SFI: డైట్‌ బిల్లులు వెంటనే విడుదల చేయాలి

సూర్యాపేట టౌన్‌: తొమ్మిది నెలలుగా డైట్‌ బిల్లులు విడుదల చేయకపోతే ప్రభుత్వ హాస్టళ్లు ఎలా నిర్వహిస్తారని, వెంటనే డైట్‌ బిల్లులు చెల్లించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఏప్రిల్ 14న‌ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు స్వరాజ్యం ప్రాంగణంలో నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ 3వ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బిల్లుల మంజూరు కేవలం తెల్ల పేపర్లలో చూసుకోవడానికే కనిపిస్తున్నాయని, సంక్షేమ వసతి గృహాల అధికారుల అకౌంట్లలో డబ్బులు ఎందుకు వేయ డం లేదని ప్రశ్నించారు.

రాష్ట్ర వ్యాప్తంగా డైట్‌ బిల్లులు సకాలంలో ఇవ్వని కారణంగా సంక్షేమ హాస్టల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహార భోజనం అందించలేకపోతున్నారని పేర్కొన్నారు. ఏడు వేల కోట్ల రూపాయలకుపైగా స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలున్నాయన్నారు.

చదవండి: SFI: విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాలు వెనక్కి తీసుకోవాలి

విద్యా సంవత్సరం పూర్తి కావస్తోందని, ఇప్పటికే ట్యూషన్‌ ఫీజులు చెల్లించని కారణంగా ప్రైవేట్‌ యాజమన్యాలు విద్యార్థులను తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాయన్నారు. ముందుగా ఎస్‌ఎఫ్‌ఐ జెండాను సంఘం జిల్లా అధ్యక్షుడు వినోద్‌కుమార్‌ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర మాజీ నాయకుడు మల్లు నాగార్జునరెడ్డి, ధనియాకుల శ్రీకాంత్‌వర్మ, వేల్పుల వెంకన్న, ఉపేందర్‌, వినయ్‌, తాళ్ల వినయ్‌, విష్ణు, జవ్వంత్‌, సుమన్‌, మనీషా సాయి, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: ST Hostel Students: విద్యార్థులతో పనులు చేయిస్తారా?

#Tags