Skip to main content

Union Budget: కేంద్ర బడ్జెట్‌ 2024-25.. పూర్తి వివ‌రాలు ఇవే..

2024–25 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23వ తేదీ పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
Indian Union Budget 2024-25 Highlights

ఎన్డీఏ ప్రభుత్వంపై వరుసగా మూడోసారి నమ్మకముంచిన దేశ ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా బడ్జెట్‌ రూపుదిద్దుకుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలన్నీ నానా సవాళ్లతో సతమతం అవుతున్నా భారత్‌ మాత్రం తిరుగులేని వృద్ధిరేటుతో దూసుకుపోతోందని చెప్పుకొచ్చారు. 

‘‘ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో పేర్కొన్నట్టు మన దేశంలో ఉన్నది ‘నాలుగే కులాలు’. అవి.. పేదలు, మహిళలు, యువత, అన్నదాతలు. వారి అభ్యున్నతి కోసం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, మధ్యతరగతిపై బడ్జెట్లో ప్రధానంగా దృష్టి సారించాం’’ అని వివరించారు. 4.1 కోట్ల పై చిలుకు యువతీయువకులకు వచ్చే ఐదేళ్లలో ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన నిమిత్తం 5 పథకాలతో కూడిన ‘ప్రధానమంత్రి ప్యాకేజీ’ని ప్రకటించారు. 

2047 నాటికి వికసిత భారత్‌ సాకారమే లక్ష్యంగా ‘వ్యవసాయ రంగంలో మరింత ఉత్పాదకత, ఉపాధి–నైపుణ్యాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి–సామాజిక న్యాయం, నిర్మాణ–సేవా రంగాలు, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, ఇన్నోవేషన్‌–రీసెర్చ్, సంస్కరణ’ల పేరిట ఎన్డీఏ ప్రభుత్వ ‘తొమ్మిది ప్రాథమ్యాల’కు తెరతీశారు. దీన్ని రానున్న బడ్జెట్లలో మరింత ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. 

రైతు నుంచి యువత దాకా.. 
వ్యవసాయ రంగ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్లో పలు చర్యలు చేపట్టినట్టు నిర్మల వెల్లడించారు. ‘‘సాగులో ఉత్పాదకతను పెంచేలా పరిశోధనలకు పెద్దపీట వేయనున్నాం. 32 పంట రకాల్లో అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే 100కు పైగా వంగడాలను అభవృద్ధి చేస్తాం. కోటిమందికి పైగా రైతులను సేంద్రియ సాగు వైపు మళ్లిస్తాం. అందుకు అన్నివిధాలా దన్నుగా నిలుస్తాం. తృణధాన్యాలు, నూనెగింజల అభివృద్ధిలో వీలైనంత త్వరగా స్వయంసమృద్ధి సాధిస్తాం’’ అని వివరించారు. ‘‘సంఘటిత రంగంలో ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టే వారికి తొలి నెల వేతనం కేంద్రమే అందిస్తుంది. 

వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉపాధి నైపుణ్యాలు కల్పిస్తాం. కోటి మందికి టాప్‌–500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తాం. ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల దాకా రుణాలకు వీలు కల్పిస్తాం. అన్ని రంగాల్లోనూ మహిళలు మరింతగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలు కల్పిస్తాం’’ అని చెప్పారు. ఉద్యోగికీ, యజమానికీ ఇద్దరికీ లాభించేలా పీఎఫ్‌ ప్రోత్సాహకాల వంటి పలు చర్యలను ప్రకటించారు. అధికారికంగానే 6.7 శాతం దాటిన పట్టణ నిరుద్యోగాన్ని ఎంతో కొంత నేలకు దించే ప్రయత్నం బడ్జెట్‌ కేటాయింపుల్లో కనిపించింది. 

భాగస్వాములకు ఇలా.. 
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కోణంలో చూస్తే నితీశ్‌కుమార్‌ పాలనలోని బిహార్‌పై నిర్మలమ్మ ఏకంగా రూ.60,000 కోట్ల మేరకు వరాల జల్లు కురిపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్‌ వేలు, భారీ విద్యుత్కేంద్రం, రెండు హెరిటేజ్‌ కారిడార్లు, ఎయిర్‌పోర్టుల వంటివెన్నో వీటిలో ఉన్నాయి. ఇవేగాక అవసరమైన మేరకు ఆ రాష్ట్రానికి మరిన్ని అదనపు కేటాయింపులూ ఉంటాయని మంత్రి ప్రకటించారు! అక్కడ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్న విషయం తెలిసిందే. రాజధాని అవసరాల నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక రుణం అందేలా చూస్తామన్నారు. పోలవరం త్వరిత నిర్మాణం, రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతాలకు గ్రాంటు తదితరాలను ప్రస్తావించారు. 

రాష్ట్రాలతో కలిసి ముందుకు..
నగరాల సమగ్రాభివృద్ధికి రాష్ట్రాల సమన్వయంతో కృషి చేస్తామని నిర్మల పేర్కొన్నారు. శివారు ప్రాంతాల అభివృద్ధి ద్వారా వాటిని గ్రోత్‌ హబ్‌లుగా తీర్చిదిద్దుతామన్నారు. పీఎం ఆవాస్‌ యోజన కింద మరో 3 కోట్ల ఇళ్లు కట్టించనున్నారు. మహిళలు, బాలికల ప్రగతి, సంక్షేమానికి ఈసారి ఏకంగా రూ.3 లక్షల కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది గిరిజనులకు లబ్ధి కలిగేలా పథకాన్ని ప్రతిపాదించారు. 

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మరింతగా ప్రోత్సహించేందుకు ముద్రా రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచారు. ‘‘పీఎం సూర్య ఘర్‌ పథకం కింద రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్ల ద్వారా కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల ఉచిత కరెంటు అందించే పథకానికి అద్భుతమైన స్పందన వచ్చింది. 14 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు’’ అని మంత్రి చెప్పారు. ఈ పథకాన్ని మరింతగా ముందుకుతీసుకెళ్తామన్నారు. 

మహిళలకు మంచి కబురు..
సామాన్యునిపై పన్నుల భారాన్ని వీలైంతగా తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్టు నిర్మల ప్రకటించారు. మహిళలకు చల్లని కబురు వినిపించారు. బంగారం, వెండి, ప్లాటినంతో పాటు మొబైల్స్‌పైనా దిగుమతి సుంకం తగ్గించారు. తద్వారా వాటి ధరలు దిగి రానున్నాయి. పీఎం విశ్వకర్మ, స్వానిధి, స్టాండప్‌ ఇండియా తదితరాలతో చేతి వృత్తుల వారు, స్వయంసహాయక బృందాలు మొదలుకుని ఎస్సీ, ఎస్టీల దాకా అన్ని వర్గాల సంక్షేమానికి భరోసా లభిస్తుందని మంత్రి అన్నారు. ‘పూర్వోదయ’ పథకం తూర్పు భారతదేశ ప్రగతిని పరుగులు పెట్టిస్తుందని చెప్పారు. 

ఈశాన్య రాష్ట్రాలకూ పలు కేటాయింపులు చేశారు. పర్యాటకాభివృద్ధికి పలు చర్యలను ప్రతిపాదించారు. ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దు ద్వారా స్టార్టప్‌లకు మరింత ఊపునిచ్చేందుకు విత్త మంత్రి ప్రయత్నించారు. విదేశీ కంపెనీలపై ఆదాయ పన్ను భారాన్ని 40 నుంచి 35 శాతానికి తగ్గించారు. అన్ని రంగాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పరిశోధనల కోసం అనుసంధాన్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఫండ్‌ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. పట్టణ భూ రికార్డులను పూర్తిగా డిజిటైజ్‌ చేయనున్నట్టు తెలిపారు. ఆదాయపన్ను చట్టం–1961ని సమూలంగా సమీక్షిస్తామని హామీ ఇచ్చారు. 

