Civils Ranker Ananya Reddy Success Story: ఎలాంటి కోచింగ్‌ లేకుండానే.. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో మూడో ర్యాంకు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌/ అడ్డాకుల: యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్‌ ఫలితాల్లో పాలమూరు బిడ్డ సత్తాచాటింది. సివిల్స్‌– 2023 ఫలితాల్లో జిల్లాకేంద్రానికి చెందిన దోనూరు అనన్యరెడ్డి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. ఆమె ఒక సాధారణ కుటుంబంలో జన్మించి సివిల్స్‌లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చడం పట్ల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చిన్నప్పటి నుంచి ఐఏఎస్‌ కావాలన్న ఆశయం ఉన్న ఆమె బాల్యమంతా మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలోనే గడిచింది. ఆమె ఐఏఎస్‌ కావాలన్న కలలకు స్ఫూర్తినిచ్చింది తాత కృష్ణారెడ్డి ఆయన సలహాలు, సూచనలతో చిన్నప్పటి నుంచి సివిల్సే లక్ష్యంగా చదువుకున్నట్లు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఎలాంటి శిక్షణ లేకుండా.. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌ జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించింది.

ఇంటర్‌ ప్రారంభం నుంచే..
అనన్య ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మహబూబ్‌నగర్‌లోని గీతం పాఠశాలలో చదివారు. ఎస్సెస్సీలో మంచి గ్రేడింగ్‌తో ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్‌ ప్రారంభం నుంచి ఐఏఎస్‌ వైపు అడుగులు పడ్డాయి. దీంతో ఆమెను హైదరాబాద్‌లోని నారాయణ ఐఏఎస్‌ అకాడమీలో చేర్చారు. ఇంటర్‌ పూర్తయ్యాక ఢిలీల్లోని మిరిండా హౌస్‌ కళాశాలలో ఏబీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌)లో చేరారు.

UPSC Civils Ranker Hanitha Success Story: వీల్‌ చెయిర్‌కే పరిమితమైనా..పట్టువిడవని విశ్వాసంతో సివిల్స్‌ సాధించిన వైజాగ్‌ యువతి

 

డిగ్రీ పూర్తయ్యాక 2020 నుంచి పూర్తిస్థాయిలో సివిల్స్‌ ప్రిపరేషన్‌పై దృష్టిపెట్టారు. ఢిల్లీలోనే పీజీ చదువుతూ సివిల్స్‌ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సివిల్స్‌లో ఆప్షనల్‌ సబ్జెక్టులుగా ఆంత్రపాలజీని ఎంపిక చేసుకున్నారు. ఈ ఒక్క ఆంత్రపాలజీ కోసం ఆన్‌లైన్‌లోనే శిక్షణ తీసుకున్నారు. దీంతో మిగతా సబ్జెక్టులు అన్ని కూడా సొంత ప్రిపరేషన్‌తో ముందుకు సాగారు. ప్రతిరోజు 12 నుంచి 14 గంటల పాటు సిద్ధమయ్యాయని చెప్పారు.

సొంత ప్రిపరేషన్‌
సివిల్స్‌కు సిద్ధమయ్యే క్ర మంలో అనన్యరెడ్డి సొంత ప్రిపరేషన్‌పైనే ఎక్కు వగా దృష్టిపెట్టారు. ప్రతి రోజు 12 గంటల నుంచి 14 గంటలపాటు చదువుకునేవారు. సబ్జెక్టులో ప్రతి అంశాన్ని నోట్‌గా రాసుకునే అలవాటు ఉండటంతో శిక్షణ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. చాలా సులువుగా లక్ష్యాన్ని చేరు కుని ప్రణాళిక ప్రకారం నిర్దేశిత సమయంలో సిలబస్‌ను పూర్తిచేసే విధంగా ఆమె ప్రిపరేషన్‌ కొనసాగించారు. సివిల్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూలకు హాజరయ్యే క్రమంలో సీనియర్ల సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడినట్లు అనన్యరెడ్డి చెప్పారు.

పొన్నకల్‌లో సంబరాలు
అనన్యరెడ్డి యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. పొన్నకల్‌వాసికి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు రావడంతో కుటుంబసభ్యులు, బంధువులు అనన్యరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనన్యరెడ్డి తండ్రి సురేష్‌రెడ్డి గ్రామంలో కొన్నాళ్లపాటు వ్యవసాయం చేశారు. 20 ఏళ్ల కిందట ఇద్దరు కుమార్తెల చదువుల కోసం మహబూబ్‌నగర్‌ వెళ్లి స్థిరపడ్డాడు. అక్కడే వ్యాపారాలు చేస్తూ కుమార్తెలను చదివించారు.

#Tags