Skip to main content

PM SHRI scheme: ఒక్కో పాఠ‌శాల‌కు 46 ల‌క్ష‌లు.... దేశ‌వ్యాప్తంగా 9 వేల పాఠ‌శాల‌ల‌కు మ‌హ‌ర్ద‌శ‌... పూర్తి వివ‌రాలు ఇవిగో

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి, అధునాతన స్కూల్స్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలవిద్యను తీర్చి దిద్దడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా(పీఎంశ్రీ) పథకానికి దేశ‌వ్యాప్తంగా 9000 పాఠ‌శాల‌లు ఎంపిక‌య్యాయి. ఆహ్లాదకర వాతావరణం, ఆధునికపద్ధతుల్లో బోధన ఉంటే పాఠశాలల్లో మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చనేది కేంద్రం యోచన. గ్రామస్థాయి విద్యార్థులకు కూడా జాతీయ స్థాయి విద్యాప్రమాణాలను అందుబాటులోకి తేవచ్చని, విద్యార్థుల ప్రతిభకు మరింత పదును పెట్టి, ఉపాధి మార్గాలకు పాఠశాల దశలోనే పునాదులు వేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ పథకం కింద ఎంపికైన పాఠశాలలకు మూడేళ్లలో రూ.46 లక్షలు అందిస్తారు.
PM SHRI scheme
PM SHRI scheme

మౌలిక సదుపాయం.. మరింత సాయం 
పీఎంశ్రీ కింద ఎంపికైన బడుల్లో సొంత భవనాలు, మరుగుదొడ్లు, గ్రంథాలయాలు, సౌరవిద్యుత్‌ ఏర్పాటు, కాయగూరల తోట ఏర్పాటు, ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దడం, శుద్ధజలం, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ(ఐసీటీ) ల్యాబ్, డిజిటల్‌ గ్రంథాలయం, క్రీడలకు ప్రోత్సాహం, నాణ్యమైన విద్యతోపాటు ఇంట‌ర్‌నెట్ సదుపాయం, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ, వృత్తివిద్యా కోర్సులు, నైపుణ్యాభివృద్ధి వంటివాటికి నిధులను వాడుకోవచ్చని కేంద్రం పేర్కొంది. స్కూల్‌ దశ నుంచే ఒకేషనల్‌ కోర్సులను ప్రోత్సహిస్తారు. విద్యార్థి డిగ్రీకి వచ్చేసరికి ఏదో ఒక రంగంలో ఉపాధి పొందేలా తీర్చిదిద్దాలన్న జాతీయ విద్యావిధానం–2020కి అనుగుణంగా ఈ పథకాన్ని తెచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.  

చ‌ద‌వండి: ఏపీలో మూడు ప్రాంతాల్లో ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్స్‌​​​​​​​
యూడైస్‌ డేటానే ప్రామాణికం 

ప్రతీ పాఠశాల సమాచారాన్ని డ్రిస్టిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ఫర్‌ ఎడ్యుకేషన్‌(యూడైస్‌ ప్లస్‌)లో నమోదు చేస్తున్నారు. దీని ఆధారంగానే పీఎంశ్రీ పథకానికి ఎంపిక చేస్తారు. యూడైస్‌లో ఆయా పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, బోధన విధానాలు, కొన్నేళ్లుగా టెన్త్‌లో వస్తున్న గ్రేడ్లు, ఇతర క్లాసుల్లో వస్తున్న విద్యార్థుల మార్కుల వివరాలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ, సహకారం, అందుతున్న నిధులతోపాటు ఆ స్కూల్‌కు కావాల్సిన అదనపు గదులు, చేయాల్సిన మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాల సమాచారాన్ని పొందుపరుస్తారు.  

చ‌ద‌వండి: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 హాల్‌టికెట్లు విడుద‌ల‌... ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
స్థానిక సంస్థల ఆమోదం తప్పనిసరి 

పీఎంశ్రీ పథకం ఆమోదానికి స్థానిక సంస్థల ప్రతినిధుల ఆమోదాన్ని తప్పనిసరి చేశారు. జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న పాఠశాలలను ఓ కమిటీ పరిశీలిస్తుంది. పథకంలో చేరేందుకు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే మార్పులు, నిధుల వినియోగంపై ఆజమాయిషీకిగాను అవసరమైన కమిటీ ఏర్పాటును గ్రామాల్లో సర్పంచ్‌లు, పట్టణాల్లో మున్సిపల్‌ కమిషనర్లు ఆమోదించాల్సి ఉంటుంది.
ప్రయోగాలు.. వర్చువల్‌ రియాలిటీ ద్వారా అవగాహన 
పీఎంశ్రీ పాఠశాలల డిజిటలైజేషన్‌లో భాగంగా కంప్యూటర్లు ఏర్పాటు చేసి, క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా అన్నిప్రాంతాల నుంచి ఫ్యాకల్టీని అందుబాటులోకి తేవాలన్నది కేంద్ర విద్యాశాఖ ఆలోచన. దీనివల్ల గ్రామస్థాయి విద్యార్థులకు జాతీయస్థాయి విద్యాప్రమాణాలు అందుతాయని భావిస్తోంది. సైన్స్‌ సబ్జెక్టుల్లో ప్రయోగాలు, సోషల్‌లో భౌగోళిక స్థితిగతులు వర్చువల్‌ రియాలిటీలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులు భావిస్తున్నారు.

చ‌ద‌వండి: ప్ర‌వేశాల‌కు వేళాయే.... కేంద్రీయ విద్యాల‌యాల‌కు ఇలా అప్లై చేసుకోండి
రాష్ట్రం వాటా 40% 

పీఎంశ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలలకు కేంద్రం, రాష్ట్రం 60:40 నిష్పత్తిలో నిధులను కేటాయించనున్నాయి. ఇప్పటికే మంచి ఫలితాలు సాధిస్తూ, టీచర్లు తగిన నిష్పత్తిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలనే ఈ పథకం కింద అధికారులు ఎంపిక చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద 14,500 పాఠశాలలను ఎంపిక చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టికైతే 9 వేల పాఠ‌శాల‌ల‌ను మాత్ర‌మే ఎంపిక చేశారు. ఎంపికైన పాఠ‌శాల‌ల వివ‌రాల‌ను మ‌రికొద్ది రోజుల్లో రాష్ట్రాల‌వారీగా విడుద‌ల చేయ‌నుంది కేంద్రం. 
ప‌థ‌కంలోకి ఇంకా చేరని రాష్ట్రాలు...
పీఎం శ్రీ పథకంలో ఇంకా కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేరాల్సి ఉంది. పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా, తమిళనాడు, జార్ఖండ్, కేరళ, ఢిల్లీ ప‌థ‌కంలో చేరలేదు. గతేడాది సెప్టెంబర్ 15న పీఎం శ్రీ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

Published date : 29 Mar 2023 03:36PM

Photo Stories