Union Budget 2024-25

బడ్జెట్లో ఆవిష్కరించిన నవ ప్రాథమ్యాలు
1. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత 
➤ వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్ల కేటాయింపులు 
➤ అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే 109 రకాల కొత్త వంగడాలు  రైతులకు అందుబాటులోకి 
➤ రెండేళ్లలో కోటి మంది రైతులు సేంద్రియ సాగు బాట పట్టేలా చర్యలు. 
➤ అందుకు దన్నుగా నిలిచేలా 10 వేల బయో ఇన్‌పుట్‌ వనరుల కేంద్రాలు 
➤ రైతులు, వారి భూముల కవరేజీ తదితరాల కోసం మూడేళ్లలో  డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రా (డీపీఐ) అభివృద్ధి 

2.ఉపాధి–నైపుణ్యాభివృద్ధి 
➤ ఏ పథకాల్లోనూ లబ్ధిదారులు కాని యువతకు ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల దాకా రుణాలు 
➤ ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ 
➤ ఉద్యోగికి, యజమానికి లాభించేలా పీఎఫ్‌ ప్రోత్సాహకాలు తదితరాలు 
➤ ప్రత్యేకించి మహిళల కోసం పలు చర్యలు 
➤ ఐదు పథకాలతో కూడిన సమగ్ర ‘ప్రధానమంత్రి ప్యాకేజీ’ 

3. మానవ వనరుల అభివృద్ధి–సామాజిక న్యాయం 
➤ పలు రాష్ట్రాల్లో పారిశ్రామిక, హెరిటేజ్‌ కారిడార్ల అభివృద్ధి 
➤ 63 వేల గిరిజన గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక పథకం 
➤ మహిళలు, బాలికల అభ్యున్నతి పథకాలకు రూ.3 లక్షల కోట్లు 
➤ ఈశాన్య ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి 

4. నిర్మాణ–సేవా రంగాలు
➤ తయారీ రంగంలో ఎంఎస్‌ఎంఈల కోసం రుణ హామీ పథకాలు 
➤ థర్డ్‌ పార్టీ గ్యారంటీ లేకుండా రూ.100 కోట్ల దాకా రుణాలు 
➤ ముద్రా రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు 
➤ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ కామర్స్‌ ఎగుమతి హబ్‌లు 

5. పట్టణాభివృద్ధి
➤ 30 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 14 నగరాల సమగ్రాభివృద్ధికి రవాణా ఆధారిత ప్రణాళికలు, వ్యూహాలు 
➤ ప్రధాని పట్టణ ఆవాస్‌ యోజన 2.0 కింద కోటి మంది పట్టణ  పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇళ్లు 
➤ ఎంపిక చేసిన నగరాల్లో వచ్చే ఐదేళ్లలో ఏటా 100 చొప్పున వీధి మార్కెట్లు 

6. ఇంధన భద్రత
➤ ఉపాధి, వృద్ధి తదితరాలతో పాటు పర్యావరణ హితాన్నీ దృష్టిలో పెట్టుకుంటూ సంప్రదాయేతర ఇంధన వనరులకు మరింత ప్రోత్సాహం 
➤ కరెంటు నిల్వ కోసం పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులకు ప్రోత్సాహం 
➤ ప్రైవేట్‌ రంగ భాగస్వామ్యంలో చిన్న, మాడ్యులార్‌  అణు రియాక్టర్ల అభివృద్ధి 

7. మౌలిక సదుపాయాలు 
➤ దీర్ఘకాలిక లక్ష్యంతో రూ.11.11 లక్షల కోట్ల కేటాయింపులు రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీలేని రుణాలకు రూ.1.5 లక్షల కోట్ల కేటాయింపు 
➤ పీఎంజీఎస్‌వై–4తో 25 వేల గ్రామీణ ఆవాసాలకు కనెక్టివిటీ 
➤ వరద ప్రభావిత రాష్ట్రాల్లో సమస్య శాశ్వత నివారణే లక్ష్యంగా పలు ప్రాజెక్టులు 
➤ పలు రాష్ట్రాల్లో పర్యాటక తదితర కారిడార్ల అభివృద్ధి 

8. ఇన్నొవేషన్‌ – రీసెర్చ్‌ 
➤ పరిశోధన, నమూనా అభివృద్ధి కోసం అనుసంధాన్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఫండ్‌ 
➤ ప్రైవేట్‌ రంగ సమన్వయంతో పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రోత్సా హమిచ్చేందుకు రూ.లక్ష కోట్ల ఫైనాన్సింగ్‌ పూల్‌ 
➤ అంతరిక్ష ఆర్థికాన్ని వచ్చే పదేళ్లలో కనీసం ఐదు రెట్లు విస్తరణ.అందుకు ఈ బడ్జెట్లో రూ.1,000 కోట్లు. 

9. భావి తరం సంస్కరణలు
➤ భూములన్నింటికీ ప్రత్యేక ల్యాండ్‌ పార్సిల్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్, లేదా భూ ఆధార్‌ 
➤ భూ రిజిస్ట్రీ ఏర్పాటు, రైతుల రిజిస్ట్రీతో లింకేజీ 
➤ జీఎస్‌ఐ మ్యాపింగ్‌తో పట్టణ ప్రాంత భూ రికార్డుల డిజిటైజేషన్‌ 
➤ అన్నిరకాల కార్మిక సేవలూ ఒక్కతాటిపైకి. సంబంధిత  పోర్టళ్లతో ఇ–శ్రామ్‌ పోర్టల్‌ అనుసంధానం

భూటాన్‌కు అత్యధికం.. మాల్దీవులకు కోత
భారత పొరుగుదేశమైన భూటాన్‌కు ‘నైబర్‌హుడ్‌ ఫస్ట్‌’ పాలసీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా రూ.2068 కోట్లను అభివృద్ధి ఎయిడ్‌ కింద కేటాయించింది. అయితే, మాల్దీవులకు మాత్రం గత ఏడాదితో పోలిస్తే నిధుల్లో కోత విధించింది. మాల్దీవులకు గత ఏడాది రూ.770 కోట్లు కేటాయించగా, ఈసారి బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించింది. 

గత ఏడాది నవంబర్‌లో మాల్దీవుల అధ్యక్షుడిగా చైనా అనుకూలురైన మొహమ్మద్‌ మొయిజ్జు వచ్చాక భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. విదేశాంగ శాఖకు గత ఏడాది సవరించిన అంచనాల మేరకు రూ.29,121 కోట్లు కేటాయించగా 2024–25 బడ్జెట్‌లో రూ.22,154 కోట్లు కేటాయించారు. భూటాన్‌ తర్వాత నేపాల్‌కు అధికంగా నిధులు (రూ.700 కోట్లు) కేటాయించారు. 

శ్రీలంకకు గత ఏడాది రూ.60 కోట్లు కేటాయించగా, ఈసారి మాత్రం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం గమనార్హం. కేంద్ర బడ్జెట్‌లో సాయం కింద అఫ్గానిస్తాన్‌కు రూ.200 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.120 కోట్లు, మయన్మార్‌కు రూ.250 కోట్లు, మారిషస్‌కు రూ.370 కోట్లు, ఆఫ్రికా దేశాలకు రూ.200 కోట్లు కేటాయించారు. లాటిన్‌ అమెరికా, యురేసియా దేశాలకు అభివృద్ధి సాయం కింద రూ.4883 కోట్లు కేటాయించారు.

బడ్జెట్లో కేంద్రం కీలక చర్యలు..
నిరుద్యోగ సమస్యకు ముకుతాడు వేసేందుకు బడ్జెట్లో కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. ఉత్పత్తి, నిర్మాణ రంగాల్లో యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పిం చడంపై దృష్టి పెట్టింది. వారికి అదనపు ఉపాధి  కల్పించే సంస్థలకు ప్రోత్సహకాలు ప్రకటించారు. నెలకు రూ.3 వేల చొప్పున రెండేళ్ల పాటు యజమాని వాటా పీఎఫ్‌ చందాను రీయింబర్స్‌ చేయనున్నారు. పని ప్రాంతంలోనే ఉండేందుకు వీలుగా చిరుద్యోగులకు డారి్మటరీల ఏర్పాటునూ ప్రతిపాదించారు. సంఘటిత రంగంలో ఉద్యోగంలో చేరేవారికి తొలి వేతనాన్ని ప్రభుత్వమే ఇస్తుందని విత్త మంత్రి ప్రకటించారు. 
 
వీటన్నింటికి వచ్చే ఐదేళ్లలో ఏకంగా రూ.2 లక్షల కోట్లు వెచ్చించనున్నారు. తద్వారా 4 కోట్ల మంది పై చిలుకు యువతకు ప్రయోజనం చేకూర్చడం, ఆ మేరకు వ్యవసాయ రంగంపై భారం తగ్గించడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. దేశీయంగా ఉన్నత విద్యకూ రుణ భరోసా ఇచ్చారు. వేతన జీవులకు నామమాత్రపు ఆదాయ పన్ను ఊరట కల్పిం చారు. దాన్ని కూడా కొత్త పన్ను విధానానికే పరిమితం చేశారు. 

