సాక్షి, హైదరాబాద్: ఉర్దూ భాషను ప్రోత్సహించడంతో పాటు, మైనార్టీ యువతకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.
ఉర్దూలో స్టడీ మెటీరియల్
ఉర్దూ మాధ్యమంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఉర్దూలో తయారు చేసిన స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడంతో పాటు, ఉన్నత విద్య చదివే వారి కోసం ఉర్దూలోకి తర్జుమా చేసిన పలు పుస్తకాలను అందుబాటులోకి తెస్తోంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న మైనార్టీ యువతకు సులభతరంగా ఉండేలా ప్రభుత్వం ఇప్పటికే ఉర్దూ మాధ్యమంలో పరీక్షలు నిర్వహిస్తోంది. తాజాగా మైనార్టీ సంక్షేమ శాఖ పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ను ఉర్దూలో తయారు చేసి విద్యార్థులకు ఉచితంగా అందిస్తోంది.
తెలంగాణ ఉర్దూ అకాడమీ నిపుణుల సమక్షంలో వీటిని తయారు చేసింది. మొత్తం 30,812 మంది అభ్యర్థులకు మెటీరియల్ పంపిణీ చేసినట్లు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నవంబర్ 23న ఒక ప్రకటనలో వెల్లడించారు.