Skip to main content

ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2017-18

తలసరి ఆదాయంలో పెరుగుదల, పన్నుల ఆదాయంలో వృద్ధి, జీడీపీ వృద్ధి రేటు - సంక్షేమ రంగంలో లక్ష్యాలకు సంబంధించిన కీలక గణాంకాలను వివరిస్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "సామాజిక, ఆర్థిక సర్వే 2017-18" ని మార్చి 8న అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
రాష్ట్రంలో అసమానతలను తొలగించి ప్రజలకు ఆరోగ్యం, సంపద, మెరుగైన మౌలిక సదుపాయలు కల్పించాల్సిన అవసరం ఉందని సర్వే అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ముఖ చిత్రాన్ని ఆవిష్కరించే "సామాజిక, ఆర్థిక సర్వే 2017-18" లోని కీలక అంశాలను పరిశీలిద్దాం...

సగటు వృద్ధి 11 శాతం
గడచిన మూడేళ్లలో రాష్ట్రం సగటున 11 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని సామాజిక, ఆర్థిక సర్వే పేర్కొంది. ఇదే కాలంలో భారత జీడీపీ వృద్ధి రేటు 7.31 శాతంగా ఉందని వివరించింది.

రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,42,054
ప్రస్తుత ధరలను పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తే రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 2017-18కి రూ.1,42,054కు చేరుతుందని ఆర్థిక సామాజిక సర్వే అంచనా వేసింది. 2015-16లో ఉన్న విలువ రూ.1,23,664తో పోలిస్తే తలసరి ఆదాయంలో 14.87 శాతం వృద్ధి చెందింది. అదే 2011-12 బేస్ ఇయర్ నాటి స్థిర ధరల ప్రకారం లెక్కిస్తే తలసరి ఆదాయం 10.55 శాతం వృద్ధితో రూ.96,374 నుంచి రూ.1,06,545కు చేరింది.

తలసరి ఆదాయం
2015-16 రూ.1,07, 276 కోట్లు
2016-17 రూ.1,23,664 కోట్లు
2017-18 రూ.1,42,054 కోట్లు (అంచనా)

Download AP Socio Economic SurveyDocument

పన్నుల ఆదాయంలో 20 శాతం వృద్ధి
రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో 20 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2016-17లో రూ.44,181 కోట్లుగా ఉన్న సొంత పన్నుల ఆదాయం.. ఈ ఏడాది రూ.52,717 కోట్లకు చేరింది. ఇదే సమయంలో సొంత పన్నేతర ఆదాయంలో 34 శాతం వృద్ధి నమోదైంది. 2016-17లో రూ.3,989 కోట్లుగా ఉన్న ఆదాయం.. ఈసారి రూ.5,347 కోట్లకు పెరిగింది. ఈ రెండూ కలిపితే రాష్ట్ర సొంత ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.48,170 కోట్ల నుంచి రూ.58,064 కోట్లకు చేరింది.

జీవీఏలో తగ్గిన వ్యవసాయం, సేవల వాటా
2017-18 ఆర్థిక సామాజిక సర్వే గణాంకాల ప్రకారం... రాష్ట్ర స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో వ్యవసాయం, సేవలు, పరిశ్రమల రంగాల వాటా క్షీణించింది. 2016-17 తుది అంచనాల ప్రకారం జీవీఏలో వ్యవసాయం (అనుబంధ రంగాలు కాకుండా) వాటా 5.93 శాతంగా ఉంటే అది 2017-18లో 5.38 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది.
  • కానీ వ్యవసాయ అనుబంధ రంగాలు అంటే.. చేపలు, హార్టికల్చర్ వంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే జీవీఏలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాట 32.75 శాతం నుంచి 34.37 శాతానికి పెరిగింది.
  • ఇదే సమయంలో సేవల రంగం వాటా 44.38 శాతం నుంచి 43.55 శాతానికి, పరిశ్రమల వాట 22.87 శాతం నుంచి 22.09 శాతానికి తగ్గినట్లు సర్వే పేర్కొంది.
  • 2016-17లో రూ. 6,34,742 కోట్లుగా ఉన్న జీవీఏ 2017-18లో 15.9 శాతం పెరిగి రూ.7,35,709 కోట్లకు చేరుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇదే సమయంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీవీఏకి పన్నుల ఆదాయం కలిపి దానిలోంచి సబ్సిడీలు తీయగా వచ్చే విలువ) రూ.6,95,491 కోట్ల నుంచి రూ.8,03,873 కోట్లకు చేరనుంది.
వాణిజ్యం.. ఎగుమతులు
రాష్ట్రం నుంచి ఎగుమతులు - ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాణాధార మందులు, ఖనిజాలు, ఖనిజ ఉత్పత్తులు, సాఫ్ట్‌వేర్.
సంవత్సరం ఎగుమతులు
2016-17 రూ.80,559.87 కోట్లు
2017-18(నవంబర్ వరకు) రూ. 50,404.75 కోట్లు

రాష్ట్ర జనాభా 5.10 కోట్లు
రాష్ట్ర జనాభా 5.10 కోట్లకు చేరుకున్నట్లు సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. 2016-17లో 5,07,43,000గా ఉన్న జనాభా.. గడచిన ఏడాది కాలంలో 0.58 శాతం(2,98,000 పెరుగుదల) వృద్ధితో 5,10,41,000కు చేరుకుందని పేర్కొంది. రాష్ట్రం విడిపోయేనాటికి రాష్ట్ర జనాభా 5,01,51,000గా ఉండగా..ఈ మూడేళ్లలో ఏటా సగటున 2.96 లక్షల చొప్పున జనాభా సంఖ్య 8.90 లక్షలు పెరిగింది.