అదే సమయంలో మోదీ సర్కారు ప్రాథమ్యాలను దృష్టిలో పెట్టుకుంటూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.11.11 లక్షల కోట్లు కేటాయించారు! మోదీ సర్కారు మనుగడకు కీలకమైన నితీశ్‌ సారథ్యంలోని బిహార్‌కు రూ.60 వేల కోట్ల మేరకు వరాలు గుప్పించగా ఏపీకి రూ.15 వేల కోట్ల ‘ప్రపంచ బ్యాంకు’ రుణంతో సరిపెట్టారు.. 

ఇవి ప్రియం.. 
➣ అమ్మోనియం నైట్రేట్, పీవీసీ ఫ్లెక్స్‌ బ్యానర్లు/పీవీసీ ఫ్లెక్స్‌ షీట్లు 
➣ గార్డెన్‌లో  వినియోగించే గొడుగులు 
➣ సోలార్స్‌ గ్లాస్‌ 
➣ దిగుమతి చేసుకునే టెలికం పరికరాలు
➣ ల్యాబొరేటరీ కెమికల్స్,  బయోడీగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌  

ఇవి చౌక.. 
➣ బంగారం, వెండి, ప్లాటినం,పల్లాడియం, ఓస్మియం, రుతీనియం, ఇరీడియం కాయిన్లు, కాపర్‌. 
➣ క్వార్ట్జ్, లిథియం కార్బోనేట్, లిథియం ఆక్సైడ్, లిథియం హైడ్రాక్సైడ్, నైట్రేట్స్‌ పొటాషియం, ఫెర్రో నికెల్, బ్లిస్టర్‌ కాపర్‌ 
➣ కేన్సర్‌ ఔషధాలు (ట్రస్టుజుమాబ్‌ డెరుక్స్‌టెకాన్, ఓసిమెరి్టనిబ్, డుర్వాలుమాబ్‌) 
➣ మెడికల్‌ ఎక్స్‌రే మెషీన్లలో   వినియోగించే ట్యూబ్‌లు,ఫ్లాట్‌ ప్యానెల్‌ డిటెక్టర్లు 
➣ మొబైల్‌ ఫోన్లు, చార్జర్లు,మొబైల్‌ ఫోన్‌ ప్రింటెడ్‌సర్క్యూట్‌ బోర్డ్‌ అసెంబ్లీ (పీసీబీఏ) 
➣ సోలార్‌ సెల్స్, ప్యానెల్స్‌ ఎక్విప్‌మెంట్‌ 
➣ చేపలు, రొయ్యల మేత 
➣ తోలు ఉత్పత్తులు, పాదరక్షలు 
➣ టెక్స్‌టైల్స్‌  

Oil Companies: ఆయిల్‌ కంపెనీలను నిరాశపరిచిన బడ్జెట్‌!
ఆయిల్‌ కంపెనీలను బడ్జెట్‌ నిరాశపరిచింది. ఇండియన్‌ ఆయిల్, భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియంలకు 2023–24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రికార్డు లాభాల (దాదాపు రూ.81,000 కోట్లు) కారణంగా గత ఆర్థిక సంవత్సరం ప్రకటించిన రూ.30,000 కోట్ల మూలధన మద్దతును ఆర్థికమంత్రి రద్దు చేశారు.
 
నిజానికి ఈ మద్దతును రూ.15,000 కోట్లకు తగ్గించాలని 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదించిన నిర్మలా సీతారామన్, తాజా బడ్జెట్‌లో ఈ మద్దతును పూర్తిగా రద్దు చేయడం గమనార్హం.

Rs.30000 cr capital support to oil cos

వ్యూహాత్మక నిల్వలకు రూ.5,000 కోట్లు 
ఇక సరఫరాల్లో అంతరాయాలను నిరోధించడానికి కర్ణాటకలోని మంగళూరు అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నిర్మించిన వ్యూహాత్మక భూగర్భ నిల్వల క్షేత్రాలను నింపడానికి  వీలుగా ముడి చమురును కొనుగోలు చేయడానికి రూ.5,000 కోట్లను బడ్జెట్‌లో ప్రతిపాదించారు.  

షేర్లు డీలా.. 
తాజా నిర్ణయం నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ఐఓసీ షేర్‌ ధర క్రితం ముగింపుతో పోల్చితే 2 శాతం నష్టపోయి రూ.166 వద్ద ముగిసింది. బీపీసీఎల్‌ షేర్‌ ధర 1 శాతం తగ్గి రూ.306 వద్ద ముగిసింది. హెచ్‌పీసీఎల్‌ షేరు ధర స్వల్ప నష్టంతో 347 వద్ద స్థిరపడింది.

క్రూజ్‌ పర్యాటకానికి ప్రోత్సాహం
విదేశీ షిప్పింగ్‌ కంపెనీలపై సులభతర పన్ను 
దేశీ క్రూజ్‌ విభాగంలో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ షిప్పింగ్‌ కంపెనీలకు సులభతర పన్నుల విధానాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. క్రూజ్‌ పర్యాటకంలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ చర్య తీసుకున్నారు. సముద్ర జలాలపై నడిచే పర్యాటక ఓడలను క్రూజ్‌లుగా చెబుతారు. దేశంలో క్రూజ్‌ పర్యాటకానికి భారీ అవకాశాలున్నట్టు మంత్రి చెప్పారు.

ఈ విభాగంలో భారత షిప్పింగ్‌ పరిశ్రమ వాటాను పెంచేందుకు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు యాజమాన్యం, లీజింగ్‌ పరంగా సంస్కరణలు తీసుకొస్తామని ప్రకటించారు. క్రూజ్‌ పర్యాటకానికి భారత్‌ను ఆర్షణీయ కేంద్రంగా మారుస్తామని, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తామని చెప్పారు. ‘‘క్రూజ్‌ షిప్పింగ్‌ల నిర్వహణలో పాలు పంచుకునే ప్రవాసులకు ఊహాత్మకమైన పన్ను విధానం ప్రతిపాదిస్తున్నాం. విదేశీ కంపెనీ, నాన్‌ రెసిడెంట్‌ షిప్‌ ఆపరేటర్‌ రెండూ ఒకే హోల్డింగ్‌ కంపెనీ కింద ఉంటే లీజ్‌ రెంటల్‌ రూపంలో ఆర్జించే ఆదాయంపై పన్ను మినహాయింపును కల్పిస్తున్నాం’’అని వివరించారు. ఈ దిశగా సెక్షన్‌ 44బీబీసీని ప్రతిపాదించారు. 2025 ఏప్రిల్‌ 1 నుంచి సవరణలు అమల్లోకి వస్తాయని చెప్పారు.  

ఎన్‌పీఎస్‌పై మరింత పన్ను ప్రయోజనం
నూతన పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా కేంద్ర సర్కారు జాతీయ పింఛను పథకంలో (ఎన్‌పీఎస్‌) పెట్టుబడులకు ప్రోత్సాహకాన్ని పెంచింది. ఉద్యోగి తరఫున ప్రైవేటు సంస్థలు జమ చేసే ఎన్‌పీఎస్‌ వాటాపై పన్ను మినహాయింపు పరిమితిని 14 శాతం చేసింది. ఉద్యోగి మూల వేతనం, కరువు భత్యంలో (గరిష్ట పరిమితి రూ.లక్ష) 10 శాతం జమలపైనే ప్రస్తుతం పన్ను మినహాయింపు ఉంది. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఇది 14 శాతంగానే ఉండగా.. ప్రైవేటు రంగ ఉద్యోగులకు సైతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాన్ని పెంచారు. ఆదాయపన్ను చట్టంలోని పాత పన్ను వ్యవస్థలో ఉద్యోగి తరఫున సంస్థలు చేసే ఎన్‌పీఎస్‌ జమలపై పన్ను మినహాయింపు 10 శాతంగానే కొనసాగుతుంది. 

