Library: జగనన్న హయాంలో ఆధునికంగా గ్రంథాలయ వ్యవస్థ
గుంటూరు ఎడ్యుకేషన్: గ్రంథాలయ వ్యవస్థను సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వ ఆధునికంగా తీర్చిదిద్దిందని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు పేర్కొన్నారు. అరండల్పేటలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న శేషగిరిరావు మాట్లాడుతూ గ్రంథాలయాలు ఒక సజీవ వ్యవస్థగా సమాజంతో మమేకమై ఉన్నాయని, ఈ వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆధునిక గ్రంథాలయాలను ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రోత్సహిస్తోందని, డిజిటల్ గ్రంథాలయాల వ్యవస్థను జగనన్న ప్రభుత్వం గ్రామస్థాయిలో పేదలకు సైతం అందుబాటులోకి తీసుకువచ్చిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయ వారోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించామన్నారు. వారోత్సవాల్లోనే కాకుండా నిత్య జీవితంలో ప్రతిరోజూ గ్రంథాలయాలకు వచ్చి, విజ్ఞానదాయక పుస్తకాలను చదవడాన్ని అలవాటుగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయాల రూపు, రేఖలను మార్చివేసిన ప్రభుత్వం పాఠకులు, విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేసిందన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి కుసుమ శ్రీదేవి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి గ్రంథాలయాలకు వచ్చి పుస్తక పఠనం చేయాలని సూచించారు. పౌర గ్రంథాలయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ షేక్ పీర్ అహ్మద్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులకు అందుబాటులో రీడర్స్ అన్ డిమాండ్ ద్వారా అవసరమైన పుస్తకాలను అందజేస్తామని తెలిపారు. అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్ దీక్షితులు మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన దేవాలయాలని, గ్రంథాలయానికి వచ్చి పుస్తక పఠనం చేయటం ద్వారా ఎంతో జ్ఞానాని పెంపొందించుకోవచ్చన్నారు. ఈసందర్భంగా వారం రోజుల పాటు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు బహుకరించారు. కార్యక్రమంలో కన్న విద్యాసంస్థల డైరెక్టర్ కన్న మాస్టారు, విశ్రాంత వాణిజ్య పన్నుల శాఖాధికారి కె. చంద్రశేఖరరావు, జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కె. ఝాన్సీలక్ష్మి, గ్రంధ పాలకులు యన్.నాగిరెడ్డి, ఐవీ దుర్గారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ఎం. సీతారామయ్య, పాఠకులు, సిబ్బంది పాల్గొన్నారు.
చదవండి: 8773 Bank Jobs 2023: ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్ పోస్టులు... ఎంపిక విధానం...
25న కేఎల్యూ స్నాతకోత్సవం 4465 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ జి.పార్థసారథివర్మ తెలిపారు. విజయవాడ నగరంలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 4,465 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయనున్నట్లు తెలియజేశారు. గత విద్యా సంవత్సరంలో అత్యంత ప్రతిభ కనబరచిన 38 మంది విద్యార్థులకు బంగారు, 41 మందికి రజత పతకాలను, నగదు బహుమతులను అందించనున్నట్లు చెప్పారు. కేఎల్యూ స్నాతకోత్సవం కార్యక్రమానికి ప్రపంచ సైన్స్ అకాడమీ అధ్యక్షుడు, ఇటలీకి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కరీం ముఖ్య అతిథిగా పాల్గొని ఉపన్యసిస్తారని, భారతరత్న అవార్డు గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్ రావు, జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైన్స్, రీసెర్చ్ సెంటర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కులకర్ణి, తెలుగు చలనచిత్ర నటుడు మురళీ మోహన్ గౌరవ అతిథులుగా పాల్గొంటారన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్ డాక్టర్ సుబ్బారావు, యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాసరావు, డీన్ కిషోర్ బాబు పాల్గొన్నారు.
చదవండి: Jobs in IT sector: ఐటీ రంగంలో నెలకు 25 వేల ఉద్యోగాలు