Suchindra Rao: సైన్స్‌ ఫెయిర్‌కు సన్నద్ధం

ఇబ్రహీంపట్నం: రెండు రోజులపాటు నిర్వహించే జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనకు గురుకుల విద్యాపీఠ్‌ వేదికయింది.

 మంగళ, బుధవారం నిర్వహించే ఈ ప్రదర్శనకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు తెలిపారు. ఈ మేరకు జ‌నవ‌రి 8న‌ ఆయన పాఠశాలలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సంబంధిత కమిటీల బాధ్యులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. 2023–24 విద్యా సంవత్సరంలో ‘రాజ్య స్తరీయ్‌ బాల్‌’(వైజ్ఞానిక, గణిత, పర్యావరణ ఎగ్జిబిట్స్‌) వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు చొరవ తీసుకుని నాణ్యమైన ప్రాజెక్టులను తీసుకురావాలని సూచించారు. ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులు, సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కమిటీ బాధ్యులకు సూచించారు. వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి శ్రీనివాస్‌రావు సెల్‌ నంబర్‌ 9395390985లో సంప్రదించాలని సుశీందర్‌రావు చెప్పారు.

చదవండి: INSPIRE MANAK: ఇన్‌స్పైర్‌ మనక్‌ ప్రదర్శనలు.. ఈ తేదీ లోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయ‌లి

ఉదయం 11గంటలకు ప్రదర్శన ప్రారంభం

రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, సమాచార శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జ‌నవ‌రి 9న‌ ఉదయం 11 గంటలకు ఈ ప్రదర్శనను ప్రారంభించనున్నట్లు డీఈఓ చెప్పారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్‌ అనితారెడ్డి పాల్గొంటారని చెప్పారు.

ఈ సమావేశంలో జిల్లా సైన్స్‌ అధికారి శ్రీనివాస్‌రావు, డీసీసీబీ కార్యదర్శి రామచంద్రారెడ్డి, ఎంఈఓలు వెంకట్‌రెడ్డి, కృష్ణ, రాంరెడ్డి, స్థానిక గురుకుల విద్యాపీఠ్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌రావు, వివిధ నిర్వాహక కమిటీల కన్వీనర్లు, సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థుల్లోని శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలను వెలికితీసి వారి ప్రతిభకు పదును పెట్టే సైన్స్‌ ఫెయిర్‌కు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. ప్రదర్శనకు సూచించిన అంశాల్లో ఉత్తమ మోడల్స్‌ తయారుచేయించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

#Tags