ఉదాహరణకు పార్థసారథి మూలవేతనం, కరవు భత్యం రూ.1,00,000 ఉందనుకుంటే.. తాజా మార్పుతో ప్రతి నెలా రూ.4,000 చొప్పున ఏడాదికి రూ.48వేల మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. మైనర్ల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్‌పీఎస్‌ ఖాతా తెరిచేందుకు ‘ఎన్‌పీఎస్‌ వాత్సల్య’ ప్లాన్‌ను కూడా ప్రకటించారు.  

ఈకామర్స్‌ ఎగుమతులకు దన్ను
హబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు 
ఈకామర్స్‌ రంగం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో హబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఇందుకు ప్రభుత్వ, ప్రయివేట్‌ విధానం(పీపీపీ)లో వీలు కల్పించనుంది. అవాంతరాలులేని నియంత్రణ, లాజిస్టిక్‌ మార్గదర్శకాల ద్వారా ఒకే గొడుగుకింద వాణిజ్యం, ఎగుమతి సంబంధ సర్వీసులకు ఇవి తెరతీయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. వెరసి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎంఎస్‌ఎంఈలు), సంప్రదాయ చేనేత, హస్తకళలు తదితర శ్రామికులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేశారు.

ప్రస్తుతం ఈకామర్స్‌ విభాగం ద్వారా దేశీ ఎగుమతులు కేవలం 5 బిలియన్‌ డాలర్లకు పరిమితంకాగా.. చైనా నుంచి వార్షికంగా 300 బిలియన్‌ డాలర్లు ఎగుమతులు నమోదవుతున్నాయి. రానున్న కాలంలో 50–100 బిలియన్‌ డాలర్లకు దేశీ ఎగుమతులను పెంచేందుకు అవకాశముంది. బడ్జెట్‌ ప్రతిపాదిత కేంద్రా(హబ్‌)ల ద్వారా తొలుత చిన్న తయారీదారులు ఈకామర్స్‌ సంస్థలు(అగ్రిగేటర్ల)కు ఉత్పత్తులను విక్రయిస్తారు.

తదుపరి ఇతర మార్కెట్లలో అగ్రిగేటర్లు వీటిని విక్రయిస్తాయి. ప్రధానంగా ఆభరణాలు(జ్యువెలరీ), దుస్తులు, హస్తకళలు తదితరాలకు భారీ అవకాశాలున్నాయి. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునే బాటలో ఆర్‌బీఐసహా సంబంధిత శాఖలతో వాణిజ్య శాఖ విభాగం డీజీఎఫ్‌టీ కలసి పనిచేస్తోంది. ఫలితంగా ఈ హబ్‌లకు ఎగుమతులు క్లియరెన్స్‌లను కలి్పస్తారు. అంతేకాకుండా వేర్‌హౌసింగ్, కస్టమ్స్‌ క్లియరెన్స్, రిటర్నుల ప్రాసెసింగ్, లేబిలింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్‌లను వీటికి జత చేస్తారు.

డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యం రూ.50,000 కోట్లు 
ప్రభుత్వ సంస్థలలో వాటాల విక్రయం(డిజిన్వెస్ట్‌మెంట్‌) ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రూ. 50,000 కోట్లు సమీకరించవచ్చని తాజా బడ్జెట్‌ అంచనా వేసింది. మధ్యంతర బడ్జెట్‌లోనూ ఇదేస్థాయిలో ప్రభుత్వం అంచనాలు ప్రకటించింది. ఇక కేంద్ర ప్రభుత్వ కంపెనీల(సీపీఎస్‌ఈలు) నుంచి రూ.56,260 కోట్ల డివిడెండ్‌ లభించవచ్చని భావిస్తోంది.

మధ్యంతర బడ్జెట్‌లో వేసిన అంచనాలు రూ.48,000 కోట్లకంటే అధికంకావడం గమనార్హం! మరోవైపు ఆర్‌బీఐ, పీఎస్‌యూ బ్యాంకుల నుంచి ఈ ఏడాది రూ.2,32,874 కోట్ల డివిడెండ్‌ అందుకునే చాన్స్‌ ఉన్నట్లు బడ్జెట్‌ ఊహిస్తోంది. ఇందుకు ప్రధానంగా ఆర్‌బీఐ నుంచి రూ.2.11 లక్షల కోట్ల అనూహ్య డివిడెండ్‌ లభించడం ప్రభావం చూపింది. మధ్యంతర బడ్జెట్‌ ఈ పద్దుకింద రూ.1.02 లక్షల కోట్లు మాత్రమే అంచనా వేసింది.

దివాలా వ్యవహారాల్లో ఇక మరింత పారదర్శకత
ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌ ఏర్పాటు   
దివాలా కోడ్‌ (ఐబీసీ) పక్రియను మరింత మెరుగుపరచడంపై బడ్జెట్‌ దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి స్థిరత్వం, పారదర్శకత, సమయానుకూల ప్రాసెసింగ్, వాటాదారులకు సంబంధించి మెరుగైన పర్యవేక్షణ సాధన లక్ష్యంగా ‘ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌’ను ఆవిష్కరిస్తున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. 2016 నుంచి అమల్లోకి వచ్చిన దివాలా కోడ్‌ పటిష్టత కోసం తగిన మార్పులను తీసుకురావడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

కోడ్‌ను ఇప్పటి వరకూ ఆరు సార్లు సవరించిన సంగతి తెలిసిందే. ఐబీసీ 1,000 కంటే ఎక్కువ కంపెనీల దివాల అంశాలను  పరిష్కరించిందని, ఫలితంగా రుణదాతలకు నేరుగా రూ.3.3 లక్షల కోట్ల రికవరీ జరిగిందని ఆమె చెప్పారు. ప్రస్తుతం దేశ రాజధానిలో ఉన్న ప్రధాన బెంచ్‌సహా 15 నగరాల్లో ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌లు ఉన్నాయి. 

అంతేకాకుండా, నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఢిల్లీ, చెన్నైలలో బెంచ్‌లను కలిగి ఉంది. రికవరీని వేగవంతం చేసేందుకు మరిన్ని ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు.  

టెలికం పరికరాల దిగుమతులకు చెక్‌
10 శాతం నుంచి 15 శాతానికి సుంకాల పెంపు 
దేశీయంగా టెలికం గేర్‌ తయారీకి దన్నుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజా బడ్జెట్‌లో దిగుమతి సుంకాల పెంపునకు తెరతీశారు. ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డు(పీసీబీఏ)లుగా వ్యవహరించే మదర్‌బోర్డులపై 5 శాతం పెంపును ప్రతిపాదించారు. వెరసి టెలికం పీసీబీఏలపై బేసిక్‌ కస్టమ్‌ డ్యూటీ ప్రస్తుత 10 శాతం నుంచి 15 శాతానికి పెరగనుంది.

అయితే కమ్యూనికేషన్‌ పరికరాల తయారీలో వినియోగించే కీలక 25 మినరల్స్‌పై డ్యూటీని పూర్తిస్థాయిలో మినహాయించింది. వీటిలో అణువిద్యుత్, పునరుత్పాదక ఇంధనం, రక్షణ, టెలికం రంగాలలో వినియోగించే లిథియం, కాపర్, కోబాల్ట్‌ తదితరాలున్నాయి.

రూ.50 లక్షలు మించితేనే రిటర్నుల పునఃమదింపు
పన్ను చెల్లింపుదారులకు సంబంధించి కొన్ని సానుకూల చర్యలకు బడ్జెట్లో చోటు లభించింది. ఎగవేసిన పన్ను ఆదాయం రూ.50లక్షలకు మించి ఉన్నప్పుడే.. అసెస్‌మెంట్‌ సంవత్సరం ముగిసిన మూడు నుంచి ఐదేళ్లలోపు తిరిగి మదింపు చేయవచ్చని ప్రకటించారు. సోదాలకు సంబంధించి కూడా ప్రస్తుతం అసెస్‌మెంట్‌ సంవత్సరం ముగిసిన పదేళ్ల వరకు అవకాశం ఉండగా, దీన్ని ఆరేళ్లకు తగ్గించారు.

పన్నుల విషయంలో అనిశ్చిత, వివాదాలను ఈ చర్యలు తగ్గిస్తాయని మంత్రి చెప్పారు. ఎలాంటి కేసుల్లోనూ ఐదేళ్ల తర్వాత సంబంధిత పన్ను రిటర్నులను తిరిగి మదించకుండా నిబంధనల్లో సవరణలు తీసుకొస్తామని ప్రకటించారు.  పన్ను వివాదాల పరిష్కారానికి వీలుగా ‘వివాద్‌ సే విశ్వాస్‌ పథకం 2.0’ను తీసుకొస్తామన్నారు. 

