Skip to main content

Free Land Survey Training: న్యాక్‌ శిక్షణ.. భవిష్యత్‌కు నిచ్చెన

సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని న్యాక్‌ కేంద్రంలో 18 మంది భూసర్వేపై శిక్షణ పొందుతున్నారు. వీరంతా నిరుపేద కార్మిక, వ్యవసాయ కుటుంబాలకు చెందినవారు.
Land Survey Training

కేవలం కార్మికులుగా గుర్తింపు కార్డులు పొందినవారి పిల్లలకే ప్రత్యేకంగా న్యాక్‌ ద్వారా భూసర్వేపై జీపీఎస్‌(గూగుల్‌ పొజిషన్‌ సిస్టమ్‌)పై శిక్షణ ఇస్తున్నారు. గతంలో ఇనుప గొలుసులు పట్టి భూమిని కొలిచేవారు. కానీ ఇప్పుడు శాటిలైట్‌ విధానంలో గూగుల్‌ పొజిషన్‌ సిస్టమ్‌ ద్వారా నేరుగా అక్షాంశ, రేకాంశాల ఆధారంగా భూమిని శాసీ్త్రయంగా కొలుస్తున్నారు.

చదవండి: Free Training in Land Surveyor Course: ల్యాండ్‌ సర్వేయర్‌ కోర్సులో ఉచిత శిక్షణ

నమ్మకమైన ఉపాధికి బాటలు

భూమి కొలతలకు సంబంధించి సర్వే చేసేవారి సంఖ్య తక్కువగా ఉంది. నిత్యం భూవివాదాలు ఎక్కువయ్యాయి. భూమి హద్దులకు సంబంధించి సర్వే చేయాలని భూమి కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్‌, డివిజనల్‌ ఇన్‌స్పెక్టర్‌, మండల సర్వేయర్లకు దరఖాస్తులు చేసే వారి సంఖ్య పెరిగింది.

పాత తరం భూమి కొలతలపై నమ్మకాలు సడలిపోవడంతో ఆధునిక విధానంలో సర్వే చేయించుకోవాలని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శాసీ్త్రయంగా భూములను కొలిచే వారి సంఖ్య జిల్లాలో తక్కువగా ఉంది. కానీ నమ్మకంగా భూములను కొలిచే వ్యక్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ప్రభుత్వం చూడా ప్రైవేటు సర్వేయర్లకు జీపీఎస్‌ మిషన్‌ ఉంటే లైసెన్స్‌ జారీ చేస్తుంది.

చదవండి: టిప్పన్‌ నక్ష అంటే ఏమిటి? ఆ పేరు ఎలా వచ్చింది? #sakshieducation

భూమి కొలతలపై నైపుణ్యం ఉంటే నమ్మకమైన ఉపాధికి అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో ఐదుగురు యువతులు, 13 మంది యువకులకు భూసర్వేపై శిక్షణ ఇస్తున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలోనూ వారితో భూసర్వేలు చేయిస్తున్నారు. శిక్షణ కేంద్రంలోనే భోజనం, టీ, స్నాక్స్‌ అందిస్తూ తర్ఫీదు ఇస్తున్నారు. వీరంతా న్యాక్‌ ద్వారా సర్టిఫికెట్లు పొంది నేరుగా క్షేత్రస్థాయిలో మరింత అనుభవం సాధిస్తే ఉపాధికి ఢోకా ఉండదు.

ఈ అమ్మాయి పేరు కుర్మాచలం హర్షిణి. సిరిసిల్ల గీతానగర్‌కు చెందిన హర్షిణి ఇంటర్‌ వరకు చదువుకుంది. అమ్మ బీడీలు చేస్తుంది. నాన్నా చిన్న దుకాణం నిర్వహిస్తాడు. ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్న హర్షిణికి న్యాక్‌ కేంద్రంలో భూమి కొలతపై సర్వే శిక్షణకు ముందుకొచ్చింది. మూడు నెలలుగా శిక్షణ పొందింది. ఇక్కడ నేర్చుకున్న సర్వే అంశాలతో క్షేత్రస్థాయిలో ఉపాధి పొందే అవకాశాన్ని అందిపుచ్చుకుంది.

కార్మికుల పిల్లలకే..

సిరిసిల్లలో న్యాక్‌ ద్వారా భూసర్వేలో శిక్షణ ఇస్తున్నాం. ఇక్కడ శిక్షణ పొందేవారంతా కార్మికులుగా గుర్తింపు కార్డులు ఉన్నవారి పిల్లలను ఎంపిక చేశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి సంయుక్తంగా తర్ఫిదు ఇస్తుంది. మార్చి 30న ప్రారంభమైన శిక్షణ ఈనెల 4న ముగుస్తుంది. యువతీ, యువకులు ఎంతో ఓర్పుగా శిక్షణ పొందారు. క్షేత్రస్థాయిలో పని చేసేందుకు వీలుగా నైపుణ్యం సాధించారు.

– వి.గంగాధర్‌, న్యాక్‌ కేంద్రం ఇన్‌చార్జి, సిరిసిల్ల

Published date : 03 Jul 2024 03:55PM

Photo Stories