పన్నుల్లోకే వస్తాయి. ఉదాహరణకు ఆదాయపు పన్ను, వెల్త్ ట్యాక్స్, కార్పొరేట్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అన్నీ ఇందులోకే వస్తాయి. వీటిలో కొన్ని ప్రధానమైన ప్రత్యక్ష పన్నుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆదాయపు పన్ను
ఒక వ్యక్తి తన లేదా హిందూ అవిభక్త కుటుంబంలోని కర్త తన ఆదాయంపై చెల్లించే పన్ను. ఆదాయాన్ని బట్టి ఈ చెల్లించే పన్ను మారుతుంటుంది. ప్రస్తుతం రూ. రెండు లక్షల ఇరవై వేల వార్షిక ఆదాయం వరకు ఎటువంటి పన్నులేదు. ఆపైన శ్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

కార్పొరేట్ ట్యాక్స్
ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం వచ్చే వాటిల్లో ఇదే ప్రధానమైనది. కంపెనీలు ఆర్జించిన లాభాలపై చెల్లించే పన్నును కార్పొరేట్ ట్యాక్స్‌గా పరిగణిస్తారు.

మినిమమ్ ఆల్టర్‌నేట్ ట్యాక్స్
కొన్ని కంపెనీలు లాభాలను ఆర్జించినా పన్ను చెల్లించనవసరం ఉండదు. అటువంటి కంపెనీలు వాటి లాభాల్లో కనీసం చెల్లించాల్సిన పన్నుని మినమమ్ ఆల్టర్‌నేట్ ట్యాక్స్ (మ్యాట్)గా పేర్కొంటారు.

లావాదేవీలపై పన్ను
స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల ద్వారా షేర్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్ల క్రయవిక్రయాలు వంటి లావాదేవీలపై చెల్లించే పన్నుని సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌గా పేర్కొంటారు.

క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్
షేర్లు, స్థిరాస్తి, వ్యాపారం వంటి విక్రయాలు చేసినప్పుడు పొందే లాభాలపై చెల్లించే పన్నును క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటారు.

డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్
ఇన్వెస్టర్లు అందుకునే డివిడెండ్‌పై ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదు కానీ.. ఇచ్చే కంపెనీ డివిడెండ్ మొత్తంపై ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి.

వెల్త్ ట్యాక్స్(సంపద పన్ను)
ఒక వ్యక్తి, హెచ్‌యూఎఫ్ లేదా సంస్థ వ్యక్తిగత ఆస్తి విలువ రూ.30 లక్షలు దాటితే, ఆ పై మొత్తం మీద ఒక శాతం పన్ను చెల్లించాలి.

పరోక్ష పన్నులు
చేస్తున్న ఖర్చుల్లో మనకు తెలియకుండానే పన్నులు చెల్లించేస్తుంటాము. అందుకే వీటిని పరోక్ష పన్నులు అంటారు. కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ వంటివి పరోక్ష పన్నుల్లోకి వస్తాయి.

కస్టమ్స్ సుంకం
విదేశాల నుంచి వస్తువులను కొనుగోలు చేస్తున్నప్పుడు చెల్లించాల్సిన పన్నుని కస్టమ్స్ సుంకాలుగా పేర్కొంటారు. ఇది ప్రభుత్వం ఆదాయ వనరుగానే కాకుండా దిగుమతుల నుంచి దేశాన్ని కాపాడటానికి కూడా దీన్ని వినియోగిస్తారు.

ఎక్సైజ్ సుంకం
దేశీయంగా ఉత్పత్తి అయ్యే వస్తువులపై ఈ సుంకాన్ని విధిస్తారు.

సర్వీస్ ట్యాక్సు
వివిధ సేవలపై ఈ పన్నును విధిస్తారు. ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరుల్లో సర్వీస్ ట్యాక్స్ ఒకటి.

జీఎస్‌టీ
ప్రస్తుతం ఉన్న పరోక్ష పన్నుల విధానాన్ని సమూలంగా మారుస్తూ ఏకీకృత పన్నుల విధానం ఉండే విధంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్‌టీ)ని రూపొందించారు. ఇది ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. జీఎస్‌టీ వస్తే వినియోగదారులపై పరోక్ష పన్నుల భారం తగ్గుతుందని అంచనా.

బడ్జెట్ రూపకల్పన
క్లుప్తంగా చెప్పుకోవాలంటే... రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్‌ల రూపకల్పన. రెవెన్యూ విభాగంలోకి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాల ప్రాతిపదికన రెవెన్యూ బడ్జెట్ రూపొందితే, క్యాపిటల్ విభాగంలోకి వచ్చే ఆదాయాలు, చేసే వ్యయాల ప్రాతిపదికన క్యాపిటల్ బడ్జెట్ రూపొందుతుంది. కానీ ఈ మూడక్షరాల వెనుక ఆరు నెలల కృషి దాగుంటుంది. ఎంతో కసరత్తు.. లెక్కకు మించి భేటీలు.. ఆద్యంతం గోప్యత.. అబ్బో చాలా తతంగమే ఉంటుంది.