వీటిపై పన్ను పెంపు.. 
బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌(డెరివేటివ్స్‌) లావాదేవీలపై పన్నును పెంచేందుకు ప్రతిపాదించారు. ఇందుకు అనుగుణంగా ఎఫ్‌అండ్‌వో సెక్యూరిటీస్‌లో ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌(ఎస్‌టీటీ)ను పెంచారు. దీంతో సెక్యూరిటీల ఆప్షన్‌ విక్రయంపై ప్రస్తుతమున్న ఆప్షన్‌ ప్రీమియంలో 0.625 శాతం పన్ను 0.1 శాతానికి పెరగనుంది. ఇక సెక్యూరిటీల ఫ్యూచర్స్‌ విక్రయంపై సైతం 0.0125 శాతం నుంచి 0.02 శాతానికి పెంచారు. అక్టోబర్‌ 1 నుంచి పన్ను పెంపు అమల్లోకి రానుంది. 

Tax



నిజానికి ఎఫ్‌అండ్‌వో విభాగంలో ఇటీవల కొంతకాలంగా రిటైల్‌ ఇన్వెస్టర్లు భారీగా ఆసక్తి చూపుతున్నారు. దీనిపై సెబీ, ఆర్థిక శాఖ, స్టాక్ ఎక్ఛ్సేజీలతోపాటు ఆర్థిక సర్వే సైతం ఆందోళన వ్యక్తం చేసింది. డెరివేటివ్స్‌ విభాగంలో రిటైలర్ల పారి్టసిపేషన్‌ భారీగా పెరిగిపోతుండటంతో జూదానికి దారితీస్తుందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో సీతారామన్‌ ఎఫ్‌అండ్‌వో లావాదేవీలపై పన్నులను పెంచేందుకు నిర్ణయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

సెబీ చీఫ్‌ మాధవి పురి బచ్, ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ ఇటీవలే ఎఫ్‌అండ్‌వో లావాదేవీలు పెరుగుతుండటంపై రిటైలర్లకు హెచ్చరికలు జారీ చేశారు. రిటైలర్లను డెరివేటివ్స్‌ అత్యధికంగా ఆకట్టుకుంటున్న కారణంగా విశ్లేషకులు సైతం రిస్కులను అర్ధం చేసుకోగలిగినవాళ్లు మాత్రమే లావాదేవీలను చేపట్టమంటూ అప్రమత్తం చేస్తున్నారు. సాధారణ ఇన్వెస్టర్లు వీటిని చేపట్టకపోవడమే మేలని సూచిస్తున్నారు. 

టర్నోవర్‌ దూకుడు 
డెరివేటివ్స్‌ విభాగంలో నెలవారీ టర్నోవర్‌ 2024 మార్చికల్లా కొన్ని రెట్లు ఎగసి రూ.8,740 లక్షల కోట్లను తాకింది. 2019 మార్చిలో కేవలం రూ.217 లక్షల కోట్లుగా నమోదుకావడం గమనార్హం! ఇదే కాలంలో నగదు విభాగంలోనూ రోజువారీ సగటు టర్నోవర్‌ రూ. లక్ష కోట్లను తాకగా.. ఎఫ్‌అండ్‌వోలో రూ.330 లక్షల కోట్లకు చేరింది.  

ఎఫ్‌అండ్‌వో అంటే? 
ఒక షేరు లేదా కమోడిటీ విలువ ఆధారంగా కుదుర్చుకునే తాత్కాలిక కాంట్రాక్ట్‌ల లావాదేవీలను ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌గా పేర్కొనవచ్చు. అత్యధిక శాతం ట్రేడర్లు రిసు్కల రక్షణ(హెడ్జింగ్‌)కు, ధరల కదలికలపై అంచనాలు, షేర్లు లేదా కమోడిటీల ధర వ్యత్యాసాల లబ్ధికి సైతం వీటిలో లావాదేవీలను చేపడుతుంటారు. వెరసి వీటిని స్వల్పకాలిక లాభార్జనకు స్పెక్యులేటివ్‌ టూల్‌గా వినియోగిస్తుంటారు. అయితే మార్కెట్‌ ఆటుపోట్లు, లెవరేజ్‌.. తదితర  రిస్క్‌ల కారణంగా అత్యధికస్థాయిలో నష్టాలు సైతం వాటిల్లుతుంటాయి.

సెబీ ఇటీవలి నివేదిక ప్రకారం రిటైల్‌ ఇన్వెస్టర్లలో 89 శాతం మంది డెరివేటివ్స్‌లో నష్టపోతున్నారు. 2021–22 ఏడాదిలో వీరికి సగటున రూ. 1.1 లక్ష చొప్పున నష్టాలు నమోదయ్యాయి. కరోనా కాలంలో ఎఫ్‌అండ్‌వో ఇన్వెస్టర్ల సంఖ్య 500 శాతం దూసుకెళ్లింది. 2019లో ఈ సంఖ్య 7.1 లక్షలుకాగా.. 2021కల్లా 45.24 లక్షలకు జంప్‌చేసింది.

5 రెట్లు అధికమైనా.. 
డెరివేటివ్స్‌లో ఎస్‌టీటీ 5 రెట్లు పెరగనున్నట్లు సిట్రస్‌ అడ్వయిజర్స్‌ వ్యవస్థాపకుడు సంజయ్‌ సిన్హా పేర్కొన్నారు. ఇటీవల ఈ విభాగంలో లావాదేవీలు భారీగా పెరిగిన నేపథ్యంలో పన్ను పెంపు ఊహించిందేనని తెలియజేశారు.

అయితే పన్ను పెంపు అమల్లోకిరానున్న 2024 అక్టోబర్‌ 1 నుంచి ఎక్స్జ‌జీల టర్నోవర్‌ చార్జీలు తగ్గనున్నట్లు కొటక్‌ సెక్యూరిటీస్‌ డిజిటల్‌ బిజినెస్‌ హెడ్‌ ఆశిష్‌ నందా పేర్కొన్నారు. ఉదాహరణకు ఆప్షన్స్‌పై రూ.10,000 రౌండ్‌ ట్రిప్‌ ప్రీమియంపై ఎస్‌టీటీ రూ.3.75 పెరుగుతుందనుకుంటే.. టర్నోవర్‌ చార్జీలు రూ.3.5–4 స్థాయిలో తగ్గనున్నట్లు వివరించారు. దీంతో నికరంగా ప్రభావం ఉండకపోవచ్చని 
అభిప్రాయపడ్డారు.

Percentages

ఎల్‌టీసీజీలో సవరణలు
కేంద్రానికి రూ.15,000 కోట్ల అదనపు ఆదాయం
బడ్జెట్‌లో వివిధ ఆస్తుల(సెక్యూరిటీలు, స్థిరాస్తులు) హోల్డింగ్‌ కాలావధి ఆధారంగా క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌లను క్రమబద్ధీకరించారు. ఏడాదికి మించి లిస్టెడ్‌ ఫైనాన్షియల్‌ ఆస్తుల హోల్డింగ్‌తోపాటు.. రెండేళ్లకు మించి ఆర్థికేతర ఆస్తులు, అన్‌లిస్టెడ్‌ ఆస్తుల హోల్డింగ్స్‌ దీర్ఘకాలిక క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ (ఎల్‌టీసీజీ) జాబితాలో చేరనున్నాయి.

అన్‌లిస్టెడ్‌ బాండ్లు, డిబెంచర్లను మినహాయించి(వీటికి సంబంధిత స్లాబ్‌లు వర్తిస్తాయి) వివిధ ఆస్తులపై దీర్ఘకాలిక లాభాల పన్ను సగటున 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారు. ఇక స్వల్పకాలిక క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ను 15 శాతం నుంచి 20 శాతానికి పెంచారు. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్స్, బిజినెస్‌ ట్రస్ట్‌ యూనిట్లు వీటిలోకి వస్తాయి. అయితే ఆర్థికేతర ఆస్తులపై 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించారు.

