PM SHRI scheme: పాఠశాల విద్యకు మరింత చేయూత

సాక్షి, భీమవరం: ప్రభుత్వ పాఠశాలల్ని ఆధునిక పరిశోధన కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ) పథకాన్ని అమలుచేస్తోంది.

విద్యార్థుల కోసం పాఠశాలల్లో ల్యాబ్‌లు, వృత్తి విద్య, క్రీడా నైపుణ్యం పెంపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఈ పథకానికి జిల్లా నుంచి 50కు పైగా పాఠశాలలు పోటీ పడగా 24 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిలో 22 ఉన్నత పాఠశాలలు ఉండగా ఒక యూపీ, ఒక ప్రైమరీ పాఠశాల ఉన్నాయి. విద్యార్థుల్లో క్రీడా, సాంకేతిక నైపుణాభివృద్ధి లక్ష్యంగా జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలకు ప్రభుత్వం రూ.1.83 కోట్లు మంజూరు చేసింది. ఆయా వసతుల కల్పనకు తొలి విడతగా రూ.30 లక్షలు విడుదల చేసింది. వీటితో అవసరమైన పనులు చేపట్టేందుకు సర్వశిక్ష అభియాన్‌ అధికారులు చర్యలు చేపట్టారు.

క్రీడావసరాలకు రూ.5 లక్షలు
క్రీడా అవసరాల కోసం 18 పాఠశాలలకు రూ. ఐదు లక్షలు చొప్పున నిధులు కేటాయింపులు చేసి తొలివిడతగా రూ.లక్ష చొప్పున విడుదల చేసింది. ఆయా పాఠశాలల్లో క్రీడా ప్రాంగణాల అభివృద్ధి, అవసరమైన కోర్టుల నిర్మాణం, క్రీడాసామగ్రి కొనుగోలు తదితర క్రీడా అవసరాలకు ఈ నిధులు వినియోగించాల్సి ఉంది. అలాగే ఆరు పాఠశాలలకు కెమిస్ట్రీ ల్యాబ్‌ల కోసం అదనపు తరగతి గది నిర్మాణానికి రూ.15.58 లక్షలు చొప్పున మంజూరు చేసింది. పనులు చేపట్టేందుకు తొలివిడతగా రూ. రెండు లక్షలు చొప్పున నిధులు విడుదల చేసింది.

చదవండి: IB Education in AP Schools: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో... IB(ఇంటర్నేషనల్ బకలారియేట్) - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ SCERT మధ్య ఒప్పందం!!

ల్యాబ్‌లకు ఎంపికై న పాఠశాలలు
బాలుర గురుకుల పాఠశాల (ఎల్బీ చర్ల), గురుకుల పాఠశాల, కడకట్ల (తాడేపల్లిగూడెం), బల్లిపాడు, చినకాపవరం, గుట్లపాడు, కలవపూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలు ఎంపికయ్యాయి.

క్రీడా అవసరాలకు ఎంపికై న పాఠశాలలు
గురుకుల పాఠశాల (ఆచంట), బీఆర్‌ఎంవీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాల (పాలకొల్లు), జీహెచ్‌ఎస్‌ (పెంటపాడు), జీహెచ్‌ఎస్‌ (ఎండగండి), జేఎల్బీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాల (భీమవరం), మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాల (రాయపేట), ఎంపీయూపీఎస్‌ (వేల్పూరు), వేమవరం, ఆకివీడు, తణుకు, ఇరగవరం, కవిటం, మార్టేరు, మొగళ్లు, మొగల్తూరు, శివదేవుని చిక్కాల, తాడేపల్లిగూడెం, వీరవాసరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు ఎంపికయ్యాయి.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు
ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు ఎంపికై న పాఠశాలలకు అవసరాలు, కల్పించనున్న వసతులకు సంబంధించి ఇప్పటికే సర్వశిక్ష అభియాన్‌ అధికారులు నివేదికను రూపొందించారు. పాఠశాలల సమగ్ర వివరాలు, క్రీడాస్థలం, తరగతి గదులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి తొలి దశ నిధులు విడుదల కాగా ఆయా పనులు చేపట్టేందుకు ఎస్‌ఎస్‌ఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

చదవండి: Free training courses: ఉపాధి ఆధారిత కోర్సుల్లో ఉచిత శిక్షణ

త్వరలో పనులు ప్రారంభిస్తాం
జిల్లాలో 24 పాఠశాలలకు పీఎంశ్రీ నిధులు మంజూరయ్యాయి. తొలి దశగా 18 పాఠశాలలకు రూ.లక్ష చొప్పున, ఆరు పాఠశాలలకు రూ.రెండు లక్షల చొప్పున నిధులు విడుదలయ్యాయి. ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఆయా పాఠశాలల్లో అవసరమైన పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– పి.శ్యామ్‌సుందర్‌, ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ

#Tags