సెప్టెంబర్ చివర్లో..

రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏయే రంగానికి ఎంత ఖర్చు పెట్టాలన్న కసరత్తు మొదలవుతుంది. దేశంలో మొత్తం జనాభా తమ తిండి కోసం ఏడాది అంతా ఎంత ఖర్చు చేస్తున్నారో దాదాపు అంత మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్‌కు కేటాయిస్తుంది.

అక్టోబర్ చివర్లో..
తమకు కావాల్సిన నిధులపై వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఆర్థికశాఖతో చర్చల్లో తలమునకలవుతారు.

డిసెంబర్..
ముసాయిదా బడ్జెట్ కాపీలను అధికారులు ఆర్థికమంత్రికి నివేదిస్తారు. ఈ ముసాయిదా పత్రాలన్నీ నీలం రంగులో ఉంటాయి.

జనవరి..
పారిశ్రామిక, బ్యాంకింగ్ రంగాలకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు ఆర్థికమంత్రిని కలిసి తమ సమస్యలను సలహాలను, సూచనలను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అందరి వాదనలు వింటారుగానీ ఎవరికీ నిర్దిష్టమైన హామీ ఇవ్వరు.

ముద్రణ ప్రక్రియ..
బడ్జెట్‌కు సంబంధించిన అన్ని వివరాలను అత్యంత రహస్యంగా ఉంచేందుకు జనవరి నుంచి ఆర్థికమంత్రిత్వ శాఖ కార్యాలయాల్లోకి జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధిస్తారు.

ఫోన్ ట్యాపింగ్..
బడ్జెట్ ప్రతిపాదనలు ఏమాత్రం లీక్ కాకుండా చూసే బాధ్యతను ఇంటెలిజెన్స్ విభాగం చూసుకుంటుంది. ఇందుకు కొందరు ఉన్నతాధికారుల ఫోన్లను సైతం ట్యాప్ చేస్తుంటుంది.

సందర్శకులపై మూడో కన్ను..
ఆర్థిక శాఖ కార్యాలయానికి వచ్చే సంద ర్శకులపై సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. ఈ కెమెరాల పరిధిని దాటి వారు కనీసం కుర్చీలపై కూర్చోవడానికి కూడా అనుమతి ఉండదు.

ఫిబ్రవరి చివర్లో..
బడ్జెట్ పత్రాలను తయారు చేసే ‘ప్రింటింగ్ ప్రెస్’ సిబ్బందిని ఎవరితో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంచుతారు. వీరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు.

ఆహారంపై ఎంత జాగ్రత్తో..
ప్రింటింగ్ ప్రెస్ సిబ్బందికి అందించే తిండిపై అత్యంత జాగ్రత్త తీసుకుంటారు. ఏ ఆహారాన్నైనా పరీక్షించిన తర్వాతే వారికి ఇస్తారు.

అత్యవసర సమయాల్లో..
ముద్రణ విభాగంలో పనిచేసే సిబ్బంది ఎవరైనా అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. సదరు వ్యక్తి వెంట ఓ ఇంటెలిజెన్స్ అధికారి, ఓ పోలీసు ఉంటారు. వారు అనుక్షణం ఆయనను నీడలా అనుసరిస్తారు.

ఫిబ్రవరి 28/29..
సాధారణంగా ఈ రోజుల్లోనే ఉదయం 11 గంటలకు ఆర్థికమంత్రి పార్లమెంటుకు బడ్జెట్‌ను సమర్పిస్తారు. సభలో ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి, ప్రధానమంత్రికి బడ్జెట్ గురించి స్థూలంగా వివరిస్తారు.

పరీక్ష పేపర్లే కాదు..
బడ్జెట్ పేపర్లు కూడా లీకైన సంఘటన 1950లో చోటుచేసుకుంది. అప్పట్లో బడ్జెట్ పత్రాల్ని రాష్ట్రపతి భవన్‌లో ముద్రించేవారు. 1950లో ఈ పత్రాలు ముందే లీక్ కావడంతో అప్పట్నుంచి మింటో రోడ్‌లోని సెక్యూరిటీ ప్రెస్‌కు ముద్రణ వేదికను మార్చారు.
1980 నుంచి ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ పత్రాల్ని ముద్రిస్తున్నారు. ఇందుకోసం అక్కడ ప్రత్యేకంగా ప్రింటింగ్ ప్రెస్‌ను ఏర్పాటు చేశారు.