అయితే ఇండెక్సేషన్‌ లబ్ధిని ఎత్తివేశారు. ఎల్‌టీసీజీ పన్ను మినహాయింపు పరిమితి రూ. లక్ష నుంచి రూ.1.25 లక్షలకు పెంచారు. కాగా.. మూలధన లాభాలపై పన్ను(క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌) రేట్ల సవరణ కారణంగా రూ.15,000 కోట్లమేర అదనపు ఆదాయం సమకూరే వీలున్నట్లు రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా అంచనా వేశారు.  

బైబ్యాక్‌ షేర్లపైనా పన్ను
డివిడెండ్‌ తరహాలో విధింపు 
బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం డివిడెండ్‌ తరహాలో బైబ్యాక్‌ చేసే షేర్లపై వాటాదారులు పన్ను చెల్లించవలసి ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న నిబంధనలతో ఇకపై బైబ్యాక్‌ షేర్లకు వాటాదారులపై పన్ను విధించనున్నారు.

వెరసి కంపెనీలు చేపట్టే బైబ్యాక్‌లో భాగంగా షేర్లకు చెల్లించే సొమ్ముపై డివిడెండ్‌ తరహాలో వాటాదారులపైనే పన్ను భారం పడనుంది. ఇది ఇన్వెస్టర్లపై పన్ను భారాన్ని మరింత పెంచనుంది. మరోవైపు ఎస్‌టీటీతోపాటు.. స్వల్పకాలిక లాభాలపై పన్ను పెంపునకు తాజా బడ్జెట్‌ తెరతీసింది. ఇప్పటివరకూ బైబ్యాక్‌ షేర్లకు కంపెనీలే పన్ను చెల్లిస్తున్నాయి.

నైపుణ్య యువతరం.. ఉద్యోగ భారతం 
దేశంలో భారీగా కొత్త ఉద్యోగాల కల్పన, అందుకు వీలు కల్పించేలా యువతకు నైపుణ్య శిక్షణ లక్ష్యంతో మోదీ 3.0 సర్కారు అడుగులు వేసింది. తమ ప్రభుత్వం నిర్దేశించుకున్న తొమ్మిది అత్యంత ప్రాధాన్య అంశాల్లో ‘ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ’ఒకటని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. 

Employment


 
వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 4.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం కలిగేలా, రూ.2 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఉద్యోగాల కల్పన కోసం మూడు, నైపుణ్యాల అభివృద్ధి కోసం రెండు ప్రోత్సాహక పథకాలను చేపడతామని ప్రకటించారు. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు, కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ప్రయోజనాలను కల్పిస్తామని ప్రకటించారు. 

ఈపీఎఫ్‌ఓ డేటా ఆధారంగా..
కొత్త ఉద్యోగాల కల్పన పథకాలను.. ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ)లో నమోదయ్యే వివరాల ఆధారంగా అమలు చేస్తామని నిర్మల తెలిపారు. మొత్తంగా ప్రస్తుత 2024–25 కేంద్ర బడ్జెట్‌లో విద్య, ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ కోసం రూ.1.48 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో ఎంప్లాయ్‌మెంట్‌ లింక్‌డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌కు 23 వేల కోట్లు, జాబ్‌ క్రియేషన్‌ ఇన్‌ మాన్యుఫాక్చరింగ్‌ స్కీమ్‌కు రూ.52 వేల కోట్లు, సపోర్ట్‌ టుఎంప్లాయర్స్‌ స్కీమ్‌కు రూ.32 వేల కోట్లు కలిపి రూ.1.07 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నట్టు వివరించారు.

నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు..
కార్కుల నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు లభించేలా చర్యలు చేపడతామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అందుబాటులో ఉన్న ఉద్యోగాలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు, తగిన నైపుణ్యమున్న కార్మకులతో కూడిన డేటాబేస్‌ను సిద్ధం చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం ఈ–శ్రమ్, శ్రమ్‌ సువిధ, సమాధాన్‌ వంటి పోర్టల్స్‌ను అనుసంధానం చేస్తామని తెలిపారు. దీనితో స్కిల్‌ ప్రొవైడర్స్, ఎంప్లాయర్స్‌కు.. ఉద్యోగాలు కోరుకునే యువతకు మధ్య అనుసంధానంకుదురుతుందని వెల్లడించారు. 

ఐదేళ్లలో కోటి మందికి ఇంటర్న్‌షిప్‌ 
దేశంలో యువత సులభంగా ఉద్యోగాలు పొందేందుకు వీలు కల్పించేలా, ఉద్యోగంలో చేరే ముందే తగిన అనుభవం సాధించేలా.. విస్తృతస్థాయిలో ఇంటర్న్‌షిప్‌ పథకాన్ని అమలు చేస్తామని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో 500 టాప్‌ కంపెనీల్లో మొత్తంగా కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఇంటర్న్‌షిప్‌లో చేరేప్పుడు ఒకసారి రూ.6 వేలు అందిస్తామని, తర్వాత ప్రతినెలా రూ.5 వేలు ఇంటర్న్‌సిప్‌ అలవెన్స్‌ అందుతుందని వెల్లడించారు. 

ఏడాదిపాటు కొనసాగే ఈ ఇంటర్న్‌షిప్‌ సమయంలో సంబంధిత ఉద్యోగం, పని వాతావరణంపై యువతకు అవగాహన ఏర్పడుతుందని.. దీనితో మంచి ఉద్యోగం పొందేందుకు అవకాశం వస్తుందని వివరించారు. ఈ ఇంటర్న్‌షిప్‌ పథకానికి ఎంపికయ్యే యువతకు శిక్షణ ఇచ్చేందుకయ్యే వ్యయాన్ని, ఇంటర్న్‌షిప్‌ అలవెన్స్‌లో పది శాతాన్ని కంపెనీలు తమ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధుల నుంచి భరిస్తాయని తెలిపారు.

స్కిల్స్ పెరిగితే.. ఉద్యోగాలూ పెరుగుతాయి! 
బడ్జెట్‌లో దేశ యువతలో నైపుణ్యాల పెంపు, ఉద్యోగ కల్పనకు ప్రోత్సాహకాలు అందించే స్కీమ్‌లను ప్రకటించడంపై హ్యూమన్స్‌ రీసోర్స్, ఎడ్‌ టెక్‌ రంగాల నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘వికసిత్‌ భారత్‌’లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం ముందుచూపుతో నిర్ణయం తీసుకుందని ప్రశంసిస్తున్నారు. యువతలో నైపుణ్యాలు పెరిగితే ఉద్యోగ అవకాశాలు విస్తృతం అవుతాయని అంటున్నారు. 

‘‘మాన్యుఫాక్చరింగ్‌ రంగంలో ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు తోడ్పడతాయి. పరిశ్రమకు అవసరమైన మానవ వనరులు అందేందుకు నైపుణ్య శిక్షణ బాట వేస్తుంది. ఈ దిశగా ప్రభుత్వ నిర్ణయాలు బాగున్నాయి..’’అని టీమ్‌లీజ్‌ డిగ్రీ అప్రెంటిస్‌షిప్‌ చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ సుమిత్‌కుమార్‌ పేర్కొన్నారు. ‘‘నైపుణ్య శిక్షణ మాత్రమేగాకుండా.. ఉద్యోగులు, ఉద్యోగాలను కల్పించే కంపెనీలకూ ప్రోత్సాహకాలు ఇవ్వడం స్వాగతించదగిన విషయమని క్వెస్‌ కార్ప్‌ సీఈవో గురుప్రసాద్‌ శ్రీనివాసన్‌ చెప్పారు.

‘‘20 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ, కోటి మందికి ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు వంటివి రాబోయే తరం సాధికారతకు తోడ్పడతాయి. దేశంలోని యువతలో నైపుణ్యాల లోటును పూడ్చవచ్చు..’’అని పియర్సన్‌ ఇండియా కంట్రీ హెడ్‌ వినయ్‌కుమార్‌ స్వామి పేర్కొన్నారు.  

ఉద్యోగాల కల్పన కోసం.. 
1. ఎంప్లాయ్‌మెంట్‌ లింక్‌డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌: వ్యవస్థీకృత రంగాల్లో కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ప్రోత్సాహకంగా ఒక నెల వేతనం చెల్లింపు. మూడు వాయిదాల్లో.. గరిష్టంగా రూ.15 వేల వరకు అందిస్తారు. దీనితో వచ్చే ఐదేళ్లలో 2.1 కోట్ల మందికి లబ్ధి కలుగుతుందని అంచనా.  