దడ పుట్టిస్తున్న ధరలు
రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని సామాజిక ఆర్థిక సర్వే తెలిపింది. గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ నాటికి దేశీయ వినియోగదారుల ధరల సూచీ 134 పాయింట్లుగా ఉంటే.. మన రాష్ట్రంలో మాత్రం 139 పాయింట్లుగా ఉంది. 2016-17తో పోలిస్తే 2017-18లో ఉల్లిపాయలు, చింతపండు ధరలు భారీగా పెరగ్గా.. కందిపప్పు, ఎండుమిర్చి ధరలు స్వల్పంగా తగ్గినట్లు సర్వే పేర్కొంది. కిలో ఉల్లిపాయల(రెండో రకం) ధరలు రూ.12.71 నుంచి రూ.22.17కి పెరగ్గా.. కేజీ చింతపండు ధర రూ.89.20 నుంచి రూ.107.64కు చేరింది. ఇదే విధంగా బియ్యం, ఇతర నిత్యవసరాల ధరలు కూడా పెరిగాయి.

మహిళలకు పెరిగిన కూలి
రాష్ట్రంలో పురుషుల కంటే మహిళలకే కూలి రేట్లు బాగా పెరిగాయని ఆర్థిక సర్వే వెల్లడించింది. గత ఏడాది కాలంలో పురుషుల కూలి రేట్లు 5.52 శాతం పెరిగితే.. మహిళల కూలి రేట్లు 8.47 శాతం పెరిగిందని తెలిపింది. పురుషుల సగటు కూలి రేటు రూ.299.88 నుంచి రూ.316.44కి పెరగ్గా.. మహిళల సగటు కూలి రేటు 214.75 నుంచి 232.96కు పెరిగింది. రాష్ట్రంలో అత్యధిక సగటు కూలి(రూ.348.67) అందుకుంటున్న వారిలో వడ్రంగి కార్మికులుండగా.. అత్యల్ప మొత్తం(రూ.271.79) తీసుకుంటున్న వారిలో చర్మకారులున్నారు.

పెరగనున్న పప్పుల దిగుబడి
రాష్ట్రంలో పప్పుదినుసులు, నూనె గింజల సాగు తగ్గినా.. దిగుబడి మాత్రం భారీగా పెరగనుందని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే పప్పు దినుసుల సాగు విస్తీర్ణం 14,13,000 హెక్టార్ల నుంచి 13,71,000 హెక్టార్లకు పడిపోయినా.. దిగుబడి మాత్రం 9,31,000 టన్నుల నుంచి 11,44,000 టన్నులకు పెరగనుందని అంచనా వేసింది.
  • అలాగే నూనె గింజల సాగు 12,30,000 హెక్టార్ల నుంచి 9,14,000 హెక్టార్లకు తగ్గినా.. దిగుబడి మాత్రం 24,91,000 టన్నుల నుంచి 29,11,000 టన్నులకు పెరగనుందని తెలిపింది.
  • కానీ ధాన్యం సాగు విస్తీర్ణం పెరిగినా ఆ స్థాయిలో దిగుబడి పెరుగుదల లేదు. ఖరీఫ్, రబీ కలిపి వరి సాగు 5,85,000 హెక్టార్ల నుంచి 6,75,000 హెక్టార్లకు పెరగ్గా.. దిగుబడి మాత్రం 1,20,03,000 టన్నుల నుంచి 1,20,77,000 టన్నులు మాత్రమే వస్తుందని అంచనా వేసింది.
కోటి దాటిన వాహనాలు
రాష్ట్రంలోని వాహనాల సంఖ్య కోటి మార్కును దాటింది. 2014 మార్చి నాటికి రాష్ట్రంలో 70.02 లక్షల వాహనాలుండగా.. గతేడాది నవంబర్‌కల్లా ఈ సంఖ్య 1.03 కోట్లకు పెరిగింది. ఇందులో ద్విచక్ర వాహనాలే 81 లక్షలకుపైగా ఉన్నాయి. 2014లో 54,31,832 ద్విచక్ర వాహనాలుండగా.. 2017 నవంబర్ నాటికి వీటి సంఖ్య 81,43,995కు పెరిగింది. అలాగే 5,09,581 ఆటోలు, 6,26,722 సరకు రవాణా వాహనాలున్నాయి. ఇదే సమయంలో కార్లు కూడా దాదాపు 50 శాతం మేర పెరిగాయి. 2014లో 4,34,516 మోటార్ కార్లుండగా.. గతేడాది నవంబర్‌కల్లా వీటి సంఖ్య 6,37,461కు ఎగబాకింది. మరోవైపు కాంట్రాక్టు క్యారియర్ వాహనాల సంఖ్య 2,737 నుంచి 3,816కు పెరిగింది.

కీలక గణాంకాలు
  • రాష్ట్ర విస్తీర్ణం 1,62,970 చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో 8వ అతిపెద్ద రాష్ట్రం.
  • దేశంలో ఎక్కువ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల్లో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో ఉన్న కోస్తా తీర ప్రాంతం పొడవు 974 కిలోమీటర్లు.
  • రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 36,909.38 చదరపు కిలోమీటర్లు. మొత్తం విస్తీర్ణంలో ఇది 23.04 శాతం. అటవీ విస్తీర్ణం పరంగా 9వ స్థానంలో ఏపీ.
  • జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో 10వ అతిపెద్ద రాష్ట్రం.
  • పండ్లు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్. మిర్చి, కోకో, నిమ్మ, ఆయిల్‌పామ్, బొప్పాయి, టమోటా ఉత్పాదకతలోను తొలి స్థానం.
  • జీడిమామిడి, మామిడి, బత్తాయి ఉత్పాదకతలో రెండో స్థానంలో ఏపీ.
Published date : 09 Mar 2018 04:38PM

Photo Stories