ఇది దేశ 82వ బడ్జెట్!
కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో రికార్డు సృష్టించారు. వ్యక్తిగతంగా ఎనిమిదో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన.. అత్యధిక బడ్జెట్లు సమర్పించిన రెండో ఆర్థిక మంత్రిగా ఘనత సాధించారు. మొత్తమ్మీద స్వతంత్ర భారతావనిలో ఇది 82వ బడ్జెట్. వీటిలో 66 సాధారణ వార్షిక బడ్జెట్‌లు కాగా, 12 తాత్కాలిక బడ్జెట్‌లు, ప్రత్యేక పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన నాలుగు మినీ బడ్జెట్‌లు ఉన్నాయి. కాగా పది బడ్జెట్లతో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ తొలి స్థానంలో ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ, యశ్వంత్‌సిన్హా, వై.బి.చవాన్, సి.డి.దేశ్‌ముఖ్‌లు ఏడు బడ్జెట్‌లు ప్రవేశపెట్టగా.. ప్రధాని మన్మోహన్‌సింగ్, టి.టి.కృష్ణమాచారిలు ఆరు బడ్జెట్‌లు సభకు సమర్పించారు.

ఏ నాణెం ఎక్కడ తయారయింది?
  1. రూపాయి నాణెం చూసి.. అదెక్కడ తయారైందో చెప్పగలరా? ‘మింట్’లో.. అని చెబుతారా? అది సరే.. ఎక్కడి మింట్‌లో తయారైంది అని అడిగితే చెప్పగలరా? మీకీ విషయం తెలుసా? ప్రతి నాణెం అదెక్కడ తయారైందో తెలిపే సూచిక దానిపైనే ఉంటాయి. వాటి సంగతేంటో.. ఇక్కడ తెలుసుకుందాం.
  2. నాణెం ముద్రణా సంవత్సరం కింది భాగంలో ‘డైమండ్’ గుర్తు ఉంటే.. అది ముంబై మింట్‌లో తయారైనట్లు లెక్క.
  3. ముద్రణా సంవత్సరం కింది భాగంలో ఎలాంటి గుర్తు ఉండకుంటే.. అది కచ్చితంగా కోల్‌కతా మింట్నాణెమే.
  4. ముద్రణా సంవత్సరం కింది భాగంలో ‘చీలిన డైమండ్’ (స్ల్పిట్ డైమండ్) లేదా ‘చుక్క’ (డాట్) లేదా ‘స్టార్’ (నక్షత్రం) ఉందంటే.. అది మన హైదరాబాదీ మింట్ తయారీయే.
  5. ముద్రణా సంవత్సరం కింద ‘గుండ్రని బిందువు’ (రౌండ్ డాట్) ఉంటే.. అది నోయిడా మింట్ నాణెమన్న దానికి సంకేతం.
  6. ఇవేవీగాకుండా నాణెంపై ఇతర చిహ్నాలుంటే అవి విదేశీ మింట్‌లలో తయారైనట్టు లెక్క.
మరికొన్ని విశేషాలు
1. ప్రాచీన ఈజిప్టులో(క్రీ.పూ.3000 నుంచి క్రీ.పూ.2800 మధ్య) తొలిసారిగా పన్నుల విధానాన్ని అమలు చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. రాజు ఏడాదికి రెండుసార్లు రాజ్యంలో పర్యటించి, పన్నుల ఆదాయాన్ని సేకరించారు. భారత్‌లో తొలిసారిగా పన్నుల విధానాన్ని(జిజియా) ముస్లిం పాలకులు 11వ శతాబ్దంలో ప్రవేశపెట్టారు.
2. 1404లో తొలిసారిగా ఇంగ్లండ్‌లో ఆదాయపు పన్ను విధించారు. అప్పట్లో దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

బడ్జెట్ టాప్
ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్, 2013-14 సంవత్సరానికి తన బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కొన్ని బడా దేశాల బడ్జెట్లపై దృష్టి సారిద్దాం. సీఐఏ వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ అత్యధిక మొత్తాలతో బడ్జెట్లు ప్రవేశపెట్టే దేశాల జాబితా రూపొందించింది. ఇందులో భారత్ 22వ స్థానంలో ఉంది. 2011 సంవత్సరం నాటి గణాంకాల ప్రకారం టాప్ 5 బడ్జెట్ల వివరాలు... (రూ.లక్షల కోట్లలో)
అమెరికా
రెవెన్యూ: 124.84
వ్యయం: 195.35
లోటు: 70.02

జపాన్
రెవెన్యూ: 106.93
వ్యయం: 135.15
లోటు: 28.22

చైనా
రెవెన్యూ: 89.02
వ్యయం: 93.90
లోటు: 4.05

జర్మనీ
రెవెన్యూ: 84.13
వ్యయం: 85.76
లోటు: 1.63

ఫ్రాన్స్
రెవెన్యూ: 74.90
వ్యయం: 83.04
లోటు: 8.14
Published date : 08 Mar 2013 08:04PM

Photo Stories