2. జాబ్‌ క్రియేషన్‌ ఇన్‌మాన్యుఫాక్చరింగ్‌ స్కీమ్‌:  కొత్తగా ఉద్యోగంలో చేరేవారు,కొత్తగా ఉద్యోగాలిచ్చే సంస్థలు చెల్లించేఈపీఎఫ్‌ఓ చందాలపై తొలి నాలుగేళ్లపాటు ప్రోత్సాహకాలు. సుమారు 30 లక్షల మంది యువతకు ప్రయోజనం కలుగుతుందనిఅంచనా.

3. సపోర్ట్‌ టుఎంప్లాయర్స్‌ స్కీమ్‌: కంపెనీలు కొత్తగా/అదనంగా ఇచ్చే ఉద్యోగాలకు సంబంధించి యాజమాన్య వాటాగా చెల్లించే ఈపీఎఫ్‌ చందాల రీయింబర్స్‌మెంట్‌.  ఒక్కో ఉద్యోగికి నెలకు గరిష్టంగా రూ.3 వేల చొప్పున రెండేళ్లపాటు చెల్లిస్తారు. దీనితో కొత్తగా 50 లక్షల ఉద్యోగాల కల్పనజరుగుతుందని అంచనా. (ఈ మూడు స్కీమ్‌లనుగరిష్టంగా నెలకు రూ.లక్ష వేతనంఇచ్చే ఉద్యోగాలు/ఉద్యోగులకు మాత్రమే వర్తింపజేస్తారు.)

నైపుణ్యాల శిక్షణ కోసం..
1. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతలో నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకం. రాష్ట్రాలు, పరిశ్రమలు, కంపెనీలతో కలసి దీనిని అమలు చేస్తారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా కేంద్రీకృత విధానంలో 1,000 పారిశ్రామిక శిక్షణ ఇన్‌స్టిట్యూట్ల (ఐటీఐ) అప్‌గ్రెడేషన్‌. 
2. వచ్చే ఐదేళ్లలో కోటి మందికి 500 టాప్‌ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ అందించే మరో పథకం అమలు.
3. పరిశ్రమలు, కంపెనీల అవసరాలకుతగినట్టుగా ఉండేలా కోర్సులు,పాఠ్యాంశాల రూపకల్పన.
4. నైపుణ్య శిక్షణ కోసం ‘మోడల్‌ స్కిల్‌ లోన్‌ స్కీమ్‌’కింద ఏటా 25 వేల మంది యువతకు రూ.7.5 లక్షల వరకు రుణాలు.
5. మహిళలకే ప్రత్యేకించిన నైపుణ్యాల శిక్షణ కార్యక్రమాలు. ఉద్యోగాల్లో మహిళల భాగ స్వామ్యం పెరగడం కోసం.. పరిశ్రమలు, కంపెనీల సహకారంతో వర్కింగ్‌ విమెన్‌ హాస్టళ్లు, చిన్న పిల్లల సంరక్షణను చూసుకునే క్రెచ్‌ల ఏర్పాటుకు నిర్ణయం.

ప్రభుత్వ ఉద్యోగుల శిక్షణకు రూ.309.74 కోట్లు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు బడ్జెట్‌లో రూ.309.74 కోట్లను కేటాయించారు. ఇందులో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సెక్రటేరియట్‌ ట్రైనింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్,లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌కు రూ.103.05 కోట్లు. వివిధ శిక్షణ స్కీమ్‌లకు రూ.120.56 కోట్లు, మిషన్‌ కర్మయోగికి రూ.86.13 కోట్లు ఇచ్చారు. వీటితో ఉద్యోగులకు వివిధ నైపుణ్యాలపై రిఫ్రెషర్‌ కోర్సులు, మిడ్‌ కెరీర్‌ శిక్షణ ఇస్తారు.

కొత్త‌కు పన్నుకు జైజై.. పాత‌కు పన్నుకు బైబై..
ఉద్యోగస్తులు పాత పన్నుల విధానం కాకుండా కొత్త పన్నుల విధానం ప్రోత్సహించే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రస్తుత బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆదాయపన్ను రిటర్నులు దాఖలును సులభతరం చేస్తున్నామన్న నెపంతో పొదుపుపై ఎటువంటి పన్ను ప్రయోజనాలు ఉండని కొత్త పన్నుల విధానం ఎంచుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. పాత ఆదాయ పన్ను విధానంలో బీమా ప్రీమియం, గృహరుణం, పిల్లల చదువులు, పోస్టాఫీసు వంటి వివిధ సేవింగ్‌ పథకాలకు చేసే వ్యయాలను చూపించడం ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చు. 

Minor changes in the new tax regime slabs

కానీ 2020లో తక్కువ పన్నురేట్లతో వివిధ శ్లాబులను కొత్త పన్నుల విధానం ప్రవేశపెట్టింది. కొత్త పన్నుల విధానం ఎంచుకున్న వారు పొదుపు, వ్యయాలపై ఎటువంటి మినహాయింపులు వర్తించవు. మొత్తం ఆదాయం ఎంత అయితే అంత పన్ను చెల్లించాల్సిందే. కొత్త పన్నుల విధానం సులభతరంగా ఉండటంతో పన్ను చెల్లింపుదారులు ఈ విధానంవైపే మొగ్గు చూపుతున్నారని, 2023–24లో ఆర్థిక సంవత్సరంలో మూడింట రెండొంతుల మంది కొత్త పన్నుల విధానంలో రిటర్నులు దాఖలు చేసినట్లు సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. 

ఈ ఏడాది ఇప్పటి వరకు 8.61 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని కొత్త పన్నుల విధానం ఎంచుకున్న వారికే ఈ మార్పులు వర్తిస్తాయని ఆమె స్పష్టం చేశారు. రానున్న కాలంలో అందరూ కొత్త పన్నుల విధానం ఎంచుకోవాలన్న ఉద్దేశ్యంతో పాత పన్నుల విధానంకు పన్ను మినహాయింపులను తగ్గిస్తూ కొత్త విధానానికి ప్రయోజనాలను పెంచుతున్నారని ట్యాక్స్‌ నిపుణులు పేర్కొంటున్నారు. కొత్తగా మార్పులు చేసిన తర్వాత పది లక్షల లోపు పన్ను ఆదాయం ఉన్న వారికి కొత్త పన్నుల విధానం ఎంచుకుంటేనే ప్రయోజనంగా ఉంటుందంటున్నారు. 

Tax

స్థిరాస్తి విలువ రూ.50 లక్షలు దాటితే టీడీఎస్‌..
ఇక నుంచి రూ.50 లక్షలు దాటిన స్థిరాస్థి విలువను విక్రయిస్తే ఒక శాతం టీడీఎస్‌ చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఆదాయపన్ను చట్టం సెక్షన్‌ 194ఐఏ సెక్షన్‌ ప్రకారం స్థిరాస్థి విలువ రూ.50 లక్షలు దాటితే ఒక శాతం టీడీఎస్‌ వసూలు చేయాలి. స్థిరాస్థి విలువను ఒకరికంటే ఎక్కువ మందికి అమ్మినా మొత్తం విలువను పరిగణనలోకి తీసుకొని టీడీఎస్‌ను వసూలు చేస్తారని ఆమె స్పష్టం చేశారు. కానీ ఈ టీడీఎస్‌ నుంచి వ్యవసాయ భూములకు మినహాయింపు ఇచ్చారు. 

స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.75 వేలకు పెంపు 
కొత్త పన్ను విధానంలో ఉద్యోగులకు ఊరటనిస్తూ స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితిని 50% పెంచుతూ సీతారామన్‌ ప్రకటించారు. రూ.50 వేలుగా ఉన్న స్టాండర్డ్‌ డిడక్షన్‌ను రూ.75 వేలకు పెంచారు. ఫ్యా మిలీ పెన్షన్‌దారుల స్టాండర్డ్‌ డిడక్షన్‌ను రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. కొత్త పన్నుల విధానంలో 10% పన్నులోపు శ్లాబుల్లో స్వల్ప మార్పుల ను ప్రతిపాదించింది. 

కొత్త పన్నుల విధానంలో 3 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవస రం లేదు. గతంలో 5% పన్ను శ్లాబు పరిధి రూ.3– 6 లక్షలుగా ఉంటే ఇప్పుడు దాన్ని రూ.3–7 లక్షలకు, గతంలో రూ.6–9 లక్షలుగా 10% పన్ను పరిధిని రూ.7–10 లక్షలకు పెంచా రు. ఈ మార్పుల వల్ల ప్రతీ పన్ను చెల్లింపుదారునికి రూ.17,500 ప్రయోజనం లభిస్తుంది.

tax regime slabs

సాగుకు రూ.1.52 ల‌క్ష‌ల కోట్లు
వ్యవసాయానికి బడ్జెట్‌లో కేంద్రం పెద్దపీట వేసింది. బడ్జెట్‌కు సంబంధించిన తొమ్మిది ప్రాధాన్య అంశాల్లో వ్యవసాయ ఉత్పాదకతను ఒకటిగా చేర్చింది. మధ్యంతర బడ్జెట్‌లో పేర్కొన్న పథకాలను కొనసాగిస్తూనే కొత్త విధానాలకు శ్రీకారం చుట్టింది. సాగు ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా కేటాయింపులు జరిపింది. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2024–25బడ్జెట్‌ ప్రసంగంలోవెల్లడించారు.  

Farmor

పరిశోధనలకు ప్రోత్సాహం
‘వ్యవసాయ పరిశోధనలను సమగ్రంగాసమీక్షించడం ద్వారా ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకుని అధిక ఉత్పాదకతనిచ్చే సరికొత్త వంగడాల దిశగా ప్రోత్సహిస్తాం. ఈ మేరకు నిధులు కూడా అందజేస్తాం. ప్రైవేటు రంగానికి కూడా ఇందులో భాగస్వామ్యం కల్పిస్తాం. ప్రభుత్వ, ప్రభుత్వేతర వ్యవసాయ రంగ నిపుణులు ఈ పరిశోధనలను పర్యవేక్షిస్తారు. 32 వ్యవసాయ అలాగే ఉద్యాన పంటలకు సంబంధించి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే, అధిక దిగుబడినిచ్చే 109 కొత్తవంగడాలను రైతులు సాగుచేసేందుకు వీలుగా విడుదల చేస్తాం. 

10 వేల బయో ఇన్‌పుట్‌ రిసోర్స్‌ కేంద్రాలు
వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా కోటి మంది రైతులను సర్టిఫికేషన్, బ్రాండింగ్‌తో కూడిన ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహిస్తాం. శాస్త్రీయ సంస్థలు, ఆసక్తి కలిగిన గ్రామపంచాయతీల ద్వారా దీనిని అమలుచేస్తాం. 10 వేల అవసరాధారిత బయో ఇన్‌పుట్‌ రిసోర్స్‌ కేంద్రాలు (సేంద్రియ ఎరువుల కేంద్రాలు) ఏర్పాటు చేస్తాం. 

సహకార సంఘాలు,స్టార్టప్‌లకు ప్రోత్సాహం
అధిక వినియోగ కేంద్రాలకు సమీపంలో భారీ స్థాయిలో కూరగాయల ఉత్పత్తి క్లస్టర్లు అభివృద్ధి చేస్తాం. రైతు–ఉత్పత్తిదారు సంఘాలను ప్రోత్సహిస్తాం. అలాగే కూరగాయల సేకరణ, నిల్వ, మార్కెటింగ్‌తో సహా కూరగాయల సరఫరా వ్యవస్థల కోసం సహకార సంఘాలు, స్టార్టప్‌లను ప్రోత్సహిస్తాం. 

పప్పు దినుసులు, నూనెగింజల్లో స్వయం సమృద్ధి
పప్పు దినుసులు, నూనెగింజల్లో స్వయం సమృద్ధి సాధన దిశగా వాటి ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్‌ను బలోపేతం చేస్తాం. మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా వేరుశనగ, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు తదితర నూనెగింజలకు ‘ఆత్మనిర్భరత’ సాధన కోసం ఓ ప్రత్యేక వ్యూహానికి రూపకల్పన చేస్తాం. 

డిజిటల్‌ క్రాప్‌ సర్వే
పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైన నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో..వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా రైతులు, వారి భూముల కోసం వ్యవసాయంలో డిజిటిల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (డీపీఐ) అమలు చేస్తాం. ఈ ఏడాది 400 జిల్లాల్లో డీపీఐ ద్వారా ఖరీఫ్‌ పంటల డిజిటల్‌ సర్వే నిర్వహిస్తాం. 6 కోట్ల మంది రైతులు, వారి భూముల వివరాలను రైతు, భూమి రిజిస్ట్రీల్లో పొందుపరుస్తాం. ఐదు రాష్ట్రాల్లో జన్‌ సమర్థ్‌ ఆధారిత కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు జారీ చేస్తాం.

రొయ్యల ఉత్పత్తి ఎగుమతి
రొయ్యల సాగు కేంద్రాల నెట్‌వర్క్‌ ఏర్పాటుకు ఆర్థిక సాయంఅందజేస్తాం. నాబార్డ్‌ ద్వారా రొయ్యల సాగు, శుద్ధి, ఎగుమతికి నిధులుఅందజేస్తాం.

జాతీయ సహకార విధానం
సహకార రంగ సర్వతోముఖాభివృద్ధికి వీలుగా జాతీయ సహకార విధానాన్ని కేంద్రం తీసుకువస్తుంది.వేగవంతమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పెద్దయెత్తున ఉపాధి కల్పన, అవకాశాలు లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందిస్తాం..’ అని ఆర్థికమంత్రి వెల్లడించారు.

భూసారం పెంపు, జీవవైవిధ్యానికి దోహదం
సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, రసాయన ఎరువులు, క్రిమిసంహారాలపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలని కేంద్రం భావిస్తోంది. ప్రకృతి వ్యవసాయం భూసారాన్ని పెంచడమే కాకుండా జీవవైవిధ్యానికి దోహదపడుతుంది. 

రైతుల సాగు ఖర్చులు తగ్గేలా చేయడం ద్వారా వారి లాభదాయకతను పెంపొదిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రోత్సహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులు వాతావరణ సూచనలు, పంటలకు సంబంధించిన సలహా సేవలు, మార్కెట్‌ ధరల గురించిన సమాచారం తెలుసుకునేందుకు ఈ డిజిటిల్‌ ఫ్రేమ్‌వర్క్‌ ద్వారా వీలు కలుగుతుంది.

యూరియాకు బడ్జెట్‌లో సబ్సిడీ తగ్గింపు 
కేంద్ర బడ్జెట్‌లో యూరియాకు సబ్సిడీ తగ్గింది. 2022–2023లో 1,65,217 కోట్లు సబ్సిడీపై ఖర్చు చేయగా, 2023–24లో రూ.1,28,594 కోట్లకు తగ్గిపోయింది. 2024–25లో బడ్జెట్‌ను మరింత తగ్గించి 1,19,000 కోట్లు మాత్రమే కేటాయించారు. పోషకాధార ఎరువుల సబ్సిడీ కింద 2022–23లో రూ.86,122 కోట్లు ఖర్చు చేయగా, 2024–25లో ఇంకా తగ్గించి రూ.45,000 కోట్లు కేటాయించారు. అంటే కంపెనీలు పెంచే ఎరువుల ధరల భారాన్ని ఇకపై రైతులే భరించాల్సి ఉంటుందని రైతు నేతలు విమర్శిస్తున్నారు. 

అలాగే 2019 నుంచి కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేటాయింపులు తగ్గిపోతూ వస్తున్నాయి. 2019–20 సంవత్సర మొత్తం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 5.44 శాతం కేటాయించగా, ఇప్పుడు 2024–2025లో 3.15 శాతానికి పడిపోయింది. ఇక పంటల బీమా పథకానికి కూడా 2023–24లో రూ. 15,000 కోట్ల ఖర్చు అంచనా వేసిన ప్రభుత్వం ఈ ఏడాది దానిని రూ.14,600 కోట్లకు తగ్గించింది. వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీకి 2023–24 లో రూ.23,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ సంవత్సరం రూ.22,000 కోట్లు మాత్రమే కేటాయించింది.  

మద్దతు ధరలకు చట్టబద్దత ఏదీ? 
కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక, తెలంగాణరాష్ట్ర కమిటీకనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దేశవ్యాప్తంగా రైతులు గత ఏడేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌ సందర్భంగా ఈ చట్టం ప్రస్తావన చేయలేదు. పైగా వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపు కూడా తగ్గించింది.

Ayudalu

 

Published date : 24 Jul 2024 02:30PM

Photo Stories